కిన్నెరసాని ప్రాజెక్టు.. ఒక పర్యాటక ప్రాంతం. సందర్శకులకు ఆహ్లాదాన్నిస్తుంది.కిన్నెరసాని ప్రాజెక్టు.. ఒక సాగునీటి దేవాలయం.రైతులకు పంటనీరు అందిస్తుంది.భూములను సస్యశ్యామలం చేస్తుంది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలంలో.. కిన్నెరసాని ప్రాజెక్టు ఉంది. ఆహ్లాదకరమైన వాతావరణంతో ఈ ప్రాంతం పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతున్నది. అదే సమయంలో.. రైతుల భూములను తడిపే సాగునీటి ప్రాజెక్టుగానూ సేవలందిస్తున్నది. ప్రాజెక్టు పరిధిలోని రెండు కాలువలు.. పాల్వంచ, బూర్గంపాడు మండలాల రైతులకు జీవనాధారం అవుతున్నాయి. 24 కిలోమీటర్ల పొడవున, 25 గ్రామాల్లోని పొలాలను తడుపుతున్నాయి. ఏటా 10 వేల ఎకరాల ఆయకట్టును సాగులోకి తెస్తున్నాయి. అందుకే, ఇక్కడ వానకాలంలోనే కాదు.. యాసంగిలోనూ భూములన్నీ పచ్చదనాన్ని పరచుకొంటాయి.
కుడి, ఎడమలతో..
వానకాలంలో కిన్నెరసాని నది ఉప్పొంగి ప్రవహిస్తుంటుంది. ఎగువ ప్రాంతంలోని చిన్నాచితకా వాగులు, వంకలు కలుస్తుండటంతో ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. మండే ఎండల్లోనూ నిండుకుండను తలపిస్తుంది. ఈ నీటిని సద్వినియోగం చేసుకొనేందుకు ప్రాజెక్టు కింద రెండు కాలువలను ఏర్పాటు చేసి, దిగువన ఉన్న పొలాలకు సాగునీరు అందిస్తున్నది ప్రభుత్వం.
ప్రాజెక్టు కుడి కాలువ 21 కిలోమీటర్ల పొడవు ఉండగా, ఎడమ కాలువ 3.5 కిలోమీటర్ల మేర ప్రవహిస్తుంది. ఈ రెండు కాలువల కింద 25 గ్రామాల్లోని 10వేల ఎకరాలకు సాగునీరు అందుతున్నది. పాల్వంచ పరిధిలోని రెడ్డిగూడెం, యానంబైలు, కోడిపుంజల వాగు, పునుకుల, కిన్నెరసాని, పూసల తండా, పాండురంగాపురంతోపాటు బూర్గంపాడు మండలంలోని ఉప్పుసాక, పినపాక, అంజనాపురం, బంజర గ్రామాల్లోని పొలాలను తడుపుతున్నాయి. దీంతో ఆయా గ్రామాల్లోని రైతులు ఏటా రెండు పంటలు పండిస్తూ, అధిక దిగుబడులు సాధిస్తున్నారు. ఎకరానికి కనీసం 40 బస్తాల చొప్పున మొత్తం 4 లక్షల బస్తాల ధాన్యాన్ని అందిస్తున్నాయి కిన్నెరసాని జలాలు.
జెన్కోకూ.. జనానికీ!
పాల్వంచలోని జెన్కో ప్లాంటుకూ కిన్నెరసాని నుంచే నీటిని సరఫరా చేస్తున్నారు. విద్యుత్ ఉత్పత్తి కోసం రోజూ 100 క్యూసెక్కుల జలాల్ని తరలిస్తున్నారు. సమీపంలోని కొత్తగూడెం పట్టణ తాగునీటి అవసరాలనూ తీరుస్తున్నది కిన్నెరసాని. తెలంగాణ ఆవిర్భావం తర్వాత భద్రాద్రి – కొత్తగూడెం ఓ జిల్లాగా అవతరించింది. కొత్తగూడెం పట్టణం జిల్లా కేంద్రమైంది. కొత్తగూడెం మున్సిపాలిటీకి కూడా కిన్నెరసాని జలాలను అందుబాటులోకి తెచ్చింది సర్కారు.
పొలాలకు ఆయువుపట్టు..
కిన్నెరసాని మా పొలాలను తడుపుతూ, మా పంటలకు ఆయువు పట్టుగా మారింది. ఇది భగవంతుడు మాకిచ్చిన వరం. ఎప్పుడూ 25 ఊర్లకు సరిపడా నీళ్లు పారుతూనే ఉంటాయ్. ఎక్కడో ఉన్న కొత్తగూడెం పట్టణానికి కూడా ఇక్కడి నుంచే నీళ్లు పోతున్నయ్. ఇంత కంటే మాకేం కావాలె.
ఇబ్బంది పడేవాళ్లం..
అప్పట్లో కిన్నెరసానిలో నీరు అంతంత మాత్రమే ఉండేది. ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులు, చెక్ డ్యాంలు, మిషన్ కాకతీయతో చెరువుల మరమ్మతులు చేయడంతో ఇప్పుడు పుష్కలంగా ఉన్నయ్. రెండు కాలువలతో పొలాలకు నీళ్లు వస్తున్నయ్. సేద్యానికి ఢోకా లేకుండా పోయింది. పంటలతో మా పల్లెలన్నీ కోనసీమలా మారిపోయినయ్.