లోపల కంటి డాక్టరు. బయట కళ్లద్దాల దుకాణం. చాలారోజులపాటు ఇదే దృశ్యం కనిపించేది. ఈమధ్యనే పరిస్థితులు మారుతున్నాయి. బహుళజాతి సంస్థలు కూడా కళ్లద్దాల తయారీలోకి అడుగుపెడుతున్నాయి. ఈ నేపథ్యంలో తన కుటుంబ వ్యాపారాన్ని దూకుడుగా విస్తరిస్తున్నారు బెంగాలీ యువతి ప్రియాంక గుప్తా. పాపులర్ బ్రాండ్ జీకేబీ ఆప్టికల్స్కు ఒకానొక డైరెక్టర్ తను.
ఇది దేశంలోని తొలితరం కళ్లద్దాల తయారీ సంస్థలలో ఒకటని చెబుతారు. తండ్రి నుంచి వారసత్వంగా పగ్గాలు అందుకున్నారు ప్రియాంక. వివాహ వేడుకల్లో అతిథులంతా ఒకే థీమ్ కళ్లజోడు ధరించే ట్రెండ్ ప్రియాంక సృష్టించిందే. అందుబాటు ధరల నుంచి ప్రీమియం బ్రాండ్స్ వరకు అనేకం అందిస్తున్నారామె. ప్రియాంక నేతృత్వంలో దేశవ్యాప్తంగా 28 నగరాల్లో 90 అవుట్లెట్స్ ఉన్నాయిప్పుడు. ‘వినియోగదారుడు మా స్టోర్ నుంచి చిరునవ్వుతో, సంతృప్తిగా బయటికి వెళ్లాలి. ఇదే నా లక్ష్యం’ అంటారు ప్రియాంక.