జరిగిన కథ : అనుమకొండలో ఉంటున్న ద్వీపరాజ్య రాకుమారుడు జాయపకు తన తల్లి నలతగా ఉన్నారని తెలిసింది. తల్లి రూపాన్ని తలచుకొంటూ రోదించాడు. కదిలిపోయిన సుబుద్ధి.. వర్తక బిడారుతో ద్వీపరాజ్యం వెళ్లే ఏర్పాటు చేస్తానని చెప్పాడు. ఉదయాన్నే సమయశెట్టి వల్లయను కలిసి.. జాయప గురించిన అసలు విషయాలు చెప్పాడు సుబుద్ధి. అతణ్ని బిడారుతో తీసుకెళ్లి ద్వీపరాజ్య వర్తకులకు అప్పగించాల్సిందిగా కోరాడు. వల్లయ ఒప్పుకోవడంతో, అదే బిడారుతో వెళ్తున్న తన తమ్ముడు భైరయకు జాయపను అప్పగించాడు సుబుద్ధి.
వర్తక బిడారు అనుమకొండను వీడింది. వరుసగా ఎన్నో ఎడ్లబళ్లు వెళ్లడం.. ఆ చక్రాల శబ్దాలు.. ఆ ఎద్దుల గిట్టల సవ్వడి.. మెడల్లో గంటల మోత.. తోలుతున్న పెరికల అదిలింపులు.. వేగంగా కదులుతూ ఎడ్లను రివ్వున తాకి, వెనక్కు వస్తున్న బారికోలల వింత శబ్దాలు. ఆవలగా బళ్లకు ఇరువైపులా వేగంగా పరిగెత్తుతున్న ముమ్మూరుదండు భటుల గుర్రాలు.. వారి ఉత్సాహపు అరుపులు.. మధ్యమధ్య పలకరింపులు.. ముచ్చట్లు.. ఎక్కడో నవ్వులు! వెచ్చని ఉదయపు నీరెండలో.. పల్లకిలోంచి బయటికి చూసిన జాయప కంటికి, ఆ దృశ్యం మనోహరంగా కనిపించింది. సైన్య పారావారం కదలిక వేరు. వర్తక బిడారు నడక వేరు. కత్తి ప్రహారాలు.. సైనికుల వీరావేశాల విన్యాసాలు.. మత్తగజాల ఘీంకారాలు.. యుద్ధాశ్వాల సకిలింపులు. దొరికిన వాణ్ని దొరికినట్లు ఖండఖండాలుగా నరికేద్దామన్నంత యుద్ధోన్మాదం, ఉద్వేగ తరంగాలు సైనికవాహిని అంతటా ప్రవహిస్తుంటాయి.
వర్తక బిడారు కదలిక చాలా ఆహ్లాదంగా ఉంటుంది. అన్నీ ఎడ్లబళ్లే! అన్ని బళ్లనూ ఎంతో చక్కగా అలంకరించారు. బండిచక్రాలకు రంగులు. మెరుపులు. ఎడ్ల ఒళ్లంతా బుక్కాయిలు, రంగురంగుల కణితలు. కొమ్ములకు చుట్టిన రంగుగుడ్డలు. అవి ఎరువనాడు ప్రాంతపు గిత్తలు. ఆ హుందాతనం.. ఆ సమున్నతత్వం.. ఆ మధురమైన వర్ణం.. ఆ నడకలోని హోయలు, లయలు.. ఆ మౌనపు మృదుత్వం.. ఆ ఎద్దు పక్కన ఉంటేనే.. అదొక మాధుర్య నిబ్బరం. నిజమైన సాధు జంతువులు.
అద్భుతమైన పెంపుడు జంతువులు. వాటి సేవ అనన్య సామాన్యం. దైనందినంలో ఎద్దుల సహకారం తోటి మానవులకన్నా ఎక్కువే. పల్లెల్లో, పురాల్లో, నగరాల్లో అన్ని చోట్లా అన్ని పనుల్లోనూ మనిషితోపాటుగా మనిషికన్నా ఎక్కువగా.. బతుకంతా వెలుగునింపే తెలతెల్లని ఎద్దులే.. ఎద్దులు.
