ఐశ్వర్య జీవితం పూలబాటేం కాదు. తండ్రి రాజేశ్ మరణం ఆ కుటుంబాన్ని కుంగదీసింది. పోషణ బాధ్యత ఐశ్వర్య మీద పడింది. టెలివిజన్ షో యాంకర్గా కెరీర్ ప్రారంభించి, అనతికాలంలోనే హీరోయిన్ స్థాయికి ఎదిగింది. ఆరేండ్ల వయసులో ‘రాంబంటు’లో బాలనటిగా తెరంగేట్రం చేసింది. తర్వాత, ‘నీతన అవన్’ అనే తమిళ సినిమాతో హీరోయిన్గా పరిచయమైంది. కథా ప్రాధాన్యాన్ని బట్టి చెల్లిగా, రెండో హీరోయిన్గా చేయడానికి తనకెలాంటి అభ్యంతరం లేదని చెబుతున్నది.
తెలుగమ్మాయే. కానీ, తమిళంలో దుమ్మురేపుతున్నది. ఎటూ రచ్చ గెలిచింది. ఇక, ఇంట గెలవాలి, ప్రేక్షకుల గుండెల్లో రచ్చరచ్చ చేయాలి. ఐశ్వర్య రాజేశ్ ఆ పని మీదే ఉంది. టాలీవుడ్లోనూ పేరు తెచ్చుకోవాలన్న తపనతో వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్నది.‘వరల్డ్ ఫేమస్ లవర్’, ‘టక్ జగదీష్’లతో మెప్పించి, ‘రిపబ్లిక్’తో మరోసారి తెలుగు ప్రేక్షకులను పలకరించిన
ఐశ్వర్య గురించి..
ఈ పదేండ్లలో యాభైకి పైగా సినిమాల్లో నటించిన ఐశ్వర్య ఉత్తమ నటిగా అనేక అవార్డులు అందుకున్నది. ‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమాలో నలుగురు హీరోయిన్లలో ఒకరిగా చేసినా, తనదైన ముద్ర వేసింది. “కొత్త దర్శకులు మంచిమంచి కథలను తెరమీద ఆవిష్కరిస్తున్నారు. ‘ఉప్పెన’ దర్శకుడు బుచ్చిబాబు నా నటన బాగుంటుందని మెచ్చుకొన్నారు. నాతో పనిచేయాలనుందని చెప్పారు. అవకాశం వస్తే అటువంటి ప్రతిభావంతులతో పనిచేసేందుకు నేనెప్పుడూ సిద్ధమే” అని ప్రకటించింది.
విభిన్నమైన కథలను ఎంచుకుంటూ రొమాన్స్, థ్రిల్లర్, సస్పెన్స్, క్రైం ఇతివృత్తాలతో పాటు, స్త్రీ ప్రధాన చిత్రాలతోనూ అలరిస్తున్నది ఐశ్వర్య. సాధ్యమైనంత వరకూ కమర్షియల్ పాత్రలకు దూరంగా ఉంటున్నది. ఇటీవల రిలీజైన ‘రిపబ్లిక్’తో తానేమిటో మరోసారి నిరూపించుకుంది. ప్రస్తుతం తెలుగులో ఒకటి, తమిళంలో రెండు సినిమాలు చేస్తున్నది.
తమిళంలో సరేసరి. మలయాళం, హిందీతోపాటు తెలుగులోనూ తనేమిటో చాటుకునే ప్రయత్నంలో ఉంది ఐశ్వర్య. క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కిన ‘కణ’ సినిమా రీమేక్ ‘కౌసల్య కృష్ణమూర్తి’లో ఎంట్రీతోనే అదరగొట్టింది. ‘మనసున్నోడు’, ‘స్వామి’ వంటి డబ్బింగ్ సినిమాలతో తెలుగువారికి మరింత దగ్గరైంది.
‘తెలుగులో చాలా అవకాశాలు వస్తున్నాయి. పాత్ర నిడివి తక్కువైనా నటనకు ప్రాధాన్యం ఉన్న కథల్నే ఎంపిక చేసుకుంటున్నా. సినిమా జయాపజయాలను పక్కన పెడితే, నేను పోషించిన పాత్ర అందరికీ చేరువ కావాలన్నది నా కోరిక’ అంటున్నది ఐశ్వర్య.