జరిగిన కథ : దాదాపు రెండేళ్ల తర్వాత తన ద్వీపరాజ్యం వైపుగా వెళ్తున్నాడు యువరాజు జాయప. అదే బిడారులో.. వల్లయకు తెలియకుండా ఓ యువజంట కూడా ప్రయాణిస్తున్నది. సత్యాచారి అనే ఓ శిల్పి, ఓరుగల్లుకు చెందిన రుద్రాంబ అనే అమ్మాయిని ఇంట్లోంచి తీసుకొని.. బిడారుతో కలిసి వెళ్తున్నాడు. విషయం తెలిసిన రుద్రాంబ తండ్రి పండరి.. చాగిరాజ్యంలో బిడారు ఆగినప్పుడు అర్ధరాత్రి వేళ వారిని పట్టుకున్నాడు. ఆ కోలాహలంలోనే.. ఒక్క కత్తి ప్రహారంతో సత్యాచారి తలను తెగ నరికాడు. దాంతో పూనకం పట్టినట్లు ఊగిపోతూ.. గగ్గోలు పెట్టింది రుద్రాంబ. మరింత కోపోద్రిక్తుడైన పండరి..కన్నకూతురి తలపైనా వేటు వేశాడు. తెగిన రుద్రాంబ తల.. సత్యాచారి తల పక్కగా దబ్బున పడింది. ఆ తీవ్ర పరిణామంతో వర్తకులే కాదు.. ప్రకృతి కూడా బిత్తరపోయింది.
ముందు కదిలినవాడు పండరి. నెత్తుటి ఖడ్గాన్ని నడుముకున్న ఉత్తరీయానికి తుడిచి, ఒరలో దోపుకొని గుర్రాన్ని అధిరోహించాడు. కళ్లెం పట్టి లాగి గట్టిగా.. “హరహర మహాదేవ! జై మైలార దేవ!” అనగానే, గుర్రం వేగం అందుకున్నది. తనతో వచ్చిన వారంతా.. “హరహర మహాదేవ!” అంటూ, తమ గుర్రాలను అధిరోహించి అతని వెంట ఉరికించారు. ఎవ్వరిలోనూ పశ్చాత్తాపం లేదు సరికదా.. ఇద్దరికి తగిన శాస్తి జరిగింది అన్నట్లుంది వారి కదలిక. అక్కడ గాలి కదలిక కూడా ఆగిపోయింది. కాసేపటికి వల్లయ కదిలి, ఆ శవాలను దూరంగా తీసివేయాల్సిందిగా ముమ్మూరు దండు భటులకు పురమాయించి.. తన గుడారం వైపు కదిలాడు. తర్వాత అందరూ ఎవరి బండివైపు వారు కదిలారు నిశ్శబ్దంగా.
“జాయపా! పద..” అంటూ తన బండి వైపు సాగిపోయాడు భైరయ.జాయప స్థాణువై ఉండిపోయాడు. తొలిసారి తన కళ్లముందు ఖడ్గంతో తలలు నరకడం అతను చూశాడు.ఒక్క కత్తివేటుకు తలతెగి ఎగిరి ఆవల పడటం.. చివ్వున చిమ్మిన రక్తం.. గిలగిలా కొట్టుకున్న నిలువెత్తు మొండాలు.. తెరచిన కళ్లు తెరచినట్లున్న ఆ తలలు.. ఒక యువజంట! తమ ప్రాణాలను అర్పించడం. ఒక తండ్రి తన కూతురి తల తెగ నరకడం. అతని కళ్లు ఇంకా రెప్ప వెయ్యడంలేదు. ఆ దృశ్యాలు.. మళ్లీమళ్లీ కళ్లముందు స్పష్టాతిస్పష్టంగా కదలాడుతున్నాయి. మనసు, శరీరం ఒక ఉన్మత్త భావావేశంతో ఏదో మగతలో ఉన్నాయి.
‘ఆమె.. ఆమె నా అక్క అయితే! ఇలాగే ఎవరన్నా.. ఖడ్గంతో ఒక్కవేటుకు నరికేస్తే! అమ్మో’.. జాయప ఒళ్లంతా వణికింది. తన అక్కలకు ఈ స్థితి రాకూడదు. వాళ్లకు ఈ స్థితి తను రానివ్వడు! ఎప్పటికీ రానివ్వడు!!
