‘నమస్తే తెలంగాణ, ముల్కనూరు ప్రజాగ్రంథాలయం’ సంయుక్తంగా నిర్వహించిన ‘కథల పోటీ-2022’లో విశిష్ట బహుమతి పొందిన కథ.
“ఆడదంటే అమ్మయేను..
సృష్టికే భువి తాను…
పతి సేవల ఓర్పు తాను..
ఇరుతనువులు ఒక్కటవ్వ నెలతప్పును..
బిడ్డ పెరుగు గర్భంలో.. అండమవ్వును పిండంగా..
తొలిరూపం మలిరూపం.. నవమాసపు అడుగుల్లో ఎన్నెన్నో వింతలాయే..
చిమ్మ చీకటి కడుపులోనా బిడ్డ తన్నులు గిలిగింతలు..
ఆలి అవ్వును అమ్మగాను!”.. శూన్యంలోకి చూస్తూ, పాట పాడుకుంటూ నడుస్తూ ఉన్నది తులసమ్మ. ఆమె చేతులకు బేడీలు వేసి ఉన్నాయి.
రాధమ్మ తరఫు న్యాయవాది రాజయ్య. కోర్టు బోనులో ఉన్న తులసమ్మ వైపు తిరిగి..
“రాధమ్మ బిడ్డను దురుద్దేశంతో చంపినట్లు నీపైన అభియోగం ఉంది” అన్నాడు.
ఎన్ని ప్రశ్నలు వేసినా..
“చనిపోయిన బిడ్డే పుట్టాడు. నేను ఏ పాపం ఎరుగను!” అనే సమాధానం చెప్పసాగింది తులసమ్మ.
తులసమ్మ తరఫున వాదిస్తున్న యాదగిరి.. ముప్పై సంవత్సరాల క్రితం తులసమ్మ పురుడు పోసిన, శాంత కొడుకు. పేరుమోసిన క్రిమినల్ లాయర్. కేసు విచారణలో ఉంది. తులసమ్మను జైలులో పెట్టారు. తులసమ్మకు యావజ్జీవ కారాగార శిక్ష పడవచ్చని అందరూ అనుకుంటున్నారు.
“అమ్మా! నువ్వు లేకుండా ఎట్ల బతికేది?” అని హృదయ విదారకంగా ఏడ్వసాగారు తులసమ్మ కొడుకులు, కూతురు పద్మిని.
“భగవాన్! నిత్య కైంకర్యాలలో నీకు ఏలోటు చేశానయ్యా? నా తులసికి ఎంతటి శిక్ష వేశావు తండ్రీ!” అంటూ ఏడ్వసాగాడు తులసమ్మ భర్త.
“లోకాలన్నీ ప్రణవం నుంచే ప్రభవించాయంటారు. మనలోని పరమాత్మ ప్రణవనాదమే! బ్రహ్మను కారాగారంలో బంధించి షణ్ముఖుడు సృష్టి చేయడానికి ఉపక్రమించ సంకల్పిస్తాడు. శివుడు షణ్ముఖుణ్ని వారించి.. ‘ఎవరి పనులు వారే చేయాలి. బ్రహ్మను ఎక్కువ కాలం కారాగారంలో ఉంచరాదు. వెంటనే విడుదల చేయండి. సృష్టికి విఘాతం కలిగించవద్దు!’ అని చెబుతాడు”..
జైలు గదిలో మాండూక్యోపనిషత్తు చదువుతూ ఉన్నది తులసమ్మ.
ఇంతలో.. జైలులోని పక్క గదినుంచి స్త్రీ ఏడుపు వినిపించసాగింది.
తులసమ్మకు ఆ ఏడుపును బట్టే అర్థం అయ్యింది.. ‘అది పురిటి నొప్పుల వేదనా భరిత రోదన!’ అని.
హత్యా నేరం కింద జైలులో ఉన్న ఖైదీ నీలమ్మ నాడి చూసి..
