వారం దినాలు వర్సగ ఇడ్వకుండ ఉన్నది ముసురు. ఓ రెండు మూడ్రోజుల నుంచే జరంత తక్కువుంది గానీ, మబ్బులెనకనే తప్పిచ్చుక తిరుగుతున్న ఆ ఎర్రబంతి మాత్రం ఇంతవరకు కండ్లవడింది లేదు. కనీసం ఇయ్యాలనన్న పొద్దెల్లుతదేమోనన్న ఆశతోని మబ్బులనే లేషి, తన పాడువడిన మొండి గోడల తాటాకు గుడిసెలకెల్లి బయిటికొచ్చి ఆకాశంలోకి చూసిండు కురుమయ్య.
చినుకైతే రాల్తలేదు. కానీ.. దెయ్యాలసొంటి నల్ల మేఘాలు మాత్రం పానకం బొట్టుకెగవడిన ఈగల్లాగ ఊరు నిండ మూగే ఉన్నయింకా.
“గీ మాయదారి వోన మల్ల గిట్ట వడ్తదో ఎట్లనో!” అంటాని.. బిరాన మల్ల లోపటికురికిండు.
“అగో.. తాతొక్కడే వోవట్టే. లేవురా మల్లేశు! ఎప్పుడు మబ్బు మొకమోన్లెక్క పండుడేనా? లేవ్!”..
బోర్లబొక్కల పండుకోనున్న కొడుకు ఈపు మీనొక దెబ్బేసి అరిసింది చిల్కమ్మ.
ఆ దెబ్బకు అదిరిపడి జెట్టన లేసి కూచొని..
“నీ.. యవ్వ పండనియ్యవ్! పోతే పోయిండు ఏమైతది? ఇయ్యాల కొత్తగ వోతుండా ఏమన్న?” గయ్యిమన్నడు మల్లేశు.
మన్మని మాటలకు నొచ్చుకోలేదు కురుమయ్య. అసలు పట్టిచ్చుకోలేదు. కానీ.. జీవచ్ఛవంలాగ మంచానికే అతుక్కపోయున్న నర్సింహులు పట్టిచ్చుకున్నడు.
కొడుకన్న మాటలకు నిస్సహాయంగా గుడ్ల నిండ నీళ్లను పొదువుకొని తండ్రి దిక్కు చూసిండు.
కురుమయ్య అతిమామూలుగా కొడుకు వైపు చూసి, దబదబ అడ్డపంచెను గోషిలాగ పైకి బిగ్గరగ చెక్కుకొని, నెత్తికి రుమాలు చుట్టుకున్నడు. శిలకొయ్యకు తగిలిచ్చున్న మోకును భుజాలకేస్కొని, ముస్తాదును నడుముకు చుట్టి ముడేసుకున్నడు. చేతుల్లో గుయ్యి, రెండు లొట్లు, కర్ర పట్టుకొని బిరబిరా బయిటికెళ్లి పోయిండు.
“చేతికొచ్చిన పిల్లగాన్వి! మాకింత ఆసరైతవనుకుంటే పురాగ ఓగుమాల్నోన్లెక్క తయారైనవ్! అయినా.. ఎవల్ల కోసాన్కి వోతుండు? మామూలప్పుడెట్లా కనీసం అటుదిక్కు తొంగి గూడ సూడవు. కని.. అవసరమున్నప్పుడన్న తాతకు చేతికిందుంటేమాయె! ముశిలోడొక్కడే వోతున్నడన్న ఇంగితం గుడ్క లేకపాయె నీకు.. థు!”.. ఈపు మీద మల్లో దెబ్బేసింది చిల్కమ్మ.
ఎండుకారం బుక్కినోన్లాగ మొకమంత ఎర్రగ జేస్కొని లేసి బయటికి నడిసిండు మల్లేశు.
* * *
నేలంతా ఇంకా పచ్చిపచ్చిగనే ఉంది. కొన్ని చోట్ల నీళ్లునీళ్లుంది.
అవేవీ లెక్కజేయడంలేదు కురుమయ్య. ఆ పచ్చిదనాలను కాళ్లకిందేసి తొక్కుకుంటనే వోతున్నడు.. యుద్ధానికి సిద్ధమైన సైనికుడిలాగ.
పోత పోత బాటల ఆగి, నెత్తికి చుట్టుకున్న రుమాల్లకెంచి బీడీ పుల్లను తీసి అంటిచ్చుకొని మల్ల కదిలిండు. గుప్పుగుప్పున గాల్లోకిడుస్తున్న బీడీ పొగ ఆకాశం నిండ పరుచుకున్న కారు మబ్బుల్లాగనే కానొస్తున్నది.
