పచ్చలైటు పడుతుంది. బండి రివ్వున దూసుకెళ్తుంది. క్షణాల్లో మజిలీ చేరుతుంది. దిగాల్సిన వాళ్లు దిగిపోతారు. ఎక్కాల్సిన వాళ్లు ఎక్కుతారు. ఎవరి గూటికి వారు చేరిపోతారు. అయినా మెట్రో రైలు భ్రమణ కాంక్ష తీరదు. ఎన్వీయస్ రెడ్డి అక్షర కాంక్షా తీరదు. కుదుపులు తెలియని మెట్రో ప్రయాణంలా ఉంటుంది ఆయన రచనా శైలి. అక్కడ ప్రయాణికుడికి అలసట తెలియదు. ఇక్కడ చదువరికి కాలం తెలియదు. ట్రాఫిక్ సమస్యలు, ఎర్రలైటు అవరోధాలు లేని మెట్రో ప్రయాణాన్ని తలపిస్తుంది.. హైదరాబాద్ మెట్రోరైలు అధినేత కవితా ప్రవాహమూ. అంతెత్తు వంతెన మీదినుంచి మెట్రోలో ప్రయాణిస్తుంటే.. మేఘాల్లో విహరిస్తున్నట్టు ఉంటుంది. ‘మేఘపథం’ చదువుతున్నప్పుడు కూడా భావాల మబ్బుల్లో తేలిపోతున్న భావన కలుగుతుంది. ‘స్వపరిచయం’లో ‘సాధారణ మానవుణ్ని.. మానవత్వమున్నవాణ్ని.. మాటకు విలువిచ్చువాణ్ని..’ అంటూ తానేమిటో చెప్పుకొన్నారు రచయిత.
అఖిల భారత సర్వీసులలో ప్రవేశించిన క్రమాన్ని, ఎదురైన సవాళ్లను, సాధించిన విజయాలను కూడా కించిత్ కవితావేశంతోనే చెప్పారు. ఏకవ్యక్తి సంస్థగా మొదలైన ‘హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్’ ప్రస్తావనతో వచన కవిత వేగం పెరిగింది. పునాదిరాళ్ల ముచ్చట్లు, భూమి పూజ ఇక్కట్లు, అడ్డొచ్చిన ఆలయాలు, సుల్తాన్ బజార్ కథలు, భరత్నగర్ బాధలు.. ఒక్కో పరిమితిని అధిగమిస్తూ అత్యాధునిక రైలుబండి.. వంతెననెక్కిన తీరును.. శ్రీహరికోట రాకెట్ ప్రయోగమంత ఉత్కంఠభరితంగా చెప్పారు. నిజానికిది, అంతకు మించిన సవాలు. కాబట్టే, ఎన్వీయస్ రెడ్డి హైదరాబాద్ మెట్రోమ్యాన్ అనిపించుకున్నారు. ఈ పుస్తకంతో తాను ‘మెట్రో కవి’ననీ నిరూపించుకున్నారు.
మేఘపథం
రచన: ఎన్వీయస్ రెడ్డి
పేజీలు: 400; వెల: రూ.500
ప్రతులకు: ప్రధాన పుస్తక కేంద్రాలు.
