జరిగిన కథ :ద్వీపరాజ్య రాకుమారుడు జాయప.. అనుమకొండలో ఉంటూ, ఒక్కో యుద్ధకాండనూ నేర్చుకుంటున్నాడు. తన గురువు నాగంభట్టు ద్వారా మిత్రుడు త్రిపుర శెట్టిని కలుసుకున్నాడు. అతను తాళపత్ర ప్రతుల ఉత్పత్తిదారుడు. ఒకనాడు అతనివెంట వెళ్లి తాళపత్ర అలేఖన పొత్తాల తయారీని చూశాడు. అప్పుడే తమ స్నేహానికి గుర్తుగా ఒక ఘంటం ఒరను జాయపకు కానుకగా అందించాడు త్రిపుర శెట్టి. మిత్రులంతా కబుర్లలో ఉండగా.. ఉరుము ఉరిమినట్లు వినిపించిందో గొంతు!
ఆ గొంతు కామిశెట్టిది. ఆయన త్రిపుర తండ్రి. ఆజానుబాహుడే కానీ, స్థూలకాయం వల్ల కదలలేని బండరాయిలా ఉన్న శరీరం. ఎడమ కన్ను మూసుకుపోయి, కుడికాలు కదలకపోవడంతో కర్ర పట్టుకుని నడుస్తున్న ఆయన.. చాలా వికారంగా ఉన్నాడు. అక్కడి పనివాళ్లపై చిర్రుబుర్రులాడుతున్నాడు. త్రిపుర నిర్వహిస్తున్న ఈ తాళపత్ర పొత్తాల తయారీ వ్యాపారం ఆయనకు ఇష్టంలేదు. మరింత లాభంవచ్చే వ్యాపారాలు చెయ్యాలని ఆయన అభిమతం.
“మా పెద్దోడు ఇనుము యాపారం. మా రెండోవాడు బంగారం, వజ్రాల యాపారం. మా పెద్దల్లుడు గుర్రాల దిగుమతి. అంటే.. ఏంటి!? అబ్బో.. కనకవర్షమే! ఇదేంది ముష్టి యాపారం. ఈ తాటాకులేంది? నాలిగ్గీసుకోడానికి తప్ప. ఏదో పజ్జేలు రాసుకునే పంతుళ్లు తప్ప.. మనకెందుకురా అంటే ఈ యదవ ఇంటల్లేదు. నువ్వయినా సెప్పు పంతులూ!” అంటూ అక్కడికి వచ్చాడు.
ఆయన ఆక్రోశం ఆయనది. విద్య వ్యాపారం కాలేదని ఆయన అభిప్రాయం. కానీ, అయ్యింది. ఆ విషయాన్ని తన తండ్రి గుర్తించడం లేదంటాడు త్రిపుర. ఇప్పుడిప్పుడే తెలుగుభాష లిపి కూడా కచ్చిత రూపం తీసుకుంటున్నది.
కవులు, లేఖకులు ఇప్పుడిప్పుడే వర్ణమాల, అక్షరాల రూపం చూసి, సంస్కృత గ్రంథాలను తెలుగులోకి అనువాదం చేసి చూసుకుని, మురిసిపోతున్నారు. కన్నడ, తమిళ భాషలు తెలుగు నుంచి వేరుపడుతూ స్పష్టత తేలుతున్నాయి. తెలుగు భాషకు కూడా సొంతలిపి అత్యంత సుందరంగా ఏర్పడుతున్నదని అందరూ మాట్లాడటం ఘటికాస్థానంలో జాయప విన్నాడు.. చూశాడు కూడా. తెలుగుభాష నిర్దిష్ట రూపం సంతరించుకుంటున్న కొద్దీ తాళపత్ర అలేఖనాల అవసరం ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్నది. ఈ వ్యాపార ఆలోచన బాగున్నప్పటికీ, వాళ్ల తండ్రిగారు ఎందుకు అభినందించడం లేదో తెలియలేదు జాయపకు.
అది ఆయన దృక్కోణం. పెద్ద పరదేశీ వ్యాపారి ఆయన. ఆయన సార్థవాహిని బయల్దేరితే అదొక పెద్ద జాతరే! వందల ఎడ్లబళ్లతో అది బరుకచ్చం వరకూ వెళ్లేది. అయినా ఆయన రక్షణకు ముమ్మూరు దండును నియమించుకునేవాడు కాదు. వ్యర్థం అనేవాడు. ఆయన వర్తక బిడారును అనేకసార్లు దొంగలు దోచుకున్నారు. ఆయన కన్ను లొట్టపోయింది. కుడికాలు విరిగింది. వైద్యంవల్ల, చాలాకాలం మంచంలో ఉండటం వల్ల ఆయన వ్యాపార సామ్రాజ్యాన్ని ఇతరులు ఆక్రమించుకున్నారు.
