..కానీ, నేలను నమ్ముకొన్న రైతు పరిస్థితి ఇప్పటికీ అంతంత మాత్రమే! పంట వేసింది మొదలు.. అమ్ముకొనే దాకా ఆరుగాలం ఏటికి ఎదురీదాల్సిందే! పంచ ప్రాణాలను పణంగా పెట్టినా, పెట్టుబడి దక్కడం కూడా కష్టమే! స్థూలంగా.. దేశానికి అన్నం పెడుతున్న రైతన్నల కడుపులు మాడుతున్నాయి. పొలంలో ఉండాల్సిన నీళ్లు.. కర్షకుల కండ్లలో కనిపిస్తున్నాయి. అయితే, ఇప్పుడిప్పుడే ప్రభుత్వ పథకాలు వారికి ఆసరా అవుతున్నాయి. పెరుగుతున్న అవగాహన, సాంకేతికత అండగా నిలుస్తున్నాయి. వీటికి ‘స్మార్ట్ ఫార్మింగ్’ కూడా తోడైతే.. ‘రైతే రాజు’ అవుతాడు. దేశానికి వెన్నెముకై నిలుస్తాడు.
వ్యవసాయం.. విదేశీయులకు ఓ జీవనాధారం. మనకు మాత్రం.. జీవితంలో అంతర్భాగం.
భారతదేశంలో సాగు ఓ సంప్రదాయం. ఓ జీవన విధానం. అందుకే, సింధూ నాగరికత
నుంచి ఇప్పటి వరకూ భారతీయులు హలాన్ని విడిచిపెట్టలేదు.రాజులు మారినా, రాజ్యాలు కూలినా..చరిత్రలోని ఏ మలుపులోనూసాగుకు దూరం కాలేదు.ఇప్పటికీ 58శాతం భారతీయులకు
వ్యవసాయమే జీవనోపాధి.వ్యవసాయ ఉత్పత్తుల్లో ప్రపంచంలోనే రెండో స్థానం మనది..
‘భూమిని నమ్ముకున్నోడు ఎన్నటికీ చెడిపోడు!’.. ఈ మాట ఒకప్పుడు ‘రియల్ ఎస్టేట్’కు మాత్రమే వర్తించేది. వ్యవసాయానికి బద్ధ వ్యతిరేకమైన విషయం. కానీ, క్రమంగా పరిస్థితి మెరుగవుతున్నది. ‘పొలాన్ని నమ్ముకొంటే ఉన్నది అమ్ముకోవాల్సిందే!’ అన్నవారే.. ‘వ్యవసాయం ఓ పండుగ’ అనే స్థాయికి చేరింది. దేశంలోని 58శాతం మందికి జీవనోపాధిగా మారింది. ముఖ్యంగా.. కొవిడ్ సమయంలో ఎంతోమందిని వ్యవసాయమే ఆదుకొన్నది. లక్షల జీతాలతో ఉద్యోగాలు చేసేవారికీ.. ఉరుకుల పరుగుల వృత్తిలో దొరకని తృప్తి నేలతల్లి ఒడిన లభిస్తున్నది. అందుకే.. నగరవాసులూ ‘వీకెండ్ ఫార్మింగ్’ అంటూ పొలంబాట పట్టేలా చేస్తున్నది. ఇప్పుడు దీనికి ‘ఆధునిక సాంకేతికత’ తోడైంది. వ్యవసాయానికీ, ఆధునిక విజ్ఞానానికీ లంకె కుదరదనే వాదన కూడా పాతబడి పోయింది. శతాబ్దాలుగా రుతువులను గమనిస్తూ, చెమటను చిందిస్తూ సాగిన వ్యవసాయం.. పూర్తిగా మారిపోయింది. ‘స్మార్ట్ ఫార్మింగ్’.. సాగు భూమిలో సమూల మార్పులు తీసుకురాబోతున్నది.
ఏమిటీ స్మార్ట్ ఫార్మింగ్!