గీతా మాధురి
గీతాస్వరప్రస్తార వ్యాఖ్య
వ్యాఖ్యాత : శ్రీగణపతి
సచ్చిదానంద స్వామీజీ,
పేజీలు : 2010 (3 సంపుటాలు),
ప్రచురణ : రాగరాగిణీ ట్రస్టు,
అవధూత దత్తపీఠం
ప్రతులకు : 98490 25479, 98490 33039
శ్రీగణపతి సచ్చిదానంద స్వామీజీ నాదబ్రహ్మ. అనేక సంగీత స్వరప్రస్తారాలతో భక్తులను పరవశింప చేశారు. ఇప్పుడు యోగబ్రహ్మగా అవతరించి, ‘భగవద్గీత’కు వ్యాఖ్యను రచించారు. మూడు సంపుటాలలో 2,010 పేజీల విస్తారమైన గీతావ్యాఖ్యానం వెలువరించారు. భగవద్గీతలోని శ్లోకాలలో ఒక శ్లోకానికి, మరొక శ్లోకానికి మధ్య గల సంబంధాన్ని స్పష్టంగా వివరించే విపుల తాత్పర్యాలు, అవతారికలు ఇందులో ఉన్నాయి. వెనుకటి వ్యాఖ్యానాలలో దొరకని అంతరార్థాలను ప్రస్తావించారు. అవసరమైన ప్రతి సందర్భంలోనూ, ప్రామాణికమైన వైజ్ఞానిక విశ్లేషణలు చేశారు. ప్రతి అధ్యాయం చివరలోనూ సాధకులకు ప్రత్యేకమైన సూచనలు అందించారు. గురుశిష్య సంవాద రూపమైన సిద్ధాంత చర్చలు నడిపించారు కానీ, ఎక్కడా పరమత ఖండనం గానీ, ఇతర ఆచార్యుల దూషణం కానీ చేయలేదు. భగవద్గీతలోని సిద్ధాంతభాగ, సాధనాభాగాలను విడదీసి చూపారు. అవసరమైన ప్రతిచోటా కథా రూపమైన ఉదాహరణలు ఆసక్తిగా చదివిస్తాయి. ముఖ్యంగా పద్మపురాణంలోని అధ్యాయమాహాత్మ్య కథలను భగవద్గీతతో ముడిపెట్టారు. ఉదహరించిన ప్రతి ప్రమాణ వ్యాఖ్యానానికీ, తగిన రిఫరెన్స్ నంబర్లు జోడించినందు వల్ల సాధకులకు సులభంగా ఉంటుంది. ప్రాచీన, నవీన వ్యాఖ్యారీతుల కలనేతగా అనేక తత్త్వరహస్యాలను అప్పాజీ మనకోసమే అందించారు. వారే చెప్పినట్లు ఇది ఆకాశపుటంచు ఊదిన ఈల! ఆస్వాదించండి, ఆచరించండి, అనుభవించండి, అది మీరే అయిపోండి. గీత.. వికాస గ్రంథం, గెలుపు మార్గం. భక్తి, జ్ఞాన, వైరాగ్యాల సమాహారం. పరమాత్మ గుదిగుచ్చిన విలువల హారం. అత్యుత్తమం, అత్యున్నతం. జై శ్రీకృష్ణ!
బుక్ షెల్ఫ్
దాగి ఉన్న నిజం
రచన : వోదెల గంగాధర్
పేజీలు : 96, వెల : రూ. 50
ప్రతులకు : వోదెల గంగాధర్,
ఫోన్ : 98496 43368
అక్షర సుమాలు
రచన : నండూరి సుందరీ నాగమణి
పేజీలు : 72, వెల : రూ. 100
ప్రచురణ : అచ్చంగా తెలుగు
ప్రతులకు : ఫోన్ : 85588 99478
దీపముండగానె
రచన : గజ్జెల రామకృష్ణ
పేజీలు : 128; వెల : 100
ప్రతులకు : గజ్జెల రామకృష్ణ
ఫోన్ : 89774 12795
అమ్మా నాన్న
సంపాదకులు : మత్స్యరాజ హరగోపాల్, మత్స్యరాజ విజయలక్ష్మి
పేజీలు : 80, వెల : 100
ప్రచురణ : మత్స్యరాజ ప్రచురణ
ప్రతులకు : ఫోన్ : 94904 24040
మహానటుడు ఎన్.టి.ఆర్
రచన : డా. ఎం.కె. రాము
పేజీలు : 116, వెల : 100 /-
ప్రచురణ : రసమయి, హైదరాబాద్
ప్రతులకు : రసమయి,
ఫోన్ నెంబర్ : 98480 14793