రైలు కదుల్తాంటే.. నేను నడుస్తూ, తూలి పడిపోతి మొదట్ల. ఒక రైలుల పంపించి.. మరో రైలులో దింపేటోడు. మస్తు పైసలు అచ్చేటియి.సాయంకాలం నన్ను ఇంటి దగ్గర దింపి.. అయ్యమ్మకు యాభై రూపాయలు ఇచ్చేటోడు.దినాం రైలు ఎక్కి రకరకాల మనుషులను చూడటం అలవాటయ్యుండే. పేచీ పెట్టకుండనే మొగిలయ్యతో ఎళ్లడం అలవాటు జేసుకున్న.
నేను పుట్టినప్పుడు నాకు ఏం పేరు పెట్టిండ్రో నాకు ఎరుకలే. అమ్మ.. ‘తల్లీ’ అని, అయ్య.. ‘బొమ్మా!’ అని, అయ్యమ్మ ‘బుడ్డదానా!’ అని, మొగిలయ్య ‘బతుకమ్మా!’ అని, ముగ్గురు అన్నలు ‘సెల్లి’ అని పిలిచేటోళ్లు.
మా అమ్మ, అయ్య బంగారం దుకాన్ల దగ్గర కాలువలో రజను తీసేటోళ్లు. చెత్త ఏరుకుని అమ్మేటోళ్లు. ఒక్కొక్కసారి.. “జుట్టుకు బదులు ఉల్లిగడ్డలు, మిఠాయి ఇస్తం!” అని ఇండ్లెంబడి తిరిగేటోళ్లు. రోజు గడవడానికి రకరకాల పనులు జేసేటోళ్లు.
ఒక్కోపాలి అయ్య బురదలో దిగి చేపలు పట్టి, వాటాలు బెట్టి అమ్మేటోడు. ఎన్ని జేసినా మాకు తిండి, బట్టా ఉండేటివి కాకుండే.మా అయ్యమ్మ మాతోనే ఉండేటిది. ఆమె ఎప్పుడూ అమ్మ మీద అయ్యకు ఏదోటి పితూరీలు జెప్పి, అమ్మను కొట్టించేటిది.
దెబ్బలు తిని అమ్మ ఏడుస్తాంటే.. అయ్యమ్మకు మస్తు ఖుషీ. అయ్యమ్మ నన్ను తన దగ్గిర పడుకో బెట్టుకుంటుండే. రాత్రిగాల అయ్యమ్మ చేసే పనులకు నిద్ర వచ్చేటిది లేకుండే నాకు. గందుకే.. అయ్యమ్మ దగ్గిర పండుకోవడం నాకు ఇష్టం లే.
అమ్మ పాలి గుడిసెలో పండుకోవాల్నని ఉండేటిది.
“అయ్యమ్మ దగ్గరికి పో!” అని తోసేటోడు అయ్య.
అమ్మ నాకు పొద్దుటే తల దువ్వి, పూలు పెట్టేటిది. అమ్మ, అయ్యా.. పనిలోకి బయటికి పోంగానే, అయ్యమ్మ మా పక్కటాల గుడిసెల ఆళ్లతో దాడి, సింత పిక్కలు ఆడేటానికి కూర్చుండేటిది.
నాకూ ఆ ఆటలు చూడటం మస్తు ఖుషీ.
అయ్యమ్మ నాకు చిరిగిన గౌను తొడిగి, పూలు పీకేసి, దూసిన జుట్టును చింపిరి జేసేటాళ్లకు..
“బతుకమ్మా!”.. అంటూ అచ్చేటోడు మొగిలయ్య. అయ్యమ్మ రెండు నువ్వు జీడీలు నా చేతిలో పెట్టి.. “ఇంక బయలుదేరు” అనేటిది. చిరిగిన బట్టలేసుకుంటేనే బిచ్చపోళ్లకు పైసలు ఏస్తరు. అందుకే నా గౌను ఎప్పుడూ చిరిగే ఉండేటిది.