రంగురంగుల తలపాగాలు ధరించిన బలింజశెట్టిలు, కోమటిశెట్టిలు, ఇతర వర్తకులు.. వారివారి అనుచరులు, లేఖకులు.. అలాగే బళ్లు నడుపుతున్న పెరికలు కూడా బహువర్ణ దుస్తులతో, తలపాగాలతో శోభితులై ఉన్నారు. ముమ్మూరు దండు భటులు మరింత ప్రస్ఫుటమైన దుస్తులలో.. నడుముకు కట్టిన ఎర్రని ఉత్తరీయంలో దోపిన చురకత్తి.. భుజాన పెద్ద బరిసె.. వెనగ్గా అంబుల పొది.. పక్కగా విల్లు.. భుజానికున్న పెద్ద డాలు.. రెండు వరసల్లో వెళ్తున్న ఎడ్లబళ్లకు అటూ ఇటూ వేగంగా గుర్రాలపై కదులుతూ, బిడారును ముట్టుకోవడం అటుంచి కంటి నిండా చూసినా కనికరించం అన్నట్లు ఉన్నారు. ఎవరు వర్తకులో, ఎవరు పెరికలో, ఎవరు ముమ్మూరు దండు భటులో గుర్తింపుగా.. ముగ్గురూ మూడు వేరువేరు రంగుల ఉత్తరీయాలు నడికట్టుగా చుట్టుకున్నారు. అలాగే వేరు వేరు అందమైన తలగుడ్డలు కూడా!
జాయపకు ఆ దృశ్యం ఎంతో మనోజ్ఞంగా ఉంది. అలా చూస్తూ చాలాసేపు ఉండిపోయాడు. మరి కాసేపటికి బిడారు ఆగబోతున్నట్లు బండ్ల పక్కగా గుర్రంపై తిరుగుతూ, కొమ్ము బూరలతో రాబోయే ఊరి వివరాలు చెబుతున్నారు ముమ్మూరు దండులు. మరో రెండు క్రోసుల దూరం తర్వాత ‘పేటస్థలము’ దగ్గర బిడారు ఆగింది. అప్పటికే చాలామంది స్థానిక వర్తకులు వచ్చి ఉన్నారు.
ముందే వేసుకున్న ప్రణాళిక ప్రకారం ఎడ్లబళ్లు అన్నీ వర్తులాకారంగా విడిచారు. ఆ వృత్తానికి ఒకవైపు దారి విడిచారు. కొనుగోరుదారులు ఆ లోపలికి వచ్చి, లోపలే కొనుగోలు చెయ్యాలి. అన్ని వస్తువులూ ఒక్కొక్క బండి చొప్పున ఆ మొదటి వృత్తంలో ఉంటాయి. అలా ఒక వర్తకుడి వస్తువుల మొదటి బండి ఖాళీ అయ్యాక.. అతని రెండోబండి వృత్తంలోకి వస్తుంది. ఈ వృత్తానికి పక్కగా రెండు గొల్లెనలను ఏర్పరచారు. ఒకదానిలో వల్లయశెట్టి తన సహాయకారులతో ఉపవిష్టులవగా, మరొకదాంట్లో మిగతా శెట్టిల ముఖ్య లేఖకులు తమతమ లేఖన బల్లలతో అమ్మకాల లెక్కల వివరాలను ఎప్పటికప్పుడు నిర్ధారించుకోవడానికి సిద్ధమయ్యారు. అనుభవజ్ఞులు కాబట్టి ఇవన్నీ చాలా వేగంగా జరిగిపోతున్నాయి.అప్పటికే సుంకమాన్యగాడు, సుంకరి, తీర్పరి, కొలుచువాండ్లు మొదలైన స్థానిక సుంకం వసూలు అధికారులు.. పెంట సుంకం, అంగడి ముద్ర, మడిగ సుంకం వసూలు మొదలుపెట్టారు.. వల్లయ అనుమతితో.
మొదటగా స్థానిక వర్తకులు వల్లయశెట్టికి తాంబూలమిచ్చి తమ కొనుగోళ్లు ప్రారంభించారు. ఆ తాంబూలంలో కొంతధనం దక్షిణగా ఆయనకు ఇస్తారు. అక్కడ జరిగే మోసాలు, అమ్మకందార్లతో వచ్చే తగవులన్నీ ఆయన తీర్చి, కొనుగోలుదారుల హక్కులు కాపాడాలి. అది కట్టుబాటు. గుడ్డ సంచులతో, తోలు సంచులతో గ్రామవాసులు బిలబిలమంటూ బళ్ల వద్దకు వచ్చి, అన్నిటినీ చూస్తూ తమకు కావాల్సిన సరుకులు కొనుగోలు ప్రారంభించారు.