బీడీ అంచున రగులుతున్న సన్నని నిప్పురవ్వలాగ నిద్రలేని తన ఎర్రటి కండ్లతోని ఆ మబ్బుల ఏ పురుగుంటదో పాముంటదోనని కండ్లంచులకు ముడ్తలు వడేట్టు చిన్నగ జేసి భద్రంగ జూస్కుంట వోతున్నడు. కాయలు గాసి మొద్దువారిన అతని అరికాళ్లు.. తొవ్వపొంటి అడ్డుపడుతున్న ముళ్లను, రాళ్లను ఏమాత్రం లెక్కజేయలేదు. శిట్టశిట్ట అడుగులేసి పెద్దవాగు కాడికి చేరుకున్నడు. వాగు పొంగి వరద నీటితో నిండిపోయిన తాటి వనాన్ని జూసి మనసు చిక్కవట్టుకున్నడు. ఆ నీళ్లల్లో కొయ్యల్లాగ నిలవడున్న తాటిచెట్లను జూడంగనే, తల్లి పాలు లేక కొట్టుకలాడుతున్న సన్నవిల్లగాన్లెక్క కండ్లల్ల నీళ్లు సుడులు దిరిగినయ్ అతనికి. ఒక్కరోజు చెట్లెక్కక పోతెనే గొలల నుంచి కల్లు వారుడు తగ్గిపోతది. ఎప్పటికప్పుడు కల్లు దించకపోతే సమయం గడిచేకొద్ది పులిసిపోతది.
అదిగ నేలపాలు గావలసిందే!
అసొంటిది.. మొన్న వారం దినాలు కురిసిన వోనకు ఇంట్లకెల్లి బయిటికెల్లే పరిస్థితే లేకుండె కురుమయ్యకు.
ఆ వారం రోజులు.. ‘గొలలేమాయెనో! వోనకు తడిసి పాకురు గిట్ట వట్టెనేమో! ఇట్లే ఉంటే గొలలెండిపోయి ఆయింత కల్లు బందైతే.. ఈ మెతుకుల వేట ఆగిపోయినట్టే!’ అంటాని బెంగటిల్లిండు. కల్లు లేక వారం రోజులనుంచి ‘ఇంటికి ఇత్తులేదు – కంటికి నిద్రలేదు’ అన్నట్లయ్యింది అతని కుటుంబానికి.
చినుకు వడ్తె చాలు వాగు చెరువై వాళ్ల బతుకులను ఎడారి పాలు జేస్తది. అందుకే.. ధైర్నం తెచ్చుకొని ఆ ఎడారిని సుత తవ్వి నీళ్లను దొర్కవట్టనీకె సిద్ధ
మయ్యిండు.
* * *
బొయ్య బొయ్య గొట్టిన వోనకు లొట్లు కొన్ని పగిలిపోయినయ్! కొన్ని కొట్కపోయినయ్! మొన్న మల్ల గొలలన్నీ మెరేసి కొత్త లొట్లు దగిలిచ్చొచ్చిండు. ఇయ్యాలనన్న కల్లొస్తే మంచిగుండన్న ఆశతోనున్నడు.
కుండలను, కర్రను పక్కన వెట్టి ముస్తాదుకు ఎనక పక్కనున్న వరల్లోంచి మార్ గత్తిని, నయం గత్తిని దీసి పిల్లబద్దపైన కొచ్చగ నూరుకొని పెట్టుకున్నడు.
మామూలుగా అందరికవి నెత్తురును కళ్లజూసే కత్తుల్లాగ కండ్లవడ్తయేమో! కానీ.. గీతన్నలకు మాత్రం వాళ్ల కుటుంబాలను అక్కున జేర్చుకునే కామధేనువులవి.
తన సామానంత తీస్కొని నీళ్లల్లోకి దిగిండు. సల్లగ నీళ్లు తగలంగనే గజగజమన్నది పెయ్యంతా. బిగవట్టుకున్నడట్లే! అటెంక కొన్ని అడుగులేసినంక సర్దుకున్నడు. ఓపక్క కుండలకు నీళ్లంటకుండ జాగ్రత్తపడ్తూ, మరో పక్క కర్రతోని నీళ్లల్లోకి పొడుసుకుంట ఏడ ఎంత లోతున్నదో పైలంగ గమనించుకొని వోతున్నడు. మధ్యకొచ్చేటాలకు మోకాళ్లపైకి అంటినయ్ నీళ్లు. త్యాపకు కాళ్లు జారినట్లయితున్నా.. ఎట్లనో ఓలాగ ఈడ్సుకుంట ఈదుకుంట వాగు దాటిండు.
