మూడు గంటలు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి నగరంలోని రోడ్లు జలమయమయ్యాయి. రాత్రి ఏడు గంటల సమయంలో కరెంటు లేక నగరవాసులు ఇబ్బందులు పడసాగారు.
విపరీతమైన ఆలోచనలతో వేడెక్కిన అరవింద్.. రెయిన్ కోటు వేసుకుని, హెల్మెట్ పెట్టుకుని బైక్ తీశాడు.
స్పోర్ట్స్ బైక్.. వేగంగా రోడ్డెక్కింది. గంట తరువాత ఇంట్లోకి అడుగుపెడుతున్న కొడుకును చూసి, తండ్రి కిరీటి ఆందోళనకు గురయ్యాడు.
“ఇంత వర్షంలో ఎక్కడికి వెళ్లావురా!?”..
ప్రశ్నించింది తల్లి కృష్ణవేణి.
మాట్లాడకుండా తన గదిలోకి వెళ్లిపోయాడు అరవింద్. అరగంట తరువాత డిన్నర్కు రమ్మని కొడుకును పిలిచింది కృష్ణవేణి. డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్న కొడుకు చేతిపై కాలిన మచ్చలు గమనించిన తల్లి..
“ఆ మచ్చలేమిట్రా!?” అని ఆదుర్దాగా అడిగింది.
జవాబివ్వకుండా అన్నం కలుపుకోబోయి అరచేతిని ఊదుకున్నాడు అరవింద్. కుడి అరచేతిలో చిన్న
పుండును గమనించి, అరవింద్కు అన్నం తినడానికి చెంచా అందించింది తల్లి. కొడుకు వాలకం తండ్రి
మనసులో అనుమానం రగిల్చింది.
“ఇంత వర్షంలో ఎక్కడికి వెళ్లావు? ఏం ఘనకార్యం చేశావు” గద్దించాడు కిరీటి.
“అర్జంటు పనిమీద ఫ్రెండ్ను కలవడానికి వెళ్లాను. చిన్నదెబ్బ తగిలిందంతే!..” అంటూ అన్నం కెలికి, ఆకలి లేదంటూ డైనింగ్ టేబుల్ దగ్గరి నుంచి వెళ్లిపోయాడు అరవింద్. చేతులు కడుక్కుని, తన గదిలోకి వెళ్లి తలుపేసుకున్నాడు.
కిరీటి మదిలో ఆందోళన మొదలైంది. కృష్ణవేణికీ
గాబరాగా ఉంది. ఇద్దరికీ తిండి మీద ధ్యాస పోయింది. కంచంలో నీళ్లు పోసి, లేచి వెళ్లిపోయాడు కిరీటి. కృష్ణవేణి భర్తను అనుసరించింది. ఇన్వర్టర్ వీక్ కావడంతో గదుల్లో లైట్లు ఆరిపోయాయి. హాలులో చీకటిలో కూర్చున్నారిద్దరూ. కొడుకు ఏదో నేరం చేసి ఉంటాడని వారి మనసు హెచ్చరించసాగింది.
కృష్ణవేణితో వివాహం నాటికి కిరీటి డిగ్రీ చేసి, చిన్న ఉద్యోగం చేస్తున్నాడు. వివాహమయ్యాక భర్తను ఎంబీయే చేయమని ప్రోత్సహించింది కృష్ణవేణి. భార్య ప్రోత్సాహంతో ఉత్సాహంగా ఎంబీయే చేశాక.. కిరీటి దృష్టి బిజినెస్ వైపు మళ్లింది. ఉద్యోగానికి రాజీనామా చేశాడు. కృష్ణవేణి తండ్రిని ఒప్పించి భర్త వ్యాపారానికి పెట్టుబడిని అప్పుగా ఇప్పించింది. మామగారి మద్దతుతో కిరీటి ఫ్యాన్సీ స్టోర్స్ తెరిచాడు. భార్య, బావమరుదులు అతనికి అండగా నిలిచారు. వారి సేవాదృక్పథం కస్టమర్లను ఆకట్టుకుంది. వ్యాపారం పుంజుకుంది. ఏడాదిలో ఫ్యాన్సీ స్టోర్స్ సూపర్ మార్కెట్గా మారింది. నాణ్యమైన సరుకులకు చిరునామాగా నిలిచింది. రెండేళ్ల తరువాత మరో బ్రాంచీ వెలిసింది. ఆర్థికంగా బలపడుతుండటంతో.. మరింత ఉత్సాహంగా వ్యాపారాన్ని అభివృద్ధి చేయసాగారు. కాలం వేగంగా పరిగెట్టింది. పదో వివాహ వార్షికోత్సవం నాడు.. భార్యాభర్తలు స్టార్ హోటల్లో లంచ్కు వెళ్లారు.
