‘నమస్తే తెలంగాణ, ముల్కనూరు ప్రజాగ్రంథాలయం’ సంయుక్తంగా నిర్వహించిన ‘కథల పోటీ-2022’లో ప్రత్యేక బహుమతి పొందిన కథ.
పొద్దు గూట్లెపడ్డంక ఎల్లమ్మ పాణం ఇడిసింది. అరవై యేండ్లకు పైబడ్డ ఎల్లమ్మ.. అప్పుడోఇప్పుడో పుటుక్కుమంటదని అందరికీ ఎర్కే. అందుకే ఆమె సావు ఎవ్వలకు పెద్దగ ఆశ్చర్యం కాలె. పైగా ఎల్లమ్మ మొగడు బుచ్చయ్య మీద అందరు గుర్రుగ ఉన్నరు. ఒక్కనాడుగూడ ఆ ముసల్దానికి కడుపు నిండ తిండి పెట్టలేదు. ఒంటినిండ ఆయిమన్న బట్ట కట్టనియ్యలేదనేది అందుకు కారణం. బుచ్చయ్య మొదటిసందీ అంతే! ఊరందరిది ఒక దారైతే, ఉలిపికట్టెది మరో దారన్నట్టు.. ‘ఎవ్వలు ఏమన్న అనుకోని. నా బతుకు నేను బతుకుత! అందరిలెక్క దుబార ఖర్చులు పెట్టుడు దండుగ!’ అనుకుంట పొదుపుగ బతికినోడు. ఇదే అందరికీ ఒకింత చికాకు తెచ్చేది.
‘సచ్చిన్నాడు ఎత్తుక, కట్టుక పోతమా! వీని కాపాయం(పొదుపు)ల మన్నువడ!’ అని లోలోపల్నే తిట్టుకుందురు. బైటికి అంటే మల్లేడ పంచాతీ మోపైతదోనని వాళ్ల భయం. ఉన్ననాడు ఉట్ల పండుగ, లేని నాడు లొట్ల పండుగ అన్నట్టు ఉండొద్దన్నది బుచ్చయ్య ఆలోచన. ఇసొంటి జాగర్తలు తీసుకునుడు ఎనుకటి సంది చేసి, బొచ్చెడు కూడవెట్టిండు.
రెండెకరాల భూమి. ఇంటికాడ రెండు బర్లు. పెండ్లం ఒంటి మీద నగానట్ర అన్నీ మంచిగనే ఉన్నయి. కానీ, ఇదంత వ్యక్తిగతం. మరి ఇన్ని ఉన్నా ఎప్పుడు చూడు.. దివాలా తీసిన కంపెనీ లెక్కనే కనపడుతుండె బుచ్చయ్య. అక్కడక్కడ తూట్లు పడి చినిగి, మాసిన బట్టలు. వాటికి తగ్గట్టు మాసిన గడ్డం. ఇంటింటికీ మట్టిపొయ్యే అన్నట్టు.. వాడ మీద ఎవ్వల ఏషమైనా గిట్లనే ఉండేది. కాకుంటే వాళ్లకు దిల్దార్ గుణమున్నది. బుచ్చయ్యకు లేంది అదొక్కట్టే! సుట్టపోడు వత్తె కూడా కోన్ని కోసుడు, కల్లు బొట్టు తెచ్చుడు తనకు తెలువదు.
“ఏంది బుచ్చయ్యా! మొన్న సొంత మీ చెల్లె, బావ వత్తె కనీసం మర్యాద చెయ్యలేదట?” అని ఎవలన్న ఇండ్లపొంటి జనాలు అడిగితే..
చిన్నగ ఒక నవ్వు నవ్వి..
“ఔ మరి! మంచిగ సూసుకుంటే ఏం ఫాయిద! రెండురోజులు ఉండెటోళ్లు నాలుగురోజులు ఉంటరు” అని మొఖం మీదనే చెప్పెటోడు.
అసొంటి పిసినారి బుచ్చయ్య.
అందరు సాటుకే అనుకునేటోళ్లు..
‘బుచ్చయ్య అనే పేరు, వీణ్ని కన్నోళ్లు కరెక్టుగనె పెట్టిన్రు. పిల్లికి బిచ్చమెయ్యడు! ఎంగిలి చెయ్యితోటి కాకిని కొట్టడు’ అని.