బురద నేలపై అతికష్టంగా నడిచి తన తాళ్ల దగ్గరికి చేరుకున్నడు. కర్రను, ఒక కుండను ఆడ్నే ఓ పక్కకు వెట్టి, ఇంకో కుండను ముస్తాదు వెనకుండే కొండేనికి తగిలిచ్చుకున్నడు. మోకును తీసి మొదలు చెట్టుకు చుట్టి, అటెంక అతని వీపు మీదినుంచి చుట్టుకొని పిల్లముడిని తల్లిముడిలోకి దూర్చి.. దానికున్న కొక్కేనికి తగిలిచ్చి బిగ్గరగా బంధమేసిండు. ఎడమ చేతిని మోకు లోపలికి, కుడి చేతిని మోకు బయటికి ఉంచి.. రెండు కాళ్ల మడిమలకు గుయ్యిని తొడుక్కున్నడు. మనసుల ఓసారి కాటమయ్యను తల్సుకొని మోకును పైకి జరుపుకొంట చెట్టుపొంటి ఉడుములాగ పాకవట్టిండు.
మధ్యమధ్యలో తడికి కాళ్లు తట్టక జారినట్లయితున్నది. ఏమాత్రం సొలిగినా అతనికింక ఈ భూమ్మీద నూకలు బాకీ లేనట్టే!
అందుకే.. ఓ దిక్కు గుండె దడదడమంటున్నా, ఇంగో దిక్కు.. ‘మన్మడు కోరుకున్న సదువు సదివియ్యలేనేమో!’ అన్న బుగులు కురుమయ్యను ఊపిరాడనిస్తలేదు.
ఎట్లనో ఓలాగ పట్టు దొరికిచ్చుకొని ఎక్కుతున్నడు.
పుండు మీద కారం జల్లినట్లు కాయలు గట్టిన అతని శరీరానికి, బొగ్గులైన బొక్కలకు చెట్టు, మోకు, గుయ్యి వొత్తుకొని నొప్పిజేస్తుంటే..
‘యాభై ఏండ్ల సంది భరిస్తున్న. గీ నొప్పులు నన్నేంజేస్తయ్ తియ్!’ అంట దులిపేసుకున్నడు.
దాదాపు అరవైఐదు అడుగుల ఎత్తున్న ఆ చెట్టును, దాని ఎత్తుకంటే ఐదేళ్లెక్కువ వయసున్న కురుమయ్య.. సగం వరకు ఎక్కినంక ఆగి దమ్మిడ్సుకుంట అక్కడినుంచి ఇంగో ముప్పై అడుగుల పైనున్న లొట్ల దిక్కు జూసిండు.
ఐదేళ్లక్రితం వరకు ఐదునిమిషాల్లో వాటిని చేరుకునేటోడు. ఇప్పుడు వయసు తెస్తున్న మార్పులకు తల్లడ మల్లడం ఐతున్నదతనికి.
* * *
సోర పిల్లగానప్పట్నుంచే దినాము తండ్రితోపాటే తను గుడంగ తాళ్లకు బోయేది కురుమయ్య. నాయినలెక్క అంతెత్తుకు ఎక్కాలన్న ఖాయిష్ మీద పద్దెనిమిదేళ్లు గూడ నిండక మునుపే తాళ్లెక్కడంల ఆరితేరిపోయిండు.
అదే విధంగా.. అతని చిన్న కొడుకు నర్సింహులు గూడ తండ్రి నోట్లో నుంచి ఊడిపడ్డట్టు మీసాలు గూడ సరిగ్గా మొలవకముందే మోకు వట్టిండు. పెద్ద కొడుకు హన్మంతు మాత్రం తప్పదన్నట్లు నేర్చుకున్నడు.
వాళ్లకున్న ఇరవై చెట్లలో కురుమయ్య, హన్మంతు చెరో మూడ్నాలుగు చెట్లెక్కి గొలలు గీసి కల్లు దింపేలోపే.. నర్సింహులు తక్కిన చెట్లన్నీ ఎక్కేటోడు.
రోజుకు రెండుసార్లు, కల్లు ఎక్కువొచ్చే కాలంల మూడు సార్లెక్కి దాదాపు నలభై, యాభై లీటర్ల కల్లును దించేటోళ్లు. కొన్నిసార్లు అంతకంటే ఎక్కువే వొచ్చేది.
నీర కావాలన్న వాళ్లకు మబ్బులనే తీసిచ్చేటోళ్లు. పొద్దటి కల్లు కావాల్సిన వాళ్లకు పొద్దున, సాయంత్రపు కల్లు కావాల్సినోళ్లకు సాయంత్రం దీసి పోసేటోళ్లు. ఊర్ల సన్నవిల్లల కొరకు పిల్లకల్లు కోసం కురుమయ్యోళ్లకాడికే వొచ్చేటోళ్లు ఎక్కువ శాతం. వాళ్లయితెనే కల్తీ లేకుండ అచ్చం పిల్లకల్లును తీసిస్తరని అందరికట్ల నమ్మకం.