“మన పెళ్లయి పదేళ్లయ్యింది. వ్యాపారంలో స్థిరపడాలనే ఆలోచనతో ఇన్నాళ్లూ కుటుంబ నియంత్రణ పాటించాం. వ్యాపారాన్ని విస్తరించాం. సొంత నివాసం ఏర్పరచుకున్నాం. నేను తల్లిని కావాలనుకుంటున్నాను. ఇద్దరు పిల్లలు నట్టింట్లో తిరిగే ముచ్చట చూడాలని మనసు ఉవ్విళ్లూరుతున్నది” అంటూ తన కోరికను వెల్లడించింది కృష్ణవేణి.. లంచ్ చేస్తూ.
గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు కిరీటి.. భార్యవైపు ప్రేమగా చూస్తూ.. మూడు నెలల తరువాత కృష్ణవేణికి తను నెల తప్పినట్లు అర్థమైంది. భార్య నోట శుభ సంకేతం విన్న కిరీటి ఆనందం అంబరాన్నంటింది. కృష్ణవేణిని అపురూపంగా చూసుకోసాగాడు. తొమ్మిదో నెలలో కృష్ణవేణికి గైనిక్ ప్రాబ్లమ్స్ మొదలయ్యాయి. బిడ్డ అడ్డం తిరిగిందన్నారు. ఆపరేషన్ చేసి మగబిడ్డను బయటికి తీశారు. తల్లి ఆరోగ్య రక్షణకు గర్భసంచి తీసేయాల్సి వచ్చింది. రెండు నెలల తరువాత కృష్ణవేణి ఆరోగ్యం కుదుటపడింది. తనకిక పిల్లలు పుట్టే యోగం లేదని బాధపడుతున్న కృష్ణవేణిని కిరీటి ఓదార్చాడు. మూడో నెలలో బారసాలనాడు తమ బిడ్డకు ‘అరవింద్’ అని నామకరణం చేశారు ఆ తల్లిదండ్రులు.
ఒక్కగానొక్క బిడ్డ అరవింద్ను గారాబంగా పెంచ సాగారు తల్లిదండ్రులు. అరవింద్ ఖరీదైన బట్టలలో మెరిసేవాడు. మెడలో బంగారు పతకం ధగధగలాడేది. తమ పుత్రరత్నాన్ని రాకుమారుడిలా పెంచాలని తలపోశారు కిరీటి దంపతులు. మూడేళ్ల వయసు నుంచే అరవింద్ విపరీతమైన అల్లరి చేయసాగాడు. అరవింద్ అల్లరిని భరిస్తూ, కొడుకును ముద్దు చేయసాగింది కృష్ణవేణి. కిరీటి కూడా కొడుకును పల్లెత్తు మాట అనేవాడు కాదు. తన మాట నెగ్గేవరకు పంతం పట్టడం అరవింద్కు అలవాటైంది. ఒక్కగానొక్క బిడ్డ ఏడిస్తే తట్టుకోలేకపోయేది తల్లి. కొడుకు ఏంకోరినా కాదనలేకపోయేవాడు తండ్రి. దాంతో.. మంకుపట్టుకు మారుపేరుగా మారాడు అరవింద్.
