గ్రీకు గాథల్లో ‘టాలోస్’ అనే పాత్ర కనిపిస్తుంది. రాగితో తయారుచేసిన ఓ భారీ యంత్రమిది. క్రేట్ అనే ద్వీపాన్ని రక్షిస్తూ ఉంటుంది.ప్రతిరోజూ ఆ ద్వీపం చుట్టూ మూడుసార్లు ప్రదక్షిణ చేస్తూ, సముద్రజలాలను గమనిస్తుంటుంది. ఒకవేళ శత్రువులు ద్వీపాన్ని ఆక్రమించుకొనేందుకు వస్తుంటే,వారి ఓడలమీద పెద్దపెద్ద రాళ్లు విసిరి నాశనం చేస్తుంటుంది. ‘కృత్రిమ మేధస్సు’ అనే ఊహకు నిదర్శనం.. టాలోస్!
..ఏదో కొత్తగా ఉంటుందని ఈ టాలోస్ కథ చెప్పుకొన్నాం. కానీ, మన జానపద కథలు మొదలు విఠలాచార్య సినిమాల వరకు.. ఇలాంటి ఎన్నియంత్రాలను మనం చూడలేదు! ఓయంత్రం తనంతట తానుగా పరిస్థితులను బేరీజు వేసుకొని, తగిన చర్యలు తీసుకోవడమే ‘కృత్రిమ మేధస్సు’. అంచెలంచెలుగా సాగే కొన్ని విశ్లేషణల (అల్గారిథమ్స్) ఆధారంగా ఇది పనిచేస్తుంది. అయితే ఇప్పటివరకూ, మానవుల పనిని సులభతరం చేసేందుకే ఈ అల్గారిథమ్స్ ఉపయోగపడ్డాయి. ఇప్పుడు, పర్యావరణాన్ని పరిరక్షించేందుకూ వీటిని వినియోగించే ప్రయత్నాలు సాగుతున్నాయి.
‘కృత్రిమ మేధస్సు’ అన్న మాట వినగానే.. మాట్లాడే మానిటర్, పట్టిపట్టి నడిచే రోబోనే మన కండ్లు ముందు మెదులుతుంది. ఓ యంత్ర లోకమేదో వింతగా పలకరిస్తుంది. నిజానికి ‘కృత్రిమ మేధస్సు’ అనేది అంతకంటే విస్తారమైంది. జాగ్రత్తగా గమనిస్తే, ఉదయం లేచిన దగ్గర నుంచి మన జీవితాల్ని శాసిస్తున్న శక్తి ఇది. ఉదాహరణకు.. గూగుల్లో ‘లేటెస్ట్ టీవీ’ అని టైప్ చేసి చూడండి. ఆ తర్వాత మీరు ఏ వెబ్సైట్కి వెళ్లినా, టీవీల తాలూకు ప్రకటనలు ఊరిస్తూ ఉంటాయి. సామాజిక మాధ్యమాల్లోనూ టీవీ కంపెనీలు పలకరిస్తూ కనిపిస్తాయి. ఇది కృత్రిమ మేధస్సు ప్రతిఫలమే! మీరు కంప్యూటర్లో ఆడే చెస్, వినే వాతావరణ హెచ్చరికలు, అలెక్సా తరహా పరికరాలు.. అన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు సాక్ష్యాలే. మున్ముందు ఈ కృత్రిమ మేధస్సు మరింతగా మన జీవితాల్లోకి విస్తరించనున్నది.