అంతేగాకుండా.. ఊర్ల ఎవల్లకి కొత్త చెట్టును కల్లుకు సిద్ధం జేయాలన్నా.. మట్టలు గొట్టి చెట్టు సాప్ జేయనీకే వాళ్లనే పిల్షేది. ముగ్గురు గలిసి మట్టలన్నీ మట్టగ ఇరిసినాక, కంపలాగ ఉన్న చెట్టు పిల్ల పక్షులను ఎదకు పొదువుకోనికే రెక్కలు చాచిన తల్లి పక్షిలాగ అగుపడేది.
ఇగ కురుమయ్య ఇంటామె సాలమ్మ గుడాలు, మక్క గారెలు చేస్కొచ్చి మండువకాడ కూసునేది. కోడళ్లేమో వొచ్చినోళ్లకు కల్లు వోషేది. కల్లుతోపాటు గుడాలు, గారెలు తినిపోయేది జనం.
కాయకష్టం జేస్కొని ఉన్నకాడికిట్ల ఖుశాలుగ బతుకెళ్లదీస్తున్న వాళ్లమీద కాలం కచ్చగట్టింది.
పండుతాళ్ల గొలలనిండా ముంజలు గాసినట్లు పట్నాలైపోయి క్రమంగా ఊర్లల్ల గూడ పుట్టుకొచ్చినయ్ బెల్టు షాపులు. ప్రకృతి నుంచొచ్చే తల్లిపాలసొంటి స్వచ్ఛమైన కల్లును గాదని.. నిషా నిండ ఎక్కుతదని మందులు కలిపే డబ్బాపాలసొంటి మందుకు మరగనీకే ఎక్కువ కాలం పట్టలేదు జనానికి. రాన్రాను బెల్టుషాపులు గీతన్నల మెడలకు బెల్టులు బిగించి, ఊపిరాడనియ్యకుండ గిలగిల కొట్టుకునేలాగ చేశ్నయ్.
పుట్టి బుద్ధెరిగినప్పట్సంది కులవృత్తినే నమ్ముకున్న కురుమయ్య కుటుంబానికి మరో పని తెల్వక, ఉన్న పనిలో ఆదాయం లేక సతమతమయిండ్రు. ఇదివరకు.. కుండలన్నీ ఖాళీ అయ్యేవి, కాని రాన్రాను కల్లు తాగేటోళ్లు తక్కువై కడుపు గట్టుకుని పానాలను పణంగా పెట్టి తెచ్చిన కల్లును పానం బిగవట్టుకొని నేలపాలు జేస్తుంటే కురుమయ్యకు కడుపుల కశిబిశయ్యేది.
‘గీ ఆదాయం లేని కష్టం నేనొల్ల!’ అని జెప్పి కుటుంబ భారమంతా తమ్ముని నెత్తినవెట్టి.. హన్మంతు పెండ్లాంను తన తల్లిగారింట్ల ఇడిసి గల్ఫ్కు వోయిండు.
కొన్నాళ్లకు.. వయసు మీదపడేకొద్దీ కురుమయ్యకు ఆయాసమొచ్చి రెండు కంటే ఎక్కువ చెట్లు ఎక్కలేకపోయేది. ఇవల్ల సరిపోవన్నట్లు బిడ్డె పెండ్లి కొరకు అప్పుజేయవలసి వొచ్చింది నర్సింహులుకు. అది మిత్తితోపాటే పెరుగుతూ వొచ్చింది. ఉన్న ఒక్కగానొక్క కొడుక్కివేమీ పట్టవసలు. ఇగ నర్సింహులుకు గొంతు మీద కత్తి వెట్టినట్లయ్యింది. ఇవల్ల పర్శాన్లు బుగుల్వెట్టి రాత్రిపూట కన్నంటుకోనిస్తలేవు. ఓనాడిట్లే గొలలు మెరేస్తుంటే ఉన్నట్టుండి పెయ్యంతా చెమటలు వట్టి కండ్లకు చీకట్లొచ్చినయ్. పట్టు తప్పి మోకు జారింది.
అంతే! కండ్లు మూసి తెర్సినంతలనే చెట్టుమీదున్నోడు జరజర జారి దబ్బున ఎల్లెల్కల కిందవడ్డడు. తనకేమయ్యిందో తెలిసేలోపే లొట్టి పగిలిపోయినట్లే.. అతని నడుముతోపాటు కాళ్లూ చేతుల బొక్కలు గూడ ఇరిగిపోయినయ్. పగిలిన లొట్టిలకెంచి కల్లంతా చుట్టుముట్టు జలజలా పారినట్లు.. అతని తలలోంచి నెత్తురు గూడ జరజరా పారింది. కదలలేకపోయిండు.