“రెండు నిమిషాల్లో కానుపు కాబోతున్నది” అంటూ కవల బిడ్డలకు ప్రసవం చేసింది తులసమ్మ. జైలు అధికారిణి సీత అభ్యర్థన మేరకు!
సమయానికి తులసమ్మ చేసిన కాన్పు గురించి జైలులో అందరూ మాట్లాడుకోసాగారు.
తులసమ్మ ఆలోచనలు మాత్రం గతంలోకి మళ్లాయి.
మరాఠా సింహాసనాన్ని అధిష్ఠించిన ప్రముఖ రాజుల్లో ఛత్రపతి రాజర్షి షాహూ మహారాజ్ చాలా గొప్పవాడు. ప్రజాస్వామ్యవాది. సంఘ సంస్కర్త. నిమ్న కులాలు, కులేతర సమూహాలకు రిజర్వేషన్ వ్యవస్థను, అందరికీ విద్య వంటి ప్రగతిశీల విధానాలను అమలు చేశాడు. అంబేద్కర్తో కలిసి ఎన్నో ప్రజాహిత సంస్కరణలు చేశాడు. రాజర్షి షాహూ ఆస్థానంలో మహదేవ్ దేశాయ్ కోశాధికారి. 19వ శతాబ్దంలో ఈ రాష్ట్రాన్ని బ్రిటీషు వారు స్వాధీనం చేసుకోవడంతో మహదేవ్ దేశాయ్.. రాత్రికి రాత్రే కట్టుబట్టలతో, భార్య తులసీబాయిని, ఆరుగురు కొడుకులు, ఒక్కగానొక్క కూతురు పద్మినిని తీసుకొని కొల్హాపూర్ నుంచి ఆదిలాబాద్ పరిసర గ్రామం, రాధానగరికి చేరుకున్నాడు. భార్య తులసీబాయి ఒంటి మీద నగలు అమ్మి అక్కడే నివాసం ఏర్పరచుకున్నాడు.
“తులసీ! వేదాలు, వేదాంగాలు, ఎన్నో పౌరాణిక గ్రంథాలను అధ్యయనం చేసిన నాకు ఈ ఊరి దేవాలయంలో అర్చకునిగా కొలువు దొరికింది. పిల్లల చదువుకు ఈ ఉద్యోగం ఎంతో ఆసరా! మనం పిల్లలకు చదువు ఇస్తే.. గుప్తధనం ఇచ్చినట్టే!” అన్నాడు భార్యతో మహదేవ్ దేశాయ్.
“ఎంత శుభవార్త చెప్పారండీ!” అంటూ.. తమల
పాకుకు వక్కా – సున్నం రాసి, భర్తకు తాంబూలం అందించింది.
భర్త పాదాలు ఒత్తుతూ..
“ఏమండీ! ఈరోజు ఏమయ్యిందంటే!.. దిగుడు బావి దగ్గర పురిటి నొప్పులతో మెలితిరిగి పోతున్న
ఒకామెకు నేను కాన్పు చేశాను!” అన్నది.
“నువ్వు కాన్పు చేశావా? తులసీ!”.
“అవునండీ! కాన్పులో సహకరించే మంత్రసాని లేక ఎందరో మహిళలు చనిపోతున్నారని విన్నప్పటి నుంచీ.. ఈ ఊరిలో వారికి కాన్పులు చేయడంలో సహకరించాలని ఉందండీ. కలిగినవారు ఇంతో అంతో ఇస్తారు. సర్దుబాటు జీవితంలో భార్య, భర్తకు చేదోడు వాదోడుగా ఉంటే జీవనానికి లోటుండదు. ఏమంటారు?”.
“తులసీ! నిప్పులు కడిగే వంశంలో పుట్టిన నీతో”.. అంటున్న భర్తను, మాట మధ్యలో ఆపి..
“ఏమండీ! పిల్లల భవిష్యత్తు ముఖ్యం. కొల్హాపూర్ నుంచి ఈ ఊరు వచ్చిన మీరు.. ఇప్పుడు మహదేవ్ ఆదిలాబాద్గా చెలామణి అవుతున్నారు. నాపేరు తులసీబాయి నుంచి తులసమ్మ అయ్యింది. కులాలు, మతాలు మనిషి పెట్టుకున్నవని మీరే చెబుతారు. ఎందుకండీ ఈ భేషజాలు!?”.