చాలా సందర్భాల్లో అది మన జీవితాలను మరింత సౌకర్యంగా మార్చబోతున్నది. విశేషం ఏమిటంటే.. మనిషివల్ల పర్యావరణానికి జరిగే నష్టాన్ని కూడా కృత్రిమ మేధస్సు తగ్గించబోతున్నది. కొన్ని సందర్భాల్లో దాన్ని సరిచేయబోతున్నది కూడా. అవును! ఇన్నాళ్లూ మన అభివృద్ధివల్ల పుడమికి చేటే జరిగింది. వాతావరణం వేడెక్కుతున్నది. పచ్చదనం పల్చబడిపోతున్నది. నదీనదాలు కరుగుతున్నాయి. జీవజాతులు అంతరిస్తున్నాయి. మొత్తంగా పంచభూతాలూ కలుషితం అయిపోతున్నాయి! తను చేసిన పొరపాటును సవరించుకొనే అవకాశం ఇప్పుడు మనిషికి వచ్చింది. ఆ సావకాశాన్ని ‘కృత్రిమ మేధస్సు’ కల్పిస్తున్నది.
పుడమి కోసం!
‘భూతాపం’ అన్నమాట కొత్తగా వింటున్నదేమీ కాదు. గ్లోబల్ వార్మింగ్వల్ల వరదలు, కరువులు, తీర ప్రాంతాలు మునిగిపోవడం, ఎడారులు పెరిగిపోవడం లాంటి సవాలక్ష సమస్యలు. అన్నీ కలిసి మానవాళిని అతలాకుతలం చేస్తున్నాయి. అందుకే ఈ శతాబ్దాంతానికి భూతాపాన్ని సగటున రెండు డిగ్రీల వరకు తగ్గించాలని ‘పారిస్ ఒప్పందం’ లక్ష్యంగా పెట్టుకున్నది. కానీ, ఇదేమంత తేలిక కాదని మనందరికీ తెలుసు. పారిశ్రామికీకరణ రోజురోజుకూ పెరిగిపోతున్నది. అడవుల నరికివేత కొనసాగుతున్నది. రసాయన వ్యర్థాలు వెల్లువెత్తడం సరేసరి. ఎటు చూసినా ఇలాంటి దుశ్శకునాలే! ఈ నేపథ్యంలో AI కీలకపాత్ర పోషించనున్నది.
నీరు ఆవిరవుతున్న శాతం, హిమనదాల కరుగుదల, నేలలో తేమ.. వీటన్నిటినీ ఎప్పటికప్పుడు లెక్కలు కట్టి భవిష్యత్తును అంచనా వేయవచ్చు. ఈ అంచనాల ద్వారా స్పష్టమైన హెచ్చరికలూ జారీ చేయవచ్చు. ఉదాహరణకు ‘మీ నగరంలో కాలుష్యం ఎక్కువగా ఉంది’ అని చెబితే ఎవరూ స్పందించకపోవచ్చు. కానీ‘కాలుష్యం ఇలాగే కొనసాగితే.. 2025 నవంబరులో మీ నగరంలో వరదలు ముంచెత్తుతాయి. 2027లో భరించలేని ఎండలు మీ నగరాన్ని దహిస్తాయి’ అని చెప్పగలిగితే.. తప్పకుండా భిన్నమైన స్పందన వస్తుంది. ఆ ఉపద్రవాలను ఎదుర్కొనేందుకు, నివారించేందుకు తగిన జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంటుంది. వందల ఏండ్లుగా నమోదవుతున్న వాతావరణ గణాంకాలను ఈ కృత్రిమ మేధస్సు కచ్చితంగా విశ్లేషించగలుగుతుంది. తదనుగుణంగా భవిష్యత్తునూ ఊహించగలుగుతుంది.
