బాలీవుడ్ తారలకు గ్లామర్ రహస్యాలు తెలుసు. పొదుపు-మదుపు గ్రామర్ లక్షణాలూ తెలుసు. ఏ పాత్ర అంగీకరించాలో తెలుసు. ఏ కంపెనీ షేర్లు కొనాలో తెలుసు.సినిమాలకు కలెక్షన్ల వర్షం కురిపించుకోవడం తెలుసు, కంపెనీలను లాభాలబాట పట్టించడమూ తెలుసు.
సినిమా తారలు వెండితెర మీద వెలిగిపోతూనే, వ్యాపారాలవైపూ తొంగి చూస్తున్నారు. స్టార్టప్లలో పెట్టుబడులు పెడుతున్నారు. వాణిజ్య ప్రకటనల్లో నటించడానికి డబ్బుకు బదులుగా వాటాలు అడుగుతున్నారు. తమ ఇమేజ్తో ఆ బ్రాండ్ విలువ పెంచుతున్నారు. గత సెప్టెంబర్లో నటి మలైకా అరోరా తన పేరు మీద మలైకా అరోరా వెంచర్స్ను ప్రారంభించింది. ఆ సంస్థ ద్వారా హెల్త్, వెల్నెస్, లైఫ్ైస్టెల్ సంబంధిత స్టార్టప్స్లో పెట్టుబడి పెడుతున్నది. ఇటీవలే ‘కపివా ఆయుర్వేద’ అనే న్యూట్రిషన్ బ్రాండ్లోనూ ఇన్వెస్ట్ చేసింది. ‘సర్వ యోగ’లోనూ ఆమె మదుపరే. ఈ కంపెనీ వెనుక నటి జెన్నిఫర్ లోపెజ్తో పాటు క్రికెటర్ శిఖర్ ధావన్ కూడా ఉన్నారు.
గ్లామర్ తోడైతే..
‘అప్పుడప్పుడే మొదలుపెట్టిన స్టార్టప్లకు సెలబ్రిటీలు ఇన్వెస్టర్లుగా దొరకడం మంచి పరిణామం. ఉచితంగా బ్రాండ్ ప్రమోషన్ లభిస్తుంది. తక్కువకాలంలోనే జనాల వద్దకు వెళ్తుంది. ఆ కంపెనీ విలువ పెరిగేకొద్దీ తారలకూ లాభమే‘ అని విశ్లేషిస్తున్నారు రీడిఫ్యూషన్ సంస్థ ఎండీ సందీప్ గోయల్. సౌందర్య ఉత్పత్తుల తయారీ సంస్థ నైకాలో 2020లోనే షేర్లు కొన్నారు ఆలియాభట్, కత్రినా కైఫ్. ఈ సంస్థ తాజాగా స్టాక్ మార్కెట్లో నమోదు కావడంతో.. నైకా మార్కెట్ విలువ అమాంతంగా పెరిగిపోయింది. ఇద్దరు భామల పంట పండింది. నటి అనుష్కా శర్మ ఓ డిజిటల్ బీమా స్టార్టప్లో రూ.50 లక్షలు పెట్టుబడి పెట్టింది. భవిష్యత్ అంతా ఇలాంటి సంస్థలదే కాబట్టి, తిరుగే ఉండదు.
ప్రియాంక రూటే వేరు..
గ్లోబల్ నటి ప్రియాంక చోప్రా ఏది చేసినా భారీగానే ఉంటుంది. తను ఎంచుకుంటున్న కంపెనీలు కూడా భిన్నమైనవే. మొదట డేటింగ్ యాప్ బంబల్లో పెట్టుబడి పెట్టింది. ఏడాదికే బ్లాక్స్టోన్ గ్రూప్ ఆమె దగ్గరున్న అన్ని షేర్లనూ కొనేసుకుంది. దీంతో డబ్బే డబ్బు! స్టార్టప్ ఇండియా ఇంటర్నేషనల్ సమ్మిట్లో కూడా.. టెక్నాలజీ స్టార్టప్లలో పెట్టుబడి పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపింది ప్రియాంక. ముఖ్యంగా మహిళా ఆంత్రప్రెన్యూర్లను ప్రోత్సహించడంలో తానెప్పుడూ ముందుంటానని చెప్పింది. కృత్రిమ మేధ (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ -ఏఐ) ఆధారిత స్టార్టప్లకు తన మద్దతు ఎప్పుడూ ఉంటుందని ప్రకటించింది. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోమని, గ్లామర్ ఉండగానే మార్కెట్ చేసుకోమనీ.. ఎవరూ చెప్పాల్సిన పనిలేదు బాలీవుడ్ తారలకు.
దీపిక ఇన్వెస్ట్మెంట్ ప్రయాణం..
సౌందర్య ఉత్పత్తుల వ్యాపార సంస్థ ‘పర్పుల్డాట్కామ్’లో సుమారు రూ.3 కోట్ల 25 లక్షలు పెట్టుబడి పెట్టింది దీపికా పదుకోన్. 2018లోనే యోగర్ట్ తయారీ సంస్థ ఎపిగామియాలో కోటి రూపాయలు ఇన్వెస్ట్ చేసింది. ఇవే కాకుండా ఎలక్ట్రిక్ ట్యాక్సీ, క్యాబ్ కంపెనీ బ్లూ స్మార్ట్, స్పేస్ టెక్ స్టార్టప్ బెల్లాట్రిక్స్ ఎయిరోస్పేస్తో పాటు, నువా అనే వెల్నెస్ బ్రాండ్లోనూ వాటాదారే.