“నిజమే! బ్రహ్మ సృష్టికి ప్రత్యక్షంగా మంత్రసాని రక్ష. ప్రసవానికి సాయం చేసి తల్లీ బిడ్డలను కాపాడితే.. వంశోద్ధారకుణ్ని ఇచ్చి తరతరాలను వెలిగించినట్లే! సాని పదంలోనే ఎంతో పవిత్రత ఉంది. ఆమె స్వామిని. మంత్రం అంటే దేవతకు శబ్దరూపం. ప్రతి ఇంటికీ తులసి మొక్క ఎంత పవిత్రమైందో.. అలాగే సృష్టి వికాసానికి మంత్రసాని కొనియాడ తగింది. నిరభ్యంతరంగా నీ వృత్తి ధర్మాన్ని నిర్వర్తించి.. మంచి పేరు తెచ్చుకోగలవు” అన్నాడు.
భర్త అనుమతి పొందిన తులసమ్మ.. ఆ చుట్టుపక్కల గ్రామాల్లో వేలాది కాన్పులు చేసి, అందరి మన్ననలను పొందసాగింది.
“ఓర్చుకో బిడ్డా! మన ఆడ జన్మకు ఇక్కట్లు తప్పవాయె! గట్ల ఏడ్వకే!”..
కూతురు శాంతను ఓదార్చుతూ, నుదుటి చెమట తుడవసాగింది బాయమ్మ.
“తులసమ్మ ఇంక రాలేదానే.. అమ్మా! మస్తు నొస్తాంది. భరించుడు నాతో అయితలేదే!”..
నొప్పులతో నులక మంచంలో మెలితిరిగి పోసాగింది శాంత.
‘దేవుడా! తల్లి కడుపుల బిడ్డ పడ్డసందీ ఆడదాన్కి పురిటి నొప్పులు శాపమేనాయే.. జన్మనిచ్చుడంటే చావు రుచి చూసుడేనా!?’ మనసులో అనుకుంటూ.. ప్రసవవేదన పడుతున్న కూతురి వైపు చూస్తూ నిట్టూర్చింది బాయమ్మ.
“అమ్మా! గొంతుల తడి ఆరిపోబట్టే. తొడలిరిగినట్లు అనిపిస్తున్నయి. నడుము పగిలి పోబట్టే!” మూలుక్కుంటనే అంటున్నది శాంత.
“గట్ల ఒర్రకే! బలం పోద్ది. ఓర్చుకోవాల. నేను మొదట్ల గిట్లనే ఏడ్చుంటి. నువ్వు మస్తు దొడ్డుగ పుట్టినవు. కాన్పు కాడానికి మస్తు పరేషాన్ అయ్యుండే. నేనూ ఇట్లనే కేకలు పెట్టి ఏడ్చుంటి. సావు కండ్ల ముందట నిలిచినట్లు అనిపించేటిది. మీ అమ్మమ్మ నా పొట్టకు ఆముదం మర్దన జేసి సముదాయించేటిది. ‘ఓర్చుకో బిడ్డా!’ అనేటిది. అదే మాట తిప్పితిప్పి అనేటిది. సచ్చి పోతున్ననని ఆడది గుబులు వడితే.. గింతమంది మనుషులు పుట్టేటోళ్లే కాదు. ప్రసవం అంటే.. ఆడదానికి మరో జన్మమేనాయే!” అంటున్నది బాయమ్మ.
ఇంతలో తులసమ్మ రావడంతో ఆమె ముఖం విప్పారింది.
“ఉరికిరా తులసమ్మా! బిడ్డకు నొప్పులోర్చు కొనుడు కష్టమాయే. తొలి కాన్పాయే.. మస్తు పరేషాన్ జేయబట్టే!”.
తులసమ్మను చూసిన శాంత మరింత గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది.