పర్యావరణం కోసం కృత్రిమ మేధస్సు ఎంతలా ఉపయోగపడుతున్నదో తెలియాలంటే మైక్రోసాఫ్ట్ మొదలుపెట్టిన AI for Earth అనే ప్రాజెక్టు గురించి చెప్పుకోవాలి. భూమిమీద కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు మైక్రోసాఫ్ట్ వంద కోట్ల డాలర్లను కేటాయిస్తుందని ఆ సంస్థ అధినేత సత్య నాదెళ్ల ఇదివరకే ప్రకటించారు. అందులో భాగమే AI for Earth. ఈ ప్రాజెక్ట్ కోసం మైక్రోసాఫ్ట్, పర్యావరణవేత్తలకు సాయపడే అనేక సాంకేతికతలను విడుదల చేసింది. భూమి ఉపరితలాన్ని నమోదు చేసే ‘లాండ్ కవర్ మ్యాపింగ్’, జీవజాతులను గుర్తించగలిగే ‘స్పీషిస్ క్లాసిఫికేషన్’, ప్రతి జంతువునూ విడిగా పోల్చుకునేందుకు వీలుగా ‘కెమెరా ట్రాప్’ లాంటి సౌలభ్యాలనూ తెచ్చింది. పర్యావరణవేత్తలు తమ డేటాను భద్రంగా దాచుకునేందుకు వీలుగా ‘అజుర్’ అనే క్లౌడ్ సర్వర్ను అందుబాటులో ఉంచింది. ఇంతేకాదు! మైక్రోసాఫ్ట్కు చెందిన ‘జాంబా క్లౌడ్’ అనే సాంకేతికత ద్వారా కెమెరాల్లో బంధించిన 20కి పైగా జంతువులను వేర్వేరుగా గుర్తించవచ్చు. అటవీ ప్రాంతాల్లో కెమెరాలను ఉంచడం కష్టమేమీ కాదు. కానీ, వేల గంటల కొద్దీ నిరంతరాయంగా రికార్డు అయ్యే దృశ్యాల్లో, ఎక్కడ జంతువులు ఉన్నాయో పసిగట్టేదెలా? అందుకోసం అమూల్యమైన శ్రమ వృథా చేయాల్సి ఉంటుంది. అదే పనిని AI ద్వారా చేసి పెడుతుంది ఈ జాంబా క్లౌడ్. అలాగే, బేసిన్ స్కౌట్ అనే సంస్థతో కలిసి, నీటి వనరుల లభ్యతకు కృషి చేస్తున్నది.
చుట్టుపక్కల చూడరా!
‘బయోబ్లిజ్’ అనే మాట పర్యావరణవేత్తలకు కొత్తేమీ కాదు. మన చుట్టూ ఉన్న పర్యావరణాన్ని గమనిస్తూ, అందులో కనిపించే జీవజాతులను రికార్డు చేస్తూ, తోటివారితో ఆ వివరాలను పంచుకుంటూ, వాటిలోని ప్రత్యేకతలను శాస్త్రవేత్తల నుంచి తెలుసుకుంటూ సాగే పరిశోధనా విధానమే బయోబ్లిజ్. దాదాపు పాతికేండ్ల క్రితం మొదలైన ఈ ప్రక్రియ శాస్త్రవేత్తలకు ఎంతో ఉపయోగపడింది. శాస్త్రవేత్తలు, ఔత్సాహికులు కలిసి చేసే ఈ ప్రయాణంలో.. తమ చుట్టూ ఉన్న జీవజాతులు ఎంత అరుదైనవో తెలుసుకునే అవకాశం ఔత్సాహికులకు కలుగుతుంది. శాస్త్రవేత్తలకేమో పరిశోధనకు తగినంత సమాచారాన్ని సేకరించే శ్రమ తప్పుతుంది. ఈ ప్రయత్నాలకు ఇప్పుడు AI సాయపడుతున్నది.