ఈ రోజుల్లో చాలా పరికరాలను ఇంటర్నెట్ ద్వారా నియంత్రించే అవకాశమున్నది. అదే.. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (IoT). ఇది మనందరికీ అనుభవంలోకి వస్తున్న విజ్ఞానమే! దీంతో పాటుగా రోబోటిక్స్, కృత్రిమ మేథ, క్రౌడ్ కంప్యూటింగ్ లాంటి మరెన్నో సాంకేతికతలను వ్యవసాయానికి సాయంగా నిలపడమే ‘స్మార్ట్ ఫార్మింగ్’. దీనివల్ల చేతిలో ఉన్న వనరులను పూర్తిగా వినియోగించుకొనే అవకాశం ఉంటుంది. ఉత్పత్తిలో వృథా తగ్గుతుంది. ఇంటి నుంచే సాగును పర్యవేక్షించే వెసులుబాటు దొరుకుతుంది. ఉత్పాదనలో వచ్చే వృద్ధితో పోలిస్తే.. ఖర్చు చాలా తక్కువగా ఉంటుంది. నీరు, రసాయనాల వృథాను తగ్గిస్తుంది. కాబట్టి, పర్యావరణం మీద కూడా సానుకూలమైన ప్రభావం ఉంటుంది. ఇన్ని లాభాలున్నాయి కాబట్టే, ‘స్మార్ట్ ఫార్మింగ్’.. ‘కచ్చితమైన వ్యవసాయం’ (ప్రెసిషన్ ఫార్మింగ్)గా గుర్తింపు పొందింది.
ఇవీ సాధనాలు!
అధునాతన సాంకేతికతను అనుసంధానిస్తూ ‘సాగే’దంతా స్మార్ట్ ఫార్మింగే! అందులో భిన్న పార్శాలు ఎన్నో.వాటిలో కొన్ని..
సెన్సర్లు
పొలంలో ఏర్పాటు చేసే సెన్సర్ల ద్వారా భూమిలో తేమ శాతం, ఉపరితల ఉష్ణోగ్రత, నేల పొరల్లో వేడిమి.. లాంటి అనేక వివరాలు తెలుసుకోవచ్చు. వీటి ఆధారంగా మొక్క ఎదుగుదల, కిరణజన్య సంయోగ క్రియ, భూసారం, నీటి లభ్యత లాంటి కీలకమైన విషయాలపై రైతులను అప్రమత్తం చేయొచ్చు. మొక్కల మీద ప్రతిఫలించే వెలుతురు ఆధారంగా పనిచేసే ఆప్టికల్ సెన్సర్లతో, దాని ఎదుగుదలను విశ్లేషించొచ్చు.‘ఎయిర్ ఫ్లో’ సెన్సర్లదీ వ్యవసాయంలో కీలక పాత్రే. ఇవి గాలి వేగం, దిశ, పీడనం లాంటి వివరాలను అంచనా వేస్తాయి. ఇవన్నీ ప్రస్తుతం లభ్యమవుతున్న సాంకేతికతలు. త్వరలోనే నేలలోని పోషకాలను సంపూర్ణంగా విశ్లేషించగల సెన్సర్లు కూడా అందుబాటులోకి రానున్నాయి. అంతేకాదు! నేల గట్టిదనాన్ని పసిగట్టి, పొలాన్ని ఎంత బలంగా దున్నాలో సూచించే సాంకేతికత కూడా రాబోతున్నది.