అరవింద్కు నాలుగేళ్లు నిండాయి. పేరున్న కాన్వెంటులో చేరిస్తే క్రమశిక్షణ పేరుతో పిల్లాణ్ని శిక్షిస్తారనే భయంతో, అంతగా పేరులేని ప్రైవేట్ స్కూల్లో చేర్చారు. తన కొడుకు తప్పుచేసినా దండించకూడదని షరతు
విధించాడు కిరీటి.
స్కూల్లో అరవింద్ అల్లరికి అడ్డులేకుండా పోయింది. తోటి విద్యార్థులను కొట్టడం, వారి పుస్తకాలు, పెన్సిల్స్
వంటివి లాక్కోవడం లాంటి పనులలో ఆరితేరిపోయాడు. ఏడో తరగతిలో తోటి విద్యార్థితో తగవుపడి అతణ్ని రక్తం వచ్చేలా కొట్టాడని అరవింద్ను స్కూల్ నుంచి సస్పెండ్ చేశారు. కిరీటి వెళ్లి పెనాల్టీగా అధికమొత్తం స్కూల్ యాజమాన్యానికి చెల్లించి.. కొడుకు సస్పెన్షన్ను రద్దు చేయించాడు.
మళ్లీ స్కూల్లో చేరిన అరవింద్ కాలరెత్తుకు తిరగ
సాగాడు. తప్పుచేసినా డబ్బు ఖర్చు పెట్టి కప్పిపుచ్చుకోవచ్చుననే భావన అతనిలో బలపడింది. తను ఐశ్వర్యవంతుడు కనుక చుట్టూ ఉన్నవారు తన మాటకు విలువనివ్వాలని, తనకు ఎదురు చెప్పినవారిని ఉపేక్షించకూడదన్న అహంకారం పెరిగింది. అరవింద్ ఇస్తున్న కానుకలకు ఆశపడిన తోటి విద్యార్థులు అతని అహంకారాన్ని హీరోయిజంగా పొగుడుతూ ఇంకా రెచ్చగొట్టసాగారు.
“మీరు మాకు ఆర్థికంగా సహాయం చేస్తున్నందున మీ అబ్బాయిని భరిస్తున్నాం. ఈమధ్య మీవాడు మరీ మితిమీరుతున్నాడు. కాస్త అదుపు చేయండి” అంటూ స్కూల్ ప్రిన్సిపాల్.. కిరీటికి ఫోన్లో చెప్పారు. ప్రిన్సిపాల్ చెప్పిన విషయాన్ని భార్య చెవిన వేశాడు కిరీటి.
“ఈ వయసులోనే మంచి బుద్ధులు నేర్పాలి. మొక్కయి వంగనిది మానయి వంగదన్నారు. నువ్వు వాడిని దండించు” అన్నాడు కిరీటి.
“ఒక్కగానొక్క కొడుకు. వాడి కాల్లో ముల్లు గుచ్చుకున్నా నా ప్రాణం విలవిలలాడుతుంది. వాడు బాధపడితే నేను చూడలేను. వాణ్నేం అనకండి. కాలంతోపాటే వాడూ మారతాడు”.. కన్నీళ్లతో చెప్పింది కృష్ణవేణి. కిరీటి మౌనం వహించాడు.
పదో తరగతి పరీక్షల్లో పాసై, జూనియర్ కాలేజీలో చేరిన అరవింద్.. సినిమాల్లో హీరోలా ధీరత్వం ప్రదర్శించాలనుకుంటూ కాలరెగరేసుకు తిరగసాగాడు. తన మాటకు ఎదురు చెప్పినవాళ్లను బెదిరించడం మామూలైంది. ఎంసెట్ కోచింగ్కు వెళ్తున్నట్లు ఇంట్లో చెబుతూ సినిమాలు, షికార్లతో సమయం వృథా చేయసాగాడు.
ఇంటర్ రెండు సంవత్సరాలు ఇట్టే గడిచిపోయాయి. సెకండ్ క్లాస్లో పాస్ అయ్యాడు అరవింద్. ఎంసెట్లో ర్యాంకు తెచ్చుకోలేకపోయాడు. డిగ్రీ బీఎస్సీలో చేరాడు.