అందుకు inaturalist ఓ గొప్ప ఉదాహరణ. అయిదేండ్ల క్రితం క్యాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి చెందిన ముగ్గురు విద్యార్థులకు వచ్చిన ఆలోచనే ఇది. ఎవరైనా సరే తాము చూసిన జీవజాతుల దృశ్యాలను ఈ వెబ్సైట్లోకి అప్లోడ్ చేయవచ్చు. వాటి గురించి కావాల్సినంత సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ఒకవేళ అది అరుదైన జీవి అయితే, దాని గురించి పరిశోధించేందుకు, మరో ఔత్సాహికుడు ముందుకు రావచ్చు. ఇంతేకాదు! రోడ్డు ప్రమాదాల్లో చనిపోయే జంతువులు, దారి తప్పిన క్రూరమృగాలు, వన్యప్రాణుల వేట.. లాంటి దృశ్యాలను కూడా కెమెరాల్లో బంధించి పర్యావరణవేత్తల దృష్టికి తీసుకురావచ్చు. అరుదైన గణాంకాలను రూపొందించి, ప్రభుత్వాలను హెచ్చరించేందుకూ ఈ తరహా సమాచారం సాయపడుతుంది.
మూడు సంవత్సరాల్లోనే inaturalist అనూహ్యమైన విజయాన్ని సాధించింది. మూడున్నర కోట్లమందికి పైగా ఇందులో సభ్యులుగా చేరారు. ఆరుకోట్లకు పైగా దృశ్యాలను పంచుకున్నారు. వీటిద్వారా 32 లక్షల జీవజాతులను గుర్తించారు. చాలా సందర్భాల్లో దృశ్యాలను అప్లోడ్ చేయగానే, అందులోని జీవి ఏమిటో చెప్పేయగలుగుతుంది ఈ వెబ్సైట్. ఇంత ప్రభావవంతంగా పనిచేస్తుంది కాబట్టే, నేషనల్ జాగ్రఫిక్, ఐక్యరాజ్యసమితి లాంటి సంస్థలు ఈ బృందంతో జతకడుతున్నాయి.
అంతేకాదు! ఈ మధ్యకాలంలో వచ్చిన ‘పోకెమాన్ గో’ గుర్తుంది కదా! మన చుట్టూ ఉన్న పరిసరాల్లో ‘పోకెమాన్’ పాత్ర ఎక్కడ ఉందో వెతకడమే ఈ గేమ్. ఈ ఆటతో పిల్లలకు ధ్యాస తప్పిపోతుందనీ, ట్రాఫిక్లో చిక్కుకుపోతారనీ ఎన్నో విమర్శలు వచ్చాయి. కానీ, inaturalist ఇదే తరహా ఆటను పర్యావరణం కోసం రూపొందించింది. ‘సీక్’ అనే ఆటద్వారా మన దగ్గరలో ఉన్న జీవజాతులను కెమెరాలో బంధించి, వాటి గురించి వివరాలు తెలుసుకోవడమే ఈ ఆట ఉద్దేశం. కృత్రిమ మేధను ఉపయోగించి ఓ ఆట విమర్శల పాలైతే, అదే సాంకేతికతతో ‘సీక్’ పిల్లలకు పర్యావరణం పట్ల మంచి అవగాహన కల్పిస్తున్నది.
ఇదీ చరిత్ర
మనం కోరుకున్న పనిని ఓ యంత్రం ద్వారా చేయించడమనే ఊహ, వేల సంవత్సరాల నుంచి ఉన్నదే. అలాంటి కల్పనల ఆధారంగానే ఆవిరితో ఎగిరే పక్షులు, కీ ఇస్తే రెక్కలు ఆడించే బాతు బొమ్మలూ, పెండ్యులమ్తో కదిలే గడియారం.. లాంటి యంత్రాలెన్నిటినో మన పూర్వికులు రూపొందించారు. 20వ శతాబ్దం నాటికి, ఈ ఊహలకు గణితశాస్త్రం తోడైంది. గణితపరంగా నిరూపితమయ్యే సిద్ధాంతాలు ఎన్నిసార్లయినా ఒకే ఫలితాన్ని ఇస్తాయి. అలెన్ ట్యూరింగ్ కనిపెట్టిన ‘ట్యూరింగ్ మెషిన్’ ద్వారా దీన్ని నిరూపించారు కూడా! దాంతో గణితం ఆధారంగా కృత్రిమ మేధను అభివృద్ధి చేయసాగారు. ఇవాళ మన జీవితాల్లో భాగమైన కంప్యూటర్ కూడా కేవలం 0,1 అనే రెండు అంకెల ఆధారంగానే పనిచేస్తుందన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసుకోవాలి.
