పర్యావరణ పరిరక్షణకు నిలువెత్తు ఉదాహరణ.. ముప్పైమూడేండ్ల చందన్ సింగ్ నయాల్. ఉత్తరాఖండ్ నైనితాల్ జిల్లా టోక్ చామా గ్రామానికి చెందిన చందన్ ఇంజినీరింగ్లో డిప్లొమా చేశాడు. అయితే, తన రంగంలో కెరీర్ను కాదనుకుని పర్యావరణ పరిరక్షణకు అంకితమైపోయాడు. పదేండ్ల నుంచి ఇప్పటివరకు అరవైవేలకుపైగానే మొక్కలు నాటాడు. వేలకొద్ది మొక్కలు పంచాడు. చందన్ తమ ఊళ్లో తోటి యువకులు, మహిళల సాయంతో పది ఎకరాల స్థలంలో వివిధ రకాల చెట్లు పెంచుతున్నాడు. అందుకు తన నర్సరీలో ప్రతి ఏడాదీ నలభైవేల వరకు మొక్కలను సిద్ధం చేసుకుంటాడు. ఇప్పటివరకు ఎనభైవేలకు పైగా మొక్కలను గ్రామస్థులకు పంచాడు.
అంతేకాదు పర్యావరణ పరిరక్షణలో చందన్ నిబద్ధత ఎంతటిదంటే… “నేను మరణించిన తర్వాత అంతిమక్రియల కోసం ఒక్క చెట్టుకూడా నరికివేతకు గురికావద్దు” అంటాడు. పచ్చదనం మీద ప్రేమతోనే తన శరీరాన్ని హల్దానీ వైద్య కళాశాలకు దానం చేశాడు! చెట్టుకు, నీటికి ప్రత్యక్ష సంబంధం ఉంది. అందుకే, చందన్ బృందం తమ పరిసరాల్లో వాననీటి సంరక్షణ కోసం ఆరు వేలకు పైగా చిన్నచిన్న చెక్డ్యాములను నిర్మించింది. డిప్లొమా పూర్తవగానే చందన్ కొంతకాలం ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. ఆ సమయంలో విద్యార్థులకు చెట్ల ప్రాధాన్యాన్ని వివరించేవాడు. ఆ తర్వాత ఆ పని వదిలేసి పూర్తిగా పర్యావరణ పరిరక్షణకే సమయం కేటాయిస్తున్నాడు.
గ్రామ మహిళలు వంటచెరుకు, గడ్డి కోసం దూరప్రాంతాలకు వెళ్లాల్సి ఉంటుంది. దీన్ని గుర్తించిన చందన్ శివార్లలో ఓక్ చెట్లను పెంచడం ద్వారా ఆ సమస్య తీర్చేశాడు. పదేండ్లుగా అతను నైనితాల్ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో పర్యావరణ పరిరక్షణ అవసరాన్ని ప్రజలకు వివరిస్తున్నాడు. పాఠశాలల్లో పిల్లలకు పర్యావరణ పాఠాలు బోధిస్తున్నాడు. ఆ స్ఫూర్తితో ఇప్పుడు ఎంతోమంది యువకులు చందన్ వెంట నడుస్తున్నారు. పర్యావరణ పరిరక్షణలో చందన్ ప్రాథమిక లక్ష్యాలు మాత్రం ఓక్ చెట్ల పెంపకం, చెక్డ్యామ్లతో నీటి సంరక్షణ, అడవులను కాపాడటం. ఈ పర్యావరణ యాత్రలో ఉత్తరాఖండ్ అటవీశాఖ చందన్కు తనవంతు సహకారం అందిస్తున్నది. పర్యావరణ పరిరక్షణలో అతని కృషికి తగిన గుర్తింపుగా 2021 జూలై 23న కేంద్ర జలశక్తి శాఖ నుంచి ‘వాటర్ హీరో’ పురస్కారం దక్కింది.