తులసమ్మ శాంత నాడి చూస్తూ..
“సమయానికే వచ్చాను. నీకు కాన్పు అవ్వబోతుంది. కాస్త ఓర్చుకో!” అన్నది
శాంత చెల్లెళ్లు గుడిసె బయట ఇత్తడి పళ్లాలు తీసుకుని వాయించసాగారు.
“ఇరుగు పొరుగు వాళ్లను అడిగి నూలు సీరలు తెచ్చుంటి!” అంటూ పాత నూలు చీరలు తులసమ్మకు ఇచ్చింది బాయమ్మ.
రెండు చేతులకు ఆకు పసరు రాసుకుని, చేతులు శుభ్రంగా కడుక్కుంది తులసమ్మ. చీరలను ముక్కలుగా తుంచింది.
శాంత చీర తీసి, లంగా బొందు వదులు చేసిన తులసమ్మ.. శాంత కాళ్లుపైకి వంచి, రెండు కాళ్లనూ వెడల్పు చేసింది. ప్రసవ వేదనతో శాంత మధ్య మధ్యలో..
‘అమ్మో అయ్యో!’ అంటూ గట్టిగా అరవ సాగింది.
శాంత మర్మస్థానం నుంచి నేలవైపు ముఖంతో బాహ్య ప్రపంచంలోకి వస్తున్న బిడ్డ తలను చాక
చక్యంగా పట్టుకున్న తులసమ్మ ఏకాగ్రత అంతా బిడ్డ తలమీదే ఉంది. బిడ్డ తల బయటికి వచ్చింది.
జాగ్రత్తగా తల పట్టుకుని, కాస్త కిందికి నొక్కింది. అలా నొక్కగానే బిడ్డ ఎడమ భుజం బయటికి వచ్చింది. వెంటనే బిడ్డ తలను కాస్త పైకి ఎత్తింది. అలా ఎత్తగానే.. కుడి భుజం బయటికి వచ్చింది. బిడ్డను జాగ్రత్తగా బయటికి తీయసాగింది. రెండు కాళ్లూ జాగ్రత్తగా పట్టుకుంది.
“నేలవైపే బిడ్డ ముఖమూ..
నేలతల్లితో మంతనాలు..
పుట్టుకనే చుట్టరికం.. నేల పైననే ఆవాసంనేల సాగు పంటలన్నీ పొట్ట నింపును..
చావులోన భూమి పొరల తనువు కరుగు”.. అని పాట పాడింది బిడ్డ ముఖంలోకి చూస్తూ..
“మాయ చుట్టిన మాయ బతుకు నుంచి ఈ లోకానికి వచ్చిన నువ్వు బాగా చదివి గొప్పోడు అవ్వాలి. నీ వంశం వృద్ధి అవ్వాలి” అని ఆశీర్వదిస్తూ.. గుడ్డతో బిడ్డ ఒళ్లు శుభ్రం చేసింది.
బిడ్డ వీపుపైన ఒక్క చరుపు చరిచింది.
అంతే, బిడ్డడు ఏడవడం మొదలు పెట్టాడు.
“జీవితంలో ఎన్నో దెబ్బలు తగులుతూ ఉన్నా.. శ్వాసే మనిషికి జీవం. ఈ దెబ్బ జీవితంలో నీ ఉనికి తెలియచేస్తుంది”.
బిడ్డ ముఖం కందగడ్డలా ఎర్రగా అయ్యింది.
“ఈ ఎరుపు మన జీవన సమరానికి గుర్తు”..
తులసమ్మ తాత్వికత ఆమె జ్ఞానానికి చిహ్నం.
“బిడ్డను చూస్తూ.. మొగ బిడ్డడే!” అన్నది శాంత. విస్మయం నిండిన స్వరంతో.
“మనవడు పుట్టిండు!” అనుకుంటూ బయటికి వెళ్లింది బాయమ్మ.. అందరికీ చెప్పడానికి.
బిడ్డ బొడ్డుతాడుకు నార దారం కట్టి, మధ్యలో చిన్న పదునైన బెరడుతో కోసి.. పత్తిలో పసరువేసి కట్టుకట్టింది.