అలా ఊహలకు సాంకేతికతను జోడిస్తూ రోబోలను రూపొందించారు. మనిషికి పనిలో సాయపడటం నుంచి, మనిషి చేయగలిగే పనులన్నీ చేసే స్థాయికి రోబోలను తీర్చిదిద్దారు. ‘మూర్స్ లా’ అనే సిద్ధాంతం ప్రకారం 2045 నాటికి మనకు అందుబాటులో ఉండే కంప్యూటర్లు కూడా, మనిషి అంత శక్తివంతంగా విశ్లేషణలు చేయగలుగుతాయి. మనిషి ఎలాగైతే ఇంద్రియాల ద్వారా పరిసరాలను అంచనా వేస్తున్నాడో, రోబోలు కూడా వేర్వేరు సెన్సర్ల ద్వారా శబ్దం, దృశ్యం, వేడి లాంటివి అంచనా వేసి అందుకు అనుగుణంగా ప్రవర్తించగలుగుతాయి. ఈ సాంకేతికతను ‘మెషిన్ పర్సెప్షన్’ అంటారు.
సముద్రాన్ని వడపోస్తూ..
ఏటా 90 లక్షల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు సముద్ర జలాల్లోకి చేరుతున్నాయని ఓ నివేదిక! వీటి నుంచి విడుదలయ్యే రసాయనాలవల్ల సముద్రం కలుషితమైపోతున్నది. నీటిలో చిన్నచిన్న ముక్కలుగా విడిపోయే ప్లాస్టిక్, కోట్ల సముద్రజీవులకు ప్రాణాంతకంగా మారుతున్నది. ఈ పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే.. అధిక శాతం తాబేలు పిల్లల కడుపులో ప్లాస్టిక్ ముక్కలు ఉన్నాయని అంచనా! ఈ పరిస్థితిని సరిదిద్దేందుకు ‘ఓషన్ క్లీనప్’ అనే సంస్థ పనిచేస్తున్నది. కానీ, మహాసముద్రాల్లో తేలియాడే ప్లాస్టిక్ ముక్కలను సేకరించడం అంత తేలిక కాదు. దీనికోసం ఓషన్ క్లీనప్ సంస్థకు మైక్రోసాఫ్ట్ సాంకేతికత కలిసొచ్చింది. సముద్రాల్లో కలిసే ప్లాస్టిక్ అంతా నదుల నుంచే వస్తుంది. దాన్ని సరైన సమయంలో అడ్డుకోగలగాలి. కానీ ఎలా! ఇక్కడే AI ఉపయోగపడింది. నదీజలాల మీద వీచే గాలుల వల్ల, వ్యర్థాలన్నీ ఒక దిశగా పోగవుతాయి. గాలులు ఎటు వీస్తున్నాయో అంచనా వేస్తూ, నదిమీద తేలుతున్నవి వ్యర్థాలే అని నిర్ధారిస్తూ.. నదీజలాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందిస్తుంది. ఆ ప్రాంతానికి చేరుకునే ఓషన్ క్లీనప్ వాహనాలు, వ్యర్థాలు సముద్రంలోకి చేరకముందే సేకరిస్తాయి.
కలిసికట్టుగా పనిచేస్తూ..!
