ప్రతి ఇంట్లోనూ ఫోన్లు, ల్యాప్టాప్లు, స్మార్ట్ వాచీలు, బ్లూటూత్.. తదితర సాంకేతిక పరికరాల సంఖ్య పదికి పైమాటే. వాటిని చార్జ్ చేయడం పెద్ద సమస్య. ఆ ఇబ్బంది లేకుండా వచ్చేసింది కొడాక్ చార్జింగ్ స్టాండ్. దీంతో ఒకేసారి ఫోన్, స్మార్ట్ వాచ్, ఇయర్బడ్స్.. మొదలైనవన్నీ చార్జ్ చేసుకోవచ్చు. ఈ స్టాండ్ను ఒక్కసారి చార్జ్ చేస్తే చాలు, దీనికి ఉన్న మూడు స్మార్ట్ ప్యాడ్స్ ద్వారా ఒకేసారి మూడు పరికరాలు నిమిషాల వ్యవధిలోనే చార్జ్ అయిపోతాయి. స్మార్ట్ ప్యాడ్లోని మాగ్నెట్స్ కిందపడకుండా ఎలక్ట్రానిక్ పరికరాల్ని పట్టి ఉంచుతాయి. దాదాపు పన్నెండు ఫోన్లను చార్జ్ చేయగల సామర్థ్యం ఉన్న ఈ చార్జింగ్ స్టాండ్ ఆన్లైన్ ధర రూ. 3,799. వివరాలకు tekkitake.com చూడవచ్చు.
చెక్కని పాదరక్షలు
రొటీన్కు భిన్నంగా కనిపించడమే ఫ్యాషన్. అలాంటి ఫ్యాషన్ ప్రేమికుల కోసం రకరకాల ఉత్పత్తులు మార్కెట్లోకి వస్తున్నాయి. చెక్క పాదరక్షలూ అలాంటివే. తేలికైన చెక్కకు దారం, ఫ్యాబ్రిక్, అద్దాలు, పూసలు జోడించి అందమైన పాదరక్షలను తయారుచేశారు. వీటిని పూర్తిగా పర్యావరణ హితమైన టెర్రకోట బీడ్స్, పీచు వంటి వస్తువులతో రూపొందించారు. చెప్పులు, షూలను కలగలిపిన సరికొత్త ఆకృతులూ బాగున్నాయి. వీటి ఆన్లైన్ ప్రారంభ ధర రూ.4,690. పూర్తి వివరాలకు needledust.com చూడవచ్చు.
80 వాష్
బట్టలు ఉతకాలంటే బకెట్ల కొద్దీ నీళ్లు కావాలి. సబ్బుతో రుద్దీరుద్దీ శ్రమపడాలి. వాషింగ్మెషీన్లు వచ్చాక శారీరక శ్రమ తగ్గినా సబ్బు, నీళ్ల అవసరం మాత్రం పెరిగింది. అయితే సబ్బు, డిటర్జెంట్తో పనిలేకుండా కప్పు నీళ్లతో బట్టలు ఉతికేలా ఓ వాషింగ్మెషీన్ను తయారుచేసింది చండీగఢ్కు చెందిన 80 వాష్ అనే అంకుర సంస్థ. ఈ వాషింగ్ మెషీన్తో ఐదు దుస్తులను కేవలం కప్పు నీటితో, అదీ 80 సెకెన్లలో ఉతికేయవచ్చు. ఈ మెషీన్తో డబ్బు ఆదా చేయడమే కాదు, రసాయన కాలుష్యాన్నీ అరికట్టవచ్చు. స్టీమ్ టెక్నాలజీ ఆధారంగా ఇది పనిచేస్తుంది. ఈ మెషీన్ తక్కువ రేడియో ఫ్రీక్వెన్సీతో కూడిన మైక్రోవేవ్ పరిజ్ఞానంతో బ్యాక్టీరియాను చంపుతుంది. దుస్తులనే కాదు.. లోహ వస్తువులు, పీపీయీ కిట్లనూ శుభ్రం చేయగలదు. పొడి ఆవిరి సాయంతో దుస్తుల మీద పేరుకుపోయిన దుమ్ము, ధూళితోపాటు రంగు మరకలనూ పోగొడుతుంది. 70-80 కిలోలు సామర్థ్యం ఉన్న ఈ యంత్రం త్వరలోనే అందుబాటులోకి రానున్నది. మరిన్ని వివరాలను 80wash.com చూడవచ్చు. నీటిని ఆదా చేయడానికి ఇదో తిరుగులేని మార్గం.
రోజంతా పరిమళం
వర్షకాలం వచ్చిందంటే చాలు. ఎక్కడ చూసినా నీళ్లూ, బురదే. ఎంత శుభ్రంగా ఉంచినా ఇల్లంతా తడిబట్టల వాసనే. ఈ సమస్యను అధిగమించి.. చక్కని పరిమళాన్ని వెద జల్లేందుకు వచ్చేసింది.. గోద్రేజ్ ఎయిర్ స్మార్ట్ మాటిక్. దీంతో రోజంతా ఇల్లు పరిమళంతో గుబాళిస్తుంది. స్మార్ట్ ఫోన్తో కనెక్ట్ చేసుకుంటే, వాయిస్ కమాండ్ ద్వారా ఆపరేట్ చేయవచ్చు. సుగంధం ఖాళీ అయ్యేలోపు.. రీఫిల్ అలర్ట్ వస్తుంది. పరిసరాల్లోని పరిస్థితులను బట్టి ఆటోమేటిక్గా స్ప్రే అవుతుంది. లావెండర్, జాస్మిన్, రోజ్ వంటి నచ్చిన పరిమళాలను ఎంచుకోవచ్చు. దీని ఆన్లైన్ ధర రూ.799. రీఫిల్ ధర రూ.275.