ఆయనకు ముగ్గురు పుత్రులు. వాళ్లకు నచ్చిన వర్తకం.. వాళ్లను చేసుకోనివ్వడు. పెద్దవాళ్లిద్దరూ ఈయనను వారి వ్యాపారాల దగ్గరికి రానివ్వరు. త్రిపుర రానిస్తాడు కాబట్టి.. తను చేసేవాటికి వంక పెడుతుంటాడు.
అక్కడి పరిస్థితి ఎలా ఉన్నా.. ఇలాంటి మరికొన్ని కుటీర పరిశ్రమలను చూశాడు జాయప. కారణం సుబుద్ధి కైజీతగాడు. ఇద్దరు తమ్ముళ్లు వర్తకం చేస్తుండగా.. మరో ఇద్దరు బలింజ సేనాలులు. మరొకరు పన్ను వసూలు నియోగంలో ఉద్యోగి. ఆరుగురూ ధనుర్విద్యలో ప్రవీణులు, బలింజవర్గాలలో మంచి గుర్తింపు ఉన్నవారు.
ఇలా పరిశీలిస్తూ, ఆశ్చర్యపోతూ సామాజిక చట్రాన్ని అవగాహన చేసుకుంటున్న జాయప కౌమార హృదయంలో మండే ప్రధానజ్వాల.. అతని అక్కలు పేరాంబ, నారాంబ అంతఃపురంలో బందీలుగా ఉండటం. ‘వారిని బంధ విముక్తులను చేసే మార్గం ఏమిటి?’ అదే అతని కుశాగ్ర బుద్ధికి అందడం లేదు. అలాంటిది జాయప ఏమాత్రం ఊహించని వార్త ఒకటి అతనికి అందింది.. ఆలస్యంగా! సుబుద్ధి ఇంట్లో ఉంటున్న జాయప.. చాలాకాలం తర్వాత మహాసేనాని మల్యాల చౌండ నగరికి వెళ్లాడు.
లోపలికి వచ్చిన జాయపను చూసి, మైలాంబ ఉత్సాహంగా ఆహ్వానించింది. అతను లోపలికి వచ్చేసరికి మైలాంబ, పద్మాక్షి ఇద్దరూ చెరో కుడ్యం వద్ద చెరో చిత్తరువును చిత్రిస్తున్నారు. భవంతి లోపల మొత్తం కొత్త కొత్త చిత్తరువులతో నింపేసింది మైలాంబ. ఇద్దరి చిత్తరువులను పరిశీలించాడు. ఆ చిత్తరువుల్లో విస్పష్టంగా కనిపిస్తున్న అంశం.. అందమైన ఆభరణాల చిత్రీకరణ. అదే అడిగాడు జాయప.
“అవన్నీ పద్మాక్షి చిత్రీకరణలు. పాత చిత్రాల్లోనూ కొత్త అలంకరణలు. ఇప్పుడు పద్మాక్షి మణికారుల వద్ద ఆభరణాల రూపకల్పన, తయారీ నేర్చుకుంటున్నది. అక్కడ నేర్చుకున్న కొత్త కొత్త రూపకల్పనలు ఇక్కడ నా పాత చిత్తరువుల్లో కొత్తగా చిత్రిస్తున్నది.. చూడు!” చెప్పింది మైలాంబ. కాటయ కూడా బయటికి వచ్చి జాయపను పలకరించాడు. ఎదిగిన కాటయ, యవ్వనవతి అయిన పద్మాక్షి.. జాయప కంటికి కొత్తగా కనిపిస్తున్నారు. అంతా ఒకరినొకరు చూసుకుని ఆత్మీయంగా మాట్లాడారు. కాటయ ధనువు చేపట్టి, బాణం విడిచే నైపుణ్యాలు కొన్ని చేసి చూపించాడు. జాయప నిజంగానే అబ్బురపడ్డాడు.
“ఓహ్.. కాటయా! నువ్వు నాన్నగారిని మించిన యుద్ధవిద్యా పారంగతుడవై, ఏదో నాటికి ఈ కాకతీయ సామ్రాజ్యానికి గొప్ప సేవలు అందించి మల్యాలవారి వంశఖ్యాతిని మరింత పెంచగలవు. నిజం!” ఉద్రేకంగా అన్నాడు జాయప. జాయప భాష.. మాట్లాడటంలో ప్రౌఢిమ వారిని ఆకర్షించింది.
“నీ భాష చాలా మారింది జాయప” అన్నది పద్మాక్షి.