బుర్రల బండికుండే తాటికాయలు తిరిగినట్టు నెత్తి గిర్రున తిరిగినట్లయ్యింది. నల్లని పొగ కమ్ముకున్న కండ్లకు.. తన నెత్తురుతో కలిసిన తెల్లని కల్లు ఎర్రగ కుంకుమ నీళ్లలెక్కనే గానొచ్చినయ్. చిల్కమ్మ నొష్టన వెట్టుకునే కుంకుమ బొట్టే కండ్లముందు మెదిలింది.
‘మొగడు గడపదాటి తాళ్లకు వోంగనే పెండ్లామ్ ముండమోసినట్లే! గా తాళ్లకువొయిన మనిషి మల్ల ఇంటి గడప తొక్కినాకనే ఆయిమె ముత్తయిదువన్నట్లు!’.. పెద్దలనే మాట యాదికొచ్చింది.
మూస్కపోతున్న అతని కండ్లపొంటి నీళ్ల సుక్కలు జరజరా రాలి మట్టిల ఇంకిపోయినయ్.
* * *
ఆ పొద్దు జర సుస్తయ్ చిల్కమ్మ ఇంటికాడనే ఉంది గానీ.. పానమంత తాళ్లకుబోయిన మొగని మీదనే గుంజింది. అసలే అత్త, మామ గుడ్క లేరు. బిడ్డను చూసిరానీకే పక్కూరికి వోయిన్రు. మన్సునవట్టలేదు చిల్కమ్మకు. జప్పజప్ప తాళ్లకాడికురికింది. దూరంకెల్లే చెట్లనన్నిటినీ చూసింది.. నర్సింహులు గానొస్తడేమోనని. కానీ కండ్లవడలేదు. భయమైంది. చెట్లకాడ ఇక్కడక్కడ పారజూసెటాలకు ఓతాన సోయి లేకుండ పడున్న పెనిమిటిని జూడంగనే గుండాగిపోయిందామెకు.
లబలబ మొత్తుకుంట సాయం కొరకు చూసింది. సుట్టుపక్కన ఎవ్వలు కండ్లవడలేదు. ఆడ్నుంచి కొంత దూరంల కల్లు దింపుకొనీకొచ్చిన ఒకాయిన సాయంతోని నర్సింహులును దవాఖానల జేరిపిచ్చింది.
* * *
కిందవడ్డప్పుడు మూతలు వడ్డ నర్సింహులు కండ్లు రెండ్రోజుల తర్వాత గాని తెర్సుకోలేదు.
‘చిల్కమ్మ పుస్తెలు గట్టివే!’.. అనుకున్నడు. కానీ..
“కాళ్లకు, చేతులకు రాడ్లెయ్యాలి. నడుము గూడ దెబ్బదిన్నది. ఇగ లేషి తిరుగుడు కష్టమే! ఈడ లాభం లేదు పట్నం దోల్కపోండి” అన్న డాక్టర్ సాబ్ మాటలిని, తానిక ఎప్పటికీ లేసి నడువలేడని తెలిసినాక గుండెవల్గిండు. చిల్కమ్మ మెడల పుస్తెలు నిలవడ్డందుకు సంతోషించాలా లేక తనిక జీవితాంతం నిలవడలేనందుకు ఏడ్వాలా తెల్వలేదతనికి. కుమిలి కుమిలి ఏడ్సిండు.
ఆ తర్వాత, పట్నంల పెద్ద దవాఖానల ఆపరేషన్ చేపిస్తే లచ్చల ఖర్చొచ్చింది. సర్కారోళ్ల సాయం ఇంగా అందలేదు. నర్సింహులుకేమో కొన్ని దినాలకు రాడ్లేసిన కాడంతా ఊకూకే ఇన్ఫెక్షన్ అయితుంది. దవాఖానకు పోయినపుడల్లా వేలు వేలు ఖర్చయినయ్. అప్పుల మీద అప్పులైనయ్. ఇగ తప్పని పరిస్థితుల్లో ఉన్న రేకుల ఇల్లమ్మి గుడిసెలకొచ్చిన్రు.
నీడ వొయింది. కొడుకు కాళ్లుజేతులు వొయినయ్. ఇవల్ల పర్శాన్లు తట్టులేక సాలమ్మ గుడంగ వొయింది.