‘సముద్రంలో తేలే తోటలు’ అనే అంశం మీద ఓ పెద్దాయన పరిశోధన చేస్తున్నాడు. దాని కోసం ఆయన ఉపగ్రహం నుంచి, సముద్రాలకు సంబంధించిన లక్షల చిత్రాలను సేకరించాడు. కానీ, వీటినీ పరిశీలించడం అంత తేలిక కాదు కదా! ఇక్కడే ‘జూనివర్స్’ అనే సాంకేతికత ఉపయోగపడుతుంది. ఈ వెబ్సైట్లో కనుక ఆ పెద్దాయన తన ప్రాజెక్టును పెడితే, సాయపడేందుకు లక్షలమంది వలంటీర్లు సిద్ధపడిపోతారు. ఆయన దగ్గరున్న చిత్రాలను విశ్లేషిస్తూ, తమకు తోచిన సమాచారాన్ని అందిస్తారు. ప్రాజెక్టు అప్లోడ్ కావడం నుంచి, టన్నుల కొద్దీ సమాచారాన్ని ఒక చోటకు చేర్చడం వరకు AI సాయపడుతుంది. మిన్నెసోటా, ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయాలు సంయుక్తంగా మొదలుపెట్టిన ఈ జూనివర్స్ ద్వారా, 350 ప్రాజెక్టులు విజయవంతం అయ్యాయి. ఇరవై లక్షలమందికి పైగా ఔత్సాహికులు సేవలను అందిస్తున్నారు. పర్యావరణం కోసం సాయపడాలి అన్న తపన ఉంటే చాలు, జూనివర్స్లో సభ్యత్వం తీసుకుని తమవంతు సాయం చేయవచ్చు.
పక్షిరాజుల కోసం!
వంశీ దర్శకత్వంలో వచ్చిన ‘అన్వేషణ’ సినిమాను ఎవరు మర్చిపోగలరు? ఆ కథలో.. పక్షులను పరిశీలించాలనే ఆసక్తితో నాయికలు అనూహ్యమైన చిక్కుల్లో పడుతూ ఉంటారు. అది టేపులు, మైకుల కాలం. ఇవి AI రోజులు. eBird లాంటి ఒక యాప్ చేతిలో ఉంటే పక్షులను గమనించడంలో అద్భుతాలు చేయవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ఔత్సాహికులు ఈ యాప్ద్వారా తాము చూసిన పక్షులు, వాటి శబ్దాలు.. అన్నీ వెబ్సైట్కు పంపుతారు. ఇవి సాటి సభ్యులకు ఉపయోగపడటం మాత్రమే కాదు.. ఏ పక్షి జాతి ఏ ప్రాంతంలో విస్తరించి ఉంది? వలస ఎలా సాగుతున్నది? భూతాపం వల్ల వాటి జీవనంలో వచ్చిన మార్పులు ఏమిటి? లాంటి అంశాల మీద ఓ స్పష్టత సాధించవచ్చు. ‘ఇవాళ ఫలానా చోటుకు నేను పక్షులను గమనించడానికి వెళ్తున్నాను’ అంటూ ఇతరులను కూడా ఆహ్వానించవచ్చు. ఇప్పటికి 50 కోట్లకు పైగా పక్షుల సమాచారాన్ని ఈ సంస్థ నమోదు చేయగలిగింది. eBird లో చేరే ప్రతి సభ్యుడూ ఎన్ని పక్షులను గమనించాడు, ఎంత సమాచారాన్ని సేకరించాడు, ఎన్ని శబ్దాలను నమోదు చేశాడు.. లాంటి వివరాలతో ఓ ప్రత్యేక ప్రొఫైల్ ఉంటుంది. ఫేస్బుక్లోని లైక్లు, షేర్లకు ఇవి ఏమాత్రం తీసిపోవు. కాకపోతే, ప్రజల అభిప్రాయాలను ప్రభావితం చేస్తున్నాయనే అపప్రథను సామాజిక మాధ్యమాలు మూట గట్టుకుంటే, పక్షుల గురించి ఏ సమాచారం కావాలన్నా దొరుకుతుందనే నమ్మకాన్ని eBird సాధించింది. అందుకే, నాసా లాంటి సంస్థలూ సహకరిస్తున్నాయి.
