Sri Ramanujacharya | ఒక దేశంలో ఉగ్రవాదం. ఒక దేశంలో వర్ణ వివక్ష. ఒక దేశంలో తీవ్ర దుర్భిక్షం. ఒక దేశంలో ఆటవిక న్యాయం. ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న ప్రతి సమస్యకూ, మానవాళిని కలవరపెడుతున్న ప్రతి సంక్షోభానికి.. శ్రీమత్ రామానుజాచార్యుల బోధనలో పరిష్కారం ఉంది. సమతామమతల సందేశంగా శంషాబాద్లోని చినజీయరు స్వామి ఆశ్రమంలో ప్రతిష్ఠితం అవుతున్న శ్రీరామానుజాచార్యుల విరాట్ మూర్తి.. ఓ విశ్వస్ఫూర్తి!
అద్వైతం అంటే రెండుగా లేకపోవడం. విశిష్టాద్వైతం అంటే ఒక్కటిగా ఉండేందుకు ప్రకృతిని ఉపాయంగా చేసుకోవడం. రామానుజాచార్యులు విశిష్టాద్వైతాన్ని ప్రవచించారు. శరణాగతి ద్వారా ఎవరైనా పరమాత్మను చేరుకుని, ఆయనతో ఒక్కటిగా కలిసి ఉండవచ్చని తెలిపారు. భగవంతుని దృష్టిలో అందరూ సమానులేనని, మోక్షం పొందడానికి ఎవరైనా అర్హులేనని చాటి చెప్పారు. ఒకనాడు రామానుజుడు లేకపోతే, ఈ నేలపై విగ్రహాలతో కూడిన ఆలయాలు లేవు. అనేకానేక ఆరాధనా పద్ధతులూ లేవు. ఈనాడు రామానుజుని స్ఫూర్తి మనలో లేకుంటే, సనాతన ధర్మనిష్ఠకు
అర్థం లభించదు. ఆచరణ సాధ్యం కాదు.
అస్మద్గురోః భగవతో అస్య దయైక సింధోః
రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే
..దయాసముద్రుడైన గురువే సాక్షాత్తూ మాకు భగవానుడు. ఆ పరమాత్మ స్వరూపుడైన రామానుజాచార్యుల చరణాలను ఆశ్రయిస్తున్నాను.
సంసారబంధం నుంచి విడివడేందుకు కావలసిన తత్త్వజ్ఞానాన్ని జీవులకు అందించేవారినే ‘ఆచార్యులు’ అంటారు. ఆచార్యుని స్థానం ఉన్నతమైనది. అందుకే భగవానుడు సైతం తాను ఆచార్యునిగా ఉండటానికి ఇష్టపడ్డాడు. ‘లక్ష్మీనాథ సమారంభాం నాథయామున మధ్యమాం’ అంటూ దేవదేవుడినే తొలిగురువుగా మనం భావిస్తుంటాం.
లక్ష్మీనాథుడైన శ్రీహరియే తొలి గురురూపం. జగదేకపతి అయిన విష్ణువును ఏకైక లోకపాలకునిగా ప్రతిపాదించే వైష్ణవం సత్యసనాతనం. బ్రహ్మ సృష్టిలోని తొలినాటివారైన సనకాదుల మొదలు అన్ని యుగాలలోనూ విష్ణుభక్తులు ఉన్నారు. కలియుగం ప్రవేశించిన 43 రోజులకు ప్రభవించిన నమ్మాళ్వార్తో మొదలుపెట్టి, అనేకమంది గురువులు భూమ్మీద విష్ణుభక్తిని నెలకొల్పడానికి పాటుపడ్డారు. పన్నెండు మంది ఆళ్వార్ల తర్వాత యామునాచార్యులు జగదేక గురువుగా నిలిచారు. సామాన్యశకం 1042లో తన శిష్యుని కలుసుకోకుండా పరమపదించిన యామునాచార్యుని వారసత్వాన్ని నిలబెట్టడానికి వచ్చిన దివ్యావతారమే శ్రీరామానుజాచార్యులు.
ఆచార్యుడు భగవంతుడే. భగవంతుడు కూడా ఆచార్యుడే. కానీ, దుష్టశిక్షణకు శిష్టరక్షణకు భగవానుడు సరైన సమయం కోసం వేచిచూస్తాడు. ఆచార్యుడు అటువంటివాడు కాదు. ముందస్తుగానే మనల్ని హెచ్చరించడానికి, మనలో శిష్టాచార సంప్రదాయాల పట్ల అనురక్తిని పెంచడానికి… ధర్మగ్లాని ఏర్పడటానికి ముందుగానే తాను అవతరిస్తాడు.
రామానుజులు అవతరించే సమయానికి… వేంగి చాళుక్య సామ్రాజ్యానికి, చోళ సామ్రాజ్యానికి ఒకే ఒక్క వారసుడై ఆంధ్ర, తమిళనాడు, శ్రీలంక ప్రాంతాలన్నింటినీ ఏకచ్ఛత్రాధిపత్యంగా ఏలిన మన తెలుగువాడు కులోత్తుంగ చోళుడు…. అప్పటికింకా రాజ్యానికి రాలేదు. తెలంగాణలో కాకతీయ సామ్రాజ్యం స్థిరపడలేదు. కర్ణాటకలో హోయసల సామ్రాజ్యం ఏర్పడలేదు. అన్నింటికంటే ముఖ్యంగా… అప్పటికింకా సోమనాథ్ దండయాత్ర జరగలేదు. భారతదేశంలో రాజకీయ, సామాజిక అస్థిరతకు దారితీసిన ముఖ్యఘట్టం.. విగ్రహారాధనను ద్వేషించే మతాలవారి ఏలుబడి మొదలుకావడం. అది జరగడానికి ముందే ఈ నేలపై రామానుజులు అవతరించారు.
