మల్లేశ్ పెద్దగా ఏం చదువుకోలేదు. కానీ, జీవితాన్ని అధ్యయనం చేశాడు. కాగితం మీద రాయలేడు. అయితేనేం, నాలుక మీద సాహితీ సరస్వతి నాట్యం చేస్తూ ఉంటుంది.పాటల చెల్మ ఊరుతూనే ఉంటుంది. ఆ మాటల్లో యుక్తి ,పాటల్లో చలోక్తి.. పుష్కలం. ఉద్యమగీతాల నుంచి భక్తి పాటల వరకూ.. తెలంగాణ జానపదంలో తనదైన ముద్ర వేసుకున్నాడు. ఆ ప్రయాణమంతా మల్ల్లేశ్ మాటల్లోనే..
నాస్వస్థలం సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం కొత్తగూడెం. అమ్మ బాలమ్మ నా తొలి గురువు. ఇంట్లో, పొలం వద్ద అమ్మ పాడుకునే పాటలు వింటూ పెరిగాను. పాడటమూ నేర్చుకున్నాను. పశువులు మేపడానికి వెళ్లినప్పుడు మళ్లీమళ్లీ పాడుకొనేవాడ్ని. అప్పట్లో ‘అక్షర ప్రభ’ బృందాలు గ్రామాల్లో పాటలు పాడేందుకు వచ్చేవి. అక్షరాస్యత మీద అవగాహన కలిగించేవి. ఆ సాహిత్యమూ నాలో ఆసక్తిని పెంచింది. తరువాత నేను జిన్నారం మండలం ఊట్ల గ్రామానికి వచ్చాను. వివేకానంద యువజన సంఘానికి సాంస్కృతిక కార్యదర్శిగా వ్యవహరించేవాడిని. పాఠశాలలో నిర్వహించే పంద్రాగస్టు, రిపబ్లిక్ డే వేడుకల్లో పాడేటోన్ని. ఆ పాటలు విన్న జన చైతన్య కళా సంస్థ అధ్యక్షుడు వీఎం ఎల్లయ్య నన్ను మండల యువజన సంఘాల సాంస్కృతిక కార్యదర్శిగా నియమించారు. దీంతో నా జీవితం మలుపు తిరిగింది. 2003లో యువజన సంఘాల వారోత్సవాల్లో నేను పాడిన పాటకు జిల్లా స్థాయిలో మొదటి బహుమతి వచ్చింది. రాష్ట్ర స్థాయి పోటీల్లోనూ రెండో బహుమతి లభించింది. నాకు చదవడం వరకే వచ్చు. రాయడమే ఇబ్బంది. ట్యూన్ల మీద పాటలు నేనే ఫోన్లో రికార్డ్ చేసుకుంటా. ఆ తరువాత, నా భార్య శివలక్ష్మితో రాయించుకుంటా.
ఉద్యమ గొంతుక..
ఉద్యమంలో అనేక ధూమ్..ధామ్ కార్యక్రమాలలో పాల్గొన్నా. ‘తెలంగాణమా…తెలంగాణమా’, ‘ఎవ్వడైతే ఏందిరా చెట్టుమీద కొమ్మలే.. జనం సొమ్ము తినమరిగిన బట్టెబాజి దొంగలే’, ‘ఉస్మానియా క్యాంపస్లో ఉదయించిన కిరణమా వీరతెలంగాణమా’ తదితర పాటలతో అందరినీ గంతులు వేయించాను. గద్దర్ అన్న, రసమయి బాలకిషన్ అన్న, గోరేటి వెంకన్న, జయరాజ్, అందెశ్రీ, విమలక్క, విజయ, సాయిచంద్, కిశోర్ తదితరులతో కలిసి అనేక ధూమ్..ధామ్లలో పాల్గొన్న. టీన్యూస్తో పాటు, వివిధ చానల్స్లో జానపద పాటలు పాడిన.
‘జై బోలో తెలంగాణ’ సినిమాలో…
‘ఎన్కౌంటర్’ సినిమా డైరెక్టర్ ఎన్.శంకర్ తెలంగాణ ఉద్యమ సమయంలో తీసిన ‘జైబోలో తెలంగాణ’ సినిమాలో గద్దర్తో పాటు తెలంగాణకళాకారుల మీద చిత్రీకరించిన ‘పొడుస్తున్న పొద్దుమీద..నడుస్తున్న కాలమా..’ పాటలో నేను కూడా పాల్గొన్నా. భక్తి పాటలూ మంచి పేరు తెచ్చాయి. తెలంగాణ జిల్లాలతో పాటు రాయలసీమ ప్రాంతంలో అయ్యప్ప పాటలు పాడాను. హైదరాబాద్ లలిత కళాతోరణంలో మాస్టార్జీ నిర్వహించిన ‘వంద గొంతులు…వెయ్యి డప్పులు’ గిన్నిస్ రికార్డ్ కార్యక్రమంలో నేనూ పాల్గొన్నా. పాటలే నా ప్రాణం. మారుమూల పలెలో పుట్టిన నాకు పాటల ద్వారానే గుర్తింపు వచ్చింది. పాటలు పాడటమే నాపని. దేవుడు అడగకుండానే అన్ని ఇస్తున్నాడు. జీవితంలో ఏదీ శాశ్వతం కాదు. ఉన్నంతలో అందరం సంతోషంగా ఉండాలన్నదే నా మనస్తత్వం. దేవుడు కలిగిస్తున్న దాంట్లో నా బంధువులకూ ఇస్తున్న. పెండ్లిళ్లు చేశాను. చదువులు చెప్పిస్తున్నా. దేవుడు కలిగిస్తే మరింత మందికి సాయం చేస్తా. పాటను ప్రపంచమంతా తీసుకెళ్తా.
-ఎం. రమేశ్