రక్తబంధం గిట్లుంటాది? అసలు కన్నా వడ్డీ
ముద్దంటరే!..
అయ్యమ్మ చేతిలో నేను గుడియానే. అయ్యమ్మ సోపతి నాకు నచ్చేటిది కాదు.
“నేను మొగిలయ్యతో ఎళ్ల..” అని మారాం చేస్తుండే. ఏడ్వబట్టినా.. అయ్యమ్మకు జాలి లేకుండేటిది. మొగిలయ్యతో పంపేటిది.
“బతుకమ్మా! నే సెప్పేటిది ఇను బిడ్డా.. ‘రెండు రోజులైనాదమ్మా బువ్వతిని! బాంచన్ నీ కాళ్లు మొక్కుత! పాంచ్ రూపియా ఇయ్యుండ్రి’ అని జరంత నీరసంగా ముఖం పెట్టి అనాల!” అని తొడపాశం పెట్టేటోడు.
నే చెప్పింది ఇని..
“ఔ మల్లా! మస్తు జెప్పినావే బిడ్డా! అట్ల అడుక్కోవాలా..” అని నన్ను రైలులో దింపేటోడు.
రైలు కదుల్తాంటే.. నేను నడుస్తూ, తూలి పడిపోతి మొదట్ల. ఒకరైలుల పంపించి.. మరో రైలులో దింపేటోడు. మస్తు పైసలు అచ్చేటియి.
సాయంకాలం నన్ను ఇంటి దగ్గర దింపి.. అయ్యమ్మకు యాభై రూపాయలు ఇచ్చేటోడు.
దినాం రైలు ఎక్కి రకరకాల మనుషులను చూడటం అలవాటయ్యుండే. పేచీ పెట్టకుండనే మొగిలయ్యతో ఎళ్లడం అలవాటు జేసుకున్న.
* * *
ఒక దినం బాగా నీరసంగా ఉండే. మొగిలయ్యతో ఎళ్లనని మారాం జేసిన. అయ్యమ్మ చింత బరికతో వీపు మీద కొట్టుండే. అల్లాడి ఏడ్చుంటి. వీపు బాగా వాచిపోయుండే. పొద్దుగాల్న అమ్మ స్నానం జేయించేప్పుడు..
“తల్లీ! ఈపు మీదట ఈ వాతలేంటే?” అని.. అయ్యమ్మే కొట్టి ఉంటదని సమజయిన దానిలా, నా వైపు జూసి మస్తు ఏడ్చింది.
ఎప్పటిలాగే అమ్మ, అయ్య బయటికి ఎళ్లంగనే.. మొగిలయ్య అచ్చిండు. ఆ పొద్దు మస్తు వాన పడబట్టే.
“వాన సినుకు సుట్టే తెలంగాణ కోక.. మా తెలంగాణ గడ్డ మీన వాన చినుకు సిత్రం.. తుళ్లిపడే వాన జల్లు.. మా దిల్ లా ఖుషయితాదీ.. ఇచిత్రమే!”
అని హుషారుగా పాట పాడుతుంటి. ఎప్పుడొచ్చిండో.. మొగిలయ్య చప్పట్లు కొట్టబట్టినాడు నా పాట ఇని.
నా దిక్కు జూస్తూ..
“బతుకమ్మా! ఎంత మంచిగా పాడబట్టినావే! నీకు వచ్చిన పాటలు పాడుతూ డబ్బులడుగు! ఎక్కువ డబ్బులు ఏస్తరు!” అన్నడు.
“గీ దినం నేను రాను. వాన నీళ్లల్లో పడవలు ఏసి ఆడుకుంటా!” అంటిని.
“నీకు పాటల పుత్తకోలు కొంట బిడ్డా..” అంటూ నన్ను ఎత్తుకుండు.