‘ఏకైక అవయవం ధ్యాయేత్’… భగవదారాధనలో భగవంతుని అంగ ప్రత్యంగ సౌందర్యం ఆస్వాదిస్తూ ఆరాధన చేయాలని ఆగమవాక్యం చెబుతోంది. కృతయుగంలో సమీపవర్తిగా, త్రేతాయుగంలో సాదృశునిగా, ద్వాపరయుగంలో లీలావిభూతితో జీవులను ఉద్ధరించిన పరమాత్మ కలియుగంలో అర్చామూర్తిగా సేవలు అందుకుంటున్నాడు. కలియుగంలో అందరికీ సేవించదగినది, ఆశ్రయించదగినది పరమాత్ముని అర్చారూపమే.. అదే విగ్రహరూపంలో కోవెలలో కొలువుదీరిన రూపం. మన ఆరాధనలన్నిటికీ ఆలంబనమైన ఆలయ వ్యవస్థను నిలబెట్టడానికి, దానికిగానూ విశిష్టాద్వైత సంప్రదాయాన్ని ప్రవేశపెట్టడానికి విష్ణుమూర్తి శయ్య అయిన ఆదిశేషుడే స్వయంగా రామానుజుల రూపంలో ఈ నేలపై వెయ్యేళ్లకు పూర్వం అవతరించాడు.
తమిళనాడులో రామానుజులు అవతరించిన శ్రీపెరంబుదూరును అప్పట్లో తుండీర మండలమని పిలిచేవారు. సామాన్యశకంలోని 1016వ సంవత్సరమది. భారతీయ కాలమానంలో పింగళనామ సంవత్సరం, వైశాఖ శుద్ధ పంచమి, శుక్రవారం నాడు సూర్యుడు మేషరాశిలో ప్రవేశించిన ఆర్ద్రా నక్షత్రంలో రామానుజాచార్యులు జన్మించారు. ఆయన తండ్రిపేరు ఆసూరి కేశవ సోమయాజి, తల్లిపేరు కాంతిమతి.
శ్రీవచనదివ్యభూషణం చెప్పినట్లు, ఆచార్యునిపై సడలని భక్తి, అభిమానాలే శిష్యుడిని ఉద్ధరించగలవు. ఆచార్యుని చరణాలను ఆశ్రయించడం ఒక్కటే మోక్షమార్గం. విద్యపై ఎనలేని గౌరవం ఉన్న రామానుజులు పదహారేండ్లు వచ్చేవరకూ శ్రీపెరంబుదూరులో, అనంతరం 8 ఏండ్లపాటు తిరుప్పుట్ కుళిలో, పదేండ్లపాటు కంచిలో వేదాంత విద్యాభ్యాసం చేశారు. విద్యార్థిగా ఉన్నప్పుడే అఖండ ప్రతిభాపాటవాలను ప్రదర్శించారు. యాదవ ప్రకాశులు అనే అద్వైత వేదాంత గురువు దగ్గర విద్యాభ్యాసం చేస్తుండగా ఒకసారి…‘యథా కప్యాసం పుండరీకమేవ యక్షిణీ’ అనే ఛాందోగ్య మంత్రానికి, ‘కోతిపృష్టం వంటి ఎర్రనైన కన్నులు గలవాడు విష్ణువు’అని గురువు వివరణ ఇచ్చారు. అప్పుడు రామానుజులు పైకిలేచి, “ఛాందోగ్య భాష్య సందర్భంలో శంకరులు, ‘కోతిపృష్టమనే నీచోపమ బురదలో ఉండే తామరలకే కానీ, విష్ణువు కన్నులకు కాద’ని చెప్పారు కదా! ఆ శంకరులే విష్ణు సహస్రనామ స్తోత్ర భాష్య సందర్భంలో, ‘కం పిబతీతి సూర్య: అనే సూత్రాన్ని అనుసరించి లోతైన నీటిని తాగే కపి అంటే సూర్యుడు’ అన్నమాట ఇక్కడ పొసగుతుంది. సూర్యుని రాకతో విచ్చుకున్న తామరల్లా విష్ణునేత్రాలు ఒప్పుతున్నాయి అని పైవాక్యానికి అర్థం చెప్పుకోవాలి” అని గురువునే సరిచేశారు.
