Shakuntala Bhagat | శకుంతల భగత్ తండ్రి ఎస్బీ జోషి అప్పటికే ముంబైలో పెద్ద ఇంజినీర్. కూతురి ఆసక్తిని గమనించి సివిల్ ఇంజినీరింగ్ చదివించారు. వీరమాత జిజియాబాయి టెక్నలాజికల్ ఇన్స్టిట్యూట్లో చేర్పించారు. తొలి మహిళా ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్గా1953లో ప్రథమ శ్రేణి పట్టాతో బయటికొచ్చారు శకుంతల. తండ్రి దగ్గరే కొంతకాలం పనిచేశారు. ఆ తర్వాత నైపుణ్యాన్ని పెంచుకోడానికి జర్మనీ వెళ్లారు. ఫ్రిట్జ్ లినోనార్ట్ అనే స్ట్రక్చరల్ ఇంజినీర్ దగ్గర మూడేండ్లు శిక్షణ పొందారు. అక్కడినుంచి వచ్చాక పొరుగింటి అబ్బాయి అనిరుధ్ భగత్ను ప్రేమించి పెండ్లాడారు. ఆ తర్వాత దశాబ్దం పాటు ఐఐటీ ముంబైలో ప్రొఫెసర్గా పనిచేశారు.
తదుపరి ప్రయాణమంతా ఆంత్రప్రెన్యూర్షిప్ వైపు సాగింది. క్వాడ్రికన్ అనే కంపెనీ స్థాపించారు. వంతెనల నిర్మాణంలో ప్రీ ఫ్యాబ్రికేటెడ్ సిస్టమ్ను పరిచయం చేసిన ఘనత శకుంతలదే. ఎక్కడో విడిభాగాలను తయారు చేసి.. ఓ చోటుకు తీసుకొచ్చి బిగించడం అనేది అప్పట్లో సంచలనమే. తన చేతుల మీదుగా దాదాపు రెండొందల వంతెనలు డిజైన్ చేశారు శకుంతల. మల్టిపుల్ స్ల్కిరోసిస్ అనే కండరాల వ్యాధితో బాధపడుతూనే కర్తవ్యాన్ని నిర్వర్తించిన సందర్భాలు అనేకం. దశాబ్దం క్రితం ఆమె మరణించారు. తన ఆస్తిలో కోటి రూపాయలు మల్టిపుల్ స్లిరోసిస్ సొసైటీకి విరాళంగా ఇచ్చారు. శకుంతల జీవితాన్ని చలన చిత్రంగా తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి.