ఏటా వేలమంది పక్షవాతంతోనో, తీవ్ర రోడ్డు ప్రమాదం కారణంగానో మాట్లాడే శక్తిని కోల్పోతుంటారు. ఒక్కసారిగా మాటలు పడిపోవడంతో మానసిక వ్యథకు గురై ఆత్మహత్యలు చేసుకుంటున్నవారూ ఉన్నారు. అయితే, ఇటీవల శాన్ఫ్రాన్సిస్కోకు చెందిన పరిశోధకులు ‘స్పీచ్ న్యూరోప్రోస్థెసిస్’ అనే టెక్నాలజీని అభివృద్ధి చేశారు.
ఈ సాంకేతికత పక్షవాతం బారినపడి మాటను కోల్పోయిన వారి మెదడు సంకేతాలను మాటలుగా మారుస్తుంది. అవన్నీ ఎదురుగా ఉన్న స్క్రీన్పై కనిపిస్తాయి. పదేండ్లకు పైగా శ్రమించి ఈ టెక్నాలజీని అభివృద్ధి చేశారు న్యూరోసర్జన్ ఎడ్వార్డ్ చాంగ్. దీనికి సంబంధించిన నివేదిక ‘న్యూ ఇంగ్లండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్’లో ప్రచురితమైంది. మెదడులోని సంకేతాలను పదాలుగా డీకోడ్ చేయడం, వాటిని స్క్రీన్పై కనిపించేలా చేయడం.. ఓ అద్భుత ఘట్టం.