రామానుజుల భక్తివైఖరి గురువుకు, ఇతర శిష్యులకు కంటగింపైంది. రాజుగారి కూతురిని పట్టుకున్న బ్రహ్మరాక్షసుడు ఒకడు… యాదవ ప్రకాశులను కాదని, రామానుజుల పాదస్పర్శ చేత మోక్షానికి పోయిన ఉదంతం అగ్నికి ఆజ్యం తోడైనట్లు చేసింది. దాంతో రామానుజుని ఉత్తరభారతానికి తీసుకుపోయి చంపివేయాలని పన్నాగం పన్నారు. అది తెలియని రామానుజులు వారితో బయలుదేరారు. అప్పటికి వారు వింధ్యారణ్య ప్రాంతంలో ఉన్నారు. ఆ రాత్రికే తనను చంపబోతున్నారని రామానుజులకు తెలిసింది. కుట్రనుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించారు. వింధ్యాచల అడవుల్లో దారీతెన్నూ తెలియని స్థితిలో వరదరాజస్వామిని ప్రార్థించారు. కొద్దిసేపటికి కిరాత దంపతులు కనిపించారు. కాంచీపురానికి తోవచూపమని వారిని కోరారు. దారి వెంట నడుస్తూ ఆ ముగ్గురూ ఆ రాత్రి ఒక చెట్టుకింద విశ్రమించారు. దాహానికి మంచినీరు కావాలని బోయత అడిగింది. అందుకా బోయవాడు తెల్లవారాక చూద్దాంలే అని ఆమెను నిద్రపొమ్మన్నాడు. వారిమాటలు విన్న రామానుజుడు ఆ దంపతులు తనకు చేస్తున్న సహాయానికి కృతజ్ఞతగా… తెల్లవారిన పిదప దగ్గరలో ఏదైనా బావి కనిపిస్తే ఆమెకు మంచినీటిని తెచ్చిపెట్టాలని భావించారు. తెల్లవారి ఆయన లేచేసరికి ఎదురుగా ఒక బావి కనిపించింది. మగువలు నీటిని తోడుకుంటూ కనిపించారు. కానీ వారి కట్టూబొట్టూ దక్షిణాది పద్ధతిగా ఉంది. ‘ఇదేమి ఊరమ్మా!’ అంటూ ఒకరిని అడిగారాయన. ‘ఇది కాంచీపురమయ్యా. అదిగో వరదరాజస్వామి కోవెల’ అంటూ చూపించారు వారు. ఎక్కడి వింధ్యారణ్యం? ఎక్కడి కాంచీపురం? ఒక్కరాత్రిలో ప్రయాణించడం సాధారణులకు అసాధ్యం. గతరాత్రి దాహమని చెప్పి తనలో బావిని వెదకాలనే ఆలోచన పుట్టించింది…. సాక్షాత్తూ వరదరాజస్వామి ఇల్లాలు పేరిందేవియే అని రామానుజులకు అప్పటికి తెలిసింది. ‘ఆమెకు నీటిని అందించలేకపోయాను కనుక తెల్లవారగానే, ఆమె చూపించిన ఈ సాలికూపం నుంచే నిత్యం వరదరాజ పెరుమాళ్ కోవెలలో తిరుమంజన, తిరువారాధన కైంకర్యాలు సమర్పించుకుంటాను’ అని భక్తితో పలికారు. నేటికీ కాంచీ క్షేత్రంలో కైంకర్యాలన్నీ ఆ బావి నీటి నుంచే నిర్వహిస్తున్నారు.
వరదరాజ పెరుమాళ్ కరుణవల్ల రామానుజాచార్యులు ఒక్కరాత్రిలో వింధ్యనుంచి కాంచీపురానికి చేరుకున్న గాథను యామునాచార్యులు విన్నారు. ఆ రామానుజాచార్యులు మరెవరో కాదు.. సాక్షాత్తూ తన మనుమరాలైన కాంతిమతీదేవి, ఆసూరి కేశవ సోమయాజి దంపతుల పుత్రుడని తెలుసుకుని ఆనందించారు. తన తదనంతరం శ్రీరంగం పీఠాధిపతి కాగలిగిన వ్యక్తి అతడేమోనని ఆశపడ్డారు.
ఆళ్వారుల్లో మొదటివాడైన నమ్మాళ్వార్ విశిష్టాద్వైతానికి మూలకందమైన నాలాయిర దివ్యప్రబంధాన్ని అందించారు. ఆయన తరువాత శ్రీనాథముని ఆవిర్భవించారు. ఆయనే నాలాయిర దివ్యప్రబంధాన్ని అనుష్ఠాన, అనుసంధాన పూర్వకంగా అధ్యయనం చేయడానికి వీలుగా నాలుగువేల పాశురాలుగా విభాగించారు. అటుతర్వాత గీతార్థ సంగ్రహం వంటి విశిష్ట వ్యాఖ్యాన గ్రంథాలను రచించినవారు యామునాచార్యులు. పాంచరాత్ర ఆగమానికి ప్రామాణిక గ్రంథమైన ‘ఆగమ ప్రామాణ్యం’ ఆయన రచనే. అలాగే జీవుడు సాధించవలసిన ఆత్మసిద్ధి, సంవిత్ సిద్ధి, ఈశ్వరసిద్ధి అనే మూడు ప్రధాన సిద్ధులనూ ‘సిద్ధిత్రయమ్’ పేరుతో ఆయన రచించిన గ్రంథం తరు