బుచ్చయ్యకు ఒక కొడుకు, ఒక బిడ్డ. వాళ్లకు కూడా బుచ్చయ్య బిచ్చపు బుద్ధి బాగనే ఎరుక. పండుగో పబ్బమో వచ్చినా, ఇంట్ల గింత కూడా మార్పులేదు. మంచి బట్టలేమోగానీ, మంచి తిండి కూడా ఆ ఇంట్ల కరువే. అందుకే ఇక లగ్గాలు కాంగనే వాళ్ల దారి వాళ్లు చూసుకున్నరు.
ఎల్లమ్మ సావు వార్త విని వాడ మీది జనం పెద్దగా బాధపడ్డది లేదు. ఎందుకంటే ఎన్నడు ఒకలకు ఇంత సాయం చేసింది కాదు, ఒకర్ని దగ్గరికి తీసింది కాదు. కనీసం బుక్కెడు మెతుకులు పెట్టింది కాదు. ఆఖరికి సొంత మనుమడు, మనుమరాండ్లకు కూడా ఏ దసరకో దీపాళికో ఒక అంగీలాగో, గౌనో పట్టిచ్చింది కాదు. అందుకే ఊరే కాదు.. సొంత కుటుంబం కూడా పెద్దగా బాధపడ్డది లేదు. ఇప్పుడు జరగాల్సిన కార్యం సంగతి సూడాలన్నట్టు సుట్టాలందరికీ కొడుకు, బిడ్డ, అల్లుడు ఫోన్లు చేస్తున్నరు.
“గిప్పుడు చీకటిపడ్డది. సావు రేపే చేద్దాం!” అన్నరు పెద్దమనుషులు.
బుచ్చయ్య ఇంటి వాకిట్ల చిన్న మంటపెట్టి కుండ పెట్టిన్రు. ముసల్ది సచ్చిన బాధ ఒక్క బుచ్చయ్యకు మాత్రమే ఉన్నది. ఎందరు తనను ఎన్ని తీర్ల అన్నాసరే.. తానొక్కతే మొగని దిక్కు నిలబడ్డది.
‘లోకులు కాకులు. ఎవ్వలు ఏమన్న అనుకోని.. నేను మాత్రం నీకున్న తియ్!’ అన్నట్టు మెలిగేది.
అదే బుచ్చయ్యకు కొండంత బలాన్నిచ్చేది. అసొంటి ఎల్లమ్మ తనను ఒంటరోణ్ని చేసి వదిలి వెళ్లేసరికి.. బుచ్చయ్యకు పాలుపోతలేదు. తనకు ఇగ తోడెవ్వరని బుగులు పడుతున్నడు.
ఇంటి ముంగట టెంటు, నాలుగైదు కుర్చీలు వేయించిండు బుచ్చయ్య కొడుకు. పెద్దమనుషులు వచ్చి కూసున్నరు. పొరుగూరిల్నే ఉండే ఎల్లమ్మ బిడ్డ.. తల్లి సావువార్త తెలువంగనె ఆదరబాదర పిల్లాజెల్లను తీసుకొని పరుగుపరుగున వచ్చింది. అంతదూరం నుంచే శోకాలు పెట్టి ఏడ్చుకుంటనే ఇల్లు చేరింది. ఎల్లమ్మ గురించి గొంతెత్తి ఏడ్వడానికి ఎల్లమ్మ బిడ్డె తప్ప పెద్దగా ఎవ్వరూ కనిపిస్తలేరు. నలుగురైదుగురు ఆడోళ్లు ఆడికొచ్చి.. మొహమాటానికి కొంగులు నోటికి అడ్డం పెట్టుకొని, ఉట్టిగనే ఏడ్చినట్టు చేస్తున్నరు. కండ్లల్ల నీళ్ల సుక్కలేదు. మొఖాలల్ల పిసరంత బాధలేదు.
ఇప్పుడు అసలు పంచాది వచ్చిపడ్డది.
‘ఈ సావు ఖర్చులకన్నా బుచ్చయ్య తను దాచుకున్న ముల్లె ఇప్పుతడా లేదా!?’ అన్నది అందరి మదిల మెదులుతున్న ప్రశ్న.
‘ఎవ్వలకు ఒక్కపైస వదిలిపెట్టని బుచ్చయ్యకు, మనసు ఒప్పుతదా!?’ అని అందరు ఊపిరిబిగపట్టి చూస్తున్నరు. అయ్యను అడగలేక, కొడుకు కొమురయ్యే తన దగ్గర ఉన్న అరకొర పైసలతో రేపటి సావుకు ఏర్పాట్లయితే చేస్తున్నడు. కొడుకు కొమురయ్యకు, అతని చెల్లె మొగడు నర్సయ్య కూడా జతైండు. చాయో, నీళ్లో తెప్పించి అందరికీ తాపిస్తున్నరు. ఇవి కాదని సాటుకు పిలిచి సారకు, మందుకు అడిగెటోళ్లకు కూడా తాపిస్తున్నరు. ఇంతల్నే..