డాక్టర్ అవుతాడనుకున్న కొడుకు.. డిగ్రీ కోర్సులో చేరడంతో కిరీటిని నిరుత్సాహం ఆవహించింది.
“పోనీలెండి.. మీలాగే డిగ్రీ తర్వాత పీజీ చేస్తాడు. చదువు పూర్తయ్యాక వాణ్నీ వ్యాపారంలోకి దింపుదాం. వాణ్ని డాక్టర్ చదివిద్దామనుకున్న డబ్బు పెట్టుబడిగా పెట్టి.. కొత్త వ్యాపారం ప్రారంభిద్దాం!” సలహా ఇచ్చింది కృష్ణవేణి.
“వాడికి మంచిబుద్ధి ప్రసాదించమని భగవంతుణ్ని ప్రార్థించడమే మనం చేయగలిగింది” అని నిరుత్సాహంగా భార్యతో అన్నాడు కిరీటి.
డిగ్రీలో చేరాక తండ్రిని ఒప్పించి స్పోర్ట్స్ బైక్ కొనుక్కున్నాడు అరవింద్. కొడుకు ముచ్చట కాదనలేక పోయాడు తండ్రి.
స్పోర్ట్స్ బైక్పై దర్జాగా కాలేజీకి వెళ్లసాగాడు అరవింద్. తనకు తిరుగులేదన్న అహంకారం అతని మనసులో బలంగా నాటుకుంది. సాయంకాలం బైక్పై నగర విహారం ఉత్సాహాన్నిస్తున్నది. యవ్వనారంభంలో అమ్మాయిల వైపు మనసు లాగసాగింది. చూస్తున్న సినిమాలు వయసుకు మించిన ఆలోచనలు రేకెత్తిస్తున్నాయి. చేతిలో స్మార్ట్ఫోన్ కొత్తలోకం చూపిస్తున్నది. కాలేజీ అనుభవాలను మధురానుభూతులుగా మార్చుకోమని మనసు పోరుపెడుతున్నది. చదువుకోవాల్సిన వయసులో అమ్మాయిలను వలలో వేసుకునే మార్గాలు అన్వేషించసాగాడు అరవింద్. రెండు సంవత్సరాలు దొర్లిపోయాయి. డిగ్రీ ఫైనల్ ఇయర్లో అడుగుపెట్టాడు అరవింద్. కాలం ఉల్లాసంగా గడుస్తున్నది.
“ఈరోజు సాయంత్రం నా మిత్రుడు రాఘవరావు తనకు ప్రమోషన్ వచ్చిన సందర్భంగా ఇస్తున్న పార్టీకి మనల్ని ఆహ్వానించాడు. సాయంత్రం ఆరింటికి అందరం వెళ్దాం” అన్నాడు కిరీటి లంచ్ చేస్తూ.
“రాఘవరావు భార్య సునీత నాకూ ఫోన్ చేసింది. అలాగే వెళ్దాం” చెప్పింది కృష్ణవేణి.
అనుకున్నట్లే సాయంకాలం ముగ్గురూ రాఘవరావు ఇంటికి చేరుకున్నారు. అతిథులను సాదరంగా ఆహ్వానించారు రాఘవరావు దంపతులు.
సునీత తన కూతురు అర్చనను కిరీటి కుటుంబానికి పరిచయం చేసింది. అర్చన బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నట్లు చెప్పింది. కృష్ణవేణి సునీతకు సహాయం చేయడానికి ఆమెతో లోపలికి వెళ్లింది. కిరీటి అక్కడ చేరిన మిత్రులతో కబుర్లు పంచుకోసాగాడు.
అర్చనను చూడగానే అరవింద్ గుండె లయతప్పింది. ఆమె అందానికి ముగ్ధుడై.. చూపు తిప్పుకోలేక పోతున్నాడు. ‘లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటే ఇదేనేమో! అబ్బ.. అర్చన బ్యూటిఫుల్ గర్ల్. నా మనసు దోచింది. ఐ లవ్ హర్!’ అనుకుంటూ, మధురమైన ఊహలలో తేలిపోసాగాడు అరవింద్.