వాతి కాలంలో విశిష్టాద్వైత సిద్ధాంతానికి ప్రాణప్రతిష్ఠ చేసింది. యామునాచార్యుల కాలం వైష్ణవానికి గడ్డుకాలంగా ఉండేది. ఎవరు గొప్పదైవం అనే చర్చలు నిరంతరం జరుగుతూ ఉండేవి. స్వయంగా యామునాచార్యులే పాండ్యరాజు కొలువులో మతచర్చలో పాల్గొని విష్ణువును పరదైవతంగా నిరూపించారు. విజయ ఫలితంగా అర్ధరాజ్యాన్ని పొందారు. కొద్దికాలం పాలనచేసి, రాజ్యత్యాగం చేశారు. శ్రీరంగం పీఠాధిపతి అయ్యారు. ఆయన తరువాత పీఠాధిపత్యం స్వీకరించే వ్యక్తి కోసం వెదుకుతున్నారు. కానీ విష్ణుద్వేషులు, కర్మసన్యాసులు పెరిగిపోయిన కాలంలో ఆయన ప్రయత్నం తేలికగా ఫలించలేదు. నిర్గుణ బ్రహ్మ అర్చారూపం అనవసరం అనే భావం ప్రబలిపోయింది. వైష్ణవ వ్యతిరేక రాజ్య, శాసనాలు ఎక్కువయ్యాయి. విష్ణువు అనాది దైవం కాదన్న అసత్య ప్రచారాలు ప్రబలిపోయాయి. వాటిని యామునాచార్యులు దాదాపు ఒంటిచేత్తో ఎదుర్కొన్నారు. అటువంటి దశలో రామానుజుల గురించి యామునాచార్యులు విన్నారు. శ్రీరంగం నుంచి కాంచీపురానికి వెళ్లారు. రామానుజులు ఏకదండి సన్యాసి వద్ద శిష్యరికం చేస్తూ ఉండటం గమనించారు. గురువుల వేదాంత విశ్లేషణను ఖండిస్తూ తనదైన భాష్యాలను చెప్పడం గురించి కథలు కథలుగా విన్నారు. వాటిలో ఒక్కటి ‘సర్వం ఖల్విదం బ్రహ్మ’ అనే ఉపనిషత్ వాక్యానికి రామానుజులు చెప్పిన వివరణ….జగత్తులో ఉన్నదంతా బ్రహ్మపదార్థమే కానీ, వేరుకాదు అన్నది యాదవ ప్రకాశులు చెప్పిన విశ్లేషణ. దీన్ని వ్యతిరేకిస్తూ ‘సర్వం ఖల్విదం బ్రహ్మ’ అంటే జగత్తులోని ద్రవ్యాంశాలన్నీ భగవంతుని శరీరాలు. అన్నింటిలో భగవంతుని తత్త్వం ప్రకాశిస్తుంటుంది. అంతేకానీ ద్రవ్యాంశకు, భగవంతునికీ భేదం లేదని చెప్పడం మాత్రం సరికాదు అన్నారు రామానుజులు. బ్రహ్మ అనంతుడంటే చెల్లుతుంది కానీ అనంతమే బ్రహ్మ అవుతుందా? అనంతం అంటే అంతం లేనిది అని కదా అర్థం. అంటే అది ఒక గుణాన్ని సూచిస్తుంది కానీ, భగవంతునికి పర్యాయపదం కాగలదా? సత్య, జ్ఞాన, అనంతాలు మూడూ భగవంతుని సహజగుణాలు, కానీ అనంతకోటి కల్యాణ గుణాకరుడైన ఆ పరమాత్మని కేవలం సత్యంగాని, జ్ఞానంగాని, అనంతం గాని పరిపూర్ణంగా చిత్రించలేవు కదా! అని చెప్పారు.
…ఇలా అనేక సందర్భాల్లో రామానుజుల ప్రతిభా వ్యుత్పత్తులను గురించి విన్న యామునాచార్యులు ఆయనను యాదవ ప్రకాశులతో కలిసి వెళుతుండగా దూరంనుంచే చూశారు. కళ్లతోనే ఆశీర్వదించారు. ఒక గురువు దగ్గర విద్యాభ్యాసం చేస్తున్న శిష్యుణ్ణి ఆ స్థానం వదిలి తమవద్దకు రమ్మని పిలవడానికి యామునులు సంకోచించారు. ‘వీలు చూసుకుని వారిని ఒకసారి శ్రీరంగం రమ్మని చెప్పండి’ అని ఎవరితోనో కబురుచేసి అక్కడినుంచి వెళ్లిపోయారు.
శ్రీరంగం నుంచి యామునులు తనకోసం వచ్చి వెళ్లారనే సంగతి పెరియనంబి ద్వారా రామానుజులకు తెలిసింది. ఆయనను వెతుక్కుంటూ రంగపురం చేరుకునేసరికి దురదృష్టవశాత్తూ యామునులు దేహత్యాగం చేశారు. రామానుజులు ఆయన మృతదేహాన్ని దర్శించారు. యామునుల చేతివేళ్లు మూడు ముడుచుకుని ఉండటం చూసి రామానుజులు ‘అలా ఎందుకు ఉన్నాయ’ని అక్కడివారిని ప్రశ్నించగా తెలిసిందేమంటే… యామునుల జీవితంలో మూడు కోరికలు ఉన్నాయి. అవి..
రామానుజులు కాంచీపురంలోనే పెరియనంబి వద్ద ద్రవిడ వేదాన్ని అభ్యసించారు. శ్రీశైలపూర్ణుల వద్ద దర్శన రహస్యాలు, వర రంగాచార్యుల వద్ద వైష్ణవ దివ్యప్రబంధాలను అనుసంధించారు. మాలాధనుల వద్ద భగవద్విషయం చెప్పుకొన్నారు. తిరుమంత్రార్థ రహస్యాన్ని తెలుసుకోవడానికి గోష్ఠీపూర్ణులను ఆశ్రయించి వారు పెట్టే పరీక్షలకు తట్టుకుని నిలబడ్డారు.
