ఛోలే భటూరే అనగానే.. పొగలు కక్కే పూరీతోపాటు ఇచ్చే శనగల కుర్మా గుర్తొస్తుంది. ఉత్తరాది వంటకమే అయినా, దేశమంతటా అభిమానులు ఉన్నారు. అయితే కరోనా వ్యాక్సిన్ వేసుకున్న వారికి ఉచితంగా ఛోలే భటూరే అందిస్తూ అందరి మన్ననలూ పొందుతున్నాడు చండీగఢ్కు చెందిన సంజయ్ రాణా అనే వీధి వ్యాపారి. కొవిడ్ నివారణకు వ్యాక్సిన్ వేసుకోవాలని ప్రభుత్వం సూచిస్తున్నా.. కొందరు మాత్రం అపోహలూ, అనుమానాల కారణంగా వ్యాక్సిన్కు దూరంగా ఉంటున్నారు. ఆ భయాల్ని పోగొట్టేందుకు.. తనవంతు ప్రయత్నాలు చేస్తున్నాడు సంజయ్. ఎవరైనా సరే, తన బండి దగ్గరికి వచ్చి.. వ్యాక్సిన్ వేసుకున్న మెసేజ్ చూపిస్తే చాలు! ఉచితంగా ఛోలే భటూరే అందిస్తున్నాడు. ఈ చిరువ్యాపారి చొరవను ప్రధానమంత్రి ‘మన్ కీ బాత్’లో ప్రశంసించారు కూడా.