డ్రోన్లు
సినిమా షూటింగ్ మొదలు.. వస్తువులను డెలివరీ చేయడం వరకూ అన్నిట్లోనూ డ్రోన్లను ఉపయోగించుకొంటున్నాం. మరి దేశానికి వెన్నెముకైన వ్యవసాయంలో వాటి పాత్రను ఎలా విస్మరించగలం? దేశంలో 15కోట్ల హెక్టార్లకు పైగా విస్తీర్ణంలో వ్యవసాయం సాగుతున్నది. రకరకాల వాతావరణాలు, వేర్వేరు పరిస్థితులు.. వీటిలోని ప్రతి సందర్భానికీ డ్రోన్లను అనుకూలంగా మార్చుకొనే అవకాశం అందివస్తున్నది. డ్రోన్ల ద్వారా మొక్కల ఎదుగుదలను ఎప్పటికప్పుడు గమనించవచ్చు. వాటికి సెన్సర్లను అమరిస్తే, వాతావరణంలోని తేమనూ పసిగట్టొచ్చు. చాలా సందర్భాల్లో పొలంలోని ప్రతి మొక్కనూ దగ్గరగా గమనించడం, చీడపీడల ప్రమాదాన్ని పసిగట్టడం ఎంతో కష్టం. అయితే, డ్రోన్లతో అది తేలికవడమే కాదు.. డిజిటల్ ఇమేజింగ్, ఇన్ఫ్రారెడ్ లాంటి సాంకేతికతలతో చిన్నపాటి సమస్యను కూడా ఆరంభంలోనే గుర్తించవచ్చు. డ్రోన్లతో ఎరువులు, క్రిమి సంహారాలనూ చల్లే అవకాశం ఉండటం మరో లాభం. ముఖ్యంగా రసాయన ఎరువుల పిచికారీ సమయంలో రైతులు వాటి దుష్ఫ్రభావాలకు గురవుతారు. కానీ, డ్రోన్లతో ఆ సమస్య ఉండదు సరికదా.. నిర్దిష్టమైన ప్రదేశంలో, కచ్చితమైన మోతాదులో మందును పిచికారీ చేసే అవకాశం ఉంటుంది. ఓ అంచనా ప్రకారం.. డ్రోన్లతో పిచికారీ చేయడం ద్వారా ఏకంగా 30 శాతం రసాయన ఎరువులు ఆదా అవుతున్నాయట. ఇక రాష్ట్రంలో సాగు ఎలా ఉంది? కరువు లాంటి సమస్యలతో ఏ మేరకు నష్టం జరుగుతోంది? ఎలాంటి పంటలు పండుతున్నాయి?.. లాంటి సవాలక్ష వివరాలు ప్రభుత్వాలకు అందించేందుకూ ఈ డ్రోన్లు ఉపయోగపడుతూనే ఉంటాయి. డ్రోన్ల వల్ల రైతులకే కాదు.. నిరుద్యోగులకూ లాభమే! వాటి సాంకేతికత మీద అవగాహన పెంచుకొని, ఓ నాలుగు డ్రోన్లతో వ్యవసాయ సేవలను అందిస్తూ, ఆదాయాన్నీ సమకూర్చుకోవచ్చు. పల్లెల్లో అవసరమయ్యే ఇలాంటి సాంకేతికతలను అందిపుచ్చుకోగలిగితే 20 లక్షల మందికి పైగా ఉపాధి దొరికే అవకాశం ఉంటుందని ఓ అంచనా!
యంత్రుని సాయం
ఒకప్పుడు పొలం దున్నడానికి ఎడ్లు, నాగలి వాడేవారు. వాటి స్థానాన్ని ట్రాక్టర్లు ఆక్రమించాయి. మరి ఆ తర్వాత? మరో మార్పు రావాల్సిందే కదా! అలా వచ్చిన సాంకేతికతే.. రోబోటిక్స్. స్మార్ట్ ఫార్మింగ్లో వీటిది ముఖ్యమైన పాత్ర. పండ్లు కోయడం దగ్గర నుంచీ కలుపు తీయడం వరకూ… విదేశాల్లో చాలా పనులకు రోబోలను వినియోగిస్తున్నారు. రోబోటిక్ సాంకేతికత ద్వారా డ్రైవర్ అవసరం లేని ట్రాక్టర్లు, పాలు పితికే యంత్రాలు మన దగ్గరా కనిపిస్తున్నాయి. రోబోలు కచ్చితత్వానికి ప్రతీక. కాబట్టి, వీటి వినియోగం వల్ల నాణ్యత పెరుగుతుంది.రోబోల ఉపయోగం, పనితీరు మూడు విషయాల మీద ఆధారపడి ఉంటుంది. అవే.. ఎండ్ ఎఫెక్టర్, గ్రిప్పర్, మానిపులేటర్! రోబో ఏ పని చేయాలో నిర్ణయించేది ఎండ్ ఎఫెక్టర్. పిచికారీ చేయాలా? పండ్లు కొయ్యాలా? అన్న అవసరాలను బట్టి ఈ భాగాన్ని రూపొందిస్తారు. ఇక గ్రిప్పర్ పట్టును సూచించే భాగం. అది వేళ్లులాగా ఉండాలా? బ్లేడ్ లాంటి ఉపకరణాలతో పనిచేయాలా? అనే నిర్ణయంతో తయారుచేస్తారు. ఇక ఈ ఎండ్ ఎఫెక్టర్, గ్రిప్పర్ల కదలికలను నియంత్రించేదే మానిపులేటర్.దీర్ఘకాల ప్రయోజనంలో భాగంగా వ్యవసాయంలో యంత్రాలతోపాటు రోబోలను కూడా ఉపయోగించుకోవచ్చు. ముఖ్యంగా మనుషులు దొరకడం కష్టమయ్యే అనేక పనుల్లో ఇవి ఉపయోగపడతాయి. పత్తికోసే రోబోలు ఇప్పుడిప్పుడే అందుబాటులోకి వస్తున్నాయి.