చివరికి తిరుమంత్రార్థ రహస్యాన్ని వారివద్దనే గ్రహించారు. తిరుమంత్రార్థ రహస్యాన్ని విన్నవారంతా జన్మరాహిత్యం పొందుతారని గురువులు చెప్పిన ఫలశ్రుతిని మననం చేసుకున్నారు రామానుజులు. ప్రయాస లేకుండా చేతనులందరికీ జన్మరాహిత్యం కలిగించే సదుద్దేశంతో ఒకనాడు గుడిగోపురం ఎక్కి అందరూ వినేలా తిరుమంత్రార్థాన్ని వివరించసాగారు. గోష్ఠీపూర్ణులది విన్నారు. “అనర్హులకు తిరుమంత్రార్థ రహస్యాన్ని వివరించిన పాపానికి నువ్వు నరకానికి పోతావు సుమా!” అని తీవ్రంగా అన్నారు. రామానుజులు అది విని ఏమీ చలించలేదు. “అంతమంది ఉద్ధరింపబడుతున్నప్పుడు ఈ దాసుడొక్కడూ నరకానికి పోతే ఏమయింది?” అని ప్రశ్నించారు. వారి చిత్తస్థైర్యానికి, పరహితకాంక్షకు గోష్ఠీపూర్ణులు ఎంతగానో మెచ్చుకున్నారు. ‘ఎంబెరు మన్నార్’…నాకంటే గొప్పవాడా!’ అంటూ రామానుజులను గౌరవించారు. తరువాత పరతత్త్వ ప్రతిపాదకమైన చరమశ్లోకార్థాన్ని పూర్తిగా వివరించి సంతృప్తి చెందారు గోష్ఠీపూర్ణులు. ఆ తర్వాత, రామానుజులు గృహస్థాశ్రమం విడిచిపెట్టి సశాస్త్రీయంగా శిఖా యజ్ఞోపవీత సహితంగా త్రిదండి సన్యాసాన్ని స్వీకరించారు. ఏకత్వంలో త్రయీతత్త్వ భిన్నత్వాన్ని మేళవించి విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని రూపొందించారు. ప్రస్థాన త్రయానికి శ్రీభాష్యం రచించారు. పూర్వాశ్రమంలో గురువైన యాదవప్రకాశులే రామానుజులకు శిష్యులుగా వచ్చారు. ఆయనకు గోవింద జియ్యర్ అనే ఆశ్రమనామాన్ని ఇచ్చారు రామానుజులు. ‘యతిధర్మ సముచ్ఛయం’ అనే గ్రంథాన్ని గోవింద జియ్యర్ రామానుజులకు అంకితం చేశారు. కూరేశులు, వాధూల దేశికులు మొదలైన శిష్యబృందాన్ని వెంటబెట్టుకుని దేశం నలుమూలలా పర్యటించారు. పాంచరాత్ర ఆగమ శాస్త్ర విధులను అనుసరించి అర్చనా విధానాన్ని, భోగాది సంప్రదాయాల్ని పటిష్ఠం చేశారు. యజ్ఞయాగాదులలో బలికి సాత్విక రూపాన్నిచ్చింది రామానుజులే.
కంటికి కనిపించే చెట్టు-పుట్ట, రాయి-రప్ప, నదులు-సముద్రాలు, వివిధ ప్రాణి కోటి వీటన్నింటితో నిండి ఉన్న ప్రపంచం భగవంతునికి శరీరంగా అమరి ఉంది. ‘తనకు శరీరమైన ఈ ప్రపంచాన్ని అంతటినీ క్రమబద్ధంగా నడిపి, అనుక్షణం దీనిని రక్షించుకోవలసిన బాధ్యత ఆ భగవంతునిది. అలాగే ఆ భగవంతుని శరీరంలోని వివిధ అవయవాల్లా అమరి ఉన్న ఈ ప్రపంచంలోని చైతన్యం కలిగిన వస్తువులు, చైతన్యం లేనట్లుగా కనిపించే వస్తువులు అన్నీ తమ ఉనికిని గుర్తించాలి. ఒకే శరీరంలోని అవయవం మరో అవయవానికి హాని కలిగించని విధంగా సామరస్యంతో కలసికట్టుగా ఉంటూ ఆ శరీరంలో ఉన్న జీవునికి ప్రయోజనం కలిగించినట్లుగా, భగవంతుని శరీరమైన ఈ ప్రపంచంలోని అన్ని తత్త్వాలు, ఒకదానితో ఒకటి కలిసి సామరస్యంగా ఏకలక్ష్యంగా ఉండాలి. అలా ఉండేలా చేయగలవాడు జీవుడు మాత్రమే. జీవులు తమ బాధ్యతను గుర్తించి సామరస్యంతో ఉన్నప్పుడే ఈ ప్రపంచపు మనుగడ భద్రంగా ఉంటుంది. దానికి ఆలంబనను ఇచ్చేది ప్రపత్తి మార్గం. ఆగమాలలోనూ, ఆళ్వారుల శ్రీసూక్తులలోనూ, వారి అనుశాసనాల్లోనూ సుస్పష్టంగా ఉన్న ప్రపత్తి అనే మార్గాన్ని రామానుజులు ఆశ్రయించి ఆచరించి చూపారు. దానిని లోకానికి ‘శరణాగతి గద్యం’ అనే గ్రంథం ద్వారా అందించారు. భగవద్రామానుజ ఆశయాన్ని స్పష్టంగా గుర్తించిన ఆచార్యులు కూడా తమ గ్రంథాలలో ప్రపత్తి వైభవాన్ని ఎక్కువగా ఉటంకించారు. ప్రపత్తి అంటే ఇతరేతరాలైన సాధనాలను అన్నింటినీ విడిచిపెట్టి భగవంతుడినే ఉపాయంగా స్వీకరించడం. ‘ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని కోరికలు ఉన్నా అన్నింటికీ ఆయన ఒక్కడే ఆశ్రయింపదగినవాడు. మరింకొక్కరు లేరు’ అన్న మహావిశ్వాసాన్ని ప్రోదిచేసుకోవడమే ప్రపత్తి.