అరవింద్ చూపులకు అర్చన తడబడింది. అతని చూపులు విషపు చూపులని ఆమె మనసు హెచ్చరించింది. అటూ ఇటూ తిరుగుతూ అరవింద్ చూపుల నుంచి తప్పించుకోవాలని ప్రయత్నించింది. పార్టీ పూర్తయి అతిథులు వెళ్లిపోయాక అర్చనకు హృదయభారం తీరినట్లయింది.
ఆ రాత్రి అరవింద్కు నిద్రపట్టలేదు. చంద్రబింబం లాంటి అర్చన ముఖం అతని మనసులో ముద్రపడింది. చాలాసేపు ఆలోచించి మర్నాడు తన ప్రేమను అర్చన ముందు వ్యక్తపరచాలని నిశ్చయించుకున్నాడు.
అనుకున్నట్లే మర్నాడు సాయంత్రం ఇంజినీరింగ్ కాలేజీ దగ్గర కాపుకాశాడు. కాలేజీ స్కూటర్ స్టాండ్లో స్కూటీ స్టార్ట్ చేస్తున్న అర్చనను పలకరించాడు.
“నువ్వు ఈ కాలం అమ్మాయిల్లాకాకుండా సంప్రదాయ దుస్తుల్లో కాలేజీకి రావడం నాకు నచ్చింది. నువ్వు చాలా అందంగా ఉంటావు” అన్నాడు నవ్వుతూ.
అతని మాటలు వినడం ఇష్టంలేనట్లు అర్చన ముఖం తిప్పుకొన్నది.
“నేను నిన్ను ప్రేమిస్తున్నాను. మనిద్దరం మేడ్ ఫర్ ఈచ్ అదర్. మన పెళ్లికి మన తల్లిదండ్రులూ కాదనరు. ఏమంటావ్!?” అన్నాడు తమకంగా.
“సారీ! నాకీ ప్రేమలూ అవీ నచ్చవు. ప్రస్తుతం చదువే నా లక్ష్యం. బీటెక్ తరువాత ఎంటెక్ చేసి, ఫారిన్ వెళ్లాలనుకుంటున్నాను. నా దారికి అడ్డురాకు” అంటూ స్కూటీ స్టార్ట్ చేసి రివ్వున వెళ్లిపోయింది అర్చన.
అర్చన తిరస్కారాన్ని అవమానంగా భావించాడు అరవింద్. ఎలాగైనా అర్చనను తన దారికి తెచ్చుకోవాలని అనుకున్నాడు. వరుసగా రెండు రోజులు అమెను వెంబడించాడు. అర్చన ఇంటికి వెళ్లే దారిలో ఎక్కడో ఒకచోట ఆమె స్కూటీకి తన బైక్ను అడ్డుపెట్టి తన ప్రేమను వెల్లడించసాగాడు. అరవింద్ ప్రవర్తనను తల్లిదండ్రులకు చెపితే వారు మనస్తాపానికి గురవుతారని భావించింది అర్చన. పోలీస్ కంప్లయింట్ ఇస్తే కుటుంబం అల్లరి పాలవుతుందని భయపడింది. అరవింద్కు తనే గట్టిగా బుద్ధి చెప్పాలని నిర్ణయించుకుంది.
చీకటి గదిలో అరగంట మౌనం రాజ్యమేలింది. కిరీటి, కృష్ణవేణి ఎవరి ఆలోచనల్లో వారు సతమతం అవుతుండగా ఒక్కసారిగా లైట్లు వెలిగాయి. వార్తలు చూద్దామని టీవీ ఆన్చేశాడు కిరీటి.