కంటి దగ్గర, చెవిలో, నోట్లో శుభ్రమైన దూదితో తుడిచింది. గుడ్డ నలిపి ముక్కులో పెట్టేసరికి.. పెద్దగా రెండుసార్లు తుమ్మాడు.
“మా పెద్ద గొంతే.. యాదగిరిది!” అంటూ నామకరణం చేసింది.
బిడ్డకు నువ్వుల నూనె మర్దన చేసి, నలుగు పిండితో స్నానం చేయిస్తూ..
“ఈ నీళ్లు మన శరీరంలో అధిక భాగం ఉండి మనకు తేజాన్ని ఇస్తాయి”.
సాంబ్రాణి పొగ వేస్తూ..
“ఈ వేడి.. మనలో వేడి ఉన్నంత వరకే ప్రాణి. ఈ పొగ మన జీవితంలో చెడును పోగొడుతుంది. మన శరీరం పాంచ భౌతికం” అన్నది.
బిడ్డలకు అర్థం కాకపోయినా తులసమ్మకు బిడ్డలతో మాట్లాడటం సరదా.. తాను చేసిన కాటుకను బిడ్డకు, తల్లికి పెట్టింది. పిల్లాడికి సిలాయి బొట్టు పెట్టింది.
“ఆడపిల్లలకు ఎలా ఉన్నా పర్వాలేదు. మొగపిల్లాడు. పత్యం బాగా చెయ్యాలి” అంటూ శాంత రొమ్ములను శుభ్రంగా తుడిచి.. కాస్త నొక్కింది. పాలు రావడం లేదని.. మరొక్కసారి నొక్కింది. పాలు పైకి చిమ్మాయి. చను మొనను పిల్లాడి నోటికి అందించింది. ఏదో
వెతుక్కుంటున్న వాడిలా.. నోరు అటూ ఇటూ కంగారుగా తిప్పుతూ, అలవాటు అయిన వాడిలా పాలు తాగసాగాడు ఆ బిడ్డ. శాంత ముఖంలో ప్రశాంతత. అప్పటి వరకూ పడ్డ నొప్పుల బాధలను మర్చిపోయింది. ఇదే కదా.. ఆదినుంచీ తల్లీ బిడ్డల మధ్యనున్న బంధం.
రాలిన బొడ్డును గుడ్డలో కట్టి శాంతకు ఇచ్చి..
“ఇది పదకొండో రోజు బిడ్డ మొలలోనో, మెడలోనో తాయిత్తు కట్టు. పిల్లాడికి ఏదైనా పెద్ద జబ్బు చేసినా, ప్రమాదం జరిగినా ఆ బొడ్డు పొడి మందులాగా వాడటం అనాది ఆచారం” అని చెప్పింది.
పుణ్య స్త్రీలను ఐదుగురిని పిలుచుకుని వచ్చింది బాయమ్మ. చాటలో తెల్లగుడ్డ పరిచి, బియ్యం పోసి.. అందులో బిడ్డను పడుకోపెట్టింది. బిడ్డ మీద పైసా బిళ్లలు పెట్టి..
“బిడ్డ నాది. దుడ్డు నీది!” అని ఎర్రనీళ్ల దిష్టితీసి బయట పోసింది తులసమ్మ.
బాయమ్మ చాటలో మానెడు బియ్యంతోపాటు, పెరటిలో కాసిన కూరగాయలు తెచ్చి తులసమ్మ కొంగు నింపింది.
బొడ్డులోంచి కొన్ని నాణేలు తీసి ఇస్తూ..
“తులసమ్మ తల్లీ! నిన్న పొలంల పల్లీలు తెంపుంటి. పొద్దుగాల నుంచి మాపటాటీలి దాకా నడుము నొచ్చినా కాసులు తక్కువే ముట్టజెప్పినాడు దొర. నువ్వు జేసిన సాయానికి గీ పైసలు తక్కువేనాయె. మా బీదరికం నీకు ఎరికనేనాయే” అన్నది.
