కొవిడ్ జీవన గమనాన్ని మార్చింది. లాక్డౌన్ ఉద్యోగాలను పోగొట్టింది. ఆంక్షలు కొత్త ఉద్యోగ ప్రయత్నాలనూ నిలిపేశాయి. కెరీర్ ఏమవుతుందో అనే దిగులు. ఆ సమయంలోనే ఒక ఐడియా వచ్చింది. చిన్నగా ఒక చికెన్ దుకాణం పెట్టారు. ఇప్పుడు కోటీశ్వరులుగా నిలిచారు ఆ ఇద్దరూ.
మహారాష్ట్రలోని ఔరంగాబాద్కు చెందిన ఆకాశ్ మాస్కే, ఆదిత్య కీర్తనే బాల్యమిత్రులు. ఇద్దరూ సాఫ్ట్వేర్ ఇంజినీర్లే. కరోనా లాక్డౌన్ సమయంలో ఆఫీస్లకు సెలవులిచ్చారు. రెండు నెలలు గడిచాయి. ఆ ఖాళీ సమయంలో ఆకాశ్, ఆదిత్య స్నేహబంధం మరింత బలపడింది. అంతలోనే, కంపెనీ పొదుపు చర్యలలో భాగంగా ఇద్దరి ఉద్యోగాలూ పోయాయి. రోడ్డున పడినంత పనైంది. ఆ తర్వాత..
ఆకాశ్, ఆదిత్య.. ఇద్దరూ మధ్యతరగతి జీవులే. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. ఉన్నపళంగా కొలువులు పోవడంతో కొత్త ఉద్యోగాలకు ప్రయత్నించారు. ఒకట్రెండు కంపెనీలు ఆన్లైన్లో ఇంటర్వ్యూలు కూడా తీసుకున్నాయి. చివరికి వచ్చేసరికి ‘నో..’ చెప్పారు. ఔరంగాబాద్ సమీపంలో పారిశ్రామిక కార్యకలాపాలు అధికంగా ఉంటాయి. అవన్నీ పరిశీలించాక.. ఉద్యోగ ప్రయత్నాలకు స్వస్తి చెప్పారు. స్వయం ఉపాధి మార్గాల గురించి ఆలోచించారు. వ్యాపార విజేతల గెలుపు కథలు చదివారు. అయినా, ఏం చేయాలనే స్పష్టత రాలేదు. ఖాళీగా ఉండటం ఎందుకని.. స్థానిక వర్సిటీలో పౌల్ట్రీ, మాంసం ప్రాసెసింగ్పై ఒకేషనల్ కోర్స్ పూర్తిచేశారు. రిటైల్ మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న చికెన్, మటన్ బిజినెస్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఆ ఆలోచనను స్నేహితులు ‘పరమచెత్త ఐడియా’ అని తేల్చిపారేశారు.
రూ.25 వేల పెట్టుబడి
ఇంట్లోవాళ్లు ‘ఇంజినీరింగ్ చేసింది చికెన్ షాప్ పెట్టడానికా?’ అంటూ తిట్టినతిట్టు తిట్టకుండా తిట్టారు. అయినా ఆ ఇద్దరూ పట్టించుకోలేదు. ధైర్యంచేసి 100 చదరపు అడుగుల స్థలాన్ని లీజుకు తీసుకున్నారు. అప్పటికి ఇద్దరి దగ్గరా కలిపి రూ.10 వేలు మాత్రమే ఉన్నాయి. మరో రూ.15 వేలు స్నేహితుల దగ్గర బదులు తీసుకున్నారు.
మొత్తానికి రూ.25 వేల పెట్టు బడితో ‘అపెటైట్’అనే వెంచర్ను ప్రారంభించారు. ‘ఇంజినీరింగ్ చదివి ఈ చికెన్ దుకాణం నడిపితే పిల్లనెవరు ఇస్తారు?’ అంటూ అమ్మలక్కలు ఆడిపోసుకునేవారు. ఇలాంటి వ్యాఖ్యలకు మొదట బాధపడినా, తర్వాత సవాలుగా తీసుకున్నారు. తొలిరోజుల్లో నెలకు రూ.40 వేల ఆదాయం వచ్చేది. వ్యాపారం నెమ్మదిగా పెరగసాగింది. బ్రాంచీల సంఖ్య కూడా పెరిగింది. కొద్దికాలంలోనే బ్రాండ్ వాల్యూ వచ్చేసింది. రెండేండ్లలో బిజినెస్ కోట్ల రూపాయలకు చేరింది. ఇన్వెస్టర్ల కండ్లూ పడ్డాయి.
రూ.10 కోట్ల ఆఫర్
అపెటైట్ టర్నోవర్ ఏటికేడాది రెట్టింపు అవుతున్నది. మార్కెట్లోనూ మంచి గుర్తింపు వచ్చింది. ఆ అభివృద్ధిని గమనించిన ‘ఫాబీ కార్పొరేషన్’ అనే కంపెనీ భారీ ఆఫర్ ఇచ్చింది. అయినా ఆకాశ్, ఆదిత్య కాదన్నారు. చేతులారా పెంచిపెద్దచేసిన సంస్థను పూర్తిగా అమ్మేయడానికి ఇష్టపడలేదు. మొత్తానికి, మెజారిటీ వాటాను ఇవ్వడానికి మాత్రం సుముఖత వ్యక్తం చేశారు. దీంతో రూ.10 కోట్లకు ఫాబీ కార్పొరేషన్ ‘అపెటైట్’లో మెజారిటీ వాటా దక్కించుకున్నది. అపెటైట్ బ్రాండ్తోనే ఈ వ్యాపారం కొనసాగుతుంది. లాభంలో 40% ఆ ఇద్దరికీ దక్కేలా ఒప్పందం కుదిరింది. కంపెనీ సహ వ్యవస్థాపకులుగా ఆకాశ్, ఆదిత్య కొనసాగుతారు. కొత్త మేనేజ్మెంట్ వ్యాపారాన్ని ఆన్లైన్లో విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది.
ఔరంగా బాద్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా రెండున్నర వేలమందికి ఉపాధి అవకాశాలు సృష్టించాలనేది వారి లక్ష్యం. దేశవ్యాప్తంగా చిన్నాపెద్దా నగరాలకు వ్యాపారాన్ని తీసుకెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. హోం డెలివరీకి ఎలక్ట్రిక్ వాహనాలను మాత్రమే ఉపయోగించాలన్నది ఆలోచన. ‘మన వ్యాపారం మనకు లాభాలను ఇవ్వాలి. అదే సమయంలో పర్యావరణానికి నష్టం కలిగించకూడదు’ అంటారు ఆకాశ్, ఆదిత్య. ప్రతి షాపింగ్లో కస్టమర్ ఓ అనుభూతిని ఆశిస్తాడు. మాంసం షాపింగ్లో మాత్రం ఆ అవకాశం ఎందుకు ఇవ్వకూడదు? దుర్వాసన మధ్య, అపరిశుభ్రమైన పరిసరాల మధ్య ఎందుకు కొనాలి? – అన్నదే ఆ ఇద్దరి ప్రశ్న.