జాయప, భైరయ సహాయకుడితో దూరంగా వెళ్లి.. కాలకృత్యాలు తీర్చుకుని, బట్టలు మార్చుకుని వచ్చాడు. అక్కడ అతను పెట్టిన చద్దిబువ్వ, కొన్ని తినుబండారాలు తిన్నాడు. తర్వాత వర్తకం జరిగే విధానం చూస్తూ, పేట స్థలం అంతా తిరిగాడు. వర్తక ఒత్తిడిలో ఉన్నా జాయపపై ఓ కన్నువేసి ఉన్నారు భైరయ, వల్లయ. మధ్యాహ్న భోజనాలను సహాయకులు అక్కడే వండారు. కావాల్సిన వస్తువులు, పదార్థాలను వర్తకులు వెంట తెచ్చుకున్నారు.సంధ్యాదీపం పెట్టే వేళకు అమ్మకాలు ఆపారు. అప్పటివరకూ క్షణం తీరిక లేకుండా వర్తకం జరిగింది. వర్తక బిడారు అంతా సంతోష కెరటాల్లో కేరింతలు కొడుతున్నది. అంతా జరిగిన వ్యాపారపు లాభాల గణాంకాలు చూసుకుని పులకించి పోతున్నారు.
ఈసారి బాగా అమ్మకం అవుతున్న వస్తువు.. మారయ శెట్టి చెప్పులు. రంగురంగుల చర్మపు చెప్పులను.. మారయ ఎన్నో ఆకర్షణీయమైన రూపాల్లోతయారుచేసి తెచ్చాడు. ముఖ్యంగా ఎత్తు మడమల పురుష, స్త్రీల చెప్పులు అక్కడ ప్రత్యేక ఆకర్షణ. ప్రతివారూ ఎత్తుగా కనిపించడానికి ఉత్సాహపడతారు. కాబట్టి ఆ చెప్పులకు విశేష ఆదరణ. అతణ్ని అందరూ అభినందించారు. వల్లయ మరీమరీ మెచ్చుకుని, అందరూ మారయలా జనుల మనోభీష్టాన్ని గుర్తెరిగి, వస్తూత్పత్తి చేసినప్పుడే.. అన్ని ఖర్చులూ దాటి మంచి లాభాలను చూడగలమని ఉద్బోధించాడు. అందరూ అమ్మకపు బడలిక తీర్చుకుంటున్నవేళ.. ఒక వార్త వర్తక బిడారులో కలకలం సృష్టించింది. మాయసాని వల్లయశెట్టికి తాంబూలం ఇవ్వడానికి వచ్చిందన్నది ఆ వార్త.
మాయసాని ఆ ప్రాంతంలో ప్రముఖ వేశ్యాగృహ నిర్వాహకురాలు. అంతే.. వర్తకులంతా వ్యాపారాలు వదిలేసి, వల్లయశెట్టి గుడారం వద్దకు పరుగులు పెట్టారు. గుడారం బయట నిలిపి ఉన్న పల్లకిని చూసేసరికి వారిలో ఉత్సాహం శృంగార కృష్ణమ్మ అయ్యింది. గుడారం బయట ఉన్న వేశ్య మాత, నపుంసక పల్లకి బోయీలు.. అందరినీ అక్కడే ఆపేశారు. ఎవ్వరూ లోపలికి పోకుండా వినయంగా అడ్డుకున్నారు. ఆ ప్రాంతమంతా కర్పూర విలాస విశేషణాదుల పరిమళాలు వెదజల్లుతున్నది. ఆ పరిమళం వర్తకుల్లో నవయవ్వన కెరటాలను ఉవ్వెత్తున లేపుతున్నది.
‘వస్తున్నది.. వస్తున్నది.. మాయసాని అదిగో.. బయటికి వచ్చేస్తున్నది’..గుడారం లోపలినుంచి మాయసాని బయటికి వస్తున్నదని, అందరూ రెప్పవెయ్యకుండా చూస్తుండగా.. ముందుగా బయటికి వచ్చాడు వల్లయశెట్టి. కించిత్ వంగి వీడ్కోలు పలుకుతున్నట్లు నవ్వాడు. అప్పుడు మాయసాని వెలుపలికి అడుగుపెట్టింది. దివికి దిగివచ్చిన అప్సరశ్శిరోభామిని ఆమె. కామమే రూపమై, కామ ప్రకోపమే శరీరమైనట్లు ఉన్నది. భుజ భూషణాదులతో, కర కంకణాలతో, గలగల గాజులతో, ఒంపుసొంపులు బహిరంగపరుస్తూ కదలి వచ్చిన మాయసానిని చూడగానే.. వర్తకులంతా ఆనందంతో హాహాకారాలు చేశారు. ఆమె వయ్యారంగా నడిచింది. విలాసంగా నవ్వింది. ఆహ్వానంలా.. చేయి ఊపింది. పొంకాలై, ప్రేమవాహినీ మూలాలై, కదంబ పుష్పాలై, కలల నిధులై, ఉరికురికి పడుతున్న సమున్నత వక్షోజాలపై మణిమయహారాలు దొర్లిపోతుండగా.. ఆమె వయ్యారంగా పల్లకి వరకు నడిచింది. అది కలో నిజమో తెలియని సందిగ్ధావస్థలో కొట్టుమిట్టాడారా వర్తకశ్రేష్ఠులు. పల్లకివద్ద నిలబడి వారికి మరింతసేపు కనువిందు కలిగించి, వయ్యారంగా వంగి.. సుతారంగా ముడుచుకుని.. విలాసంగా పల్లకిలోకి మాయమయ్యింది. అయినా పల్లకి అంచుకు వేలాడుతున్న ఆమె చేలాంచలాలు వారికి చాలా దూరం వరకు కనువిందు కలిగిస్తూ.. వేశ్యాగృహానికి స్వాగత గీతం ఆలపిస్తూనే ఉన్నాయి. “మీ ఇష్టం! నేను అడ్డు చెప్పగలవాడినా?!” అన్నాడు నవ్వుతూ.. వల్లయశెట్టి. వారి ముఖాలలో ఎగసిపడుతున్న కామ కెరటాలను చూస్తూ. చాలామంది శ్రేష్ఠులు స్నానాదులు పూర్తి చేసుకుని, అత్తరులో మునిగి.. మహోద్రేకంతో మాయసాని వేశ్యాగృహానికి పరుగుపెట్టారు. అయితే అందరూ వెళ్లలేదు.