“రేపు పొద్దటి దాకా పీనిగెను పెట్టుకొని ఎట్ల కూసుంటం? భజన పెట్టించాలె” అన్నరు కులపెద్దలు.
సావుకాడ భజన మొదలైంది. డప్పు, డోలక్, కంజెర మోగుతున్నది..
“చిలకా ఎగిరిపాయె..
ఈ గూడే చిన్నబోయే..
గూటిలోని రామచిలుక గుట్టలపాలాయే..
నిలకడ లేనిదాయే..
నిమిషంలో మాయమాయే!”.. అంటూ బతుకు తత్వాన్ని, మనిషి జీవితానికి రంగరించి పాటందుకున్నడు రాయలింగం.
రాయలింగం గొంతెత్తి పాటపాడితే ఊరి మీద కదిలే చంద్రుడు కూడా జెరసేపు కదులుడు మరిచిపోతడు అంటరు జనం. అసొంటి కమ్మటిగొంతు ఆయినెది. పాటకు మధ్యలో ఆయన పలికే మాట, ఎత్తి దించే రాగం.. పాటకు ఒక సొగసును ఇస్తది. దాంతో వాడ మీది జనమంతా ఆ భజన చుట్టూ చేరెటోళ్లు. చప్పట్లు, దరువుల మోతలు, కంజెర గజ్జెలు జోరుమీద మోగేది. దూరాన ఉన్నోళ్లు కూడా దగ్గరికి రాకుండ ఆగలేరు. అంతటి మాయజేస్తది రాయలింగం భజనపాట.
‘ఔను! రాయలింగం పాడినట్టు.. గూటిలోని చిలుక గుట్టలపాలైంది!’.. అంటే గుడిసెల బతికే ఎల్లమ్మ ఇయ్యల అందర్ని ఇడిసి చిలుక లెక్కనే ఎగిరిపోయింది అనుకున్నరు జనం.
ఆ పాట వింటే జనానికి బతుకు విలువ తెలిసి వచ్చేది. ఎవ్వల బతుకైనా గింతే!
‘నూరేండ్లు బతికినా సావు తప్పది. వెయ్యేండ్లు కలిసున్నా వేరుతప్పది’ అనుకుందురు.
పాటలో రాయలింగం చెప్పినట్టు..
‘నిలకడ లేనిది, నిమిషంలో మాయమయ్యేదే.. గీ బతుకు!’ అని ఎవల బతుకును వాళ్లు తలుచుకుందురు.
అట్లా సకల కోరికల మీద మనసు ఇరిగి, బతుకును సరికొత్తగా సూపిత్తది ఆ భజన పాట. ఇట్లా పాటలు, పోతలు, మాటలు అన్నీ కలగలిసి ఆ రాత్రిని నిద్రపోకుండా కాపలా కాసినయి. తెలతెల్లవారుతుండగా ఎవలిండ్లకు వాళ్లుపోయి కునుకుపట్టిన్రు.
బుచ్చయ్యకు ఎప్పుడు కునుకు పట్టిందో ఏమో కుర్చీలోనే ఒరిగిండు.. బుచ్చయ్య కొడుకు, అల్లుడు మాత్రం అలుపు లేకుండా పనుల ఏర్పాట్లు చూస్తున్నరు. తెల్లారి సుట్టాలందరు వచ్చేసరికి బొంద సిద్ధం చెయ్యాలె, డప్పులు కొట్టెటోళ్లను తీసుకురావాలెనని ఏవేవో ఆలోచనలు చేస్తున్నరు. అనుకున్నట్టే అన్నీ రెడీ అయ్యి, పీనిగెను పాడెకెత్తిన్రు.
బుచ్చయ్య.. తలగోరు కుండ పట్టిన కొడుకు పక్కన నెమ్మదిగా నడుస్తున్నడు. ఎవరెవరో ఓదార్చుతున్నరు. నిజంగ ఏడుస్తున్నోళ్లు కొందరే! ఏడుపు రాకున్నా ఏడుస్తున్నట్టు నటిస్తున్నోళ్లే ఎక్కువున్నరు. ఇదంతా బుచ్చయ్య గమనిస్తూనే ఉన్నడు. అట్లా డప్పుల సప్పుల్ల నడుమ శ్మశానానికి ముందు.. దింపుడుకల్లం చేరింది ఎల్లమ్మ పీనిగె.