“భాష మారడం కాదు పద్మాక్షి. జాయప యువకుడై స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నీ ప్రతిభను ఆనాడే మీ బాబాయిగారు గుర్తించారు జాయప. నువ్వు మరింత గొప్పవాడివి అవుతావు. ఇది తథ్యం!” అన్నది మైలాంబ.
అందరిలో ఆశ్చర్యానందం కలిగించిన అంశం.. జాయప రూపురేఖలు. దాదాపు రెట్టింపైన విగ్రహం, ముఖంపై ప్రస్ఫుటంగా కనిపిస్తున్న నల్లని నూనూగు మీసాలు, పురుషత్వాన్ని సూచిస్తున్న బొంగురు గొంతు, యుద్ధవిద్యలకు అనుకూలంగా బలిష్టమవుతున్న శరీరం, రాచనగరిలో కాకుండా సాధారణ కుటుంబ వాతావరణంలో నివసిస్తున్నట్లు తెలియజేస్తున్న నల్లబడిన శరీరవర్ణం. ముచ్చటగా బాల్యం దాటి యవ్వనఛాయల్లోకి జాయప వచ్చినట్లు గుర్తించి ముగ్ధులయ్యారు. పద్మాక్షి పరిపూర్ణ యవ్వనవతిగా.. రూపురేఖా విలాసాలలో, దుస్తుల్లో, అలంకరణలో, కదలికల్లో, పరిచారికలను పురమాయించడంలో అధికార ప్రతిభను వెలారుస్తుండటం జాయపకు మధురంగా ఉంది. తన అక్కలు ద్వీప రాజ్యంలో ఉంటే ఇలాగే ఉండేవారేమో..
“పద్మాక్షి తానొక బంగారు ఆభరణాల తయారీ పరిశ్రమ ఏర్పాటు చెయ్యాలని భావిస్తున్నది. సేనానుల వారేమో ఆభరణాల రూపకల్పన నేర్చుకో గానీ, పరిశ్రమ వద్దంటున్నారు!” చెప్పింది మైలాంబ.
“బాబయ గారు ఎక్కడ పిన్నిగారూ?!” అడిగాడు జాయప.
“ఆయన రాజనగరికి వెళ్లారు. అయినా వారి రాచ కార్యాలు అన్నీ నాకు చెప్పరు కదా జాయపా!?” అంటూ నవ్వింది మైలాంబ.
“ఆ .. జాయపా! ఈరోజు మాతో భోజనం చెయ్యాలి. నేనే వంటల నిర్వహణ” అన్నది ఉత్సాహంగా పద్మాక్షి.
“అవునవును.. మహావంటగత్తె! నువ్వే తిని ఆమెను మెచ్చుకోవాలి జాయపా!” అక్కను ఆటపట్టించాడు కాటయ.
“వాడు పీకలమొయ్యా తింటాడు. ‘అక్కా అక్కా! అది కావాలె! ఇది కావాలె!’ అని అడిగి మరీ వండించుకుని తిని.. ఇప్పుడు చూడు.. నీ దగ్గర ప్రగల్భాలు. నా వంట బాగోలేదని!” బుంగమూతి పెట్టింది పద్మాక్షి.
“నువ్వు నోరు ముయ్యరా కాటయా! పద్మాక్షి వంట నువ్వు తిని అప్పుడు చెప్పు జాయపా!” అన్నది మైలాంబ. జాయప కూడా నవ్వుతూ..
“నేనైతే తినకుండానే భలే భలే బాగుంది అని చెప్తాను.. పద్మాక్షి అక్కా!” అన్నాడు. అక్కడంతా నవ్వులు విరిసి కురిశాయి.
“ఆ.. జాయపా! త్వరలో పద్మాక్షికి పెళ్లి చెయ్యాలని మీ బాబయ గారు అభిలషిస్తున్నారు. ప్రయత్నాలు కూడా ప్రారంభించారు” అన్నది మైలాంబ.
ఉత్సాహంగా, అభినందనగా పద్మాక్షిని చూస్తూ చప్పట్లు చరిచాడు జాయప. సిగ్గుతో పరుగున లోపలికి పోయింది పద్మాక్షి. జాయపకు మళ్లీ అక్కలు గుర్తొచ్చారు. ద్వీప రాజ్యంలో ఉండి ఉంటే అక్కలపెళ్లి అంగరంగ వైభవంగా జరుగుతుంది. మనసంతా దుఃఖిత భావనలతో సంక్షుభితమైంది. వారు లోపల ఎలా ఉన్నారో తెలియదు. తనేమో ఇలా వీధులవెంట తిరుగుతున్నాడు. అతని ముఖం మ్లానమైంది. అప్పుడే గుర్తొచ్చినట్లు అన్నది మైలమ.
