Kasi Majili Kathalu Episode 85 ( కాశీ మజిలీ కథలు ) | స్త్రీరాజ్యపు మహారాణిని కన్యాకుబ్జ యువరాజు పుష్పకేతుడు వివాహం చేసుకున్నాడు. కొలువులో తమ ముందుకు వచ్చిన రెండు హత్యాపరాధాలపై విచారణలో.. తప్పిపోయిన తన సోదరులను కలుసు కున్నాడు. ఈ సందర్భంగా వాళ్లు తమతమ కథలను చెప్పుకొన్నారు. చివరిగా మయూరధ్వజుని వంతు వచ్చింది.
మయూరధ్వజుడు స్త్రీరాజ్యపు దక్షిణపు పొలిమేరలో తాను విన్న కథను సోదరులకు వినిపిస్తున్నాడు. ఉజ్జయినీ రాజ్యానికి రాజైన గోపాలుడు తన తండ్రిని చంపి రాజ్యానికి వచ్చాడనే అపవాదుతో కుమిలిపోయాడు. అసలు ఆ అపవాదు ఎందుకు, ఎలా పుట్టిందో తెలుసుకోవాలనే ఉద్దేశంతో.. ఆ మరునాటి రాత్రి మారువేషంతో రాజ్యంలో సంచరించసాగాడు. ఒకచోట ఒక కాముకుడు తన అభిసారికను రహస్యంగా కలుసుకుని, మాట్లాడుతుండగా.. గోపాలుడు వారి మాటలు పొంచి విన్నాడు.మాటల మధ్యలో ఆ అభిసారిక..
“మన సంబంధానికి నా భర్త, పిల్లలు అడ్డంగా ఉన్నారు” అని చెప్పింది. అందుకు ఆ కాముకుడు.. “వాళ్లను చంపేసి నా దగ్గరికి వచ్చేయి. మన గోపాలుడు తండ్రిని చంపి రాజ్యానికి రాగా లేనిది.. నువ్వు నీ భర్తను, పిల్లలను అడ్డం తొలగించుకుంటే తప్పేముంది?” అన్నాడు. ఆ మాటలు విని, గోపాలుడు మరింత బాధపడ్డాడు. మరికొంత ముందుకు వెళ్లేసరికి.. పాలు తాగకుండా గుక్కపట్టి ఏడుస్తున్న బిడ్డను ఒక తల్లి.. “పితృఘాతకుడా!” అని తిట్టింది. దానికి ఆ పిల్లవాడి తండ్రి.. “ఎందుకంత మాటన్నావ్?!” అని అడిగితే..
“వయసు పెరిగేకొద్దీ బిడ్డలు తల్లిదండ్రుల చావునే అతిగా ఊహించుకుంటూ, కోరుకుంటూ ఉంటారు. మన గోపాలుడు కూడా తండ్రిని చంపే రాజ్యానికి వచ్చాడు కదా!” అన్నదామె. ఆ మాటలు కూడా గోపాలుడి చెవిలో పడ్డాయి. మరికొంత ముందుకు వెళ్లేసరికి.. ఒక తండ్రి, కొడుకు గొడవపడుతున్నారు.
“నువ్వు బతికుండగా ఈ ఆస్తి నన్ను అనుభవించనివ్వవు. గోపాలునిలా నిన్ను చంపి, ఈ ఆస్తి నేను లాక్కుంటాను” అంటున్నాడు కొడుకు.
అడుగడుగునా గోపాలునికి ఇటువంటి మాటలే వినిపించాయి. అతని హృదయం మరింతగా రగిలిపోయింది. బాధాతో అంతఃపురానికి చేరుకున్నాడు. తెల్లవారుతూనే మంత్రులిద్దరినీ రప్పించాడు.
“నేను పితృహంతకుడిననే అపవాదు రాజ్యమంతా వ్యాపించింది. కానీ, నేను తండ్రిని దైవంలా ఆరాధించినవాణ్ని. అలాంటి నేను నా తండ్రిని చంపడమేమిటి?! పైగా ఆ విషయం నాకు తెలియకపోగా.. రాజ్యంలో ప్రతి ఒక్కరికీ తెలియడం ఏమిటి?! దీనికి కారణమేమిటో అంతుపట్టడం లేదు. నిప్పు లేకుండా పొగరాదు. దీనిపై సరైన విచారణ జరిపి, నిజానిజాలు తేల్చండి” అన్నాడు గోపాలుడు.
అప్పుడు మంత్రులు..