అక్కడ కింద దించి, కుటుంబసభ్యులంతా సచ్చినోళ్ల చెవిలో వారికి ఏ వరుసైతే, ఆ వరుసతో పిలిస్తే.. లేచి వస్తరనేది వారి ఆశ. ఆ చివరి ఆశ ఆచారం ఎవ్వరు పెట్టిన్రోగని.. ఇప్పటివరకు ఒక్కరు కూడా అట్లా లేచినోళ్లే లేరు. అయినా సరే.. ఎనుకటి సంది వస్తున్న ఆచారం ఎందుకు కాదనాలె అని అందరు ఇక లైను కట్టిన్రు.
ఇక్కడే మరో ముఖ్యమైన తంతు మిగిలి ఉంది. సచ్చిన మనిషి మీద ఏమైన సొమ్ములుంటే తీసుకునే తంతు. సావుకొచ్చిన జనాలందరికీ ఎరికే.. బుచ్చయ్య ముక్కుపుల్లను కూడా పోనియ్యడని. అందుకే ఇప్పుడు బుచ్చయ్య ఏం చేస్తడని చూస్తున్నరు. బుచ్చయ్య కంటే ముందు బుచ్చయ్య కూతురు, కొడుకు పక్కకు పోయి ఏదో మాట్లాడుకొని వచ్చిన్రు. బహుశా ఎల్లమ్మ ఒంటి మీది గొట్టాల గొలుసు, చెవుల కమ్మలు, ముక్కుపుల్లలు, కాళ్ల కడేలు ఎవరెవరు ఎట్లా పంచుకుందామని వాటాలేసుకున్నట్టు జనాలకు అర్థమైంది. కానీ, అందరి సూపూ ఇప్పుడు బుచ్చయ్య మీదే ఉంది.
‘అసలే అవి బంగారు నగలు. ఇప్పుడు బంగారం రేటు కూడా బాగా పెరిగింది. అసొంటి బంగారాన్ని బుచ్చయ్య తనకు కాకుంట తన పిల్లలకో, బంధువులకో పోనిస్తడా!?’ అన్నది వాళ్ల సందేహం.
అందుకే కళ్లప్పగించి చూస్తున్నరు.
డప్పులోల్లను కూడా..
‘జెరసేపు కొట్టకున్రి! ఇప్పుడు అసలు ముచ్చట తేలనుంది!’ అని సైగ చేసిన్రు.
డప్పులోళ్లు కూడా సప్పుడు చేయకుంట, కన్నార్పకుంట చూస్తున్నరు.
అనుకున్నట్టే.. బుచ్చయ్య బిడ్డె, కొడుకు ఇద్దరూ తల్లిమీది బంగారు నగలు ఒలుచుకోవడానికి సిద్ధమైన్రు. ముందు ముక్కుపుల్లల కాడ మొదలుపెట్టిన్రు. ఒకవైపు జనానికి సూడ ఏడుస్తున్నట్టే ఏడుస్తూ.. మెల్లగా ముక్కుపుల్లలను తీస్తున్నరు బుచ్చయ్య కొడుకు, బిడ్డ.
కానీ, అవి రావడం లేదు. అందుకు కారణం.. అవి ఏనాడో ఎల్లమ్మ పెట్టుకున్న దగ్గరినుంచి మల్ల తీసినట్టు లేదు. ముక్కుపుల్ల కోసం, చెవుల కమ్మల కోసం చేసిన రంధ్రాలు కూడుకపోయినయి. దీంతో బుచ్చయ్య బిడ్డ ఏడుపు ఆపి మరింత గట్టిగనే లాగుతున్నది. అవి తిప్పితే తిరుగుతలేవు. అందుకే ఇరిగినా పర్వాలేదన్నట్టు బుచ్చయ్య బిడ్డ లాగుతున్నది.
ఇంతలోనే బుచ్చయ్య బిడ్డె కొడుకు, కొడుకు కొడుకు.. నిండా పదిహేనేండ్లు లేని ఆ ఇద్దరు మనుమండ్లు ఎక్కడినుంచి, ఎప్పుడు తెచ్చారోగాని ఒక కటింగ్ప్లేర్ వెంట తెచ్చుకున్నరు. ఈ ముందస్తు ఉపాయం, ముందుచూపు తన బిడ్డదే అని బుచ్చయ్యకు అర్థమయ్యింది. ఇక ముక్కుపుల్ల రాకుంటే కటింగ్ప్లేర్తో పట్టి లాగి తీస్తానని ముందుకు వంగింది. బుచ్చయ్య కొడుకేమన్న తక్కువ తిన్నోడా..