‘ఇగిప్పట్సంది నేను తాళ్లకు వొయినప్పుడు సాలమ్మకు పుస్తెలు గుమ్మానికి తగిలిచ్చే పనిలేదు. అంశమంతురాలు.. పుస్తెలను గుడ్క మూటగట్టుకపోయింది!’.. అంటాని పెండ్లాన్ని తల్సుకొని కండ్లనీళ్లు వెట్టని దినం లేదు కురుమయ్యకు.
* * *
కొడుకట్లయినాక తాళ్లెక్కేటోళ్లెవ్వరు లేరు. మన్మడేమో అంటను ముట్టనన్నట్టు ఉండుడే కాకుండా, ఇప్పుడు కొత్తగ సోపతిగాళ్లెవరో వోతున్నరని తను గూడ ఐద్రవాద్లనే సదువుతా అంటాని మొండి పట్టు వట్టిండు.
చిల్కమ్మకు ఇంగింత భారమయ్యింది. అందుకే.. చేతగాకున్నా అతికష్టంగా అయిదు చెట్ల వరకు ఎక్కుతున్నడు కురుమయ్య. ఎక్కలేక తక్కినవి పాలుకిచ్చిండు.
సీజన్లనే అంతంతమాత్రం బతుకులు. సీజనయిపోతే తిండికి, గుడ్డకు చాన తిప్పలు. చిల్కమ్మ తెచ్చే కూలి పైసలే ఒకింత ఆదరవు.
* * *
పుట్టలకెల్లి చీమలెల్లినట్లు తన మెదడులకెంచి ఆలోచనలన్నిటినీ బయిటికి నూకి, తక్కిన ముప్పై అడుగులు గూడ ఎక్కి ఆత్రమాత్రం గొలలకున్న లొట్లను ఒక్కోదాన్ని తీసి.. వాటిలో పడ్డ కల్లును తనవెంట తెచ్చుకున్న కుండలో పోసుకున్నడు. గొలల చివర్లకు పట్టిన మడ్డిని సాఫ్ జేసి, మల్ల మెరేసి లొట్లు కట్టి నిదానంగ కిందికి దిగిండు. దించిన కల్లును కిందున్న ఖాళీ కుండలో పోసి మిగతా నాలుగు చెట్లను గూడ ఎక్కిండు.
కనీసం అయిదు లీటర్లన్నొచ్చే కల్లు ఇప్పుడు రెండు లీటర్లు గిట్ట సరిగ్గ రాలేదు. మొకమంత చిన్నగ జేస్కొని వాగులకు దిగిండు. కొన్ని అడుగులేసిండో లేదో.. చినుకులు మొదలయినయ్. గుండె దడీలుమన్నదతనికి.
‘అరె నీయవ్వ! మల్ల దగుల్కున్నది గద! ముసుర్ల బొందవెట్ట! జెప్పున వోవాలే. ఆయింత ఎక్వయిందంటే కల్లంత ఆగమైపోతది’.. గత్తర బిత్తరయి దబదబ నడుద్దమంటాని వొయిండు. కానీ, కుండల బరువుకు అడుగులు గూడ బరువైనయ్. వాన గుడంగ ఎక్కువైంది.
‘మాపటికి ఎట్లెక్కాల్నో ఏంకతనో! ఈడికే కల్లు తక్కువొస్తున్నది’.. బుగుల్వట్టిండు.
ఎన్కకు తిరిగి దీనంగ తాళ్లదిక్కు జూసిండు. రెండడుగులైతే గట్టుకు చేరుకుంటడనంగ.. కాలు బెణికినట్లు అయ్యేటాలకు దబ్బుమని బోర్ల బొక్కల వడ్డడు.
కర్ర గద్వకు గుద్దుకున్నది. పెయ్యంత గీరుకపోయి దెబ్బలు తగిలినయ్. లొట్లు పగిలిపోయి కడుపు గట్టుకుని తెచ్చిన కల్లంతా కండ్లముందే మట్టినీళ్లల్లో కలిసిపోతుంటే.. కడుపుల శేయివెట్టి తిప్పినట్లయ్యింది కురుమయ్యకు. కల్లుతోపాటు అతని కండ్లల్ల నీళ్లను గూడ తనలో కలుపుకొని ఎత్తుకపోయింది కనికరం లేని గంగమ్మ.
నిమ్మలంగ లేసి నీళ్లల్ల పడిపోయిన కత్తులను దేవులాడుకొని అట్లిట్ల గట్టుకు చేరుకున్నడు.
‘కుమ్మరి కిష్టయ్య ఇయ్యాల జరంత ఎంగిలి వడ్తడులే! భగమంతుడు భలే ఇచిత్రమైనోడు! ఒకళ్ల కండ్ల నీళ్లు ఇంకొకళ్లకు నోటికాడి గింజలు..’ వేదాంతం పలికిండు.
