మొఘలాయి రుచుల్లో బిర్యానీ ఎంతో, తెలంగాణ వంటల్లో బగారన్నం అంత! అన్నంతో కలిపి తినే గుడ్ల మిరియం ఇక్కడ మాత్రమేవండుకునే ప్రత్యేక వంటకం. కానీ, ఇవన్నీ స్విగ్గీలోనో, జొమాటోలోనో ఆర్డర్ పెట్టుకోవాలంటే కుదరదు. ఒకటో రెండో బయట లభించినా.. అసలు రుచి దొరకదు. ఈ వెలితే, హైదరాబాద్కు చెందిన కోర్పోలు మాలతీ రావును ‘తెలంగాణ విందు’ ఏర్పాటు దిశగా ఆలోచింపజేసింది. ఆ వంటలు ఆరగించినఎవరైనా ‘జై తెలంగాణ రుచులు’ అనక మానరు. ఆ శాకపాకాల ప్రయాణం మాలతి మాటల్లోనే..
బాగా ఆకలేసినప్పుడూ, వంట చేసుకునేంత ఓపిక లేనప్పుడూ… మనం ఆశగా బయటి తిండి వైపు చూస్తాం. ఎంత పెద్ద రెస్టారెంట్ నుంచి, ఎంత ధర పెట్టి తెప్పించుకున్నా మన ఇంటి వంట రుచి చచ్చినా రాదు. అందుకే, నేనే ఆ రుచిని నలుగురికీ అందించేలా ఏదైనా మొదలు పెడితే బాగుంటుంది అనిపించింది. అలా పుట్టిందే ‘తెలంగాణ విందు’. ఆలోచన రావడమే ఆలస్యం.. నా వంటింటినే స్టార్టప్ స్పేస్గా మార్చుకున్నాను. ఇక్కడి నుంచే వండి పంపిస్తున్నాను. వంట మీదే కాదు, వడ్డనపైనా దృష్టి పెడతాన్నేను. అన్నట్టు, మా తెలంగాణ విందు పక్కా పర్యావరణ హితం. తాటి బుట్టలో బగారన్నం, మట్టి కుండలో మటన్ కూర, చిట్టి ముంతలో సోంపులు, ఆరగించేందుకు మోదుగాకు విస్తర్లు.. మోసుకొస్తుంది మా పార్సిల్.
వెబ్డిజైనింగ్ నుంచి..
మా సొంతూరు కరీంనగర్ జిల్లా లింగాపురం. నాన్న ఉద్యోగ రీత్యా హైదరాబాద్ వచ్చాం. నాకు మొదటి నుంచీ తొమ్మిదింటికి వెళ్లి అయిదింటికి తిరిగొచ్చే ఉద్యోగాలు ఇష్టం ఉండేవి కాదు. అందుకే మేనేజ్మెంట్లో డిగ్రీ (బీబీఏ) చేశాను. ఆ తర్వాత సాఫ్ట్వేర్ బూమ్ ఉండటంతో వెబ్ డిజైనింగ్ చదివాను. స్నేహితుల సాయంతో కాలేజీలు, కంపెనీలకు వెబ్సైట్లు డిజైన్ చేసిచ్చాను. పెండ్లి తర్వాత.. పిల్లలు, కుటుంబ బాధ్యతలతోనే సరిపోయేది. అందులోనూ, అప్పటికి నాకు వంట రాదు. ఆయన మీద ప్రేమతో వంటల పుస్తకాలు ముందేసుకుని ఉదయం, సాయంత్రం రకరకాల ప్రయోగాలు చేసేదాన్ని. చాలా ఏండ్లు ఇలానే గడిచిపోయాయి. పిల్లలు పెద్దయిపోయారు. నాకంటూ ప్రత్యేకం ఉండేలా ఏదైనా చేయాలన్న తపన ప్రారంభమైంది. నిజానికి, పెండ్లి తర్వాత నాకు వంటలతో బలమైన అనుబంధం ఏర్పడింది. ఏది ఎలా చేస్తే రుచిగా ఉంటుందో తెలిసిపోయింది. నేను స్వతహాగా భోజన ప్రియురాలిని.
