పిల్లలు పోషకాహారం తీసుకోవాలని కోరుకుంటాం. వాళ్లేమో పండ్లు, కూరలను ఇష్టపడరు. మనమేమో వాళ్లకు బలవంతంగా తినిపించలేం! ఇది ఇంటింటి సమస్య. ఇందుకో ఉపాయం ఉందంటున్నారు ఇలినాయ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు. ఈ సమస్యకు పరిష్కారాన్ని కనిపెట్టడం కోసం కొన్ని స్కూళ్లను ఎంచుకున్నారు. అక్కడ భోజన విరామ సమయంలో పిల్లల ప్రవర్తనను గమనించారు. భోజనం చేసేందుకు తక్కువ సమయం ఉన్నప్పుడు… పిల్లలు చకచకా నచ్చిన వేపుళ్లు, జంక్ ఫుడ్స్ తినేశారు. కానీ కాస్త తీరుబాటు ఉంటేమాత్రం, అందుబాటులో ఉన్న పదార్థాలన్నిటినీ రుచిచూసేందుకు ప్రయత్నించారు. స్కూల్లో అయినా, ఇంట్లో అయినా భోజనానికి తగినంత సమయం కేటాయించి పోషకాహారాన్ని అందుబాటులో ఉంచితే… పిల్లలు పండ్లు, కూరగాయలకు అలవాటు పడతారని సూచిస్తున్నది ఈ పరిశోధన.