రైలు ఎక్కిన. పాట షురూ జేసిన.
అందరూ నా దిక్కు చూడబట్టిండ్రు. అందరూ..
“శెభాష్ బిడ్డా! మస్తు టైంపాస్” అంటా డబ్బు ఇస్తున్రు. గా దినంకెల్లి నేను పాడుతా అడుక్కోబట్టిన.
ఏ విషయం అయినా ఒకమారు ఇంటే పట్టుడు నా దిమాక్లో ఉండే.
నా పాట రైలుల అందరికీ నచ్చేటిది.
“పోరి గొంతు మస్తు ఉంది.. పెద్ద అయ్యేటాలకు మంగ్లీలా పాడుతది”.. అనుకొన బట్టిన్రు.
“ఓ పోరీ! నీ పేరేంది?” అనేటోళ్లు కొందరు. “అడుక్కునే పిల్లా!” అని ఇంకొందరు అందురు.
ఎవరైనా నా పేరు అడిగిన్రనుకోండ్రి.. ‘బొమ్మ’ అనే చెప్పేటిదాన్ని.
“అవును.. బుట్టబొమ్మలా.. ముద్దుగున్నవు” అనేటోళ్లు వాళ్లు.
“ఈ పోరికి చక్కగా తలదూసి, మంచి బట్టలేసినమా మస్తుగుంటుండే!” అనుకునేటోళ్లు.
వాళ్లకేమెరుక.. మా అమ్మ నాకు సక్కని జడలేసి, ఆ జడలో పూలు పెట్టి తయారుజేస్తదని.
* * *
ఒక దినం ఏసీ బోగీలో అడుక్కుంటున్న. గప్పుడు ఒక పోరడు తెల్ల కాగితాల పుస్తకంలో బొమ్మలు ఏసుకుంటున్నడు. ఆ పోరనికి బరాబర్ నా వయసే ఉండొచ్చు. నేను ఆ బొమ్మలు జూస్తూ.. గక్కడ్నే ఆగిన. ఆ ఏస్తున్న బొమ్మను జూసిన. ఆ పోరడు నా కెల్లి జూసి..
“నీకు బొమ్మలు గీయడం వచ్చా?” అన్నడు.
“వచ్చు” అన్న.
“గట్లయితే ఎయ్యి” అన్నడు.
పక్కపొంటి వాళ్ల అమ్మ అనుకుంట.. గా పోరన్ని అన్నం తినమని బతిమాలి తినిపిస్తుండే.
“మామ్! ఐ యాం ఫుల్” అంటుండు ఆ పోరడు.
రోజూ ఏసీ బోగీలో అడుక్కోడంతో.. నాకూ ఇంగ్లీషు అబ్బింది.
‘గొప్పోళ్ల బిడ్డలు బువ్వ వద్దని మారాం జేసినా.. ఆళ్ల తల్లులు కుక్కి కుక్కి పెడుతరు’ అనుకున్న.
ఇంతట్లకే..
“నీ పేరేంది?” అన్నడు ఆ పోరడు.
నన్ను ఎవరెట్ల పిలుస్తరో అన్ని పేర్లూ జెప్పిన.
“పేర్లు రెండే ఉంటాయి. ఒకటి స్కూల్లో పేరు. ఇంకోటి ఇంట్లో పిలిచేటిది. నీకు ఇన్ని పేర్లా?” అన్నడు.
“గది సరే! ఫస్టయితే బొమ్మ ఎయ్యి”.. అని మళ్లా అన్నడు.
“నిన్ను చూసి ఏస్తాను” అనుంటి.
“నే ఈ కాగితంపై పట్టను గానీ.. ఇదిగో ఈ జామకాయ చూసి ఎయ్యి” అన్నడు.
నేను ఆ పోరని బొమ్మే గీసిన.
పక్కపొంటి ఉన్న ముసలామె వాళ్ల అవ్వ గావచ్చు..