నేలను కాపాడుకుంటూ..
నేల.. తల్లితో సమానం. నీడనిచ్చినా, ఆహారం అందించినా.. నేల చల్లగా ఉంటేనే, బతుకు సాధ్యం. కానీ, రసాయనాలను విపరీతంగా వాడటం, అధిక దిగుబడికోసం ఆరాట పడటంతో నేల సారం తగ్గిపోతున్నది. దానికి తోడు కాలుష్యం చేసే చేటు ఎలాగూ ఉంది. AI సాయంతో నేల సారాన్నీ, పంట దిగుబడినీ పెంచే ప్రయత్నం జరుగుతున్నది. ఉదాహరణకు బెర్లిన్కు చెందిన PEAT అనే సంస్థ, ప్లాంటిక్స్ అనే సాంకేతికతను అందుబాటులోకి తెచ్చింది. ఇది నేలలోని ఖనిజ లోపాలను, స్థానికంగా ఉండే చీడపీడల్నీ ముందుగానే గుర్తిస్తుంది. FarmShots లాంటి సంస్థలు ఇంకాస్త ముందుకు వెళ్లి, ఉపగ్రహాల సాయంతో పొలాలకు తగిన వర్షం ఎప్పుడు పడుతుందో కూడా పసిగడతాయి. ఇక కలుపు ఎక్కడ ఉందో తన కెమెరాతో గుర్తించి, దాన్ని పెకిలించే ‘లెట్యూస్ బోట్’ యంత్రం, మొక్కలు ఎక్కడ ఉన్నాయో చూసుకుని మరీ పోషకాలను చిలకరించే ‘సీ స్ప్రే’ సాంకేతికత.. ఇలా చెప్పుకొంటూ వెళ్తే వ్యవసాయ రంగంలో AI చేస్తున్న మాయ సరికొత్త లోకాన్నే తలపిస్తుంది. వర్షపు నీటిని శుభ్రంగా ఉపయోగించుకుంటూ, నేలకు అనుగుణమైన పంటలు వేస్తూ, తక్కువ రసాయనాలు వాడుతూ, ఎక్కడికక్కడ వృథాను అరికడుతూ సాగే ఈ నూతన విధానం వల్ల .. నేల తల్లిని భద్రంగా చూసుకుంటూనే, అధిక దిగుబడిని పొందే అవకాశం ఉంది. ప్రకృతినీ పరిరక్షించినట్టు అవుతుంది.
ఇంకా చాలా..
పవర్ గ్రిడ్స్ :
వేల కిలోవాట్ల విద్యుత్తును అందించే పవర్ గ్రిడ్స్కు AI ని జోడిస్తే, వాడకానికి అనుగుణంగా విద్యుత్తును అందిస్తూ, ఎక్కడికక్కడ వృథాను గమనిస్తూ విద్యుత్తును ఆదా చేస్తుంది. విద్యుత్ ఆదా అయ్యిందంటే, దాని అర్థం విలువైన వనరులను కాపాడుకున్నట్టే! వాతావరణాన్ని కచ్చితంగా అంచనా వేయడం ద్వారా కూడా విద్యుత్ వినియోగంలో హెచ్చుతగ్గులను ముందుగానే పసిగడుతుంది AI.
రవాణా :
‘ఫలానా చోట ట్రాఫిక్ ఎక్కువగా ఉంది. కాసేపు ఆగి బయల్దేరండి’ అనే హెచ్చరికలు ‘కుడివైపు ఉన్న మలుపులోకి తిరిగితే మీ ఆఫీసుకి త్వరగా చేరుకుంటారు’ తరహా సూచనలు మనకు ఇప్పటికే వేర్వేరు యాప్స్ ద్వారా అందుతున్నాయి. కృత్రిమ మేధస్సును కనుక పూర్తిగా వినియోగించుకోగలిగితే.. మానవ రహిత వాహనాలు, ట్రాఫిక్కు అనుగుణమైన ప్రయాణాలు, డ్రోన్లద్వారా రవాణా సాధ్యమవుతాయి. పర్యావరణమూ లాభపడుతుంది.
