పాలిచ్చే తల్లి కంటే.. పాలించే తండ్రి (పాలకుడు) బాధ్యతే ఎక్కువని అంటాడు చాణక్యుడు. కాబట్టే, కేటీఆర్ ఓ అన్నలా రుద్ర రచనకు అండగా నిలిచారు. ఆత్మవిశ్వాసం నింపారు. ఆ మనోబలంతోనే తను మంచి మార్కులతో ఇంజినీరింగ్ పాసైంది. క్యాంపస్ ప్లేస్మెంట్ సాధించింది. పేదరికం బాధ, సామాజిక బాధ్యత.. రెండూ తెలిసిన ఆ యువతి తన నాలుగు నెలల జీతంలోంచి అక్షరాలా లక్ష రూపాయలు సీఎం కేసీఆర్
సమక్షంలో ముఖ్యమంత్రి సహాయనిధికి అందించింది. ఆ క్షణంలో కేసీఆర్ ఓ తండ్రిలా మురిసిపోయారు. మరింత ఎత్తుకు ఎదగాలని ఆశీర్వదించారు. రచన ఇప్పుడు అనాథ కాదు. తెలంగాణ సర్కారే ఆమె కుటుంబం. ఉన్నతోద్యోగం సాధించి అభాగ్యులకు ఓ కుటుంబాన్ని ఇవ్వడమే తన కర్తవ్యమని చెబుతున్నది రుద్ర రచన..
నా పేరు రుద్ర రచన. భూమేశ్వర్, మమత నా తల్లిదండ్రులు. జగిత్యాల జిల్లా రాయికల్ మా స్వగ్రామం. నాన్న ఓ ఫైనాన్స్ కంపెనీలో గుమస్తాగా చేసేవారట. అమ్మ బీడీ కార్మికురాలు. నాకు ఒక అక్కయ్య ఉంది. పేరు రమ్య. నేను పుట్టిన నెల రోజులకే నాన్న పచ్చకామెర్లతో చనిపోయారు. విధిలేని పరిస్థితుల్లో అమ్మ మమ్మల్ని తీసుకుని తన పుట్టిల్లు.. తాండ్య్రాలకు వచ్చింది. అద్దె ఇంట్లో ఉంటూ అక్కను, నన్ను చదివించింది. కుటుంబాన్ని పోషించడానికి బీడీలు చుట్టింది. కూలి పనులకూ వెళ్లింది. విష జ్వరంతో అమ్మ చని పోవడంతో ఉన్న ఒక్క ఆధారమూ పోయింది. అప్పటికే అమ్మమ్మ, తాతయ్య మరణించారు. అక్క ధైర్యం చేసి బీడీలు చుడుతూనే ఇంటర్ పూర్తి చేసింది. నన్ను కూడా చదివించింది. పనిచేస్తూ కాలేజీకి వెళ్లడం కష్టం కావడంతో డిగ్రీ మొదటి సంవత్సరంలోనే చదువు ఆపేసింది. ఓ దశలో నా చదువులకూ ఆటంకం ఎదురైంది. దీంతో జగిత్యాలలోని బాలికల సదనంలో చేర్పించింది. అక్కడే ఉంటూ పదో తరగతి వరకు చదివాను.
టెన్త్లో మంచి మార్కులు రావడంతో పాలి టెక్నిక్ కోర్సుకు దరఖాస్తు చేశాను. హైదరాబాద్లోని దుర్గాబాయ్ దేశ్ముఖ్ పాలిటెక్నిక్ కాలేజీలో సీటు వచ్చింది. యూసఫ్గూడలోని స్టేట్ హోమ్లో ఉండి చదువుకున్నా. డిప్లొమా తరువాత సీబీఐటీలో ఇంజినీరింగ్ సీట్ వచ్చింది. అప్పటికే డిప్లొమా పాసయ్యాను కాబట్టి, నేరుగా బీటెక్ రెండో సంవత్సరంలో చేరి పోయాను. కాలేజీ ఫీజు, హాస్టల్ వసతి కోసం రూ.2.25 లక్షలు అవసరమైంది. అంత మొత్తం ఎలా చెల్లించాలో అర్థం కాలేదు. మా బావ (అక్క రమ్య భర్త) స్వచ్ఛంద సంస్థలను సంప్రదించారు. తెలిసినవారికంతా నా పరిస్థితి వివరించారు. దీంతో కొంత స్పందన కనిపించింది. అప్పటి జగిత్యాల కలెక్టర్ డాక్టర్ శరత్ చొరవ తీసుకున్నారు. కలెక్టరేట్ సిబ్బంది తలో చేయీ వేసి రూ.70 వేలు అందించారు. జగిత్యాలకు చెందిన డాక్టర్ ఎల్లాల శ్రీనివాస్రెడ్డి కొంత సాయం చేశారు. వివిధ యువజన సంఘాల సభ్యులు సహకరించారు. అయినా ఆ డబ్బు సరిపోలేదు. ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి సహకారం కోరాం. హైదరాబాద్ వచ్చి కలవాలని చెప్పారు. అన్నట్టుగానే లక్ష రూపాయలు అందించారు. అంతకుముందే, మా బావ నా పరిస్థితిని వివరిస్తూ మంత్రి కేటీఆర్ను సోషల్ మీడియా ద్వారా అభ్యర్థించారు. హైదరాబాద్కు వెళ్తుండగానే మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో స్పందించారు. ప్రగతి భవన్కు రమ్మని చెప్పారు. కేటీఆర్ మాకోసం చాలా సమయం కేటాయించారు. అక్కడే భోజనం చేశాం. ధైర్యంగా ముందుకు సాగాలని, అన్ని రకాలుగా అండగా ఉంటానని ధైర్యమిచ్చారు. అప్పటికే రెండో సంవత్సరం ఫీజు సమకూరడంతో.. మూడో ఏడాది ఫీజు చెక్కు రూపంలో ఇచ్చారు. ఫైనల్ ఇయర్లో మరోసారి కలుద్దామని, మధ్యలో ఎలాంటి ఇబ్బంది వచ్చినా తన దృష్టికి తీసుకురావచ్చని భరోసా ఇచ్చారు. బీటెక్ ఫైనల్ ఇయర్లో ఉండగానే నాలుగు బహుళజాతి కంపెనీల నుంచి ఆఫర్స్ వచ్చాయి. ఆ విషయం తెలిసి మంత్రి కేటీఆర్ మళ్లీ ప్రగతిభవన్కు పిలిపించి అభినందించారు. ఫైనల్ ఇయర్ ఫీజు కోసం చెక్కు ఇచ్చారు.
కాగ్నిజెంట్లో ఆరు మాసాల ఇంటర్న్షిప్ చేశాను. తర్వాత, పూర్తిస్థాయి ఉద్యోగిగా తీసుకున్నారు. జీతం అందుకున్నప్పుడు ఎంతో సంతోషంగా అనిపించింది. అదే సమయంలో నా బాధ్యత కూడా గుర్తుకొచ్చింది. అందుకే, అక్కతో కలిసి సీఎం కేసీఆర్ను కలిసేందుకు బీఆర్ అంబేద్కర్ సచివాలయానికి వెళ్లాను. ముఖ్యమంత్రి నన్ను, అక్కను తన చాంబర్కు పిలిపించారు. అన్ని వివరాలూ అడిగారు. మా కథంతా వివరించాను. నా నాలుగు నెలల వేతనం నుంచి లక్ష రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్కు ఇవ్వాలని ఉందని చెప్పాను. ఆయన చాలా సంతోషించారు. సివిల్స్కు ప్రిపేర్ కావాలని సూచించారు. నన్ను పెద్ద ప్రభుత్వ ఉద్యోగిగా చూడాలనేది అమ్మ కల కూడా. సమాజంలో నాలాంటి అనాథ పిల్లలు ఎంతోమంది. వారిలో కొందరికైనా సాయం చేయాలన్నది నా ఆశయం. అందుకు సివిల్స్, గ్రూప్స్ మంచి మార్గాలని భావిస్తున్నా. దేవుడి దయవల్ల గొప్ప స్థాయికి చేరితే, అనాథ ఆశ్రమం స్థాపించి ఏ దిక్కూ లేనివారిని గొప్పగా తీర్చిదిద్దుతాను. దేవుడు అన్ని సమయాల్లో మనతో ఉండలేడు కాబట్టే అమ్మానాన్నలను ఇచ్చాడు. నాకు మాత్రం.. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ రూపంలో నాన్నను, అన్నను ఇచ్చాడని అనుకుంటున్నా. దిక్కు లేని వారికి దేవుడే దిక్కు అంటారు. తెలంగాణలో మాత్రం దిక్కు లేనోళ్లకు సీఎం కేసీఆరే దిక్కు.
తెలంగాణ సర్కారు అనాథ పిల్లలకు అండగా ఉంటుందని, అలాంటి చిన్నారుల విషయంలో ప్రత్యేక పాలసీ తీసుకొచ్చే ఆలోచన ఉందని ముఖ్యమంత్రి చెప్పారు. ఆశయ సాధన కోసం సివిల్స్కు సిద్ధం కావాలని సూచించారు. బాల్యంలోనే అందర్నీ పోగొట్టుకున్న నాకు కేటీఆర్ అన్న, కేసీఆర్ సార్ కొత్త ధైర్యం ఇచ్చారు. వాళ్లే నా కుటుంబం.