“ఆ.. జాయపా! ఇటీవల ద్వీపరాజ్యం నుంచి మీ పినతండ్రి గారు వచ్చారట. కప్పాల చెల్లింపు నిమిత్తం సంప్రతి రామూచతో సమావేశమయ్యారట. నీ గురించి వాకబు చేశారట. మీతల్లి గారు కొంచెం నలతగా ఉన్నట్లు.. నిన్ను తలచుకొని దుఃఖితులవుతున్నట్లు వారు చెప్పారట. మీ బాబయ గారు నాతో అన్నారు”.. చివ్వున లేచాడు జాయప.
“మరి.. మరి.. నాకెందుకు తెలియజేయలేదు?”.
“నిజానికి మీ బాబయగారు ఆరోజు రాజధానిలో లేరు. కొండిపర్తి వెళ్లారు. శాసనం పూర్తయ్యింది. చెరువు తవ్విస్తున్నారు కదా! వచ్చిన తర్వాత సంప్రతి రామూచ
చెప్పారట” అన్నదామె. బాధతో, అవమానంతో ఉగ్రుడయ్యాడు జాయప. దాదాపు రెండేళ్లు కావస్తున్నది. లోపల అక్కల పరిస్థితి తెలియదు. ఇక్కడ తను గాలిలో దీపంలా ఉన్నాడు. తనెవ్వరో చౌండ గానీ, సుబుద్ధి గానీ ఎవ్వరికీ చెప్పరు. తన బంధువర్గం ఇక్కడికి వస్తే కూడా.. తనకు తెలియజేయరు. ఉక్రోషంతో ముక్కుపుటాలు అదిరాయి. కనీసం తన తల్లి అనారోగ్యమైనా తనకు తెలియరాలేదు. తల్లి రూపం గుర్తొచ్చి జాయప కళ్లు నీటి చలమలయ్యాయి.
‘అమ్మా! అమ్మా!’ అంటూ అతని లేత హృదయం మౌనవేదనతో రోదించింది. నిరాశ, నిస్పృహ ముప్పిరిగొనగా వేగంగా బయటికి వచ్చేశాడు జాయప.
వెనుక మైలాంబ, కాటయ, పద్మాక్షి పిలుస్తున్నా ఆగలేదు. ఎటో వెళ్లాడు. ఎక్కడెక్కడో తిరిగాడు. వీధులు, కోట ప్రాకారాలు, అంగళ్లు, భవంతులు, నగరులు, సంతలు.. తిరిగిన చోటే తిరిగాడు. గమ్యం లేదు. ఎక్కడా ఆగింది లేదు. చూసింది లేదు. ఆకలి లేదు. దప్పిక లేదు. శూన్య దృక్కులు. కళ్ల వెంట ధారగా కన్నీళ్లు.. కళ్ల ముందు తల్లి. ఆమె రూపం. ఆమె నవ్వు. ఆమె ఏదో చెబుతున్నది. ఏదో తినమని ప్రాధేయపడుతున్నది. తండ్రి మందలిస్తే ఆమె తండ్రినే తప్పు పడుతున్నది. జాయపది తప్పు కాదంటున్నది. ఆమె ఒడిలో ఆమె చీరెలో దాచుకుంది. ఆ చీరెలో దాక్కోవడం భలేగా ఉంది.. తల్లి మధుర దృశ్యాల భావనలతో.. తిరిగి తిరిగి దారి పక్క ఓ బండపై కూలబడ్డాడు. మసకమసగ్గా చీకట్లు కమ్ముకుంటున్నాయి..
అదే దారిపై ఓ ఊరేగింపు సాగిపోతున్నది. వేలుపుర రాజధానిగా క్రీ.శ. 1000 నుంచి పరిపాలిస్తున్న హోయసల మహారాజులు ఇప్పటికి 958 ప్రదేశాలలో 1,500 దేవాలయాలు నిర్మించారు. వేలుపురలో నిర్మించిన చెన్నకేశవ దేవాలయం, ద్వారసముద్రం వద్ద నిర్మించిన కేశవ దేవాలయ సముదాయం వాటిలో తలమానికమైనవి. ప్రపంచం నలుమూలల నుంచి ఎందరెందరో శిల్ప, ఆగమ పండితులు నిత్యమూ ఆ ఆలయాలను సందర్శిస్తుంటారు. వాటిని నిర్మించిన స్థపతి జక్కనాచార్య వర్యులు. వారిని అనుమకొండకు ఆహ్వానించింది..
కాకతీయ ప్రభుత్వం. (సశేషం)