* * *
ఏనాడూ తాతకు తోడుగా పోని మల్లేశు, ఇయ్యాల గూడ పోలేదు. తల్లి పోరు పడలేక ఇంట్లకెల్లి బైటికి వొయిండంతే! ఆడీడ తిరిగి, దోస్తులతోని బాతఖాని వెట్టి ఇంటికొచ్చిన కొడుకు మీద ఈ సారి చిల్కమ్మ విరుచుకుపడలేదు. కానీ, ఎప్పుడు లేనిది ఆమె చూపులో కండ్లవడ్డ ఇకారం.. మల్లేశు పెయ్యంతా విషం పాకినట్లు పాకింది. తల్లి కళ్లలోకి చూడలేకపోయిండు. తాతను పలకరియ్యనీకే మొకం జెల్లలేదు.
* * *
పొద్దు పోయింది.. బయట అలుముకున్న చిమ్మచీకట్లకంటే ఇప్పుడు తన చుట్టూ గుమిగూడిన చీకటే మల్లేశుకు భయంకరంగా అనిపిస్తున్నది.
“బతికుంటే యాదోటి జేస్కొని ఎళ్లదీయ్యెచ్చు. గదే పానం మీదికి దెచ్చుకున్నాక ఏం జేయగలవ్! పదో పరకో నాకొచ్చే కూలి పైసలతోనే సర్దుకుందం. నీకేమన్నయితే ఇగ మాకు పెద్దదిక్కెవరు మామా! సూడు పెయ్యినిండ దెబ్బలెట్ల దగిలినయో” డాక్టరిచ్చిన గోలీలిచ్చుకుంట పైటంచుతోని కళ్లొత్తుకుంది చిల్కమ్మ.
“మన్మని సదువు కొరకు తప్పదు. అయినా.. మన పనికి ఎండేంది? వోనేంది, సలేంది? యాదున్నా యేమైనా పోవాల్సిందే!” గోలి మింగి అన్నడు కురుమయ్య.
“యేమొద్దూకో! ఇల్లెల్లగొట్టంగ దొంతులు సదిరినట్టు.. తోడువొమ్మంటే తప్పిచ్చుక దిరిగినోని కొరకేంటికి తండ్లాడ్తవ్! సదువు మీన ఖాయిషున్నోడు యాడైన సదువుతడు. ఈడ ఎల్గవెట్టిందేం లేదు గాని ఐద్రవాద్ వోతడట! గంతంత పిరెము సదువులు మనతోని యాడైతయన్న ఆలోచన గుడ్క లేకపాయే వోన్కి. మనూర్ల గవుర్నమెంట్ కాలేజిల జేర్తేమైతది? యేతుల మొకమోడు!” అన్నది చిలకమ్మ.
“యే.. పోనూకో బిడ్డ! వోన్ని గిట్ట తప్పువట్టలేములే! ఇప్పటోళ్లది ఒక్కొక్కరిది ఒక్కో తీరు. వోళ్ల నాయిన గిట్ట మంచిగున్నింటే కొడుకును పెద్ద సదువులు సదివిచ్చుకునేటోడేమో! కని వోని పరిస్తితి గిట్లయిపాయె. నువ్వొక్కదానివి యెంతకని తండ్లాడ్తవ్!” అన్నడు కురుమయ్య.
‘బతికున్న పీన్గెనయి మీ నెత్తిన గుది బండనైతి! దీనికంటే.. గా దినమే పుటుక్కుమనింటే మీకిన్ని తిప్పలుండేవి గాదు. ఇన్నేండ్లసంది మమ్ముల సాది, ఇప్పుడు ఆరాంగుండాల్సినోడు పానాలను గుప్పెట్ల వెట్టుకొని మొండి ధైర్నం జేషి తిరుగుతున్నడు నాయిన!’.. చెప్పాలనుకొని నోరు తిరగక మాట నత్తి వోతున్నది నర్సింహులుకు. చెప్పలేక గుడ్ల నీళ్లు గుక్కుకున్నడు. అవ్విటిని తూడ్సుకుందమంటే గూడ చేతులు రాకపాయె.
“యేడ్సకూకో! నీవేం ఫికర్ జేయకు. నేను లేనా? మీ నాయినని నేను గనిపెట్టుకుంటగాన్లే! మాయమ్మకు మేము ఎనిమిది మందిమి. కూలినాలి జేస్కుంటనే అందర్ని సాదింది. మొన్నటివరకు నాకిద్దరే! గిప్పుడు నల్గురు బిడ్డలనుకుంట. యాడన్న తల్లికి బిడ్డలు భారమైతరా? అవల్ల ఆలోచనలు బంజేషి గప్పున వండుకో”.. పైటంచుతో మొగని కండ్లు తూడ్సుకుంట అన్నది చిల్కమ్మ. ఇంటికి చేరుకున్నాక బయిటినుంచే వాళ్ల మాటలు విన్న మల్లేశుకు చెంప ఛెళ్లుమన్నట్టు అనిపించింది. రాత్రంతా రెప్పవాలలేదు అతనికి.