స్టార్టప్ల ఒరవడిలో ‘గ్రీన్ రోబో మెషినరీ’ లాంటి సంస్థలూ రోబోల తయారీలో దూసుకుపోతున్నాయి.
బ్లాక్ చెయిన్
సమాచార రంగంలో బ్లాక్ చెయిన్ ఓ విప్లవమే! సమాచారాన్ని ఒక్కసారి నమోదు చేసిన తర్వాత, దాన్ని మార్చే అవకాశం లేకుండా చేస్తుందీ సాంకేతికత. ఒకవేళ ఏదన్నా మార్పులు చేస్తే.. దానికి బాధ్యులు ఎవరో కూడా పసిగట్టేస్తుంది. వ్యవసాయంతో సంబంధం లేని విషయంగా తోచే ఈ బ్లాక్ చెయిన్.. పరోక్షంగా రైతుకు సాయపడుతుంది. బ్యాంకులతో, దళారులతో జరిగే లావాదేవీల్లో ఎలాంటి మోసమూ జరగకుండా నియంత్రిస్తుంది. తనకు అందాల్సిన డబ్బు, తను చెల్లించాల్సిన రుణం, గిట్టుబాటు ధర, రవాణాలో ఉన్న ఉత్పత్తి.. ఇలా ఏ వ్యవహారానికైనా సరే, బ్లాక్ చెయిన్ జోడించగానే పారదర్శకంగా మారిపోతుంది. ఇక ప్రభుత్వం దృష్టి నుంచి చూస్తే వ్యవసాయ భూముల వివరాలు, రైతులకు అందాల్సిన ఆర్థిక సహాయాలు, పొలం మీద హక్కు లాంటి వివరాలన్నీ సవ్యంగా ఉంటేనే నిర్వహణ తేలికవుతుంది. లబ్ధిదారుల ఎంపికలో, వివాదాల పరిష్కారంలో ఈ వివరాలే కీలకం. బ్లాక్ చెయిన్ ద్వారా ఇవన్నీ సాధ్యం.
యాప్స్
కడుపులో చల్ల కదలకుండానే ఓ యాప్ ద్వారా కావాల్సిన పని పూర్తిచేసుకొనే రోజులివి. మరి అవి వ్యవసాయానికి ఇంకెంత మేలు చేయాలి? ఈ విషయంలో మనం సరైన దారిలోనే ఉన్నాం. ప్రైవేటు సంస్థలు రూపొందించిన అగ్రి యాప్ (AgriApp), భారత్ అగ్రి (BharatAgri), ఫామ్ బీ (FarmBee) లాంటి యాప్స్తో పాటు.. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు రూపొందించిన ఎన్నో యాప్స్ రైతులకు అందుబాటులో ఉన్నాయి. వ్యవసాయ శాఖ రూపొందించిన ‘కిసాన్ సువిధ’, రైతు సమాఖ్య వారి ‘ఇఫ్కో కిసాన్’, వ్యవసాయ పరిశోధన శాఖ వారి ‘పుస కృషి’ ఇలాంటివే!
ఈ యాప్స్ ద్వారా రైతులకు అసాధారణమైన సమాచారం అందుతున్నది. వాతావరణ విశ్లేషణ, మార్కెట్ ధరలు, సాగు చేస్తున్న పంటకు సంబంధించిన మెలకువలు.. లాంటి వివరాలతోపాటు నిపుణులతో సంభాషించే అవకాశం కూడా దక్కుతున్నది. కొన్ని యాప్స్ నామమాత్రపు ధరలతో భూసార పరీక్ష లాంటి సేవలు కూడా అందిస్తున్నాయి.