“గమన్! గా పిల్ల అడుక్కోవాలి.. ఆమెను పోనీ” అన్నది.
నేను ఆమె మాటలు పట్టించుకోకుండ.. బొమ్మ గీసిన.
ఆ బొమ్మ చూసిన ఆ పోరడు ఆశ్చర్యంగా ముఖం పెట్టిండు. గాళ్ల అమ్మ, నాయిన ఆ బొమ్మను ఆ బోగీలో ఉన్న ఆళ్ల సోపతోళ్లందరికీ చూపించిండ్రు.
నాకు గమన్ బాబు.. రంగు పెన్సిళ్లు, తెల్ల కాగితాల పుస్తకం ఇచ్చిండు. ఆ బోగీలో అందరూ డబ్బు ఇచ్చి, ఎంతో మెచ్చుకున్నరు. సరస్వతీ దేవి కటాక్షం అన్నరు. అలా నేను ఏసిన గమన్ బొమ్మ.. ఒకరి చేతిలోంచి ఇంకొకరు తీస్కొని జూసుకుంట..
“గింత చిన్న వయసులో బొమ్మ మస్తు ఏసింది. అచ్చు గమన్ లెక్క కొడుతుండె బొమ్మ! అచ్చుగుద్దినట్టు దింపేసింది:” అని అన్నరు.
“నువ్వు పాటలు కూడా మస్తు పాడుతున్నవు. మాతో వస్తావా? బాగా చదివిస్తాం” అన్నడు గమన్వాళ్ల నాయిన.
“అమ్మను సూడకపోతే బుగులైతాది. నేను రాను” అని చెప్పిన.
“ఈ పైసల్ ఎవరికిస్తవు?” అనడిగింది గమన్ వాళ్ల అమ్మ.
“మొగిలయ్య తీస్కుంటడు” అన్న.
“మొగిలయ్య యెవరూ?” అని మళ్లా అడిగింది.
దాంతోని నా ముచ్చట మొత్తం జెప్పిన. అంతా ఇన్నంక..
“అయ్యో పాపం! ఎంత అన్యాయం. మొగిలయ్య లాంటివాళ్లను నిలువునా నరికి పాతేసినా పాపం ఉండదు! ఈ పిల్ల కష్టం ఆడు గుంజుతుండు” అని కోపానికి అచ్చిండ్రు.
“నువ్వు ఇయ్యాల అచ్చిన పైసల్ మీ అమ్మకు ఇయ్యి. మస్తు పాడుతున్నవు జరంత మంచి పాటలు నేర్చుకో” అని చెప్పిండ్రు.
ఆ రోజు మస్తు పైసల్ వచ్చినయి.
‘అవును! ఈ పైసల్ అమ్మకే ఇయ్యాలే. మంచి చీర కొనుక్కుంటది’ అనుకొంటి.
నేను ఏసుకున్న లాగుల ఆ పైసల్ దాచిన. మస్తు ఖుషీ అయిన. పాడుకుంట ఇంటికిపోయిన. పుస్తకం, పెన్సిల్ దిక్కు గట్లనే చూడబట్టిన.
ఇన్ని దినాలూ మస్తు పైసల్ సంపాదించి ఉంటి. కానీ, దాచి అమ్మకియ్యాల్ననే ఆలోచన దిమాక్ల లేకుండే!
* * *
అమ్మ నా కోసం పూలు తెచ్చింది.
“అమ్మా! పూలు పెట్టు” అని మారాం జేసిన.
‘పండుకునేటేల ఎందుకే తల్లీ! నిద్రపోతే నలిగిపోతాయి. బయట గుడిసె మీద పెట్టి పొద్దుగాల పెడతాలే!” అంది.
“సరేలే!” అన్న.
లాంతరు బుడ్డి ఎలిగించి దగ్గర పెట్టుకుని.. అమ్మను చూసుకుంట ఆ పుస్తకంల ‘అమ్మ బొమ్మ’ గీసిన. దాన్ని చూసి అమ్మ మస్తు సంబురపడ్డది.
