మరుగున పడ్డ తెలంగాణ చరితను వెలికి తీసిన చరిత్రకారుడతను. అద్భుత పదబంధాలతో కవితలను అల్లగలడు. ఉన్నతమైన భావాలతో పాటలను రాయగలడు. సినీ గీత రచయితగానూ సుపరిచితుడే. ఆయనే.. బహుముఖ ప్రజ్ఞాశాలి కావూరి శ్రీనివాస్.
కవిగా, చరిత్రకారుడిగా, గీత రచయితగా, పరిశోధకుడిగా సుపరిచితులు కావూరి శ్రీనివాస్. సిద్దిపేట జిల్లాలోని పుల్లూరు శ్రీనివాస్ స్వస్థలం. తల్లిదండ్రులు కావూరి హేమచంద్ర శర్మ, నాగలక్ష్మి. 1964 నవంబర్ 3న జన్మించిన శ్రీనివాస్, సిద్దిపేటలో ఇంటర్ చదివారు. కాశీ విద్యాపీఠం నుంచి సాహిత్య శిరోమణి, విద్యావారధి పట్టాలు పుచ్చుకొన్నారు. కలకత్తా విశ్వవిద్యాలయం నుంచి మూలికా వైద్యంలో, యునైటెడ్ థియోలాజికల్ రీసెర్చ్ యూనివర్సిటీ నుంచి ఆయుర్వేదంలో డాక్టరేట్ పట్టాలు అందుకొన్నారు.
శ్రీనాథుడి వారసత్వం..
శ్రీనాథ కవిసార్వభౌముడి వంశంలోని 13వ తరానికి చెందినవారు కావూరి శ్రీనివాస్. వీరి తండ్రి వ్యాకరణ పండితులు, భాషావేత్త. దీంతో శ్రీనివాస్కు బాల్యం నుంచే సాహిత్యం పట్ల మక్కువ ఏర్పడింది. ‘జాతి మేల్కొన్నది యువత జాతి మేల్కొన్నది’ అంటూ చిన్నతనంలోనే కవితా రచన ప్రారంభించారు. మహాకవి సినారె ప్రోత్సాహంతో సాహిత్యరంగంలో అంచెలంచెలుగా ఎదిగారు. ‘హృదయ నినాదాలు’, ‘నా కవితలు’, ‘కవీశ్వరుడి కథనం’.. మొదలైన పుస్తకాలు, పరిశోధనాత్మక వ్యాసాలు రాశారు. కవిత్వం, తాళపత్ర గ్రంథాలు, మంత్రశాస్త్రం, ఆయుర్వేదం, జ్యోతిషం మొదలైన అంశాలపై పరిశోధన చేశారు. చారిత్రక పరిశోధకుడిగా మట్టిదిబ్బల మరుగునపడ్డ నగరాలను కనుగొన్నారు. 200కు పైగా ప్రాచీన తాళపత్ర గ్రంథాలను సేకరించారు.
సినీ ప్రస్థానం..
సినీ పాటల రచయితగానూ తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకొన్నారు శ్రీనివాస్. 1993లో ‘ప్రభు మహిమ’ సినిమాతో చిత్రసీమలోకి ప్రవేశించారు. ‘అమ్మ చేతి వంటరా అమృతాల పంటరా.. చేతివంట తింటిరా చెమ్మగిల్లిపోతిరా’ అంటూ మొదటి పాటతోనే తన కలం బలాన్ని చూపించారు. అమ్మ ప్రేమలోని మాధుర్యాన్ని, గోరుముద్దల మహాత్మ్యాన్ని ఎంతో అద్భుతంగా చెప్పారు. అమ్మలాలనలోని ఆప్యాయత వర్ణించలేనిదని, అమ్మ అనురాగం వెల లేనిదని, తుల లేనిదని చెబుతూ ‘అమ్మేరా నన్ను గన్న తల్లిరా.. ఆ అమ్మేరా నా కల్పవల్లిరా’ అని కీర్తించడం మహోన్నతంగాఉన్నది.
1996లో వచ్చిన ‘ధాత్రిలో దౌర్జన్యం’ సినిమాలో ‘చూడరో అన్నో ఈ దౌర్భాగ్య రాజ్యమును’ అంటూ అవినీతి, అన్యాయం అలుముకొన్న సమాజాన్ని కండ్లముందు ఉంచారు.