కేవలం సాగులో మాత్రమే కాదు! ఉత్పత్తి అమ్మకంలోనూ యాప్స్ ఉపయోగపడుతున్నాయి. అందుకు eNAM మంచి ఉదాహరణ. 2016లో విడుదలైన ఈ యాప్ అద్భుత విజయాన్ని సాధించింది. 175 రకాల ఆహార ఉత్పత్తులను దేశంలో ఏ వర్తకుడికైనా అమ్మే అవకాశాన్ని ఈ యాప్ కల్పిస్తున్నది. ఇప్పటివరకూ ఈ యాప్ ద్వారా లక్ష కోట్ల రూపాయలకు పైగా వ్యాపారం జరిగిందని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నది. తెలంగాణ సహా 18 రాష్ర్టాల్లో వెయ్యికి పైగా వ్యవసాయ మార్కెట్లను ఈ యాప్కు అనుసంధానించడం విశేషం.
మన దేశంలో వంద కోట్లకు పైగా మొబైల్ కనెక్షన్లు ఉన్నాయి. 50 కోట్ల మంది దగ్గర స్మార్ట్ఫోన్లు కనిపిస్తున్నాయి. రాబోయే దశాబ్దంలో ప్రతి ఒక్కరి వద్దా స్మార్ట్ ఫోన్ ఉంటుందని ఓ అంచనా! వీటికి తోడు మన దగ్గర డేటా లభ్యత చాలా చవక. అపారమైన డేటాతో గేమింగ్, పోర్నోగ్రఫీ లాంటి వ్యసనాలు అలవాటు అవుతాయనే భయమున్నా.. అదే సమయంలో వైద్యం, విద్య, వ్యవసాయం లాంటి రంగాలకు మేలే జరుగుతున్నది. అయితే స్మార్ట్ఫోన్లు, డేటా వేగం పెరిగినంత తొందరగా వ్యవసాయ యాప్స్ డౌన్లోడ్లు పెరగడం లేదు. అటు ప్రభుత్వం, ఇటు ఇంటింటా ఉండే విద్యావంతులు, స్థానిక అధికారులు, నాయకులే పూనుకొని.. సాంకేతికతలో వస్తున్న ఇలాంటి మార్పులను అందిపుచ్చుకోవాల్సిందిగా రైతులను ప్రోత్సహించాల్సి ఉంది!
డేటా విశ్లేషణ
స్మార్ట్ ఫార్మింగ్లో డేటా విశ్లేషణే కీలకం. ఇందుకు సమాచారమే పెట్టుబడి. అదృష్టవశాత్తూ మనకు ఆ కొదవ లేదు. విస్తారమైన వ్యవసాయ భూముల గురించి ప్రభుత్వం దగ్గర ఎంతో సమాచారం ఉంది. స్మార్ట్ ఫోన్ యాప్స్ ద్వారా మరికొంత సమాచారాన్ని సేకరించే అవకాశముంది. ఇస్రో లాంటి సంస్థల ఉపగ్రహాలు మన నేల అణువణువునూ విశ్లేషించగలుగుతున్నాయి. వీటి ద్వారా ఎక్కడ ఏ పంటలు వేస్తున్నారు? చీడపీడల వ్యాప్తి ఏ దిశలో ఉంది? వాతావరణం గురించిన సమగ్ర సమాచారాన్నీ తెలుసుకోగలుగుతున్నాం. సాక్షాత్తూ ఇస్రోనే ‘భువన్’ పేరుతో ఇలాంటి వ్యవసాయ సూచనలు అందిస్తున్నది.
చాలా సందర్భాల్లో సమాచారాన్ని నేరుగా చూసినప్పుడు ఏమీ తోచదు. కానీ, దాన్ని అల్గారిథమ్స్ ద్వారా విశ్లేషిస్తే.. అందులో దాగిన రహస్యాలు బయటపడతాయి. ఉదాహరణకు ఓ ప్రాంతంలో పరిస్థితులన్నీ ఫలానా పంటకు అనుకూలంగా కనిపించవచ్చు. కానీ, ఏదో ఒక లోపం వల్ల రైతులు నష్టపోయే ప్రమాదం ఉండవచ్చు. చుట్టుపక్కల రైతులంతా ఒక్కసారిగా అదే పంట వేస్తే గిరాకీ తగ్గిపోయే అవకాశం రావచ్చు. ఇలాంటి సమస్యలు రాకుండా, డేటా అనలటిక్స్ ద్వారా సాఫ్ట్వేర్లు కచ్చితమైన సూచనలు ఇవ్వగలుగుతాయి. భవిష్యత్ మార్పులనూ అంచనా వేయగలుగుతాయి. కేవలం అంకెల ద్వారా మాత్రమే కాదు.. ఉపగ్రహ ఛాయా చిత్రాలు, డ్రోన్ల ద్వారా సేకరించిన ఫొటోలను విశ్లేషించడం ద్వారా కూడా నేల తీరు దగ్గర నుంచీ ఆకుల్లో ఉన్న పత్రహరితం, పండ్ల బరువు, మొక్కల ఎత్తు వరకూ సమాచారాన్ని తెలుసుకోవచ్చు.