“బాయమ్మా! నేను మీలాంటి కాయకష్టం చేసేవారి దగ్గర డబ్బు తీసుకోను. ఖర్చులకు ఉంచుకో!” అన్నది తులసమ్మ. ఇంతలో..
“తులసమ్మ తల్లీ! నాకు బిడ్డలు లేకుండే. నువ్వే నా దిక్కమ్మా! నా వంశం నిలపాల!” అంటూ వచ్చిన కమలమ్మ కండ్లల్లో సముద్రాల హోరు వినిపిస్తున్నది.
శాంత పురిటి నులక మంచం మీద కమలమ్మను కూర్చోపెట్టి, కత్తిరించిన చిన్న బొడ్డుముక్కను కమలమ్మ చేత మింగించింది తులసమ్మ.
“కమలమ్మా! ఇంటికి వెళ్లి స్నానం చేసి అమ్మవారికి దండం పెట్టుకో! నీకు పురుడు నేనే పోస్తాను. పండంటి బిడ్డలు పుడతారు” అన్నది ధీమాగా.
పిల్లలు లేనివారు బాలింత పక్కపైన కూర్చుని, బిడ్డ బొడ్డు మింగితే పిల్లలు పుడతారు అనేది విశ్వాసం.
తులసమ్మ నోటి చలవో! దేవుడి తలపో! బిడ్డలు లేని వారికి తులసమ్మ దీవెనలు వరాలుగా బిడ్డలు పుట్టడంతో తులసమ్మ మాటలపై మంచి గురి ఏర్పడింది అందరికీ.
తులసమ్మ పాదాలకు దండం పెట్టి..
“మా బీదోల్లకు నువ్వు దేవతవు. బాపనమ్మవైనా కులం మతం అంటని తులసి తల్లివి నువ్వు!”.. అంటున్న కమలమ్మ కండ్లు ఊట బావులయ్యాయి.
కాలం ఎప్పుడూ ఏవో మార్పులు చేసుకుంటూ సాగుతూనే ఉంటుంది.
కమలమ్మకు తులసమ్మ దీవెనలు ఫలించాయి.
కమలమ్మ నాడి చూసిన తులసమ్మకు అర్థం అయ్యింది. బిడ్డ ఎదురు కాళ్లతో పుట్టబోతున్నది అని.
రెండు చేతులతో గర్భస్థ శిశువు స్థానాన్ని మార్చే ప్రయత్నం చేస్తూ, పొట్టను నొక్కుతూ ఉండగా.. బిడ్డ రెండు కాళ్లూ బయటికి రాసాగాయి. చాలా జాగ్రత్తగా.. బిడ్డను బయటికి లాగ సాగింది తులసమ్మ. ఎదురు కాళ్ల ప్రసవంలో ఒక్కోసారి తల్లి చనిపోవచ్చు. ఒక్కోసారి బిడ్డ తల తల్లి గర్భంలోనే తెగిపోవచ్చు. ఎలాంటి కాన్పు అయినా.. సునాయాసంగా చేసే సత్తా తులసమ్మది. కమలమ్మకు కూతురు పుట్టింది.
‘శ్రీ హిత!’ అని పేరు పెట్టి దీవించింది తులసమ్మ.
వేల కాన్పులు చేసిన తులసమ్మ పేరు చుట్టు పక్కల ఊర్లన్నీ పాకడంతో.. తులసమ్మకు ప్రభుత్వం వాహన సౌకర్యం కల్పించింది. పురస్కారం కూడా ప్రకటించింది.
ఏ ఇంట్లో విన్నా.. ‘తులసమ్మ మా దొడ్డ మనసున్న దేవత. ఎందరికో పురుడు పోసిన ఆమె, ఎందరో బిడ్డలకు పరోక్షంగా తల్లే!’ అన్న మాటలే.
తులసమ్మ పురుడు పోసిన చుట్టు పక్కల పల్లెవాసులు కూడా చేరి..
