ఆయన కలం.. మహిళా శక్తిని ప్రపంచానికి చాటింది. థియేటర్లలో విజిల్స్ వేయించింది. ప్రేక్షకులతో కన్నీరూ పెట్టించింది. ఆ పాటల్లో.. పదునైన పదాలసిరి నిండుగా కనిపిస్తుంది. కవితాస్పర్శ మెండుగా దర్శనమిస్తుంది. ఆ గేయ రచయితే.. డా. ప్రభాకర్ జైనీ.
నవలా సాహిత్యంతోపాటు గీత రచన, దర్శకత్వ విభాగాల్ల్లో నైపుణ్యం గడించిన ప్రభాకర్ జైనీ స్వస్థలం ఉమ్మడి వరంగల్ జిల్లా జనగామ. తల్లిదండ్రులు శకుంతల, లక్ష్మీనారాయణ. 3 మే 1955లో జన్మించిన ప్రభాకర్ జైనీ వరంగల్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ నుండి డిగ్రీ అందుకొన్నారు. తెలుగు యూనివర్సిటీ నుండి ఫిల్మ్ డైరెక్షన్లో పీజీ డిప్లొమా చేశారు. ఆచార్య దివాకర్ల వేంకటావధాని దగ్గర శిష్యరికం చేశారు. 1989లో ‘కాలవాహిని అలల వాలున’ శీర్షికతో ‘ఆంధ్రప్రభ’ వీక్లీలో సీరియల్ రాశారు. ఆ తరువాత గమ్యం, చోర్ బజార్, లక్ష్యం, సినీవాలి మొదలైన 25కుపైగా నవలలు వెలువరించారు.
స్త్రీ శక్తిని చాటుతూ..
2013లో స్వీయ దర్శకత్వంలో రూపొందించిన ‘అమ్మా నీకు వందనం’ సినిమాతో ప్రభాకర్ జైనీ పాటల రచయితగానూ మారారు. ఈ సినిమా కోసం స్త్రీ శక్తిని చాటుతూ ‘నువ్వు.. తరతరాల దాస్యానికి’, ‘అమ్మా నీకు వందనం’ అనే రెండు పాటలు అందించారు. రెండు గీతాల్లోనూ మహిళల మహోన్నత వ్యక్తిత్వ చైతన్యాన్ని ఎలుగెత్తి చాటారు. సకల రంగాల్లో అభ్యున్నతిని సాధిస్తున్న మహిళాజాతి విజయపరంపరను తెలుపుతుందీ పాట. ‘నువ్వు ఆకాశగంగా ఝరీప్రవాహానివి.. నిత్య నూతనమైన చైతన్య స్రవంతివి’ అంటూ స్త్రీజాతికి అక్షర హారతి పట్టారు ప్రభాకర్ జైనీ. ఇదే సినిమాలోని ‘అమ్మా నీకు వందనం’ అనే టైటిల్ సాంగ్కూడా ఎంతో ప్రత్యేకమైనది. అమ్మ ప్రేమ మాధుర్యాన్ని, అమ్మదనంలోని దైవత్వాన్ని గొప్పగా చెప్పారీ పాటలో. ‘పొత్తిళ్లలో లాలించే అమ్మా.. కొవ్వొత్తి తానై కరిగే అమ్మ’ అంటూ అమ్మలాలనను, పాలనను, త్యాగశీలతను అక్షరీకరించిన తీరు ఎంతో బాగుంది. సృష్టికి ప్రాణం పోసే మాతృమూర్తి ఔన్నత్యాన్ని కరుణ రసార్ద్రంగా పలికించారు. ‘కష్టాల కొలిమిలో జ్వలియించే అమ్మా.. కన్నీటి కడలికి తీరం అమ్మ’ అనే పంక్తుల్లో వెతలతో సాగే ఆమె జీవన గమనాన్ని కండ్ల ముందుంచారు.
కన్నీటి గాథలు తెలిసేలా..
ప్రణయ, ప్రబోధ గీతాలే కాదు.. విషాదాత్మకమైన సన్నివేశాలను కూడా ప్రభాకర్ జైనీ కలం చక్కగా పలికించగలదు. 2016లో వచ్చిన ‘క్యాంపస్ అంపశయ్య’ చిత్రంకోసం రాసిన ‘కొడుకా కొమరుడా!’ అనే పాట గుండెల్ని పిండేలా సాగుతుంది. ఎంతో శ్రమించి, జీవితాన్ని పణంగా పెట్టి కొడుకు భవిష్యత్తుకోసం తాపత్రయపడే తల్లిదండ్రుల గురించి, వారి కన్నీటి
గాథల గురించి అద్భుతంగా చెప్పారీ పాటలో. ‘నువ్వు నడిచే బాటల కన్నుల దారులు పరిసినా.. నువ్వు పలికే మాటల కన్నీటిధారలు మరిసినా’ అంటూ వేదనాతప్త హృదయాలను పలికిస్తారు జైనీ.
కవిగా, నటుడిగా, దర్శకుడిగా, రచయితగా బహుముఖ ప్రతిభను చాటిన ప్రభాకర్ జైనీకి ‘నా సినిమా సెన్సార్ అయిపోయిందోచ్’ నవలకుగాను ప్రతిష్ఠాత్మక నంది పురస్కారం వరించింది. ‘అమ్మా నీకు వందనం’ చిత్రానికి ఉత్తమ ప్రయోగాత్మక చిత్రంగా ‘భరతముని సినీ ఆర్ట్స్ అకాడమీ’ అవార్డు లభించింది. ప్రభాకర్ కలం నుంచి భవిష్యత్తులో మరిన్ని ఉత్తమ రచనాలు రావాలని ఆకాంక్షిస్తూ..
ప్రణయ గీతాల్లోనూ..
మొదటి సినిమాలో స్త్రీ జాతికి అక్షర హారతి పట్టిన ప్రభాకర్ జైనీ, తన తదుపరి చిత్రంలో యువతరం గుండెల్ని పులకింతల్లో ముంచేసి, వలపుల్లో తానమాడించే ప్రణయ గీతాలను అందించారు. 2013లో వచ్చిన ‘ప్రణయ వీధుల్లో..’ సినిమా కోసం ‘సై ఆటకు సైరంధ్రిని మనసెరిగిన మానినిని’ అంటూ మధురమైన ప్రణయగీతాన్ని ఆవిష్కరించారు. ఇదే సినిమాలో ‘గణ గణ గణ గంట వాయిస్తా పరువాల బడికి ఫస్ట్ బెల్ మోగిస్తా’ అంటూ హుషారు గీతాన్ని రాశారు. తొలివలపులోని సందడిని, వయసులు చేసే సవ్వడిని ఎంతో హాయిగా వివరించారు. మరోపాట ‘ఘల్లు ఘల్లు ఓరుగల్లు..’ పాట కూడా ఎంతో భావుకతతో సాగుతుంది. ‘మడికొండలోన కలుసుకుందాం హన్మకొండలోన హగ్గుకుందాం ఖిల్లా వరంగల్ లో కిస్సుకుందాం’ వంటి వాక్యాల్లో వరంగల్ వీధుల పేర్లతోపాటు ప్రేమికుల ప్రణయసౌందర్యం ధ్వనిస్తుంది. ఈ సినిమాకు దర్శకత్వం వహించడంతోపాటు అన్ని పాటలూ రాశారు.
తిరునగరి శరత్ చంద్ర
6309873682