ప్రతి సందర్భంలోనూ..
స్మార్ట్ ఫార్మింగ్ ఏదో ఒక రంగానికి పరిమితం కాదు. పాడి పంటలకు సంబంధించి ఎన్నో సందర్భాల్లో ఇదిఉపయోగపడుతుంది.వ్యవసాయానికి, ఉత్పత్తి రవాణాకూ వినియోగిస్తున్న వాహనాలు ఎక్కడున్నాయి? ఎటు వెళ్తున్నాయి? అనే విషయాలను నిరంతరం గమనించవచ్చు.
ఉన్నచోటి నుంచే పశువుల బాగోగులను పర్యవేక్షించవచ్చు.చేపల చెరువులకూ ఇది ఉపయోగమే. సూర్యరశ్మితోపాటు నీటిలో ఆక్సిజన్ స్థాయిని గుర్తించే సెన్సర్ల వల్ల చేపలను కాపాడుకోవచ్చు.
పౌల్ట్రీల్లో ఉండాల్సిన ఉష్ణోగ్రతలు, కోళ్లకు అందుతున్న మేత లాంటి అంశాలను ఎప్పటికప్పుడు ఇంటి దగ్గర నుంచే తెలుసుకోవచ్చు.వాటర్ ట్యాంకులు, గోదాములు ఎంతవరకు నిండుకున్నాయో గమనించవచ్చు. దొంగల నుంచీ సరుకును కాపాడుకోవచ్చు.
ఇదో వలయం
వ్యవసాయంలో ఏదో ఒక విభాగానికి మాత్రమే సాంకేతికత జోడిస్తే పెద్దగా ప్రయోజనం ఉండదు. అందుకనే చాలా సందర్భాల్లో ఇది ఒక వలయంగా మారి, సాగు లక్ష్యాలను పూర్తిచేస్తుంది. ఇందులో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (IoT) పాత్ర కీలకం. ఒక సెన్సర్ లేదా మరేదైనా పరికరం.. సమాచారాన్ని సేకరించి, దాన్ని ఇంటర్నెట్ ద్వారా వినియోగదారుడికి అందించే ప్రక్రియ ఇది. అలాగే ఇచ్చిన సూచన లేదా పరిస్థితుల మేరకు ఒక పని చేయడం కూడా ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ద్వారా సాధ్యపడుతుంది.
పరిశీలన : సెన్సర్ లాంటి పరికరాల ద్వారా నేల, పంట, వాతావరణం లాంటి అంశాలకు సంబంధించిన వివరాలు నమోదవుతాయి.
విశ్లేషణ : సర్వర్లలో అప్పటికే నమోదై ఉన్న వేల వివరాలు, సందర్భాలతో వీటిని పోలుస్తూ మంచి
చెడుల బేరీజు పూర్తవుతుంది.
నిర్ణయం : విశ్లేషణ ఆధారంగా ప్రస్తుత పరిస్థితి, సమస్యను సరిచేయడానికి లేదా యథాతథ స్థితి కొనసాగించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలనే సూచన వస్తుంది.
ఆచరణ : చాలా సందర్భాల్లో నిర్ణయాన్ని అమలు చేసే అవకాశం కూడా ఉంటుంది. నీరు తక్కువగా ఉన్నట్టు గమనిస్తే, పారుదలను ప్రారంభించడం లాంటి చర్యలెన్నో స్మార్ట్ ఫార్మింగ్లో సాధ్యమే!
ఇవీ మన కష్టాలు!
‘స్మార్ట్ ఫార్మింగ్’ ఓ బాధ్యత!