“అక్కా! ముందు గొట్టాల గొలుసు తియ్యి!” అంటున్నడు.
“గట్టిగ గుంజు! పోనియ్యొద్దు!” అంటున్నరు జనం.
వాళ్లంతా రాత్రి భజన పాటలో మనిషి బతుకుతత్వం విని, గాలిబుడగ అసొంటి జీవితంలో కోరికలే వద్దనుకున్న జనాలు. ఇప్పుడు ఆ బతుకుతత్వాన్ని మరిచిన్రు. ఇప్పుడు బతుకుకంటే బంగారమే ముఖ్యమంటున్నరు.
జనాల ఎగేసుడు, కొడుకు, బిడ్డా ఉత్సాహం.. ఒక దశలో ఎల్లమ్మ ముక్కు తెగి వస్తదా!? అన్నట్టు ఉంది. అప్పటిదాకా గడ్డకట్టినట్టున్న బుచ్చయ్యకు ఈ దుర్మార్గం ఎక్కడలేని దుఃఖాన్ని తెప్పించింది. నిన్నటి దాకా తనదే తప్పన్న లోకం.. ఇప్పుడు బంగారం కాడికి వచ్చేసరికి ఎట్లా మారిపోయారు. ఎట్లా తోడేళ్లలా ఎల్లమ్మ ఒంటి మీద పడుతున్నరో చూస్తే.. బుచ్చయ్య కంట్లోంచి ఒక కన్నీటి ధార చెంపల మీదుగా కారుతున్నది. ఎల్లమ్మ చావుకంటే ఇట్లా గుంజుకునుడే విషాదమనిపించింది బుచ్చయ్యకు. ఆయినె కంటి నుంచి కన్నీటి చుక్కలు టపటప రాలిపడుతున్నయి. అది అక్కడున్న జనాలకు నమ్మశక్యంగా లేదు. అప్పటిదాకా ఏడ్వని బుచ్చయ్య ఇప్పుడెందుకు కన్నీళ్లు పెడుతున్నట్టు!? బహుశా ఆ బంగారం గురించేమో అనుకున్నరు.
ముక్కుపుల్లలు, కమ్మలు ఎంతకూ ఒస్తలేవు. బిడ్డె మాత్రం కటింగ్ప్లేర్తోటి గుంజేస్తున్నది.
‘ఇందుకేనా నా బిడ్డ నిన్నటిసంది అంతగనం ఏడ్చింది!?’ అనుకున్నడు బుచ్చయ్య.
ఎల్లమ్మ పాడె చుట్టున్న జనం..
“గుంజు.. లాగు.. గట్టిగా!” అని అరుస్తున్నరు.
వాళ్ల అరుపులకు బిడ్డె మరింత గట్టిగ లాగుతున్నది. అసలే పట్టుకారు లాంటి కటింగ్ప్లేర్కు.. పాణం ఉన్నోళ్లకైతే పాణాలు పోయేటంత నొప్పి, బాధ కలిగేది. పాపం ఎల్లమ్మ సచ్చి ఏ లోకాన ఉండి భరిస్తున్నదో ఈ బాధను. ఆ క్షణం సచ్చిన శవాలను కోతకానల(పోస్ట్మార్టం రూంల) కోసెటోళ్లన్న నయం అనిపించింది బుచ్చయ్యకు. ఇక తాను నోరు తెరువకుంటే అంతే సంగతులని.. అప్పటిదాకా ఈ దారుణానికి కన్నీరు పెట్టిన బుచ్చయ్య ఒక్కసారిగా తలకాయ కొట్టుకొని వాళ్ల మీద అరిచినంత పనిచేసిండు.
“నీ యవ్వ! నా బిడ్డయినా, కొడుకైనా.. నీయవ్వ ఇంకెవలైనా.. నా పెండ్లం ఒంటి మీదున్న నగలు ముట్టకుంటే ఇగ మర్యాదగుండదు. నా బతుకంత తోడునడిచిన మనిషే మట్లెకు పోతంటే.. దాని ఒంటి మీది నగల కోసం మాత్రం ఆశపడే బతుకు ఒక బతుకేనా!? ఆ నగలు నా ముసల్దానితోనే పోనియ్యిర్రి..” అని ఏడుస్తూనే అరిచిండు బుచ్చయ్య.
