మూడింటి మూడాఫ్.. డెస్క్ ఉద్యోగులను కలవర పెడుతున్నది. మధ్యాహ్నం అయ్యిందంటే.. అనేకమందిలో అలసట వచ్చేస్తున్నది. దానివెంటే నిద్రకూడా ముంచుకొస్తున్నది. ఉద్యోగుల్లో శక్తి తగ్గిపోయి, నీరసించిపోయి, ఏకాగ్రత కోల్పోయి.. మొత్తంగా పనిమీదే ఇంట్రెస్ట్ లేకుండా పోతున్నది. దీనినే ‘3 పీఎం క్రాష్’ అని కార్పొరేట్ ప్రపంచం ముద్దుగా పిలుచుకుంటున్నది. దీనివల్ల ఉద్యోగాలకే ముప్పువాటిల్లే ప్రమాదం ఏర్పడనున్నది. మరి, ఆ క్రాష్లో పడిపోవద్దంటే.. ఈ సూచనలు పాటించాల్సిన అవసరం ఉన్నది.
ఏ ఉద్యోగి అయినా.. ఉదయాన్నే ఉత్సాహంగా ఆఫీస్కు వెళ్తారు. మధ్యాహ్నం వరకూ అలుపెరగకుండా పనిచేస్తారు. అలా లంచ్ అయ్యిందో లేదో.. ఇలా ‘3 పీఎం క్రాష్’లోకి జారిపోతారు. సత్తువ కోల్పోయి, ఏకాగ్రత తగ్గిపోయి.. పనిని పక్కన పెట్టేస్తారు. ఒక చిన్న కునుకు తీయాలని ఆశపడతారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న డెస్క్ ఉద్యోగుల్లో చాలామంది ఇదే సమస్యతో బాధపడుతున్నారట. ఇందుకు కారణాలు అనేకం.