‘మీ భార్యాభర్తల్లో ఎవరిది పైచేయి’ అనే ప్రశ్న తరచూ వినిపిస్తుంటుంది. సరదాగా తోచినా, ఆ జవాబు ఆధారంగా వారిమధ్య అన్యోన్యతను అంచనా వేయవచ్చని అంటున్నారు జర్మనీ పరిశోధకులు. సంసారంలో ఇద్దరి నిర్ణయానికీ తగిన ప్రాధాన్యం ఉన్నప్పుడే కాపురం పచ్చగా ఉంటుందని చెబుతున్నారు. ఈ విషయాన్ని తేల్చేందుకు నిపుణులు 181 జంటలను ఎంచుకున్నారు. వీరంతా సగటున ఎనిమిదేండ్లు కలిసి ఉన్నారేమో సరిచూసుకున్నారు. ఈ జంటలను అనేక ప్రశ్నలు అడిగిన పిమ్మట నిర్ణయం తీసుకునే అధికారం సరిసమానంగా ఉన్న జంటలే సంతృప్తిగా ఉన్నట్టు తేలింది. ధనకనక వస్తువాహనాల్లాంటి భౌతికమైన విషయాలేవీ ఈ సంతృప్తిని ప్రభావితం చేయలేదట. అయితే, ఇక్కడ ఓ కిటుకు ఉంది. ప్రతి విషయంలోనూ ఇద్దరి పట్టూ చెల్లాలని లేదు. అభిరుచులనుబట్టి కొన్ని విషయాల్లో భార్య, మరికొన్ని సందర్భాల్లో భర్త తమ మాటలను నెగ్గించుకోవచ్చు.