Personal Finance | డబ్బుంటేనే డాబైనా, రుబాబైనా! ఆర్థికంగా చతికిలపడితే.. జీవితం దుర్భరమే! ఎంత సర్దుకుపోయే మనస్తత్వం ఉన్నప్పటికీ.. నెలవారీ నికర ఆదాయం లేకుంటే కంటికి కునుకుపట్టదు. మాటకు విలువ ఉండదు. కడుపున పుట్టిన వాళ్లు భారంగా భావిస్తారు. కన్నవాళ్లు దీనంగా చూస్తారు. లోకమంతా లోకువ కడుతుంది. వాళ్లంతా చౌకబారు మనుషులు అనుకుని తృప్తిపడ్డా… మనకు మనం చెప్పుకొందామంటే సమాధానం దొరకదు. ఈ పరిస్థితి ఎదురవ్వొద్దన్నా, ఎదురులేకుండా నిలబడాలన్నా.. ఆర్థికంగా విజయం సాధించడమే మార్గం. అదెలాగంటే…
సుజాతమ్మకు డబ్బు ఏండ్లు. విమానంలో ఢిల్లీకి వెళ్తున్నది. సహ ప్రయాణికురాలు ఆమెతో మాట కలిపింది. ఢిల్లీలో ఎవరుంటారని అడిగింది. మా పెద్దబ్బాయి దగ్గరికి వెళ్తున్నానని చెప్పింది సుజాతమ్మ. ‘హైదరాబాద్లో ఎవరుంటారు?’ అని ప్రశ్నించిదామె. ‘నేనొక్కదాన్నే!’ అందీమె. మరి మీ చిన్నబ్బాయ్ అన్నట్టు ప్రశ్నార్థకంగా చూసింది. ‘చిన్నోడు చెన్నైలో ఉంటాడు’ అన్నది సుజాతమ్మ. ‘ఈ వయసులో మిమ్మల్ని ఒంటరిగా వదిలేయడం ఏంటి?’ అని ఉండబట్టలేక అడిగేసింది! సుజాతమ్మ చిన్నగా నవ్వి.. ‘అమ్మాయ్! తొందరపడి నా బిడ్డల్ని నిందించకు. నేనే స్వతంత్రంగా ఉండాలనుకున్నా. వాళ్లను చూడాలనిపించినప్పుడు ఇలా వెళ్లొస్తుంటా’ అని బదులిచ్చింది. ‘ఈ వయసులో…’ అని తోటి ప్రయాణికురాలు ప్రశ్న అడిగేంతలోనే.. ‘నా ఒంట్లో శక్తి ఉంది. బ్యాంకులో బ్యాలెన్స్ ఉంది. పిల్లల దగ్గరుంటే.. వాళ్లకు తగ్గట్టు నా జీవనశైలి మార్చుకోవాలి. అలా చేయలేకపోతే.. నన్ను వాళ్లు భారంగా భావించే ప్రమాదమూ ఉంది. అందుకే ఒంట్లో శక్తి ఉన్నన్నాళ్లూ.. స్వతంత్రంగా ఉండాలనుకుంటున్నాను’ అని చర్చకు ముగింపు పలికింది.
సుజాతమ్మది మొండితనం కాదు! ఆత్మవిశ్వాసం!! ఆమె ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పనిచేసి రిటైర్ అయింది. నెలకు రూ.అరవై వేల పెన్షన్ వస్తుంది. భర్త పోయాక ఒక్కతే ఉండాలని నిర్ణయించుకోవడం వెనుక ఇదే ప్రధాన కారణం. స్వతంత్రంగా బతకడానికి కావాల్సిన అన్ని అర్హతల్లో ముఖ్యమైనది ఆర్థిక స్వాతంత్య్రం. ఇరవైలో చేతిలో పైసా లేకపోయినా ఇబ్బందిలేదు. కండలు కరగదీసే దిల్ ఉంటే చాలు. నలభైలో ఆదాయం కాస్త అటూ ఇటూ అయినా ఫర్వాలేదు! రెండు ఇంక్రిమెంట్లు, ఒక్క బోనస్ వస్తే అన్నీ సర్దుకుంటాయన్న నమ్మకం ఉంటుంది. అరవైకి చేరువయ్యాక కూడా ఆర్థిక విషయాలు ఆందోళనకరంగా ఉన్నాయంటే.. చింతించాల్సిందే! ఈ పరిస్థితి రావొద్దంటే.. ముప్పయ్లోకి రాగానే జాగ్రత్తపడాలి. ప్రణాళికా బద్ధంగా భవిష్యత్ రచన చేస్తే.. రిటైర్ అయ్యాక సుజాతమ్మలా ధీమాగా జీవనం సాగించొచ్చు.
