‘సాఫ్ట్వేర్ కుర్రోడు.. చీరలు అమ్మడమా?’ స్నేహితుల ఆశ్చర్యం. ‘నా జీవితంలో ఇంత వెర్రివాడ్ని ఎప్పుడూ చూడలేదు’ బంధువుల అసహనం. ‘మీరెందుకు కోప్పడతారు. తనే బిచాణా సర్దేస్తాడు’ అయినవారి వెటకారాలు. అయినా ఆ యువకుడు వెనకడుగు వేయలేదు. నాణ్యమైన వస్ర్తాలను, నమ్మకమైన సాఫ్ట్వేర్ను మాత్రమే నమ్ముకున్నాడు.. చలవడి నాగ కనక దుర్గ ప్రసాద్. ఆ పట్టుదలే కళామందిర్ను వస్త్ర ప్రపంచంలో అగ్రస్థానంలో నిలబెట్టింది. ప్రసాద్ను ఫోర్బ్స్ పత్రిక కండ్లలో పడేలా చేసింది. తాజా సంచికలో ఆయనకు మూడు పేజీలు కేటాయించేలా చేసింది.
‘ఎప్పుడైనా మనిషి స్వభావం ఒక్కటే.. గెలుపు గుర్రాలపైనే పందెం కడతారు. నేను దానికి పూర్తి వ్యతిరేకం. వ్యాపారంలోకి దిగాక రేసు గుర్రంలా పరుగెత్తాలని అనుకుంటారు. కానీ, నేను ఎప్పుడూ అలా పరుగెత్తలేదు. ఓ వ్యూహం ప్రకారం, నా లెక్కలకు అనుగుణంగానే అడుగులు వేశాను. అందుకే విజయం సాధించగలిగాను. పబ్లిక్ ఇష్యూకు వెళ్ల గలుగుతున్నా’ అంటారు ‘కళామందిర్'(సాయి సిల్క్స్) అధినేత చలవడి నాగ కనక దుర్గ ప్రసాద్. అక్టోబర్, 2005లో హైదరా బాద్లో ఓ వస్ర్తాలయంగా ప్రారంభమైన కళామందిర్ ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ర్టాల వరకూ విస్తరించింది.
సుగంధ ద్రవ్యాల నుంచి..
చలవడి కుటుంబం సుగంధ ద్రవ్యాల వ్యాపారం చేసేది. ఫ్యామిలీ బిజినెస్లో మెలకువలు తెలిసిన ప్రసాద్ ఎంబీఏ తర్వాత దుబాయ్ వెళ్లారు. అక్కడి నుంచి అమెరికా వెళ్లి.. సాఫ్ట్వేర్ కోర్సులు చేశారు. కొన్నేండ్లపాటు అక్కడే ఐటీ సంస్థలో ఉద్యోగం చేశారు. మళ్లీ వ్యాపారంపై మనసు మళ్లి ఇండియాకు వచ్చేశారు. ఈ క్రమంలో వస్త్ర ప్రపంచం గురించి అధ్యయనం మొదలుపెట్టారు.
మన దేశంలో ‘పెండ్లి’ అనే తంతు ఉన్నంతకాలం కొత్త చీరలు కొనుగోలు చేస్తూనే ఉంటారు. అదనంగా పండుగలు, శుభకార్యాలు ఉండనే ఉన్నాయి. నాణ్యమైన వస్ర్తాలను అందిస్తే.. కస్టమర్ల నమ్మకాన్ని పొందితే.. వ్యాపార వృద్ధికి తిరుగు ఉండదని భావించారు ప్రసాద్. ఓ నిర్ణయానికి రాగానే.. సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని వదిలేసి, చీరలు అమ్ముకునేందుకు సిద్ధమయ్యారు. కుటుంబసభ్యులు, బంధువులు ఎంత చెప్పినా వినకుండా.. హైదరాబాద్లో తొలి షోరూమ్ ప్రారంభించారు. తన సాఫ్ట్వేర్ అనుభవంతో.. లావాదేవీలన్నీ కంప్యూటర్లో రికార్డు చేయడం మొదలుపెట్టారు. కృతిమమేధను వ్యాపారంలో భాగం చేశారు. ఏ రంగంలో అయినా కస్టమర్ దేవుడితో సమానం. అంతకంటే ఎక్కువ కూడా. కాబట్టే, కస్టమర్లతో ఎలా మసలుకోవాలో సిబ్బందికి బోధించారు.
ఓ క్రమశిక్షణను అలవాటు చేశారు. అక్కడితో ఆగకుండా.. సంపన్న శ్రేణి కోసం, మధ్యతరగతి కోసం.. కొనుగోలు శక్తి ఆధారంగా ప్రత్యేక దుకాణాలను ప్రారంభించారు. ఈ ప్రయోగమూ విజయవంతమైంది. వ్యాపారంతో పాటు బాధ్యతలూ పెరగడంతో కుటుంబ సభ్యులకు కూడా తలో విభాగం అప్పగించారు. ప్రసాద్ భార్య ఝాన్సీరాణి రిటైల్, మార్కెటింగ్, సేల్స్, అడ్మినిస్ట్రేషన్, హెచ్ఆర్ విభాగాలను పర్యవేక్షిస్తుంటారు. ‘చీరను మేం వ్యాపార వస్తువుగా కాకుండా.. ఓ ఎమోషన్గానే చూస్తాం’ అంటారు ఝాన్సీరాణి. ‘ఆ చీర కట్టినప్పుడు ఆత్మవిశ్వాసం ఇనుమడించాలి. మీరు వేసే ప్రతి అడుగులో అది కనిపించాలి’ అంటూ మంచి చీర ఎంపికలో సలహా ఇస్తారు ప్రసాద్.
ఫోర్బ్స్ ప్రశంస..
చీరల వ్యాపారాన్ని దుకాణం నుంచి షోరూమ్కు, షోరూమ్ నుంచి కార్పొరేట్ స్థాయికి తీసుకెళ్లారు ప్రసాద్. వివిధ పేర్లతో నాలుగు రాష్ర్టాల్లో నలభై ఆరు షోరూమ్లు నడపడం సామాన్య విషయం కాదు. ముప్పై ఏడేళ్ల వయసు వచ్చేసరికి.. ఐపీవోకు వెళ్లగలిగేంత బలమైన పునాదులను వేయడం వ్యాపార నాయకత్వానికి నిదర్శనం. చీరల వ్యాపారంలో నిలదొక్కు కోవాలంటే.. మహిళల మనసు తెలుసుకోవాలి. చీరకట్టులోని కని కట్టును అర్థం చేసుకోవాలి. ప్రసాద్ ఆ పాఠాలుకూడా నేర్చుకున్నారు. తన సిబ్బందికి చీరకట్టు చిట్కాలను కూడా బోధిస్తారు. నేత కళాకారులతో మాట్లాడి డిజైన్లూ ఖరారు చేస్తారు.