“మహారాజా! మీకొక సంగతి మనవి చేయాల్సి ఉంది. మీ తండ్రిగారి చివరిరోజుల్లో మీరు విజయ యాత్రల్లో ఉన్నారు. ఆయన దగ్గర లేరు. మృత్యువు సమీపిస్తున్న కొద్దీ మీ తండ్రిలో క్రూరత్వం ఆవహించింది. చిన్నచిన్న అపరాధాలకే తన భృత్యులకు మరణదండన విధించేవాడు. ఒకరోజు మంగలి తెల్లవెంట్రుకకు బదులుగా నల్లవెంట్రుకను పెరికాడని చంపించాడు. భోజనంలో పంటికింద రాయి వచ్చిందని వంటవాణ్ని చంపించాడు. వింజామర గట్టిగా వీచిందని పరిచారికను చెరసాలలో పెట్టించాడు. వందిమాగధులు నిద్రాభంగం చేశారని కొరడాదెబ్బలు కొట్టించాడు. ఇలా మీ తండ్రి విచిత్రరీతిలో ప్రవర్తిస్తుంటే విసిగిపోయిన రాజ్యపౌరులందరూ ఆయన మరణాన్నే కోరుకునేవారు. అటువంటి సమయంలో మా తండ్రిగారు మరణించారు. మేం మంత్రిపదవిలోకి వచ్చాం. పరిస్థితులన్నీ సమీక్షించిన తరువాత, మీ తండ్రిగారిని చెరసాలలో పెట్టించాం. విజయయాత్ర ముగించుకుని, వెంటనే రాజ్యానికి రావాల్సిందని మీకు వార్త పంపాం. మీరు తిరిగి వచ్చేలోపుగా దైవికంగా మీ తండ్రిగారుచెరసాలలోనే మరణించారు” అని చెప్పారు. ఆ మాటలు వింటూనే గోపాలుడు తలవంచుకుని, కొంచెంసేపు ఊరుకున్నాడు. కళ్లనీరు నిండుతుండగా ఆకాశం వంక చూస్తూ..
“మంత్రులారా! మీరు శుక్రబృహస్పతులతో సమానులు. మంచిపనే చేశారు. కానీ, ఇలాంటి పనులు నా వంటివారికి పనికిరావు. నేనిప్పుడే రాజ్యాన్ని త్యజిస్తున్నాను” అన్నాడు.
తన తమ్ముడైన పాలకుడికి రాజ్యాన్ని అప్పగించి, కుమారుడైన నరవాహనదత్తుణ్ని అతని సంరక్షణలోనే వదిలేసి తపోవనానికి వెళ్లిపోయాడు. పాలకుడు రాజై ప్రజారంజకంగా కొంతకాలం పాలించాడు. ఒకసారి పాలకుడికి వరుసగా దుస్వప్నాలు రాసాగాయి. దాంతో ఆందోళన చెందిన పాలకుడు, తాను కూడా రాజ్యాన్ని వదిలేసి.. నరవాహనదత్తుణ్ని రాజును చేశాడు.
నరవాహనదత్తుడు రాజ్యం చేస్తుండగా ఒకనాడు.. అతనివద్దకు తన పిల్లలతో ఒక స్త్రీ వచ్చింది. ఆమె చూడటానికి చాలా అసహ్యంగా ఉంది. ఆమె పిల్లలు మాత్రం రత్నాల్లా మెరిసిపోతున్నారు. వారిని చూసి ఆశ్చర్య పడిన నరవాహనదత్తుడు.. ఎవరు మీరని అడిగాడు.
అప్పుడు ఆ స్త్రీ తన కథ ఇలా చెప్పింది..
“మహారాజా! నాపేరు పింగళిక. మాది కపిష్టిల అగ్రహారం. మా తండ్రిగారి పేరు సోమదత్తుడు. వేద వేదాంగ పారంగతుడైన ఆయనకు ధూమకేతువువంటి నేను జన్మించాను. పుట్టింది మొదలు నాకన్నీ దుర్గుణాలే. ఒక్క సుగుణమూ లేదు. ఆచారహీనురాలినై పుట్టినింటికి చెడ్డపేరు తీసుకొచ్చాను. వయసు పెరుగుతున్న కొద్దీ నా ఆగడాలకు మితి లేకుండాపోయింది. ఊళ్లో తగవులన్నీ ఇంటిమీదికి తీసుకొస్తుంటే భరించలేక, ఒకనాడు నా తండ్రి నన్ను అరణ్యంలో విడిచిపెట్టి రమ్మని శిష్యులను పురమాయించాడు. ఆ అడవిలో చిక్కుకున్న తరువాత.. హాయిగా చచ్చిపోతే ఈ బాధలన్నీ ఉండవు కదా అనుకున్నాను. చచ్చేందుకు మార్గం వెతుక్కుంటుంటే ఓ విష్ణువు ఆలయం, దానిపక్కనే తటాకం కనిపించాయి.