“తులసమ్మ తప్పు చేయదు. తులసమ్మను జైలు నుంచి విడిచి పెట్టాలి” అని ఆందోళనకు దిగారు.
యాదగిరి, కమలమ్మ కూతురు డా. శ్రీహిత
తులసమ్మను కలవడానికి జైలుకు వచ్చారు.
“అమ్మా! రాధమ్మ ఇంట్లో ఏం జరిగిందో చెప్పు?” అన్నాడు తులసమ్మ వైపు తిరిగి యాదగిరి.
తులసమ్మ చెప్పిన మాటలు విన్నాడు.
“రాధమ్మ తోడికోడలు.. గర్భంలోనే బిడ్డ
చనిపోయే మందును కోయదొర దగ్గర తీసుకుని,
నాటుకోడి కూరలో కలిపి పెట్టింది” అన్న పాలేరు మాటలు విన్న యాదగిరి హతాశుడయ్యాడు.
తులసమ్మ నిరపరాధి అని రుజువు అయ్యింది.
తులసమ్మ పురుడు పోసిన పిల్లలు.. చిన్నా పెద్దా అంతా తులసమ్మకు పూలదండలు వేశారు.
‘మహోన్నత ధన్వంతరి’గా తులసమ్మకు చరిత్రలో స్థానం దక్కింది.
కాలం ఎప్పుడూ ఏవో మార్పులు
చేసుకుంటూ సాగుతూనే ఉంటుంది.
కమలమ్మకు తులసమ్మ దీవెనలు
ఫలించాయి. కమలమ్మ నాడి చూసిన తులసమ్మకు అర్థం అయ్యింది.
బిడ్డ ఎదురు కాళ్లతో పుట్టబోతున్నది అని. రెండు చేతులతో గర్భస్థ శిశువు స్థానాన్ని మార్చే ప్రయత్నం చేసింది.
డాక్టర్ శ్రీదేవీ శ్రీకాంత్
క్లినికల్ సైకాలజిస్ట్గా పనిచేస్తూనే.. రచయిత్రిగా, కవయిత్రిగా, నృత్యకారిణిగా, చిత్రకారిణిగా, సమీక్షకురాలిగా బహుముఖ ప్రజ్ఞ చాటుతున్నారు డాక్టర్ శ్రీదేవీ శ్రీకాంత్. వీరి స్వస్థలం హైదరాబాద్. ప్రస్తుతం ఆఫ్రికాలోని బోట్సానా దేశంలో నివాసం ఉంటున్నారు. ఐదు పీజీలు, రెండు పీహెచ్డీలు (క్లినికల్ సైకాలజీ, ట్రాన్స్లేషన్ స్టడీస్) చేశారు. లెక్కకు మిక్కిలి కథలు రాశారు. వీరి కలం నుంచి తెలుగు, హిందీ, ఆంగ్లంలో 800లకు పైగా గజల్స్ జాలువారాయి. ఆయా భాషల్లో పాటలు, భక్తి పాటలు, కవితలు, పద్యాలు, తత్వాలు, నానీలు, హైకూలు, వ్యాసాలు తీసుకొచ్చారు. మూడు నవలలు, నాలుగు సైకాలజీ పుస్తకాలు, రెండు గేయ కావ్యాలను వెలువరించారు. చిత్ర లేఖనం, రాక్ పెయింటింగ్, వాల్ ఆర్ట్లో ప్రవీణురాలు. కూచిపూడి, భరతనాట్యంతోపాటు వీణావాద్యంలోనూ ప్రవేశం ఉన్నది. నాటకాలు, నృత్యం, వక్తృత్వ, చిత్రలేఖన పోటీల్లో అనేక బహుమతులు అందుకున్నారు. రేడియోలో అనేక కార్యక్రమాలకు న్యాయమూర్తిగా వ్యవహరించారు. కథలపై లోతైన సమీక్షలు చేస్తారు. ఆయా రంగాల్లో ఎన్నో సన్మానాలు, బహుమతులు దక్కించుకున్నారు.
డాక్టర్ శ్రీదేవీ శ్రీకాంత్
+26776279761