ఉత్పత్తి :
ఇప్పటికే IoT (ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్) అనే ప్రక్రియద్వారా వస్తువుల ఉత్పత్తిలోని ప్రతి అంచెలోనూ కృత్రిమ మేధస్సు సాయాన్ని తీసుకుంటున్నారు. దీనికి తోడు ‘దృష్టి’ లాంటి ఆవిష్కరణలు కూడా ఉత్పత్తి క్రమంలో విలువైన వనరులు వృథా కాకుండా అరికడుతున్నాయి. తెలుగువారు ప్రసాద్ ఆకెళ్ల స్థాపించిన ఈ సంస్థ, ఉత్పత్తిలో అణువణువునూ గమనిస్తుంది. ఎక్కడ వృథా జరుగుతున్నదో తెలియచేస్తుంది.
కంప్యూటర్లు :
శక్తిమంతమైన సర్వర్లనుంచి విపరీతమైన వేడి వెలువడుతుంది. ఆ ఉష్ణోగ్రతలను నియంత్రించడానికి శీతల యంత్రాలు సెగలు కక్కక తప్పదు. కృత్రిమ మేధద్వారా, సర్వర్ల పనితీరుకు అనుగుణంగా శీతలీకరణ చేయవచ్చు. గూగుల్ సంస్థ ఇలాంటి సాంకేతికత ద్వారా తన డేటా కేంద్రాలలో 35 శాతం విద్యుత్తు ఆదా చేయగలుగుతున్నది. దీనివల్ల అనేక సమస్యలకు పరిష్కారం లభించినట్టు అవుతుంది కూడా.
ఇలా ఒకటీ రెండూ కాదు, మన దినచర్యలోని ప్రతి మలుపులోనూ AI ద్వారా వనరుల వృథాను అరికట్టే అవకాశం ఉంది. ఉదాహరణకు గదిలో ఎంతమంది ఉన్నారో గమనించి.. అందుకు అనుగుణంగా వెలుతురును,వేడిని అందించే సాంకేతికత కృత్రిమ మేధతోనే సాధ్యం.
కృత్రిమ మేధస్సు వల్ల ఎంత ప్రయోజనం ఉన్నా అది ఇంకా అసంపూర్ణమే! ప్రస్తుతానికైతే ఈ మాట ఒప్పుకొని తీరాల్సిందే.AI ద్వారా ఏ పని, ఎప్పుడు ఎలా చేయాలో యంత్రాలకు చెప్పగలం. కానీ, విచక్షణతో కూడిన నిర్ణయం తీసుకోవడం వాటికి సాధ్యం కాదు. ‘కర్బన ఉద్గారాలను ఎట్టి పరిస్థితుల్లో తగ్గించాలి’ అనే ఆదేశంతో బ్రహ్మాండమైన కంప్యూటర్ని రూపొందించామే అనుకోండి.. ప్రాణ
వాయువు పీల్చుకుని కార్బన్డయాక్సైడ్ వదిలే మానవులు కూడా వాటికి శత్రువులుగా కనిపించవచ్చు. అందుకనే అల్గారిథమ్స్ రూపకల్పనలో, నిర్ణయాలు తీసుకునే మలుపులో మరింత అప్రమత్తంగా ఉండాలన్నది శాస్త్రవేత్తల సూచన. ఈ కాస్త జాగ్రత్తా తీసుకుంటే వందల సంవత్సరాలుగా, మనిషి ప్రకృతికి చేస్తున్న చేటును కొన్ని దశాబ్దాలలోనే సరిదిద్దవచ్చు!