అనేక పురస్కారాలు..
సినిమా కవికి అవసరమైన అన్ని లక్షణాలూ శ్రీనివాస్లో పుష్కలంగా ఉన్నాయని చెప్పడానికి 2021లో వచ్చిన ‘యమధర్మ’ సినిమా నిదర్శనం. ఈ చిత్రంకోసం ‘మత్తెక్కిస్తోంది మందుబాటిలు.. కిక్కెక్కిస్తోంది కన్నెఫిగరు’ అంటూ ఓ శృంగార గీతాన్ని రాశారు. ఇందులోని ‘అందాలొలికే నా ఒళ్ళు కైపెక్కిస్తాయి నీ కళ్ళు’ వంటి పంక్తుల్లో వయసు సౌందర్యం గుబాళించే రస
భావనలు కనిపిస్తాయి. ఇవే కాకుండా ‘నా ఇల్లు నా వాళ్ళు’, ‘జాజిమల్లి’, ‘రుద్ర రుద్రాంశి’,
‘రాఘవేంద్ర స్వామి మహాత్మ్యం’ మొదలైన సినిమాలకు సాహిత్యాన్ని అందించారు. నాలుగు డాక్యుమెంటరీ చిత్రాలకు దర్శకత్వం వహించారు. విభిన్న రంగాల్లో రాణిస్తున్న శ్రీనివాస్ను ఎన్నో అవార్డులు, సత్కారాలు వరించాయి. ఆరు జాతీయ అవార్డులతోపాటు, ఆరు నంది పురస్కారాలను అందుకొన్నారు. తొమ్మిది ప్రపంచ రికార్డులను కైవసం చేసుకొన్నారు. పలు విశ్వవిద్యాలయాల నుంచి గౌరవ డాక్టరేట్లు అందుకున్నారు. అఖిల భారత భాషాసాహిత్య సమ్మేళనంలో ‘భారత్ భాషాభూషణ్’ బిరుదును పొందారు. సినారె చేత ‘కవిరాజు’ అనిపించుకొన్న ఘనాపాఠి శ్రీనివాస్. ‘నారాయణ రెడ్డి వ్యక్తిత్వమూ, రచనలే నాకు స్ఫూర్తి’ అంటారాయన.
ప్రేమ పాటల్లోనూ సిద్ధహస్తులు..
ప్రేమికుల భావుకతను ప్రకటించేలా ప్రణయ గీతాలు రాయడంలోనూ శ్రీనివాస్ సిద్ధహస్తులు. 1999లో వచ్చిన ‘ప్రతీకార జ్వాల’ సినిమా కోసం ‘అందాల భామ నచ్చింది ఈ వేళా.. ఈ అపరంజి బొమ్మ నీకోసమొచ్చింది ఈ వేళా’ అంటూ ఓ లలిత మనోహరమైన గీతాన్ని అందించారు. ఈ పాటలోని ‘మనమే ఏకమై తొలిప్రేమకు సాక్ష్యమై నిలిచిపోవాలిలా..’ అంటూ సాగే పంక్తుల్లో ప్రేమికుల హృదయాల్లో చెలరేగిన అనురాగ మాధుర్యాన్ని ఎంతో అందంగా వివరించారు. 2011లో వచ్చిన ‘ధర్మ వ్యాధుడు’ చిత్రం కోసం ‘అదిగదిగో అదే అదే జీవనధర్మము ఈ జగతికి మూలము’ అనే పాట రాసి, శ్రీ ధర్మవ్యాధుని ఔన్నత్యాన్ని చాటి చెప్పారు. శాంతి, ధర్మం, సహన గుణం.. మార్గాలుగా ముందుకు సాగిన ధర్మవ్యాధుని మహిమాన్వితమైన జీవితగాథను ఈ పాట ద్వారా వివరించారు. ఇందులోని ‘ధర్మానికి కట్టుబడ్డ రాజమహావేద్యా’ వంటి పంక్తుల్లో ధర్మవ్యాధుని వ్యక్తిత్వ పరిమళం అద్భుతంగా వ్యక్తమవుతుంది.
తిరునగరి శరత్ చంద్ర
6309873682