ప్యాక్ చేసిన ఆహారంలో, శీతల పానీయాల్లో ఉండే చక్కెర శాతం గురించి ఎంత చెప్పుకొన్నా సరిపోదు. వినియోగదారులను ఆకర్షించడానికి, యువతకు తమ ఉత్పత్తిని ఓ వ్యసనంలా మార్చేడానికి ఇబ్బడిముబ్బడిగా చక్కెర దట్టిస్తూ ఉంటాయి కంపెనీలు. ఈ తరహా ఆహారం వల్లే ప్రజల్లో ఊబకాయం, మధుమేహం, గుండెజబ్బులు పెరిగిపోతున్నాయనడంలో ఎలాంటి అనుమానమూ లేదు. ఈ విషయం మీద అవగాహన కల్పిస్తూ అమెరికాలో National Salt and Sugar Reduction Initiative పేరుతో ఓ పత్రాన్ని కూడా తీసుకువచ్చారు. ప్యాక్ చేసిన ఆహారాలు, శీతల పానీయాల్లో స్థాయికి మించిన చక్కెరను నిషేధించాలనీ లేదంటే, షుగర్ ట్యాక్స్ లాంటి పన్నులు విధించాలనీ వీరి సూచన. ఆ ప్రకారంగా ప్యాక్ చేసిన ఆహారంలో 20 శాతం చక్కెరను, శీతలపానీయాల్లో 40 శాతం పంచదారను తగ్గించగలిగితే ఒక్క అమెరికాలోనే 4.9 లక్షల గుండెజబ్బు మరణాలను అరికట్టవచ్చట.