టాలీవుడ్కు ఉత్తరాది భామల వలస కొత్తేమీ కాదు. ఎందరో హిందీ సుందరీమణులు అందంతో, అభినయంతో తెలుగు ప్రేక్షకుల మనసులు దోచేస్తున్నారు. రెండేండ్ల క్రితం ‘ఈ మాయ పేరేమిటో..’ అంటూ మంత్రమేసిన ముంబై భామ కావ్య థాపర్. ఇటీవల ఓటీటీ వేదికగా వచ్చిన ‘ఏక్ మినీ కథ’ సినిమాతో మరోసారి తెలుగు ప్రేక్షకులను పలకరించింది.
ముంబైలో పుట్టి పెరిగిన కావ్య డిగ్రీ కాగానే మోడలింగ్లో మెరిసింది. పతంజలి, మేక్ మై ట్రిప్, కోహినూర్ వంటి బ్రాండ్స్ ప్రచార చిత్రాల్లో నటించింది. 2013లో ‘తత్కాల్’ అనే హిందీ షార్ట్ ఫిల్మ్తో కెరీర్ను ప్రారంభించిన కావ్య, ‘ఈ మాయ పేరేమిటో’ సినిమాతో టాలీవుడ్ను మాయ చేసింది.
తెలుగులో మొదటి సినిమా
ఆశించినంత ఫలితం ఇవ్వక పోయేసరికి, తమిళబాట పట్టింది కావ్య. అక్కడ ‘మార్కెట్ రాజా ఎంబీబీఎస్’ సినిమాలో నటించింది. చెన్నపట్నంలోనూ అవకాశాలు రాకపోవడంతో మళ్ళీ ఫొటోషూట్లు, మోడలింగ్పై దృష్టి సారించింది. ఇటీవల ఓటీటీ వేదికగా విడుదలైన ‘ఏక్ మినీ కథ’ సినిమా చాన్స్ కొట్టేసింది. ఈ సినిమాలో అమృతగా కావ్య అభినయానికి మంచి గుర్తింపు లభించింది
మోడలింగ్ చేస్తూనే హీరోయిన్ అవకాశాలకోసం ప్రయత్నించింది కావ్య. కెరీర్ ఆరంభంలోనే కండోమ్ యాడ్ చేసి ‘ఔరా!’ అనిపించింది. వృత్తిని వృత్తిగానే చూడాలనీ, వ్యక్తిగతంగా ఫీలవ్వాల్సిన అవసరం లేదనీ సమర్థించుకుంది. కావ్య ధైర్యాన్ని అందరూ మెచ్చుకున్నారు కూడా.
‘ఫలానా పాత్రలే చేయాలని ప్రత్యేకమైన నియమాలేం పెట్టుకోలేదు. మంచికథ, ప్రాధాన్యం ఉన్న పాత్ర అయితే చాలు. నటిగా నన్ను నేను నిరూపించుకోగలిగే అన్ని క్యారెక్టర్లూ చేస్తాను. స్కిన్ షో విషయంలో నాకెలాంటి పరిమితులూ లేవు. కథలో బలం ఉంటే చాలు. ఎలా ఉన్నా సినిమా ఆడుతుందని నమ్ముతా. అందుకే, కథ అవసరాన్నిబట్టి దుస్తులు ధరిస్తానే తప్ప, వ్యక్తిగతమైన ఆంక్షలు విధించుకోను’ అంటున్నది కావ్య.
‘తెలుగు ప్రేక్షకులు చాలా ప్రత్యేకం. ముంబై అమ్మాయినైనా తెలుగింటి బాలికగానే ఆదరిస్తున్నారు. రెండో సినిమాతోనే మంచి గుర్తింపు దక్కడం చాలా సంతోషంగా ఉంది. అమృత పాత్ర నా జీవితానికి చాలా దగ్గరగా ఉంది. అందుకే, నేనెలా ఉంటానో సినిమాలోనూ అలానే చేశా. ఈ సినిమా తర్వాత తెలుగులో మరిన్ని అవకాశాలు వస్తాయని ఆశిస్తున్నా. ఇప్పటికే కొన్ని కథలు వింటున్నా. ఇంకా ఫైనల్ కాలేదు’ అంటూ భవిష్యత్ ప్రణాళికను వివరించింది కావ్య.
‘టాలీవుడ్లో చిరంజీవి,ఎన్టీఆర్ల డాన్స్ అంటే ఇష్టం. నాని, ప్రభాస్, రామ్చరణ్లకు పెద్ద అభిమానిని. అవకాశం వస్తే వాళ్లతో నటించాలని ఉంది. ప్రస్తుతం తమిళంలో విజయ్ ఆంటోనీ సరసన ఒక సినిమాకు చేస్తున్నా. హిందీలో మూడు చిత్రాల్లో నటిస్తున్నా. అన్నీ నిర్మాణ దశలో ఉన్నాయి. త్వరలోనే వివరాలు వెల్లడిస్తా’ అంటున్నదంటే, బాలీవుడ్ను ఏలేసే ఉద్దేశం ఉందనేగా అర్థం.
‘నేను మితభాషిని. అంత
తొందరగా కలిసి పోలేను. ఆధ్యాత్మిక చింతనా ఎక్కువే. ప్రశాంతతకోసం తరచూ గుడికి వెళ్తుంటాను. జంతు సంరక్షణ అంటే ఇష్టం. వాటికోసం తోచినంతలో ఏదో ఒకటి చేయాలని భావిస్తా’ అని తన మనోగతం చెబుతున్న ఈ భామ, ఇకనైనా వరుస అవకాశాలు దక్కించుకుంటుందేమో చూడాలి.