‘ఇందులో స్నానం చేసి, ఈ దేవుణ్ని పూజించి చచ్చిపోతే వైకుంఠం వస్తుంది’ అనుకున్నాను. ఆనాటినుంచి ఆ స్వామిని పూజించడమే దినచర్యగా కొన్నిరోజులు గడిపాను. అలా ఉండగా ఒకనాడు స్వామి కలలో కనిపించాడు. ‘పుత్రీ! నీ భక్తికి మెచ్చాను. ఏం వరం కావాలో కోరుకో’ అన్నాడు. అప్పుడు నేను..
‘స్వామీ! నన్ను వెంటనే చంపెయ్’ అని కోరుకున్నాను. ఆ మాటవిని స్వామి నవ్వుతూ..
‘పతి పుత్ర ధనాదులను కోరకుండా ఆత్మహత్యను కోరుకోవడం సమంజసం కాదు. జాగ్రత్తగా ఆలోచించి కోరుకో’ అన్నాడు. అందుకు నేను..
‘స్వామీ! నేను పూర్వజన్మంలో పుణ్యమేమీ చేయలేదు. ఈ జన్మలో నాకు పెళ్లయ్యే సూచనలేమీ కనిపించడం లేదు. అయినా ఇంతటి కురూపిని నన్ను పెళ్లి చేసుకునేవాడెవడు?! నాకు మరణమే మంచిది. వెంటనే దయచేయి’ అని కోరుకున్నాను.
అప్పుడు స్వామి..
‘పుత్రీ! నువ్వు అన్నమాట వాస్తవమే. పూర్వజన్మలలో నువ్వు చాలాతక్కువ పుణ్యకార్యాలే చేశావు. కానీ ఒకనాడు ఒక బ్రాహ్మణునికి కుంచెడు ధాన్యం దానమిచ్చావు. ఆయనపై నిన్ను ఉద్ధరించాల్సిన బాధ్యత ఉంది. అందుకోసమే మళ్లీ జన్మ తీసుకున్నాడు. అతనే నీకు భర్తకాగలడు. అతని కళ్లకు నువ్వు గొప్ప సౌందర్యవతిగా కనిపిస్తావు. వేరొక జన్మలో నువ్వొకసారి నువ్వులు తింటుండగా వేళ్లసందునుంచి ఎనిమిది గింజలు జారి అగ్నిహోత్రంలో పడ్డాయి. అందువల్ల నీకీ జన్మలో ఎనిమిదిమంది పిల్లలు కలుగుతారు. అయితే ఒక్కవిషయం గుర్తుపెట్టుకో. నువ్వు ధాన్య మివ్వడం వల్ల నీ భర్త అయ్యాడన్న విషయం ఆయనతో ఎన్నడూ చెప్పకు. అలా చెబితే ఆనాటితో నీకూ ఆయనకూ ఉన్న రుణానుబంధం తెగిపోతుంది’ అని సెలవిచ్చాడు.ఆ మరునాడే నా తండ్రి నన్ను వెతుక్కుంటూ అరణ్యానికి వచ్చాడు. నన్ను ఇంటికి తీసుకుపోయాడు. కొంతకాలానికి చతుర్వేది అయిన బ్రాహ్మణుడు ఒకడు మా ఊరిమీదుగా వెళ్తూ.. మా ఇంటిలో విడిదిచేశాడు. నన్ను చూసి.. ‘ఈ దివ్యాంగన ఎవరు? దేవలోకం విడిచి భూలోకానికి వచ్చినట్లుంది. సోమదత్తా! ఈమెను నాకిచ్చి వివాహం చేయగలవా?!’ అని
అడిగాడు. మా తండ్రిగారు సంతోషించి, మా పెళ్లి చేశారు. ఆయన నాపట్ల అత్యంత అనురాగంతో మెలిగేవాడు. కాలక్రమంలో మాకు ఎనిమిదిమంది పిల్లలు పుట్టారు. ఒకనాడు ఆయన.. ‘నాకు కాళ్లు నొప్పి పుడుతున్నాయి. కాసేపు కాళ్లు ఒత్తు!’ అని అడిగాడు.
అహంకారంతో కళ్లు మూసుకుపోయి..
‘నేను నిన్ను కుంచెడు ధాన్యమిచ్చి కొనుక్కున్నాను. నీకు పాద సంవాహనం చేయాల్సిన అవసరం లేదు’ అని పలికాను. నా భర్త నావంక విస్మయంతో చూశాడు.
