కరువు నుంచి నిరక్షరాస్యత వరకు ప్రతి సమస్యా.. పురుషుల కంటే మహిళలనే తీవ్రంగా బాధిస్తుంది. దీనికితోడు ఇంటి బాధ్యతలు. పట్టణ మహిళలతో పోలిస్తే పల్లెవాసులకు ఇలాంటి బరువులు మరీ అధికం. అందుకే గ్రామీణ మహిళల సాధికారత పట్ల మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఉందంటారు సామాజిక వేత్తలు. అలాంటి కృషే చేస్తున్నారు మహారాష్ట్రకు చెందిన సునంద పవార్. ఆమెను గ్రామీణ మహిళలు ‘సునందా తాయి’ అని ప్రేమగా పిలుస్తారు. తాయి అంటే అమ్మ! తను బారామతిలోని వ్యవసాయాభివృద్ధి సంస్థకు కార్యదర్శిగా పనిచేస్తున్నారు.
కరువుతో బాధపడుతున్న 40 గ్రామాల్లో నీటి ఎద్దడిని అరికట్టేందుకు కృషి చేసి… 90 శాతం మార్పును సాధించారు. పల్లె మహిళల్లో రుతుక్రమ ఆరోగ్యానికి సంబంధించి పూర్తిస్థాయి అవగాహన కల్పిస్తున్నారు. ఆడపిల్లలు ఆత్మరక్షణ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది వివరిస్తున్నారు. భీమతాడి జాతర పేరుతో మహిళా వ్యాపారులు తమ ఉత్పత్తులను ప్రదర్శించే అవకాశాన్నీ కల్పిస్తున్నారు. ఈ ఉద్యమానికి గ్రామీణ మహిళలే తనకు స్ఫూర్తి అనీ, వారి కోసం మరింత మెరుగైన సమాజాన్ని నిర్మించడమే తన ఆశయమనీ అంటున్నారు సునంద.