అంటే.. తను తలగడదీవి కోటకు వెళ్లిపోతే ఇక్కడ వాళ్లను ఎవరు రక్షిస్తారు? ఇక్కడ ఏమైనా జరిగినా.. అక్కడ తెలియదు. జరిగింది వాస్తవంగా ఎవ్వరూ చెప్పరు. తప్పుడు వార్త చెప్తారు. తను కత్తి చేపట్టి ఇక్కడికి వచ్చేటప్పటికి అక్కను వీడిలాగే ఎవడో నరికేస్తే! ఆ ఆలోచనలతోనే చివ్వున బండివద్దకు వెళ్లాడు జాయప. అప్పటికే భైరయ నిద్రపోతున్నాడు. బండ్ల వాళ్లంతా జరిగింది మరిచిపోయి నిద్రపోతున్నారు. రేపు మళ్లీ మామూలే! అమ్మకాలు.. తూకాలు.. నాణేలు.. గణాంకాలు.. కొనుగోలుదార్లతో నవ్వులు.. వ్యాపారస్తులు వీళ్లు! ఈ చచ్చినవాళ్లను, ఆ చంపినవాళ్లనూ అందరూ మర్చిపోతారు.
‘అవును. కానీ, నేను మర్చిపోను?! నా అక్కలకు ఈ స్థితి రాకుండా నేనే కాపాడుకోవాలి. తండ్రికి తెలిసినా ఏమీ చెయ్యలేరు. అసలు వాళ్లేగా ఇక్కడికి సాగనంపింది. నేనే కాపాడుకోవాలి! అంటే అక్కడే అనుమకొండలోనే ఉండాలి’..
జాయపలోని ఏదో శక్తి కదిలింది. చురుగ్గా కదిలాడు. గూడుబండిలోకి చూశాడు. భైరయ నిద్ర పోతున్నాడు. రేపు భైరయతో, వల్లయతో చెబితే.. ‘నేను ద్వీపం వెళ్లను. అనుమకొండకే తిరిగి మీతో వస్తాను’ అంటే.. ఎందుకని ప్రశ్నిస్తారు. ‘మా అక్కలను నేను రక్షించుకోవాలి!’ అంటే.. నవ్వుతారు. మేమంతా లేమా? కుర్రవాడివి నువ్వేం రక్షిస్తావని పరిహాసం చేస్తారు. రేపు ఆ శెట్టితో పంపేస్తారు. ఇప్పుడు, ఇక్కడ ఈ అక్కను ఎవరు రక్షించారు? చూస్తూ ఉండిపోయారు.
‘నా అక్కలకు ఏమైనా జరిగినా వీళ్లే కాదు.. చౌండ బాబాయి, సుబుద్ధి మామయ కూడా కాపాడలేరు. నేనే కాపాడుకోవాలి.. అందుకు ఏమి చెయ్యాలి!?’.. ఆ క్షణం నుంచి జాయప జీవితంలో మరో అధ్యాయం మొదలైంది.
* * *
మరునాడు పొద్దున లేచిన భైరయకు.. పక్కన జాయప కనిపించలేదు. ఆయన కంగారుపడి బండి దిగి చూశాడు. కనుచూపు మేరలో లేడు. బండి గూడుపైనున్న వస్త్రంపై మీద ఏదో రాసి ఉండటం కనిపించింది. ‘నేను అనుమకొండ వెళ్తున్నాను!’.. కంగారుపడ్డాడు భైరయ. ఎందుకు? ఎలా.. ఎలా వెళతాడు? ఒక్కడే!.. పరుగున వెళ్లి వల్లయకు చెప్పాడు. ఆయన భ్రుకుటి ముడివేసి ప్రశ్నార్థకంగా చూస్తూ.. “ఏమైంది..?” అని అడిగాడు. “ఏమో! నాకూ అర్థం కావడం లేదు” చెప్పాడు భైరయ. తనకే కాదు.. ఎవ్వరికీ అర్థం కాలేదు.
“సరే సరే! అనుమకొండకే కదా. వెళ్లనీ!”.. వల్లయ మాటతో భైరయలో కాస్త అలజడి తగ్గింది.అందరికీ తెలిసింది.. జాయప రాత్రికి రాత్రే వెనక్కి వెళ్లాడని. అంతా తమతమ కాలకృత్యాల్లో నిమగ్నమై పోయారు కానీ.. ఓ కౌమార వయస్కుడు అర్ధరాత్రి ఆ దుర్గమ మార్గంలో ఎలా వెళతాడని ఒక్కరూ ఆలోచించలేదు. బయల్దేరిన జాయప కూడా.. వెళ్లడంలో ఉన్న కష్టాల గురించి ఏమాత్రం ఆలోచించలేదు. మూర్ఖత్వం.. ప్రతిభావంతుల ముఖ్య లక్షణం!!