ప్రాణులు చేసే ధర్మబద్ధమైన పనులన్నీ భగవద్ ఆరాధనమేనని ఎలుగెత్తి చాటింది రామానుజుల సిద్ధాంతం. భగవద్ ఆరాధనం కాని కర్మ ఏదీ అపేక్షితం కాదు, సార్థకం కాదు. చేసేవాడికి ఉపకరిస్తూ చుట్టూ సమాజానికి ఉపకరించే ఏ పనైనా ధర్మమే. అదే కర్మయోగం. ఈ కర్మవల్ల ప్రీతిగొన్న భగవంతుడు ఫలాన్ని ఇస్తాడు. ఇదే భగవద్ ఆరాధనంగా ఉత్తారకం అవుతుంది అని సమాజంలో సత్కర్మ నిష్ఠను అలవరిచారు రామానుజులు.
భగవంతుని దృష్టిలో అందరూ సమానులే. అందరూ మోక్షానికి అర్హులే అంటూ సర్వమానవ సమానత్వ భావాన్ని, సహోదరత్వాన్ని బోధించారు రామానుజులు. ఆయన పాతికేళ్ల వయస్సు వచ్చేవరకూ సన్యాసం స్వీకరించలేదు. తాను గురువుగా ఎంచుకున్న కాంచీపూర్ణుల ఉచ్చిష్టాన్ని, రామానుజుల భార్య అయిన తుంజమాంబ ఏవగించుకున్నది. ఫలితంగా రామానుజులు గార్హస్థ్యాన్ని వీడి యతిగా మారారు.
తిరునారాయణపురం అనేది వైష్ణవ 108 దివ్యదేశాలలో ఒకటి, దీనినే మేల్కోటే అంటారు. కర్ణాటకలోని మేల్కోటేలో రామానుజులు దాదాపు 12 సంవత్సరాల కాలంపాటు నివాసం ఏర్పరుచుకున్నారు. దీనికి కులోత్తుంగ చోళుని కాలంలో జరిగిన ఎడతెగని యుద్ధాలు ఒక కారణం కాగా, హోయసల సామ్రాజ్య రక్షణ మరో కారణం. ఇక్కడ ఉన్నకాలంలోనే… నిమ్నజాతులవారికి ‘తిరుకులత్తార్’ అనే పేరును స్థిరపరచి నేరుగా మేల్కోటే క్షేత్రంలోని ఆలయంలో ప్రవేశింపచేశారు రామానుజులు. సమతామూర్తిగా తన అవతార పరమార్థాన్ని చాటుకున్నారు. కన్నబిడ్డ ఆరోగ్యం కోసం తల్లి పథ్యం చేసినట్లుగా దీనజనుల ఉద్ధరణం కోసం తామే భగవంతుని ఆశ్రయించి, ఈ లోకులంతా ఆశ్రయించినట్లుగా భావించమని దైవాన్ని ప్రార్థించారు రామానుజులు. ఆర్తి కలిగినప్పుడు ఎవరికైనా కరావలంబనం కావాలి. ఎవరైనా కల్యాణ గుణపూర్ణుడైన భగవంతుని ఆశ్రయించవచ్చు. ఇక్కడ ధనవంతులు-దరిద్రులు, పండితులు-పామరులు అనే తేడా ఏమాత్రం లేదు. ఇక్కడ తరతమ భేదాలు లేవు అని చాటారు. భగవద్గీత మొదలైన శాస్ర్తాలు, రామాయణ మహాభారతాలు, విష్ణు భాగవతాది పురాణాలు ఈ తత్త్వాన్నే బోధిస్తున్నాయని అన్నారు. నారాయణ తత్త్వాన్ని ఆశ్రయిస్తే అది మనకు చేయూతను ఇచ్చి అన్ని కష్టాలనుంచి వెలికి తీస్తుందనే దృఢమైన విశ్వాసాన్ని రామానుజులు అందించారు. శ్రీరంగం, కంచి, తిరుమల మొదలైన ఎన్నో క్షేత్రాలను ఉద్ధరించారు. సగుణోపాసనను విశిష్టమైనదిగా లోకానికి అందించారు.
