పీవీ వ్యక్తిత్వాన్ని అంచనా వేయడం కష్టం. ఆయనలో ఆలోచన ఉంది. ఆవేశం ఉంది. తక్షణం స్పందించే లక్షణం ఉంది. దాటవేసే ధోరణీ ఉంది. ఏ సందర్భంలో ఏ కోణాన్ని ఆవిష్కరించాలో పీవీకి బాగా తెలుసు. పద్దెనిమిది భాషల పండితుడిని, ‘మీకు ఏ భాష ఇష్టం’ అని అడిగితే, ఆయన చెప్పిన సమాధానం ‘మౌన భాష’! ఈ ఒక్కటి చాలదా మౌనమునిలా ఉండే పీవీలో స్పాంటెనియటి ఏ స్థాయిలో ఉండిందో చెప్పడానికి! ఆ విశిష్టమూర్తి జీవితంలో ఇలాంటి విభిన్న కోణాలు ఎన్నో! వాటిలో కొన్ని..
పీవీకి, ప్రజాకవి కాళోజీకి ఉన్న అనుబంధం ప్రత్యేకమైంది. కాళోజీని ‘కాళన్న’ అని ఆప్యాయంగా పిలిచేవారు నరసింహారావు. సొంత తమ్ముడిని పిలిచినట్టు పీవీని ఏక వచనంతో సంబోధించేవారు కాళోజీ. ఈ ఇద్దరి ఆత్మీయతకు అద్దం పట్టే సందర్భాలెన్నో. కాళోజీ షష్ఠిపూర్తి సందర్భంగా పీవీ రాసిన కవిత ఆయనపై ఈయనకున్న అభిమానాన్ని అందంగా, విచిత్రంగా చాటుతుంది. ఆ కవిత పీవీ రచనా పాటవాన్నీ తెలియజేస్తుంది. అందులో కొన్ని పంక్తులివి..
‘సూక్తులు శాపములను
పునరుక్తి దోషముండకుండ
జగత్తు నభిశంసించుచు
శత వత్సరములు దాటుము..
బ్రహ్మ నీకు పొరపాటున
పాపుల వయసిచ్చుగాక..
కాలుడు మా కాళయ్యను
కలకాలము మరుచుగాక’
అంటూ కాళోజీ నిండు నూరేండ్లు బతకాలని ఆకాంక్షించారు. బతికినన్నాళ్లూ కాళోజీలానే ఉండాలని పీవీ మనస్ఫూర్తిగా కోరుకున్నారు.
అయితే.. ఫ్లాపే!
అది 1960. హైదరాబాద్ నారాయణగూడలోని దీపక్ థియేటర్లో సినిమా చూసి బయటకు వస్తున్నారు పీవీ. మిగతా ప్రేక్షకులు ఏదో అర్థం కాని ప్రపంచంలోకి వెళ్లొచ్చామన్నట్టుగా పెదవి విరుస్తున్నారు. పీవీ మాత్రం కొత్త విషయం నేర్చుకున్న విద్యార్థిలా సంతోషంగా అడుగులు వేస్తున్నారు. ఇంతలో ఆయనకు ఆ చిత్ర నిర్మాత ఎదురయ్యారు. ‘ఎలా ఉందండీ సినిమా?’ అని పీవీని అడిగారు. ‘బాగుందయ్యా! మంచి సినిమా నిర్మించారు’ అన్నారు. దానికా నిర్మాత ‘మీలాంటి మేధావికి నచ్చిందంటే, మా సినిమా పోయినట్టే’ అన్నారు నవ్వుతూ. ఆ నిర్మాత ఎవరో కాదు. కాంగ్రెస్ నేత ఎం.సత్యనారాయణరావు. ఆయన అన్నట్టే ఆ సినిమా ఫ్లాప్ అయింది. చిత్రం పేరు
‘చివరకు మిగిలేది’. మహానటి సావిత్రి హీరోయిన్. కాంగ్రెస్ నాయకుడు ఉప్పునూతల పురుషోత్తం రెడ్డి ..పాల్వాయి గోవర్ధన్రెడ్డి, ఎం.సత్యనారాయణరావులతో కలిసి ఈ సినిమా నిర్మించారు. ‘చివరకు మిగిలేది’ నిర్మాతలకు నష్టాలు మిగిల్చినా, పీవీ చెప్పినట్టు మంచి చిత్రమన్న ఖ్యాతిని మూట గట్టుకుంది. సావిత్రికి అవార్డు తెచ్చి పెట్టింది.
ప్రశ్న వేయకుండా ప్రశ్న
పీవీ ప్రధానిగా ఉన్నప్పుడు ఒకసారి హైదరాబాద్లో మాడుగుల నాగఫణిశర్మ మహా సహస్రావధానానికి విశిష్ట అతిథిగా హాజరయ్యారు. ఆ సందర్భంగా పీవీ పలుకులు ఆయనలోని హాస్య చతురతను మరోసారి అందరికీ పరిచయం చేశాయి. అవధానం ఆద్యంతం వీక్షించాలని ఉన్నా తనూ వ్యవధానం లేకుండా అవధానం చేస్తున్నానని చెప్పుకొచ్చారు. పదవీ బాధ్యతలు తనను వరద బాధితుల్లా సమయాభావ బాధితుడిని చేశాయని సభలో నవ్వులు పూయించారు. అవధానికి పద్యం పూరించడానికి ప్రశ్న వేయమని కోరిన సందర్భంలో, ‘అవధానిగారు ఒక ప్రశ్న సంధించమన్నారు. గడ్డివాములో సూది పడితే దాన్ని బయటకు తీసినట్టుగా ఉంది నా పరిస్థితి. నిద్రావస్థలో కూడా ప్రశ్నలే ప్రశ్నలు కనపడుతున్న నాకు, ప్రతి మానవుడు ఒక ప్రశ్నగా, సమస్యగా పరిణమించిన సందర్భంలో! నేను ఇన్ని ప్రశ్నల్లో నుంచి ఒక ప్రశ్నను వేరు చేస్తే తక్కిన వాటికి అన్యాయం చేసినవాణ్ని అవుతాను’ అంటూ చమత్కరించారు. చివరకు ఈ క్షణంలో అవధాని మనస్థితిని అనుసరించి అన్నిటికన్నా పెద్ద ప్రశ్న ఏది స్ఫురిస్తుందో దానిపై పూరణ చేయాలన్నారు. ‘ప్రశ్న వేయకుండా ప్రశ్న వేశారంటూ’ ఆ అవధాని అందమైన పద్యంతో పీవీకి సమాధానం ఇవ్వడం కొసమెరుపు.