“నేనెప్పుడూ పోటో దిగలే! అచ్చు నాలాగే గీసినావు! నా కళ్లల్లో కెల్లి సూసి మాట్టాడుతున్నట్టు గీసినావ్” అన్నది అమ్మ.
‘మా అయ్యమ్మ సూడకుండా అమ్మకు పైసలు ఇయ్యాల. ఎట్ల ఇయ్యాల?’ అని అనుకున్న.
అయ్యమ్మ కల్లు తాగనీకి బయటికి ఎల్లుండే. గప్పుడు ఎవరూ సూడకుండా అమ్మకు పైసలిచ్చిన.
“అమ్మా! నువ్వు ఆకాశం రంగు చీర కొనుక్కో” అని చెప్పిన.
అమ్మ కళ్లల్లో నీళ్లు నిండినాయ్. వస్తున్న కన్నీళ్లు తుడుసుకుంటూ..
“తల్లీ! గిన్ని పైసల్ ఎట్ల అచ్చినయ్?” అని
అడిగింది.
“అమ్మా! శానాకాలంగా నన్ను అయ్యమ్మ అడుక్కోడానికి పంపి పైసలు తీసుకుంటున్నది” అని చెప్పిన.
దానికి అమ్మ మస్తు ఏడ్చింది.
నన్ను అయ్యమ్మ కొడ్తదని.. అయ్యమ్మను అమ్మ అడగలే. అయ్యకూ చెప్పలే.
* * *
పొద్దుగాల్నే నిద్రలేచి.. బొమ్మలు గీసిన పుస్తకం చూసుకున్న. అమ్మ బొమ్మ, అయ్య బొమ్మ, అన్నల బొమ్మలు.. ఆ పుస్తకంలో ఏసుకుని చాలా సంబురపడ్డా.
అమ్మ నన్ను దగ్గరికి పిలిచి, తలనిమిరి,
ముద్దు పెట్టి..
“నువ్వు అడుక్కోడం నాకు ఇష్టంలే తల్లీ! మీ అయ్యకు సెబుతా. నువ్వు అడుక్కోడానికి ఎల్లకే!” అన్నది ఏడుత్తా.
“అయ్యమ్మ! అయ్యకు తాగనీకి పైసల్ ఇస్తది. తాగినంక నిన్ను కొడ్తడేమో.. నువ్వు ఏడ్వకు అమ్మా!” అన్న.
ఎప్పటిలానే మొగిలయ్య అచ్చిండు.
“నేను అడుక్కోడానికి ఎల్ల” అని మారాం జేసిన.
అయ్యమ్మ నన్ను బాగా కొట్టి, బూతులు తిట్టి..
మొగిలయ్యతో పంపింది. ఆ రోజు ఎప్పటిలానే మొగిలయ్యతో ఎల్లిన.
జరంత పెయ్యి కాలబట్టె. పక్క స్టేషన్లో దిగాల్సిన నేను.. రైలులోనే నిద్రపోయిన. రైలు ఎళ్లి పోయింది. నాకు మెలుకువ వచ్చేసరికి అక్కడ అందరూ దిగిపోతున్నరు. నేను కూడా అక్కడే దిగిన.
నాకు బాగా జ్వరంగ ఉన్నది. అక్కడే స్టేషన్లో పండుకున్న.
‘కరోనా కాబట్టి ఇక రైళ్లు తిరగవు’ అని అందరూ అంటుండ్రు. గింతల్నే నాకు జ్వరం ఎక్కువాయే. ప్లాట్ఫాం పైనే ఒళ్లు తెలియక నిద్రపోయిన.
నాకు మెలుకువ వచ్చేసరికి ఆ స్టేషన్ మాస్టరు ఇంట్లో ఉన్న. కరోనాతో లాక్డౌన్ పెట్టిండ్రు. రైళ్ల రాకపోకలు లేవాయే.