మా ఇంట్లో అందరూ అంతే. ఈ పూటకు ఏదో ఒకటి తింటే సరిపోతుందిలే అనుకునే రకం కాదు. దాంతో వంట శ్రద్ధగా చేస్తాం. కానీ ఒక్కపూట బయట తినాలనిపించినా ఆ రుచి ఎక్కడా దొరికేది కాదు. అందుకే మళ్లీ కెరీర్ మొదలు పెట్టాలనుకున్నప్పుడు ఆహార రంగమే నాకు సరైనది అనిపించింది. అలా ‘తెలంగాణ విందు’కు శ్రీకారం చుట్టాను. ఇంట్లోనే వండి పార్సిళ్లు పంపడం మొదలుపెట్టాను. ముందుగా నా అవసరాలకు తగ్గట్టు.. వివిధ సైజులలో ఈత బుట్టలు, విస్తరాకులు ఆర్డరిచ్చి తెప్పించాను. మట్టి కుండలు ప్రత్యేకంగా చేయించుకున్నాను. తెలిసిన వాళ్లకు నా స్టార్టప్ గురించి చెప్పాను. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లోనూ ప్రకటన ఇచ్చాను. అమ్మ సలహాతో ఇన్స్టాగ్రామ్ పేజీ క్రియేట్ చేశాను. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లతోనూ మా సంస్థ గురించి నలుగురికీ తెలియజేశాను. మొత్తానికి మేం చేస్తున్న పని చాలా మందికి నచ్చింది. ఇప్పుడు తెలంగాణ విందుకు ఇన్స్టా పేజీలో ఇరవై వేలమంది ఫాలోవర్లు ఉన్నారు.
అదే ఫేమస్..
మా మెనూలో తెలంగాణ మటన్ కర్రీకి భలే గిరాకీ. బగారన్నం, గుడ్ల మిరియం, గుడ్ల పులుసు, పచ్చిపులుసు, నాటుకోడి కర్రీ, రొయ్యల ఇగురు, పాయలాంటివి కూడా లభిస్తాయి. వంటలో సేంద్రియ దినుసులే వినియోగిస్తాం. జహీరాబాద్ దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ నుంచి కారం, కొన్ని మసాలా దినుసులూ కొంటాను. మరికొన్ని కేరళ నుంచి తెప్పిస్తాను. ప్రతి ఆర్డర్నూ ప్రత్యేకంగా చూస్తాను. మధ్యాహ్నం కావాలంటే ఉదయం తొమ్మిదిలోపు, రాత్రికి అయితే సాయంత్రం నాలుగులోపు ఆర్డర్ ఇవ్వాలి.
ఆదివారాల కోసం శుక్రవారమే చెప్పొచ్చు. పనివాళ్లను పెట్టుకున్నా.. నాణ్యత తగ్గకూడదనే ఉద్దేశంతో నేనే వండుతాను. కాబట్టి, మేం గరిష్ఠంగా 50 మందికి మాత్రమే వంటలను అందిస్తున్నాం. వ్యాపారం ప్రారంభించిన తొలినాళ్లలో గ్రైండర్లో నా కుడిచేతి బొటనవేలు నలిగిపోయింది. కనీసం సంతకం కూడా చేయలేననుకున్నాను. ఆ సమయంలో అమ్మ నన్ను ఆదుకుంది. నా పనుల్లో సాయపడింది. ‘రుచి అదిరింది’ అంటూ కస్టమర్ల నుంచి వచ్చే ఫోన్లే మరుసటి రోజు ఉత్సాహంగా పనిచేసేందుకు సరిపడా బలాన్నిస్తాయి. ఫ్రాంచైజీలు తెరిచే ఆలోచన ఉంది. తెలంగాణ రుచుల్ని ప్రపంచ వ్యాప్తం చేయాలన్నది నా కల.
…? లక్ష్మీహరిత ఇంద్రగంటి
ఎం.గోపీకృష్ణ