“బ్రేకింగ్ న్యూస్.. అర్చన అనే ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థినిపై యాసిడ్ దాడి జరిగింది. నిందితుడు చాలా తెలివిగా కటిక చీకట్లో అర్చన ముఖంపై యాసిడ్ పోసి పారిపోయాడు. ఆమె అక్కడికక్కడే మరణించింది. అర్చన తల్లిదండ్రులు నిందితుడి ఆచూకీ చెప్పలేక పోతున్నారు. వర్షం కారణంగా నిందితుడు సాక్ష్యాధారాలు లేకుండా చేయగలిగాడని పోలీసులు చెబుతున్నారు”..
ఆ వార్త వింటూంటే కిరీటి చేతిలో రిమోట్ జారి కిందపడింది. కృష్ణవేణి గుండెలో మంట రగిలింది. తల్లి మనసు కంపించింది.
‘అరవింద్ చేతిపై కాలిన మచ్చలు.. యాసిడ్ చుక్కలు పడటం వల్ల కాదుగదా!?.. అంటే.. అరవింద్!’ ఆపైన ఊహించుకోలేకపోయింది ఆ మాతృమూర్తి.
కిరీటి గబగబా అరవింద్ గదిలోకి వెళ్లాడు. అతని కళ్లు నిప్పులు కురుస్తున్నాయి.
“నువ్వు.. అర్చన ముఖంపై యాసిడ్ పోసి వచ్చావు కదూ!” అరుస్తున్నట్టు అడిగాడు కిరీటి.
“నీకెలా తెలిసింది నాన్నా!?” గాబరాగా అన్నాడు అరవింద్.
“అంటే.. నేననుకున్నది నిజమేనన్న మాట! ఆ అమ్మాయి నీకేం అపకారం చేసిందిరా దుర్మార్గుడా!” గద్గద స్వరంతో అన్నది కృష్ణవేణి.
“నా ప్రేమను తిరస్కరించింది. రెండు రోజుల కింద నన్ను చెప్పుతో కొట్టింది. తట్టుకోలేకపోయాను. ఈరోజు వర్షం రావడంతో నా ప్లాన్ సులభంగా అమలైంది. సాక్ష్యాధారాలు దొరక్కుండా జాగ్రత్త పడ్డాను. మీరేం కంగారు పడకండి. నన్నెవరూ పట్టుకోలేరు” తడబడుతూ చెప్పాడు అరవింద్.
కోపంతో అరవింద్ రెండు చెంపలూ వాయించాడు కిరీటి. కృష్ణవేణి కళ్లు వర్షించసాగాయి. నెత్తి మొత్తుకుని రోదించింది.
ఇంద్రగంటి నరసింహ మూర్తి స్వస్థలం కాకినాడ. డిగ్రీ చేశారు. కెనరాబ్యాంకులో 30 ఏండ్లు ఉద్యోగం చేసి, చీఫ్ మేనేజర్గా విరమణ పొందారు. ఇప్పటివరకు 200 పైగా కథలు ప్రముఖ దిన, వార, మాస పత్రికలలో ప్రచురితమయ్యాయి. ‘జీవనస్వరం’ కథల సంపుటిని వెలువరించారు. స్వాతి వారపత్రిక కథల పోటీలలో మూడుసార్లు రూ.పదివేల బహమతులు అందుకున్నారు. ఇతర పత్రికలలో మరో ఆరు కథలకు బహుమతులు దక్కాయి. ఆదిత్య హృదయం, జీవితచక్రం, స్థితప్రజ్ఞత, జీవనసమరం, ఆటుపోట్లు, జీవనరాగం కథలు పాఠకుల ప్రశంసలు పొందాయి. వీటిలో కొన్ని ఆకాశవాణి, విశాఖపట్నం కేంద్రం ద్వారా ప్రసారమయ్యాయి. ‘ఈనాడు’ అంతర్యామిలో 22 వ్యాసాలు ప్రచురితమయ్యాయి.
“మీరు గాబరాపడకండి.. నాకేం కాదు!” దృఢంగా చెప్పాడు అరవింద్.