‘దేవుడు నా పైన జాలితో వాళ్ల ఇంట్లో ఆశ్రయం ఇచ్చిండ్రు’ అనుకున్న. వాళ్ల ఇంట్ల నా అంత పాప ఉండె. పేరు రూపసి. నేనంటే చాలా ఇష్టం.
అమ్మ గుర్తొచ్చి రోజూ ఏడ్చేటిదాన్ని.
నా డ్రాయింగు పుస్తకంల అమ్మ బొమ్మను చూసుకునే దాన్ని. వాళ్లింట్లో వాళ్లకు నా బొమ్మలు, నా పాటతోనే లాక్డౌన్లో మస్తు టైం పాస్. రెండు నెలల లాక్డౌన్ సమయంల నేను వాళ్లింట్లో టీవీ చూసి, చాలా పాటలు నేర్చుకున్న. కానీ, నా మనసంతా అమ్మే.
‘ఎప్పుడెప్పుడు లాక్డౌన్ ఎత్తేస్తరా?! అమ్మను సూద్దామా!’ అని ఉండేటిది.
‘అమ్మకు నేను నేర్సుకున్న పాటలన్నీ పాడి ఇనిపియ్యాలే!’ అని అనుకునేటి దాన్ని.
ఏడుపొస్తే రాత్రి దుప్పటి కప్పుకొని ఏడ్చేటిదాన్ని. లాక్డౌన్తో పని అమ్మాయి రావడంలే. నేనే గిన్నెలు తోమి, ఇల్లు ఊడ్చి వారికి పనిలో సాయం జేసిన.
లాక్డౌన్ ఎత్తేసిండ్రు. ఆ రోజు నాకు మస్తు ఖుషీగ ఉండే. ఆ స్టేషన్ మాస్టరు టిక్కెట్టు కొని రైలు ఎక్కించిండు.
“బొమ్మా! వెళ్లగానే మా అమ్మ నంబర్కు ఫోన్ చెయ్యి” అన్నది రూపసి.. రైలెక్కే ముందు.
* * *
రైలు మా ఊరిల ఆగింది. నేను రైలు దిగి నడవడం లేదు. లేగ దూడలా చెంగు చెంగున ఉరుకుతూ.. మేము ఉండే గుడారాల దగ్గరికి పోయిన. అక్కడ మా గుడారాలు ఒక్కటి కూడా లేకుండె. కరోనా టెస్టుల కోసం చెక్క గదులు వరసగా కట్టిండ్రు. గవ్విటిని చూసిన నాకు ఏడుపు ఆగడం లే. ఆ చుట్టుపక్కల అంతా తిరిగిన. ఎక్కడా నాకు ఎరుక ఉన్నోళ్లు కనిపించలే. తిరిగి తిరిగి యాష్టకొచ్చె. ఎస్టీడీ బూత్కు పోయిన. రూపసికి ఫోన్ చేయాల్నని.. ఫోన్ నంబర్ ఉన్న చిన్న కాగితం ముక్క చేత్తో పట్టుకుని చాలాసేపు తిరగడంతో.. చెమటకు ఆ కాగితం తడిసిపోయి నంబర్లు కనిపించలే. అంకెలన్నీ అలుక్కుపోయినయి!
.. జీవితంలో ఒక్కచోట పేరుకున్న కష్టాల్లా ఉంది నా పరిస్థితి.
శూన్యంలకు చూస్తున్న నా దగ్గరికి మొగిలయ్య వచ్చిండు.
“బతుకమ్మా! ఏమైనవే గిన్నాళ్లు?” అన్నడు.
“మా అమ్మావాళ్లు ఎక్కడా?” అని అడిగిన.. ఆశగా.
“నాకు తెల్వది. బతుకమ్మా! పద రైళ్లు వచ్చే సమయం అయింది” అన్నడు.
