Ruchi Deepak | ఆర్థిక రంగం గురించి అవగాహన ఉన్నవారికి అకో ఇన్సూరెన్స్ పేరు కొత్తేమీ కాదు. ప్రస్తుతం ఉన్న ప్రముఖ బీమా సంస్థల్లో ఇది కూడా ఒకటి. కానీ ఈ సంస్థ ఆరంభం, మనుగడ అంత తేలికగా ఏమీ సాగలేదు. బీమా కంపెనీలు ఇప్పటికీ సంప్రదాయ సిద్ధాంతాలకు అనుగుణంగానే నడుస్తుంటాయి. సాంకేతికతకు తక్కువ ప్రాధాన్యం ఇస్తుంటాయి. కస్టమర్లు మిగతా ఉత్పత్తుల్లాగానే బీమా పాలసీని కూడా కొనుగోలు చేసేందుకు వీలయ్యే సాంకేతికతతో దీనిని రూపొందించారు సంస్థ వ్యవస్థాపకుల్లో ఒకరైన రుచి దీపక్. 2016లో రుచి ఈ సంస్థను ప్రారంభించే సమయానికి ఎవరూ అందులో పెట్టుబడి పెట్టేందుకు ముందుకు రాలేదు.
తమ లక్ష్యాలను, ప్రణాళికలను స్పష్టంగా వివరించిన తర్వాత ఇన్ఫోసిస్ నారాయణమూర్తి లాంటి ప్రముఖులు అందులో భాగస్వాములయ్యారు. 2021 నాటికి వంద కోట్ల డాలర్లతో యూనికార్న్ కంపెనీగా ఆవిర్భవించడం అకో సాధించిన అరుదైన ఘనత. అయితే, రుచి దీపక్ అక్కడితో ఆగిపోలేదు. వస్త్ర రంగంలో కావల్సిన దుస్తులు రకరకాల ఫ్యాషన్లలో, అందుబాటు ధరల్లో దొరుకుతున్నప్పటికీ… వాటిలో తగినంత నాణ్యత లేదని గుర్తించారు. ఇందుకు పరిష్కారంగా ‘ఎయిర్లూమ్’ పేరుతో నాణ్యమైన దుస్తులను అందించే కంపెనీని స్థాపించారు.