ఆధ్యాత్మిక గ్రంథాలు ఓపట్టాన కొరుకుడు పడవు. ఆ పరిభాష పాఠకుడిని ఇబ్బంది పెడుతుంది. ఆ వాక్యం అర్థమైకానట్టు ఉంటుంది. రెండో ప్రయత్నంలోనో, మూడో ప్రయత్నంలోనో రచయిత అంతరంగం ఎంతోకొంత అవగతం అవుతుంది. కారణం.. ఆధ్యాత్మికవేత్తలంతా గొప్ప రచయితలు కాకపోవచ్చు. గొప్ప రచయితలకు ఆధ్యాత్మిక ప్రజ్ఞ ఉండకపోవచ్చు. కానీ, ఈ గ్రంథంలోని ప్రతి వ్యాసం.. ఆధ్యాత్మిక ప్రజ్ఞావంతులైన రచయితల కలం నుంచి జాలువారినట్టే అనిపిస్తుంది. లోతైన వ్యాసాలే అయినా సుబోధకంగా ఉన్నాయి. అలతి పదాల్లోనే ఆత్మజ్ఞాన సారాన్ని బోధిస్తాయి. భక్తిటీవీ 15 ఏళ్ల విశిష్ట సంచిక ‘అర్చన’.. భారతీయ తత్త్వచింతనలోని అరుదైన అంశాలను ఒకచోట చేర్చిన పుస్తకం. ఏడు అధ్యాయాలున్న సంచికలో 85కు పైగా ప్రత్యేక వ్యాసాలున్నాయి. మొదటి అధ్యాయం ‘తత్త్వం’, సనాతన ధర్మంలోని భిన్నకోణాలను ఆవిష్కరిస్తుంది. మతం తాలూకు మూలాలను ఎరుకపరుస్తుంది. తత్త్వవేత్త సర్వేపల్లి రాధాకృష్ణన్ రచించిన ‘ధర్మోద్ధరణ’ వ్యాసంతో ఈ గ్రంథం ప్రారంభమవుతుంది. వివేకానంద, జిడ్డు కృష్ణమూర్తి, దయానంద సరస్వతి తదితరుల తాత్త్విక సందేశాలు ఇందులో పొందుపర్చారు. రెండో అధ్యాయం భారతీయ వైదిక, పౌరాణిక వాఙ్మయాన్ని పరిచయం చేస్తుంది. మూడో అధ్యాయం రామాయణ, మహాభారత ‘ఇతిహాసాల’కు సంబంధించినది. నాలుగో అధ్యాయమైన ‘చింతన’లో… నవవిధ భక్తి
మార్గాలు, ధర్మం, ఆత్మగుణాలు, తపస్సు వంటి విశ్లేషణాత్మక వ్యాసాలకు స్థానం కల్పించారు. ఐదో అధ్యాయం ‘సంస్కృతి’. ఆరాధన అంతరార్థం, పండుగల పరమార్థం, దేవాలయ దర్శనంలోని సామాజిక హితం వంటి అంశాలు ప్రసిద్ధ రచయితల కలాల నుంచి వెలువడ్డాయి. గురుతత్తం, ప్రసిద్ధ గురువుల జీవన సంగ్రహాన్ని పరిచయం చేస్తుంది ఆరోదైన ‘గురుదేవులు’ అధ్యాయం. ఏడోదైన ‘జ్ఞానదీపికలు’ ప్రసిద్ధ ఆధ్యాత్మిక గ్రంథాలను పరిచయం చేస్తుంది. విశ్వ ఆవిర్భావం, మతాల పుట్టుక, దేవుళ్లు మానవ జీవితంలో ప్రవేశించిన వైనం, ఆధ్యాత్మికత పేరిట సాగుతున్న మూఢ విశ్వాసాలు, మతంలోని ఔన్నత్యం, సంస్కృతిలోని గొప్పదనం, సంప్రదాయాల్లోని అంతరార్థం తెలుసుకోగోరే ప్రతీ ఒక్కరూ చదివి తీరాల్సిన విలువైన గ్రంథం అర్చన.
శ్రీరాముడు తన కపిసేనను యుద్ధక్షేత్రంలో నడిపించినట్లు, శేషేంద్రుడు తన ‘కవిసేన’ను సాహిత్య సమర క్షేత్రంలో నడిపించబూనాడు. అందుకోసం వారికి ‘బుల్లెట్ ప్రూఫ్’ జాకెట్లనే కావ్యశాస్త్ర రహస్యాల తొడుగులను తొడిగాడు. ప్రతి సైనికుని చేతికీ ఒక ‘పెన్ను గన్ను’ను అందించాడు. వారికి సాహిత్య పోరాట రహస్యాలను నూరిపోశాడు. తాను ముందుండి తన వెనక వాళ్ళను నడిపించాడు తన ‘ఆధునిక కావ్యశాస్త్రం’ అనే ‘కవిసేన మేనిఫెస్టో’ ద్వారా యుగకవి శేషేంద్ర. శ్రీకృష్ణుడు అర్జునుడికి దివ్యదృష్టిని ప్రసాదించినట్లు సాహిత్య మర్మజ్ఞతా దివ్యదృష్టినీ ప్రసాదించాడు. తానొక కవిని మాత్రమే కాననీ, కావ్యశాస్త్ర మర్మజ్ఞుడననీ నిరూపించుకున్నాడు. ఆ శంఖారావమే ఈ అత్యాధునిక కావ్యశాస్త్రం. ‘ఈ కవిసేన ఎక్కడుంది?’ అన్న ప్రశ్న అనవసరం, అసంబద్ధం. శేషేంద్రుని అడుగుజాడల్లో నడిచిన ప్రతి ఒక్కడూ ఒక (కలం) సైనికుడే ! సైన్యమే! భరతఖండంతోపాటు ప్రాక్పశ్చిమ ఖండాల్లోని అనేకానేక మహామహుల కావ్యాల్ని, కావ్యశాస్ర్తాల్ని మథించి, కావ్య రహస్యాన్ని తీర్థప్రసాదాలుగా వడ్డించాడు. శేషేంద్ర దీని ద్వారా అనేకానేక కావ్య రహస్యాల్ని మనకు కరతలామలకం గావిస్తున్నారు. ఉన్నది ఉన్నట్లుగా చెప్పడం ‘నిరలంకృతిదోషం’. కవిత్వం ఒక ఆత్మకళ. చైతన్యసాగర రహస్యానికి తాళపుచెవి అనుభూతి. ఇలా, అనేకానేక రహస్యాల్ని శోధించి చెప్పిన గ్రంథరాజం ఇది.
వసంత రుతువులో కోకిల కంఠం నుంచి కుహుకుహూ రావాలు రావడం సహజం. విన్నవారి మనసులు పరవశించిపోవడమూ అంతే సహజం. అందుకే ఆ పక్షి నల్లనిదైనా అందరి ఆదరాన్ని పొందగలిగింది. కాంక్రీటు భవనాలతో కిక్కిరిసిపోయిన నగర అరణ్యంలో కోకిల గొంతెత్తితే విని ఆనందించేవాళ్లు చాలా కొద్దిమందే ఉంటారు. ప్రకృతి గురించి అసలే పట్టించుకోలేనంత పనిపాటల్లో, ఆటల్లో మునిగిపోయే బతుకులు మరి! ఇవెలా ఉన్నా ఒక కవికి, పండితుడికి కోకిల గొంతు విప్పితే కలిగే ఆనందంలోంచి వెలువడేది కావ్యమే అనడం సముచితం. అలా ఓరోజు ఉదయం కోకిల కూజితాలను స్ఫూర్తిగా తీసుకుని, ఆచార్య మసన చెన్నప్ప సరళమైన శైలిలో, కోకిల పాటంత మధురంగా 311 ఆటవెలది పద్యాలలో వెలువరించిందే ‘కోకిల’ కావ్యం. ఇది ఆచార్య చెన్నప్ప జీవిత వివరాలతో లౌకికంగా మొదలై వేద ప్రాధాన్యాన్ని వివరిస్తూ, మాయావాదాన్ని పరాస్తం చేస్తూ, ఆయనను ‘ఆర్షకవి’గా నిరూపిస్తూ పారలౌకికత దిశగా సాగిపోతుంది. ఆత్మాశ్రయ రీతిలో కోకిలను శ్రోతగా చేసుకొని రాసిన ఈ చిరుపుస్తకం ఆర్ష మార్గాన్ని చూపించే కరదీపిక.