వైద్య రంగంలో స్పెషలైజేషన్ చేయాలి అనుకున్నప్పుడు మానసిక శాస్ర్తాన్ని ఎంచుకున్నారు కన్నడ వనిత ప్రతిమ మూర్తి. కానీ అది తనకు నప్పుతుందా, అందులో రాణించగలనా అనే సందేహం కలిగింది. ఆ విషయం తెలుసుకునేందుకు మూడు నెలల పాటు సీరియస్గా చదివారు. ఆ తర్వాతే, మానసిక వైద్యురాలిగా స్థిరపడాలని నిర్ణయించుకున్నారు. మూడు నెలల గడువు కాస్తా మూడు దశాబ్దాల ప్రయాణంగా మారింది. మానసిక శాస్త్రంలో నిష్ణాతురాలిగా ఐక్యరాజ్య సమితి, ప్రపంచ ఆరోగ్య సంస్థ సహాపలు ప్రతిష్ఠాత్మక వేదికలపై పనిచేశారు ప్రతిమ.
ఆ తర్వాత, బెంగళూరులోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్లో చేరారు. ఇది దేశంలోనే అతిపెద్ద మానసిక వైద్యశాల. ఆమె ప్రతిభను గుర్తించిన ప్రభుత్వం రెండేండ్ల క్రితం డైరెక్టర్గా నియమించింది. నిజానికి, ఆ సమయంలో కొవిడ్ వల్ల పరిస్థితులు అల్లకల్లోలంగా ఉన్నాయి. నిమ్హాన్స్లోని రోగుల మానసిక ఆరోగ్యాన్నే కాదు.. కొవిడ్ ప్రభావాన్నీ ఎదుర్కోవాల్సిన గడ్డుకాలం. అయినా నిబ్బరంగా సంస్థను నడిపారు ప్రతిమ. మద్యపాన డీ-ఎడిక్షన్ ప్రక్రియలో తను సిద్ధహస్తురాలు. ‘మొదట్లో వ్యసనం నుంచి ఓ వ్యక్తిని బయటికి తీసుకురావడం అసాధ్యంగా అనిపిస్తుంది. కానీ అంతిమ ఫలితం తర్వాత, ఆ శ్రమంతా మాయమైపోతుంది’ అంటారు డాక్టర్ ప్రతిమ మూర్తి.