* * *
దెబ్బలు పచ్చిగ అట్లే ఉన్నా, లెక్కజేయకుండ మబ్బులనే లేసి కోడలు వొద్దని ఎంత జెప్పినా వినిపించుకోకుండా తాళ్లకు పోనీకే తయారయ్యిండు కురుమయ్య.
గుమ్మం బయట భుజాల చుట్టూ మోకు, నడుముకు ముస్తాదు, చేతిల లొట్టి వట్టుకొని నిలవడ్డ మన్మణ్ని చూసి.. తన కండ్లను తానే నమ్మలేకపోయిండు.
“ఇదివరకు తాళ్లెక్కడంల మా నాయిన నీతోని పోటీ వడ్తుండెనంట గదా? ఇప్పుడు నీకు పోటీ ఎవ్వరు లేకుండయ్యిన్రని..” నగుకుంటన్నడు మల్లేశు.
“పరాశికాలాడనీకే గిదేమి మీ దోస్తులకాడుండే రెండు పయ్యల బండనుకున్నవా!? అమాతము ఎక్కనీకే!”.. పర్షాన్ల వడ్డడు కురుమయ్య.
“మా నాయినకయితెనే నేర్పిస్తవా! నాకు నేర్పియ్యవానే తాళ్లెక్కుడు. జల్ది వా.. మల్ల నేను మా సార్ను గలవాలె. ఈడ కాలేజిల జేరనీకె!”.. మల్ల నగి, తాత భుజం చెట్టూ చెయ్యేసి ముందుకు నడిసిండు మల్లేశు.
చాన దినాలకు కురుమయ్య మొకంల గిట్ట నవ్వు కండ్లవడింది. గన్మల నిలవడి తాతామన్మన్ల దిక్కే చూస్కుంట నిలవడింది చిల్కమ్మ.
కొడుకు మనసునిండా కప్పుకోనున్న ముసురు తొలగిపోయినందుకు చిల్కమ్మ, నర్సింహులు మొకాల్లో సంతోష రేఖలు పొడసూపినయ్.
‘వారం పది రోజులసంది ఆకాశాన్ని ఇడ్వకుండ పట్టిన ముసురు గుడంగ.. మెల్లిమెల్లిగా మాయమై పొద్దు పొడుసుకొస్తున్నది.
మరిగ.. గీతన్నల బతుకుల నిండా కమ్మిన ముసురెన్నడు తొలగిపోతదో ఆ భగవంతుడికే ఎరుక!’..
గోడకున్న ఎంకన్న పటం చూస్తూ, మనసులో అనుకున్నడు నర్సింహులు.
తండ్రి రఘురామయ్య స్ఫూర్తితో సాహిత్యం వైపు అడుగులు వేశారు స్ఫూర్తి కందివనం. వీరి స్వస్థలం మహబూబ్నగర్. హైదరాబాద్లో నివాసం ఉంటున్నారు. బయోటెక్నాలజీలో పీజీ చేసి.. సైంటిఫిక్ ఈ-జర్నల్స్ పబ్లిషింగ్ సంస్థలో మేనేజింగ్ ఎడిటర్గా పనిచేశారు. 2019 నుంచి రచనలు చేస్తున్నారు. ఇప్పటివరకు 30కిపైగా కథలు, 3 నవలలు రాశారు. ఆంగ్లంలోనూ కథలు రాశారు. ‘చీకటి వెలుగులు’, ‘నాయిన చెప్పిన అబద్ధం’, ‘డిమ్కి’, ‘నల్ల చీమలు’, ‘నేను& మీ!’ కథలు పాఠకాదరణ పొంది.. రచయిత్రిగా స్ఫూర్తికి మంచి గుర్తింపునిచ్చాయి. ‘చైత్ర’ నవలకు 2022లో ‘తెలంగాణ సారస్వత పరిషత్తు యువ పురస్కారం’, ‘అంపశయ్య నవీన్ లిటరరీ ట్రస్ట్ ప్రథమ నవలా పురస్కారం’ దక్కింది. ‘గీత కార్మికుల జీవితాలు కూడా యుద్ధానికి బయల్దేరిన సైనికుడిలాంటివేననీ, గాలిలో దీపంలాంటి ఓ గీతన్న జీవన పోరాటమే.. ముసురు కథ’ అని రచయిత్రి చెబుతున్నారు.