శ్రీరంగంలో శ్రీరంగనాయకీ అమ్మవారి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఉత్సవాల్లో ఒకనాడు ఆలయానికి వెనక భాగంలో ఉన్న మంటపంలో దేవదంపతులు వేంచేశారు. చుట్టూ తెరలు కట్టారు. ఆ సమయంలో రామానుజులు తెర లోపలికి ప్రవేశించారు. లోపల ఏం జరుగుతున్నదోనని కూరేశులవారు తెర వెలుపలి రంధ్రం నుంచి ఆతృతతో చూస్తున్నారు. రామానుజులు గద్యత్రయ ప్రబంధాన్ని అమ్మకు, అయ్యకు విన్నవించారు. విని పరవశించిన శ్రీరంగనాథుడు ‘భాష్యకారా, నీకు ముందే లీలా విభూతిని, నిత్య విభూతిని అనుగ్రహించాను కదా. మళ్లీ ఏం కోరి ఈ ప్రబంధాన్ని, శరణాగతి గద్యను విన్నవించావు’ అని ప్రశ్నించాడు. అప్పుడు రామానుజులు ‘స్వామీ, నన్ను ఆశ్రయించినవారికి కూడా పరాభక్తి, పరాజ్ఞానం, పరమ భక్తుల్ని అనుగ్రహించి మోక్షాన్ని ప్రసాదించు’ అని ఆ స్వామిని వేడుకున్నారు. ఆ దివ్య దంపతులు అలాగే అని అనుగ్రహించారు. తెర వెలుపలి నుంచి దీన్నంతటినీ చూస్తున్న కూరేశులవారు భగవద్రామానుజుల ఔదార్యానికి ఆశ్చర్యచకితులై పంచెపైన నడుముకు కట్టుకున్న ఉత్తరీయాన్ని గాలిలోకి ఎగురవేస్తూ…
‘న చేద్రామాను జేత్యేషా
చతురా చతురక్షరీ
రామ వస్థాం ప్రపద్యతే
జంతవో హస్త మాదృశః’
రామానుజ అనే నాలుగు అక్షరాలు లేకపోతే జనన మరణ స్వభావులమైన మాబోటివారి గతి ఏమై ఉండేదో… అని తన్మయత్వంతో నర్తించారు. శరణాగతి గద్యని ప్రతి నిత్యం పారాయణ చేస్తే మోక్షం తథ్యమని ఆ సంఘటన ద్వారా తెలుస్తోంది. గద్యత్రయ ప్రబంధంలో శరణాగతి గద్య, శ్రీరంగ గద్య, శ్రీవైకుంఠ గద్య అని మూడు గద్యలు ఉన్నాయి. భగవద్రామానుజుల అనర్గళ పద బంధ ప్రౌఢిమకు ఈ రచనలు నిదర్శనం.
తిరుమలను రామానుజాచార్యులు తొలిసారి దర్శించినప్పుడు… మోకాళ్లకు వస్ర్తాలను కట్టుకుని, మోకాళ్లపైనే కొండపైకి ఎక్కారు. ఆయన కాలానికి తిరుమల క్షేత్రంలోని దైవం ‘నారాయణుడా? శక్తియా? సుబ్రహ్మణ్యుడా?’ అన్న మీమాంస ఉండేది. విభిన్నవాదాలు చోటుచేసుకున్నాయి. తిరుమలను ఏలుతున్న యాదవరాజు ఆయా వర్గాలవారి వాదనలతో విసిగిపోయాడు. ‘రేపు తెల్లవారి ఆలయం తెరిచే వేళకు విగ్రహం ఎలా కనిపిస్తే, అదే ఖాయం చేస్తాను’ అని చెప్పి, రాజు తలుపులు మూయించేశాడు. తెల్లవారేసరికి వేంకటేశ్వరస్వామి చేతిలో శంఖుచక్రాలతో విష్ణు స్వరూపం స్ఫుటంగా దర్శనమిచ్చింది. రామానుజుల వాదమే నెగ్గింది. శ్రీవేంకటేశ్వర స్వామి వక్షస్థలంలో లక్ష్మీదేవి అంతకుముందే వేంచేసి ఉన్నది. వ్యూహలక్ష్మిని రామానుజులే ఏర్పాటుచేశారు. శుక్రవారం ఉత్తరఫల్గుణీ నక్షత్రయుక్త శుక్లపక్ష ద్వాదశి, రత్నమాలికా యోగంలో వ్యూహలక్ష్మిని ఆయన ఏర్పరిచినట్లు చరిత్ర చెబుతోంది. తిరుమల శ్రీనివాసుని సేవకోసం జీయర్, ఏకాంగి వ్యవస్థలను భగవద్రామానుజులు ఏర్పరచారు. జీయర్ స్వాములు త్రిదండి సన్యాసం స్వీకరించినవారు. కాషాయం, కమండలం, త్రిదండం వారికి దీక్షలో భాగంగా ఉంటాయి. ఏకాంగి అంటే కాషాయం మాత్రమే స్వీకరించినవారు. స్వామికి సన్నిహితంగా ఉంటూ కైంకర్యాలను, సేవలను అర్చకముఖంగా జరిపించే ప్రధాన బాధ్యతను భగవద్రామానుజులు జీయర్ వ్యవస్థకు అప్పగించారు.
శ్రీరంగనాథుని పతిగా పొందిన ఆండాళ్ ఆయనలోనే లీనమైపోయింది. అందరూ చూస్తుండగానే ఆకాశంలోకి ఎగిరి వెళ్లిపోయిన వారు, విగ్రహాల్లో లీనమైపోయేవారు, నీటిలో మునిగి అంతర్థానం అయ్యేవాళ్లు, పూలవానలో కనిపించకుండా పోయేవాళ్లు… ఇటువంటి భక్తులెందరో భారతదేశ చరిత్రలో కనిపిస్తారు. కొందరు యోగులు తమను తాము వృక్షాలుగా, శిలలుగా మార్చుకున్న ఘట్టాలు కూడా అనేకం ఉన్నాయి. భగవద్రామానుజులు ఆ కోవలోకి వస్తారు. సామాన్యశకం 1137 పింగళ నామ సంవత్సరం మాఘ శుద్ధ దశమినాడు తనను తాను చరమశ్రీ విగ్రహంగా మలచుకున్నారు. ఆ విగ్రహాన్ని ‘తానాన తిరుమేని’గా వ్యవహరిస్తారు. శ్రీరంగంలోని వసంతమంటపంలో విగ్రహంగా కనిపిస్తున్నది ఒకనాటి రామానుజుల భౌతిక దేహమేనని చెబుతారు.