‘బొమ్మా! నీకు మంచి జీవితం ఉంది. నీ చేతిలో మంచి కళ ఉంది. మంచి గాత్రం ఉంది. కష్టపడు. అడుక్కోకు!’ అన్న స్టేషన్ మాస్టరు మాటలు యాదికొచ్చినయి.
‘అవును నేను గొప్పదాన్ని అవ్వాల. అమ్మకు నేను అడుక్కోడం ఇష్టంలే’ అని అనుకున్న.
‘కళ అంటే సంపద. కళ మనిషికి గౌరవాన్ని ఇస్తుంది’ అని టీవీలో ఇన్నాను. ఆ మాటలు నా చెవుల్లో మారుమోగుతున్నయ్.
“మన బతుకు మనదే కాదు. మన బతుకు ఎదుటివాళ్లకు ఉపయోగపడాల. ఈ ఊరికి ఉపయోగపడాల. మన దేశానికి ఉపయోగపడాల. ఈ దునియాకే ఉపయోగపడాల. శానామంది అవయవాలు లేకపోయినా కష్టపడి.. గొప్పోళ్లు అవుతుండ్రు. నేనూ కష్టపడాలే. ఈ అడుక్కునే బతుకు నా జీవితాన్ని బర్బాద్ చేస్తది. ఈ బతుకమ్మ ఇక నీతో రాదు మొగిలయ్యా! నేను బతుకమ్మను.. అవును ఎందరికో బతుకునిచ్చే అమ్మను అవుతా!” అని.. అమ్మ బొమ్మ చూస్తా దౌడు తీస్తుండా.
దూరంగా.. ‘కృషి ఉంటే మనుషులు రుషులవుతారు.. మహా పురుషులవుతారు!’ పాట వస్తున్నది.
డాక్టర్ శ్రీదేవీ శ్రీకాంత్ స్వస్థలం హైదరాబాద్. ప్రస్తుతం ఆఫ్రికాలోని బోట్స్వానా దేశంలో ఉంటున్నారు. ఐదు పీజీలు, రెండు పీహెచ్డీలు (క్లినికల్ సైకాలజీ, ట్రాన్స్లేషన్ స్టడీస్) చేశారు. ప్రస్తుతం క్లినికల్ సైకాలజిస్ట్గా పనిచేస్తున్నారు. ఇప్పటివరకూ 150కిపైగా కథలు, రెండు వందలకుపైగా గజల్స్, రెండు వందలకుపైగా కవితలు, అనేక నానీలు, భక్తి పాటలు, హైకూలు, జానపద పాటలు రాశారు. ఆంగ్ల కవితలు, సైకాలజీలో నాలుగు పుస్తకాలు (ఆంగ్లంలో) తీసుకొచ్చారు. మానసికతత్త్వానికి సంబంధించి మూడు పుస్తకాలు వెలువరించారు. గజల్స్, కవితలు, ఆంగ్ల కవితల పుస్తకాలను ప్రచురించారు. మరికొన్ని కథల పుస్తకాలు ప్రచురణకు సిద్ధంగా ఉన్నాయి. రేడియోలోనూ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. కథలపై లోతైన సమీక్షలు చేస్తుంటారు. సాహిత్యంతోపాటు చిత్ర లేఖనంలోనూ అనేక బహుమతులు, సన్మానాలు అందుకొన్నారు. కూచిపూడి, భరతనాట్యం, వీణ వాద్యంలో ప్రావీణ్యం సాధించారు.
డాక్టర్ శ్రీదేవీ శ్రీకాంత్
+26776279761
‘నమస్తే తెలంగాణ, ముల్కనూరు ప్రజాగ్రంథాలయం’ సంయుక్తంగా నిర్వహించిన ‘కథల పోటీ-2021’లో రూ.5 వేల బహుమతి పొందిన కథ.