నేను నిజామాబాద్ జైలులో ప్రవేశించగానే బైట ఏమి జరుగుతున్నదీ తెలుసుకోవాలనే కోరిక, ఆ ఆలోచనలు ఆగిపోయాయి. రెండు మూడు సంవత్సరాలో ఇంకా చాలా ఎక్కువ కాలమో నేను జైలులోనే గడపాల్సి ఉంటుందని అనుకొన్నాను. అందుచేత బైట జరుగుతున్న సంఘటనలను గురించి మనఃక్లేశం పొందడం, చింతించడం.. అవివేకం, నిష్ఫలం. ఒక విధంగా చూస్తే నాకు ఈ జైలు నివాసం ఒకవరం. బైటి వారికెవరికీ ప్రభుత్వం నన్నెక్కడ ఉంచిందీ తెలియదు. చాలాకాలం వరకూ ఉత్తర ప్రత్యుత్తరాలకు అవకాశం కూడా లేదు. నాకు కావలసిన నిత్యావసర వస్తువులు ఎలాంటి చడీచప్పుడు లేకుండా సప్లయి చేస్తున్నారు. ఒక విధంగా చూస్తే నన్ను పలకరించకుండా నా మానాన నన్ను వదిలేశారు. నేను ఉన్న పరిసరాలలోకి మరే ఖైదీ రావడానికి వీలులేదు. జైలరు, వార్డరు, రాత్రి నాకు కావలా ఉండే మనిషి తప్ప నాలుగో మనిషి మొహమే నాకు కన్పించేది కాదు.
నా గది ఒక కొండమీద బాగా ఎత్తుగా ఉన్న చోట ఉంది. ప్రకృతి సౌందర్యం దర్శనీయమైంది. రకరకాల ఉడతలు, పాములు, తేళ్లు నాకు ప్రత్యక్షం అవుతూ ఉండేవి. రంగురంగుల సీతాకోక చిలకలు, రకరకాల పక్షులు నాతో చెలిమి చేసేవి. వాటికి నాతో అనుబంధం కలిగినట్లు, అవి కొంతదూరంగా ఉంటున్నప్పటికీ, తమ సాహచర్యాన్ని ప్రసాదించి హాయినిచ్చేవి. సరళ, స్వచ్ఛమైనటువంటి ఆ పరిసరాల్లో నా మనస్సు సహజంగా ఆత్మానుసంధానం వైపు తిరిగింది. వంట చేసుకొనవలసిన పని తప్ప నాకు మరో పనిగాని, నన్ను ఆకర్షించే విషయం గాని లేవు. ఆ వంటకూడా అన్నం, ఏదో శాకం రోజుకొకసారి మాత్రమే వండుకొనడం.. ఆ తర్వాత తక్లీ మీద ఒకగంట సేపు నూలు తీయడం.. ఇది మాత్రమే రోజంతటికీ నాకున్న పనులు. మిగిలిన కాలం అంతా ధ్యానంలోనే గడిపేవాణ్ని. పదిహేను నెలలపాటు ఆ జైల్లో అట్లాగే గడిపాను. అది నాకు చాలా సత్ఫలితాలు ప్రసాదించింది. ఆ కాలం అంతా నేను ఉపవాసాలలో, ప్రార్థనలో, ధ్యానంలో గడిపాను. ఆ కాలంలోనే నేను ఉపనిషత్తులు పఠించాను. ఆలిఫ్ అక్షరంతో ప్రారంభించి ఏడు పాఠ్య పుస్తకాలను పూర్తిచేశాను. బైటి ప్రపంచాన్ని పూర్తిగా మరచిపోయాను.
– స్వామి రామానందతీర్థ
(1940లలో జైలుశిక్ష సందర్భంలో)
హైదరాబాద్ స్వాతంత్య్ర పోరాటం
అనుభవాలు – జ్ఞాపకాలు నుంచి
అనువాదం: హరి ఆదిశేషువు