ఈ పద్యం కాణాదం పెద్దన సోమయాజి రచించిన ముకుంద విలాసం అనే కావ్యం ద్వితీయాశ్వాసం లోనిది. ఇతను గద్వాల చినసోమ భూపాలుని ఆస్థానకవి. అష్ట మహిషులలో ఒకరైన భద్రాదేవితో శ్రీకృష్ణుడికి జరిగిన వివాహ వృత్తాంతం ఇందులోని ఇతివృత్తం. ‘భద్రాపరిణయం, భద్రాపరిణయోల్లాసం’ అని దీనికి నామాంతరాలు. శ్లేష, శబ్దాలంకారాలు, బంధకవిత, పాదభ్రమకం, ఏకాక్షర కందం మొదలైన చిత్రకవితా విన్యాసాలు ఎన్నో ఈ కావ్యంలో కనిపిస్తాయి. ఇతివృత్తం చిన్నదైనా కవి తన కవితా శక్తి తో ఈ కావ్యాన్ని మూడాశ్వాసాలు గల గొప్ప ప్రబంధంగా తీర్చిదిద్దాడు.
ఈ కావ్యంలో చిలుక దౌత్యం కనిపిస్తుంది. భద్రాదేవి అందచందాల గురించి శ్రీకృష్ణుడికి ఒక చిలుక వివరిస్తుంది. ఆ సందర్భంలో చిలుక ఒలికించిన పద్యమిది. పైన పేర్కొన్న పద్యం భద్రాదేవి మోమును వర్ణిస్తుంది. ముఖాన్ని నిండు చంద్రుడితో పోల్చడం సామాన్యమే. పెద్దన ఈ పద్యంలో నిండు చంద్రుడిగా కాకుండా నిండునెలతో పోల్చాడు. నిండునెల అన్నది శ్లిష్ట పదం. దీనికి ‘పూర్ణచంద్రుడు, ముప్పై రోజులు గల నిండు నెల’ అని రెండు అర్థాలు. ఆమె ముఖం నిండునెలగా భాసిల్లుతున్నదని కవి విచిత్రంగా చెప్పారు. అందువల్ల ఆమె ముఖం పూర్ణచంద్రుడి వలె ప్రకాశిస్తున్నదనడం సామాన్యార్థం కాగా, నుదురు ఒకటి ‘౧’ లాగా ఉంది.
కనుబొమ్మలు జంటగా పదకొండు ‘౧౧’ లాగా, రెండు చెవులు రెండు తొమ్ముదులుగా ‘౯’, ‘౯’ ఉన్నాయని పోల్చడం కూడా సాధారణమే! చివరికి కొంత విచిత్రం చేశారు కవి. ‘ఇంతయున్ గూడ ఆ దినసంఖ్యలను దిలకింప నిండునెల’ అన్నారు. ఇది ఎలా అంటే ౧+౧౧+౯+౯=౩౦ అవుతుంది. అందువల్ల ఇవన్నీ కలిసి ఆమె ముఖం ముప్పై రోజుల నిండునెలగా ఉందని చెప్పారు కవి. ఇది పూర్ణస్థితిగా పేర్కొన్నారు. పరిపూర్ణమైన పొందికలో ముఖాంగాలు అమరినాయి. అంతేకాకుండా ముప్పై రోజులూ ముఖం పూర్ణచంద్రుని వలె ప్రకాశిస్తుందని అంతరార్థం. ఇలా కావ్యంలో శ్లేషార్థాత్మక శబ్దాలంకారాల ప్రయోగం విరివిగా జరిగింది. చిలుక భద్రను సరస్వతీ కృపాకటాక్ష లబ్ది పొందిన గొప్ప పండితురాలిగా అభివర్ణించిన సందర్భంలోని మరో పద్యం చూద్దాం.
మ.గతి మత్తేభము, నాస చంపక, మొగింగైశ్యంబు కందంబు, సం
గత వాక్యంబులు మత్తకోకిలలు, దృక్పాండిత్యమయ్యుత్పల
ద్యుతి, మోమంబురుహంబు, దేహ రుచి విద్యున్మాలిగా మానినీ
తతవృత్త స్థితులెన్నగా దరమె తద్వాగ్జానికైనందగున్
ఈ పద్యంలో తీసుకున్న ఉపమానాలు మత్తేభము, చంపకము మొదలగు వృత్తజాతి పద్యాలు కాగా వాటి సామాన్యార్థాలు పోలికలై విశేషంగా అలరించాయి. ఒక పద్యంలో పేర్కొన్న శ్లిష్ట పదాలు అన్నీ ప్రకృతార్థం బోధించడంతో పాటు అప్రకృతమైన విషయానికి సంబంధించిన ఆయా అంశాలను గూడా తెలియజేయడం పెద్దన శ్లేష ప్రయోగంలోని విశిష్ఠ విషయంగా విమర్శకులు పేర్కొన్నారు.
-చేపూరి శ్రీరాం, హన్మకొండ