ఊహించని బుచ్చయ్య మాటలకు బిడ్డె, కొడుకే కాదు.. సావుకొచ్చిన ప్రతి ఒక్కరికీ ఆశ్చర్యం కలిగింది.
రాత్రి నుంచి తల్లి నగల కోసం కాచుకొని కూర్చున్న కొడుకు, బిడ్డె ఆశలన్నీ అడియాశలైనయ్.
బుచ్చయ్య మాత్రం తన చేతికున్న ఉంగురం కూడా తీసి.. భార్య నోట్లె పెట్టి, ఎల్లమ్మను మట్టిలోకి దించి బొందమీద పడి.. పసిపోరని తీరు మట్టినంతా ఒంటి మీద చల్లుకుంటూ, పూసుకుంటూ పండి పొర్లుతూ చాలాసేపు ఏడ్చిండు.
భజన పాటలో బతుకుమర్మం విని అప్పుడే మరిచిపోయిన లోకం, ఎప్పటిలాగే ‘అయ్యో పాపం!’ అని నటిస్తూ ఊరిదారి పట్టింది.
బుచ్చయ్య మాత్రం తన యాదిలో ఎల్లమ్మ జ్ఞాపకాలను ఎంట తీసుకొని ఇంటితొవ్వ పట్టిండు.
తొవ్వల ఊరిచెరువు నీళ్లల్ల మునిగి పాలోళ్లు, ఇంట్లోళ్లు ముఖాల మీద కనిపించని ముసుగులు వేసుకున్నరు.
బుచ్చయ్య మాత్రం అదే నీళ్లల్ల మునిగి ముసుగులన్నీ తొలగించుకొని కొత్త జీవితం మొదలుపెట్టిండు.
అన్నిటినీ పైపైన చూసే లోకానికి.. ఈ పూట బతుకు మర్మమేదో బోధపడజేసిండు.
“నీ యవ్వ! నా బిడ్డయినా, కొడుకైనా.. నీయవ్వ ఇంకెవలైనా..నా పెండ్లం ఒంటి మీదున్న నగలు ముట్టకుంటే ఇగ మర్యాదగుండదు.నా బతుకంత తోడునడిచిన మనిషే మట్లెకు పోతంటే.. దాని ఒంటి మీది నగల కోసం మాత్రం ఆశపడే బతుకుఒక బతుకేనా!? ఆ నగలు నా ముసల్దానితోనే పోనియ్యిర్రి..”అని ఏడుస్తూనే అరిచిండు బుచ్చయ్య.
డా.పసునూరి రవీందర్
సామాజిక బాధ్యతతో రచనలు చేస్తున్న యువ రచయిత.. పసునూరి రవీందర్.
వరంగల్లోని శివనగర్ రవీందర్ స్వస్థలం. తెలంగాణ రాష్ట్రం నుంచి తొలిసారి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం అందుకున్నారు. పాట, కవిత్వం, కథ, విమర్శ, పరిశోధన వంటి ప్రక్రియల్లో బహుముఖ కృషి చేస్తున్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి తెలంగాణ ఉద్యమ పాటపై పరిశోధన చేసి.. డాక్టరేట్ అందుకున్నారు. తెలంగాణ ఉద్యమకాలంలో జర్నలిస్ట్గా చేసిన సేవలకు.. రాష్ట్ర తొలి అవతరణ వేడుకల్లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ‘ఉత్తమ జర్నలిస్ట్’గా లక్షరూపాయల నగదు బహుమతిని అందుకున్నారు. లడాయి (దీర్ఘకవిత), అవుటాఫ్ కవరేజ్ ఏరియా (కథలు), తెలంగాణ ఉద్యమపాట (పరిశోధన), గ్లోబలైజేషన్ సాహిత్య విమర్శ(పరిశోధన), ఇమ్మతి (సాహిత్య విమర్శ), ఒంటరి యుద్ధభూమి (కవిత్వం), పోటెత్తిన పాట (సాహిత్య విమర్శ), కండీషన్స్ అప్లయ్ (కథా సంపుటి) పుస్తకాలను ప్రచురించారు. సామాజిక వాస్తవికత, సజీవభాషా సంవాదం, తాత్విక పునాది, దళిత అస్తిత్వ చైతన్యం.. పసునూరి కథలను వైవిధ్యంగా నిలుపుతాయి.
డా.పసునూరి రవీందర్
77026 48825