స్థిరాస్తులు మంచివే! కానీ, అమ్మితేగానీ సొమ్ముకాని అస్తులు ముందుతరాలకే కానీ, మన బతుకులను మార్చేదేం ఉండదు. చెమటోడ్చి సంపాదించిన ఆస్తిని మన తదనంతరం వారసులు అడ్డెకు పావుసేరు లెక్క అమ్ముకుంటారు. అదే ఆస్తిని ఆదాయం వచ్చేలా మార్చగలిగితే మనం వార్ధక్యంలో పస్తులుండాల్సిన పరిస్థితి రాదు.
ప్రభుత్వ ఉద్యోగులకు కూడా.. పెన్షన్ ఇచ్చే రోజులు కావివి. కాబట్టి, ముప్పయ్ ఏండ్ల తర్వాత మీ అవసరానికి తగ్గట్టుగా ఆదాయం సమకూరే పాలసీలను ఎంచు కోవాలి. గ్యారంటీడ్ మనీ స్కీమ్, ఎస్ఐపీ, ఎస్డబ్ల్యూపీ, మ్యూచువల్ ఫండ్స్, ఈక్విటీ ఇలా దేన్ని ఎంచుకున్నా.. మీరు రిటైర్ అయినప్పటి నుంచి కాలం చేసేవరకు నెలకు స్థిర ఆదాయం వచ్చేలా ప్లాన్ చేసుకోవాలి. ఎస్ఐపీలో నెలకు రూ.15వేలు చొప్పున 20 ఏండ్లపాటు కట్టారే అనుకోండి. 12 శాతం రిటర్న్ అనుకున్నా… ఇరవై ఏండ్ల తర్వాత మీ సంపద అచ్చంగా రూ.1.50 కోట్లకు పడగ లెత్తుతుంది. ఈ మొత్తాన్ని ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్నా.. నెలకు రూ.80 వేల వరకు నికర ఆదాయం లభిస్తుంది.
నగర శివారులో 200 గజాల ప్లాటు తీసుకునే బదులు, నగరంలో అపార్ట్మెంట్లో ఫ్లాట్ తీసుకుంటే నెలకు రూ.20వేల వరకు అద్దె వస్తుంది. కమర్షియల్ స్పేస్ తీసుకుంటే.. తరతరాలకూ నెలవారీ ఆదాయం సమకూరుతుంది. రిటైర్ అయ్యేనాటికి ఒకే ఇల్లు ఉంది. పెన్షన్ రాదు. అంతమాత్రాన కొడుకుల దగ్గర దేహీ అనాల్సిన అవసరం లేదు. పైగా ఇన్నాళ్లూ పెంచి పోషించాం కాబట్టి మమ్మల్ని చూడాల్సిన బాధ్యత మీదే అని డిమాండ్ చేయొద్దు. అదే ఇంటిని బ్యాంకులో మార్ట్గేజ్ పెడితే నెలకు పాతికవేల వరకు ఆదాయం సమకూరుతుంది. మీ తదనంతరం.. ఆ ఇంటిని కావాలనుకుంటే మీ వారసులు విడిపించుకుంటారు!
సాఫీగా సాగిపోవాలంటే..
ఆపేయాలి అనుకుంటే జీవితం ముగించినట్టే! రిటైర్మెంట్ అంటే.. పని చేయకపోవడం కాదు! ఇష్టమైన పని చేయడం. నచ్చిన వ్యాపకం చేయాలంటే ఆరోగ్యంగా ఉండాలి. అలా ఉండాలంటే.. ముప్పయ్ల నుంచే జాగ్రత్తపడాలి. ఆహార నియమాలు, ఆరోగ్య సూత్రాలు పాటిస్తేనే.. శేష జీవితం సాఫీగా సాగిపోతుంది. ఒంట్లో శక్తి ఉన్నప్పుడు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే.. రోగాలతో కుస్తీ పట్టడంతోనే ముసలితనమంతా మూలిగిపోతుంది. అందుకే, ఆర్థిక సూత్రాలతో పాటు ఆరోగ్యమంత్రాన్ని పఠిస్తూ వృద్ధాప్యంలోనూ స్వతంత్రంగా బతికేద్దాం!
ఎం. రాం ప్రసాద్
సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్
ram@rpwealth.in
www.rpwealth.in