* * *
అక్కలను కాపాడుకోవాలన్న ఆలోచన రాగానే.. మెల్లగా బండి కింద ఉన్న తన చెప్పులు తీసి తొడిగాడు. అనుమకొండ వైపు కదిలాడు. బిడారులో బండ్లు అన్నీ గుండ్రంగా చుట్టి పెట్టి.. అంతా లోపలి బండ్లలో నిద్రపోతారు. బయట వరస బండ్లలో ముమ్మూరు దండు భటులు పడుకుంటారు. అక్కడినుంచి ఒక క్రోసుడు దూరం వరకూ.. బిడారు కాగడాల వెలుగు పడుతున్నది. ఆ వెలుగు దాటే వరకు తలొంచుకుని వడివడిగా నడుస్తున్నాడు.
వెనకగా ఎవరో ముమ్మూరు భటుడి గొంతు.. “ఎవరది?”.. చటుక్కున్న బాట వదిలి పక్కన చీకట్లో కలిశాడు. రెండు మూడుసార్లు పిలిచాక ఆ గొంతు ఆగిపోయింది. మళ్లీ బాట పట్టబోయి ఆగిపోయాడు. బిడారుతో కలిసి వస్తున్నప్పుడు.. బాటలో కాకుండా పక్కకు వెళ్తున్న ఎడ్లబండ్లను, గుర్రాలను, ఎనుబోతులను చూసి భైరయను అడిగాడు.. ‘వాళ్లు బాటలో పోకుండా మరోవైపు పోతున్నారేమిటి?’ అని.
‘వాళ్లు అనుమకొండ చేరడానికి అడ్డదారిలో చిన్నచిన్న గ్రామాలను దాటుకుని వేగంగా వెళ్తారు’ అని చెప్పాడు భైరయ.
తను కూడా ఇలా పక్కదారుల్లో వేగంగా వెళ్తే, రేపు అనుమకొండ చేరగలడు. ప్రధానబాటలో వెళ్తే.. రెండు మూడురోజులు పడుతుంది. చీకట్లో బాట కాని డొంకల్లో పడి.. వడివడిగా పోసాగాడు.
చిక్కని చీకటి. నడిజాము దాటాక బయల్దేరాడు. నడుస్తున్నాడు.. నడుస్తున్నాడు. అడ్డదిడ్డంగా. అనుమకొండ ఏ దిక్కుగా ఉందో తెలుసు. అటుగా పోతున్నాడు. కానీ, అది బాటో కాదో తెలియదు. పేరుకు గ్రామం అయినా, పల్లె అయినా అవి చాలా చిన్న జనావాసాలు. జనాభా చాలా తక్కువ. స్వయంపోషకమై పద్దెనిమిది వృత్తుల వారున్నవే.. పెద్ద గ్రామాలు. అలాంటి పెద్ద గ్రామాలు తక్కువ. గ్రామానికి గ్రామానికి దూరాలు చాలా ఎక్కువ. మధ్యలో అంతా అడవి. పెద్ద పెద్ద జంతువులున్న కీకారణ్యాలు కాకపోయినా.. ప్రజలు ఎక్కువగా ప్రవేశించలేనివే! రాత్రిపూట అసలు వెళ్లలేనివి. వెళ్లకూడనివి!
అలాంటి అడవిలోకి తెలియకుండా ప్రవేశించాడు జాయప.
* * *
కార్తికమాసపు నడిజాము. వాతావరణమంతా చల్లబడి వణుకుతున్న ప్రకృతి.. మంచుదుప్పటి కప్పుకొన్న వేళ. ఏమీ తెలియని జాయప నడుస్తున్నాడు అడ్డంపడి. రానురానూ మార్గం కఠినమవుతున్నది. మాటు గోతులు, పల్లపు తోవలు, మంచుకప్పిన బాటలు, కాటుక చీకటి.. అడుగుతీసి అడుగు వేయడం కూడా కష్టంగా ఉంది. కాళ్లకు బలిష్టమైన వృక్ష భాగాలు తగిలి పాదాలు అదిరిపోతున్నాయి. తోలు చెప్పులున్నా ముళ్లు, మోళ్లు గుచ్చుకుంటున్నాయి. చలిగా ఉన్నా ఒళ్లంతా తడిసిపోతున్నది. తలెత్తితే పెద్ద పెద్ద వృక్షాలు.. వాటిమధ్య అప్పుడప్పుడూ కనిపిస్తున్నది ఆకాశం. ఎప్పుడో ఓసారి చందమామ.. మిలమిల మెరిసే నక్షత్రాలు.. మినహా అంతా చీకటి. రానురానూ చీకటి మరీ చిక్కబడుతున్నది. ఏవేవో శబ్దాలు. కొన్ని తెలుస్తున్నాయి. కొన్ని భయపెడుతున్నాయి. అవి జంతుశబ్దాలో.. పిట్టల కూతలో అంతుపట్టడం లేదు. గొంతు తడి ఆరిపోతున్నది. దాహం.. దాహం! అలసిపోయి ఓ చెట్టు మొదలు మీద కూర్చున్నాడు. చాలా సేపటినుంచి వినవస్తున్న ఓ వింతశబ్దం దగ్గరగా.. మరింత దగ్గరగా.. ఎవరో వెనక పట్టి ఎత్తి విసిరేసినట్లు అంతెత్తున ఎగిరి.. అవతలగా ఓ చిన్నగుట్టపై పడ్డాడు. రాతికి తగిలి పెదవి చిట్లి.. నెత్తురు చిమ్మింది. రక్తపు పెదవిని చూసుకునే లోపల ఎవరో.. మళ్లీ గట్టిగా కుమ్మారు.