“అమ్మో.. లాభం అంతా గుంజేస్తుంది”.. ఒక శెట్టి అభిప్రాయం.“సంగీతం! అబ్బో.. అద్భుతం. మంచి గాయనీమణులు ఉన్నారక్కడ. కానీ, నా కూతురి పెళ్లి పెట్టుకున్నాను. ఇప్పుడు.. ఈ సానికొంపలకు పోతే కొంపలు అంటుకుంటాయి” మరొక శెట్టి.
“ఓపిక లేదు! ఊర్లో ఉన్న సానికే కట్టనా!? దార్లో ఉన్న సానికే కట్టనా!” మరో శెట్టి బేరీజు వేసుకున్నాడు.ఈ గణాంకాలు జాయపకు తెలియదు గానీ, శెట్టిలంతా ఉత్సాహంగా ఉండటం.. ముస్తాబై బయటికి వెళ్లడం చూశాడు. భైరయను అడిగాడు. “ఏమిటి విశేషం చిన్నమామయ్య గారూ?” అని.ఆయన నవ్వి ఊరుకున్నాడు. రెట్టించి అడిగే చనువు ఆయన వద్ద లేదు జాయపకు. హాయిగా ఎడ్లబండిలో ప్రకృతి ఒడిలో నిద్రపోయాడు.
ఒకరోజు ఒక పేటస్థలం వద్ద వ్యాపారం చేసుకుని ఆ రాత్రి అక్కడే బసచేసి, మరునాడు ముందుకు సాగిపోవడం.. అలా వ్యాపారం చేసుకుంటూ మునుముందుకు సాగిపోతున్నది బిడారు.రాశి వర్తకులే ఈ పెద్దబిడారులలో సరుకులు రాశి బేరానికి కొని, చిల్లర వర్తకులకు అమ్ముతారు. వాళ్లు గ్రామ సంతలలో వాటిని అమ్ముతారు. ప్రతిగ్రామంలో ఇప్పుడు ఉత్పత్తిదారులు ఉన్నారు. వాళ్లు వారి గ్రామంలో అమ్ముతూ మిగిలినవి పక్క గ్రామాల్లో సంతల ద్వారా అమ్ముతారు. ఈ సంతలు ఒక్కొక్కరోజు ఒక్కొక్క గ్రామ కూడలిలో జరుగుతాయి. ఆదివారం ఒక గ్రామం, సోమవారం పక్క గ్రామం.. అలా వారమంతా ఈ చిల్లరవర్తకులు సంతలలో వ్యాపారాలు సాగిస్తుంటారు. ఉత్పత్తిరంగంలో అన్ని కులాలవారు ఉంటే.. ఈ చిల్లర వర్తకం వైశ్యులు, కోమట్లు మాత్రమే చేసేవారు. కాలగతిలో జనాభా పెరుగుతున్నకొద్దీ ఇతరులు కూడా వర్తకంలోకి ప్రవేశిస్తున్నారు. కారణం కేవలం గ్రామాలు స్వయం సమృద్ధం కావడమే కాకుండా, మిగులు ఉత్పత్తి వస్తున్నది. దానిని అమ్ముకోవడానికి
కొనుగోలుదారులను వెతుక్కుంటూ వెళ్లాల్సి వస్తున్నది. నాలుగు రోజులు గడిచేటప్పటికి.. వర్తక అంశాలు, ఆర్థికలావాదేవీలు జాయపకు కొంత అవగాహన అయ్యాయి. ఈ పరిజ్ఞానం భవిష్యత్తులో తనకు ఎలా ఉపయోగపడుతుందో?