తన కసి తీరిందని పైశాచిక ఆనందం పొందుతున్నాడు. ఒక ప్రాణం హరించినా పశ్చాత్తాపపడకుండా, నిబ్బరంగా ఉండగలుగుతున్న కొడుకు రాక్షస మనస్తత్వానికి కృష్ణవేణి మనసు వికలమైంది.
‘తప్పు చేసిన పిల్లలను చిన్నవయసులో దండించకపోతే, వయసు ముదిరాక అదుపు తప్పుతారని తెలిసీ అలక్ష్యం చేశాను. నా గారాబమే వాణ్ని చెడగొట్టింది. కొడుక్కు మంచి నడత నేర్పడంలో తల్లిగా నా బాధ్యత నిర్వర్తించలేక పోయాను’ అనుకుంటూ చెంపలు వాయించుకుంది కృష్ణవేణి.
అర్చన అమాయక ముఖం కళ్లముందు కనపడుతూంటే.. కృష్ణవేణి హృదయం ద్రవించింది. అరవింద్ మీద కోపం రగిలింది.
‘ఏం చేయాలా!?’ అని ఆలోచించసాగింది. ఎదురుగా గోడపై ఉన్న తైలవర్ణ చిత్రంలో అర్జునుడికి గీతాబోధ చేస్తున్న శ్రీకృష్ణ పరమాత్మ వైపు దృష్టి సారించింది. మందహాసంతో కృష్ణ పరమాత్మ తనకేదో సందేశమిస్తున్నట్లు అనిపించింది. అర్చనపై విషం చిమ్మినప్పడే అరవింద్ మృతప్రాయుడయ్యాడని ఆమెకు బోధపడింది. కర్తవ్యం స్ఫురించింది. సెల్ఫోన్ తీసి.. పోలీస్ స్టేషన్కు కాల్ చేసింది.
అరగంటలో పోలీసులొచ్చారు. తన ప్రాణానికి ప్రాణంగా పెంచిన అరవింద్ను కన్నతల్లే స్వయంగా పోలీసులకు అప్పగించింది.
“వాణ్ని ఉరితీయండి సార్!”.. అరిచింది కృష్ణవేణి.
అరవింద్తోపాటు కిరీటినీ పోలీసులు స్టేషన్కు తీసుకెళ్లారు. స్టేట్మెంట్ రికార్డు చేసుకుని కిరీటిని విడిచిపెట్టారు. రెండు గంటల తరువాత పోలీస్ స్టేషన్ నుంచి ఇంటికి బయల్దేరాడు కిరీటి.
‘అరవింద్ చేసిన నేరానికి తగిన శిక్ష పడుతుంది. అంతమాత్రాన అర్చన తల్లి కడుపుమంట చల్లారుతుందనుకోను. ఒక సంఘ విద్రోహ శక్తిని సమాజానికి అందించిన తల్లిగా నాకూ ఈ నేరంలో
భాగం ఉంది. ఏ చట్టానికీ చిక్కని నేరస్తురాలిని. నాకు నేను శిక్ష విధించుకుంటున్నాను’.. టేబుల్ మీద కృష్ణవేణి రాసిన లేఖ.
‘అరవింద్ చేసిన నేరానికి తగిన శిక్ష పడుతుంది. అంతమాత్రాన అర్చన తల్లి కడుపుమంట చల్లారుతుందనుకోను. ఒక సంఘవిద్రోహ శక్తిని సమాజానికి అందించిన తల్లిగా నాకూ ఈ నేరంలో భాగం ఉంది. ఏ చట్టానికీ చిక్కని నేరస్తురాలిని. నాకు నేను శిక్ష విధించుకుంటున్నాను’.. టేబుల్ మీద కృష్ణవేణి రాసిన లేఖ. ఎదురుగా ఫ్యాన్కు వేలాడుతున్న కృష్ణవేణి మృతదేహం..
పోలీస్ స్టేషన్ నుంచి ఇంటికి వచ్చిన కిరీటి.. ఆ రెండిటినీ చూస్తూ కొయ్యబారిపోయాడు.
ఇంద్రగంటి నరసింహ మూర్తి :99593 52900