మళ్లీ దొర్లిపడ్డాడు. అప్పుడు చూశాడు.. నల్లని అడవిపంది. ఆ వింతశబ్దం దానిదే. మళ్లీ మీదికి వస్తున్నది. చురుగ్గా వెనక్కి జరిగాడు. ఓ చెట్టును బలంగా కొట్టుకున్నాడు. పంది మీదికి దూకింది కానీ, తప్పుకొన్నాడు. అది తిరిగి మళ్లీ పెద్దగా శబ్దంచేస్తూ మీదికి రాబోతున్నది. ప్రాణ భయం అప్పుడు అనుభవమైంది జాయపకు. మనసు పోరాటానికి సిద్ధమైంది. కళ్లు చీకటిలోనూ చూడటం ప్రారంభించాయి. ఆవలగా పెద్ద కట్టె కనిపించింది. అది తీసుకుని ఒకే ఒక్క దెబ్బ.. కచ్చితంగా దానిమీదే పడింది. గట్టిగా మూలిగి.. లేచి పరిగెత్తింది పంది. రొప్పుతూ కూలబడ్డాడు జాయప.
జాయప చాలా ఆశ్చర్యపోయాడు. కట్టెతో కొడుతున్నప్పుడు తనకు ముమ్మూరు దండు గుర్తొచ్చింది. దండు భటుడు రాజన్న తనకు దండం ఎలా తిప్పాలో ఒక్కసారి చూపాడు. తను ముచ్చటపడిపోయాడు. అదిప్పుడు క్షణంలో వెయ్యోవంతు కాలంలో మనసులో మెరిసింది. అంతే! కట్టె దెబ్బ నిక్కచ్చిగా అడవిపంది నడుంపై, అనుకున్నట్లుగానే పడింది. ఏకసంతాగ్రాహి అయిన జాయప.. చూసింది చూసినట్లు మనసులో ముద్రవేసుకోగలడు. అవసరమైనప్పుడు ప్రయోగించగలడు.
లేచాడు. కట్టెను గట్టిగా.. కూతురి తల నరికిన పండరి కత్తి పట్టుకున్నట్లు బిగించి పట్టుకున్నాడు. ముందుకు కదిలాడు. ఎక్కడో పాము బుస చప్పుడు.. నక్కల ఊళ.. పందుల ఘుర్ఘురింపులు.. పిట్టల రెక్కల చప్పుళ్లు.. ఏవేవో జంతువుల వికటాట్టహాసాలు.. భయపెట్టే అనేకానేక శబ్ద సమూహాలు.
ఎటు వెళ్తున్నదీ తెలియదు. ఎటు వెళ్లాలో తెలియదు. పూర్తిగా గందరగోళమైపోయాడు. అలా రెండుక్రోసుల దూరం ఆ దట్టమైన అడవిలో పోతుండగా.. దూరంగా ఏదో కాగడా వెలుగు.. ఏమై ఉంటుంది? అటు వెళ్లాడు శబ్దం రాకుండా. చురుగ్గా. నలుగురు వ్యక్తులు. వర్తులంగా కూర్చుని ఏవో వస్తువులను పంచుకుంటున్నారు. పూర్తిగా ఊహకు అందని సంగతి. వీలైనంత దగ్గరికి వెళ్లాడు. కాలి శబ్దం కూడా నియంత్రించుకుంటూ. అక్కడ దృశ్యం చూసి.. ఒక్కసారిగా గుండె ఆగినంత పనైంది జాయపకు.
(సశేషం)
-మత్తి భానుమూర్తి
99893 71284