శేషావతార రూపమశేష
జనౌఘాఘహరణ చరణాబ్జమ్
శ్రీభాష్యకార మమలం
కలయే రామానుజం కృపాసింధుమ్
సముద్రమంత తన అపార కరుణ చేత అశేష జనుల పాపాలను హరించడానికి… శ్రీమన్నారాయణుని శయ్య అయిన ఆదిశేషుడే…. భగవద్రామానుజులుగా, శ్రీభాష్యకారులుగా రూపమెత్తాడు. ఆయన చరణారవిందాలకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను.
దళితులు వెలివాడల్ని దాటి రాలేని రోజుల్లో.. వచ్చినా వీపునకు చీపురు వేలాడేసుకోవాల్సిన దురదృష్టకర పరిస్థితుల్లో.. భగవంతుడి దృష్టిలో అందరూ సమానమేనని చాటిచెప్పారు రామానుజులు. బోధనలతో సరిపెట్టుకోలేదు, ఆలయ సేవల్లో అన్ని వర్గాల్నీ భాగస్వాముల్ని చేశారు. కొందరికి పల్లకీ మోసే సేవ అప్పగించారు. కొందరికి వింజామరలు వీచే అదృష్టం కల్పించారు. కొందరికి దివిటీలు పట్టే భాగ్యం ప్రసాదించారు. కులం కాదు, గుణం గొప్పని చాటారు. గుణాన్నిమించిన యోగ్యత లేదన్నారు. ఆ మార్పును ఛాందసవాదులు జీర్ణించుకోలేకపోయారు. శాస్త్రవిరుద్ధమని గగ్గోలుపెట్టారు. అధర్మ మంటూ ఆగ్రహించారు. స్వామివారు ఆ కువిమర్శల్ని పట్టించుకోలేదు. సాక్షాత్తు భగవానుడే గీతలో తాను అందరివాడినని ప్రకటించి నప్పుడు.. మనలో మనం ఇలాంటి తేడాలు సృష్టించుకోవడం సరికాదని హితవు చెప్పారు. మహిళల విషయంలోనూ అంతే. స్త్రీ.. మాతృమూర్తిగా జగత్తుకే మాటలు నేర్పుతుందే. చదువులమ్మ సరస్వతి కూడా ఓ మహిళే. అలాంటి తల్లి నోరారా చదివితే, మంత్రం అపవిత్రం అవుతుందా? కానేకాదు. అయితే గియితే, మరింత పవిత్రం కావాలిగానీ అంటూ మహిళలకు మంత్ర యోగ్యత కల్పించారు. ఆధ్యాత్మిక సాధనకు అవకాశం ఇచ్చారు. ఆ ప్రోత్సాహంతోనే ఎంతోమంది మహిళలు పండిత చర్చల్లో పాల్గొన్నారు. ఆధ్యాత్మికోన్నతిని సాధించారు. తన తర్వాత వచ్చిన ఆధ్యాత్మికవేత్తలకు రామానుజుడు స్ఫూర్తి ప్రదాత. అప్పటిదాకా ప్రపంచం అంటే మాయ! ఆ మాయావాదాన్ని ఆయన ఖండించారు. నువ్వు నిజం. నీ బతుకు నిజం. నీ అనుభవాలు నిజం. ఈ జగత్తు అంతా నిజం.. అని చాటిచెప్పారు. ఆ మూలాల ఆధారంగానే, మధ్వాచార్యులు, వల్లభాచార్యులు, ప్రభు పాదులు.. ఎవరికివారు తమతమ సిద్ధాంతాల్ని నిర్మించుకున్నారు. అలా భక్తి ఉద్య మానికి మూలపురుషులుగా నిలిచారు రామానుజులు.
నూట ఇరవై సంవత్సరాలపాటు అవనీ సంచారం చేసిన రామానుజులు తమ అవతారాన్ని విరమించబోయే సమయంలో… శిష్యులకు 72 అంశాలు చెప్పారు. వాటిని ‘వైణవన్ కురల్’
అనే ద్రవిడ గ్రంథం చెబుతోంది. అందులో ముఖ్యాంశాలివి…
.. ✍ నేతి సూర్యనారాయణశర్మ
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Follow us on Google News
అల్పాహారం చేసిన తర్వాత పూజ చేయవచ్చా?
Abhishekam |అభిషేకం వేటితో చేస్తే శివుడికి ప్రీతికరం.. పాలతోనా? పెరుగుతోనా?
సంక్రాంతి తర్వాత ఆరు నెలల ప్రత్యేకత ఏంటి? ఆ టైంలో ఏం జరుగుతుంది?
కాలం ముందు ఆ శివుడు అయినా లోబడి ఉండాల్సిందే.. ఇదే అందుకు నిదర్శనం