‘ఎవరు నువ్వు.. నా పింగళిక ఏమైంది?!’ అని ప్రశ్నించాడు. విష్ణుదేవుడు సెలవిచ్చిన నా పూర్వజన్మ రహస్యాన్ని నా భర్తకు తెలియచేశాను. దాంతో ఆయన నన్ను అసహ్యించుకుని, వదిలిపెట్టి వెళ్లిపోయాడు. మా తండ్రిగారు స్వర్గస్థుడయ్యాడు. ఇప్పుడు పిల్లల పోషణకు తంటాలు పడుతూ మిమ్మల్ని శరణుజొచ్చాను!” .. అని చెప్పిన ఆమె కథను విని, నరవాహనదత్తుడు ఆ కుటుంబపోషణకు తగిన భత్యం ఏర్పాటుచేశాడు.
ఇంతవరకూ చెప్పిన తరువాత ఆ కథకుడు ఇంకా ఏదో చెప్పబోయేంతలో.. ఆ వీధిలో కలకలం చెలరేగింది. జనులందరూ ఇళ్లను వదిలి, తలోదిక్కుకూ పారిపోతున్నారు. ‘భూమి బద్దలైపోతున్నది. పరుగెత్తండో!’ అని అరుస్తున్నారు. నాకు ఏం జరుగుతున్నదో అర్థం కాలేదు. ప్రాణభయంతో పరుగెడుతున్నవారిని ఆపి, అసలు సంగతేమిటని అడిగే అవకాశం చిక్కడం లేదు. ఇంతలో ఒక మేడదాపున ఒక చిన్నది కాలికి రాయి తగిలి కిందపడి స్పృహతప్పి పడి ఉంది. ఆమెను లేవదీయలేక తల్లిదండ్రులు రోదిస్తున్నారు. ఎవరెవరినో సహాయం కోసం అర్థిస్తున్నారు. నేను వెనువెంటనే అక్కడికి చేరుకుని, ఆ కన్యను ఎత్తుకుని వారినొక సురక్షితమైన ప్రదేశానికి చేర్చాను. ఆమెకు మూర్ఛతేర్చాను.
“బాబూ! మాకోసం నువ్వు చిక్కుల్లో పడవద్దు. ఇక్కణ్నుంచి త్వరగా పారిపో” అన్నాడామె తండ్రి. “అసలేం జరిగింది? ఎందుకు మీరిలా పరిగెడుతున్నారు?” అని నేను ప్రశ్నించాను. అందుకాయన..
“మా నగరానికి అప్పుడప్పుడూ ఒక రాక్షసుడు వస్తుంటాడు. కనిపించిన వారందరినీ పీక్కు తింటాడు. వాడు వచ్చేముందు భూమి అదురుతుంది. బీటలు వారుతుంది. ఆ పగుళ్లలోనుంచి రాక్షసుడు బయటికొస్తాడు” అని చెబుతూ ఒక్కసారి ఉలిక్కిపడి..
“ఆ.. అయ్యయ్యో! చచ్చిపోయాంరా నాయనో..” అని అరిచాడు. వీధిచివర పర్వతాకారుడైన రాక్షసుడొకడు భూమిని చీల్చుకుని బయటపడ్డాడు. మావైపే రాసాగాడు. నేను కత్తి దూసి వాడిమీదికి ఉరికాను. గుహలాంటి నోరు తెరిచి, అగ్నిజ్వాలలాగా నాలుక వేలాడుతుండగా.. వాడు నన్ను తన చేతులతో పట్టుకుని మింగబోయాడు. నేను ప్రచండవేగంతో ఒక్కవేటు వేశాను. వాడి నాలుక తెగిపడింది. వాడు గింజుకుంటుండగా రెండు చేతులూ నరికేశాను. వాడు కొండలా నేలమీద పడ్డాడు. భీషణంగా ఘోషపెట్టసాగాడు. అదును చూసుకుని వాడి మెడపై వేటువేశాను. దాంతో రాక్షసపీడ వదిలిపోయింది. ఆ వీధిలోని వారందరూ నన్నొక దేవతలా ఆరాధనాభావంతో చూడసాగారు. పళ్లు, పూలు తెచ్చి నాకు సమర్పించసాగారు. నేను రక్షించిన బాలిక తండ్రిపేరు ధనకోటి. ఆయన పదికోట్ల దీనారాలకు అధిపతి. ఆయన తన కుమార్తెనిచ్చి నాకు పెళ్లి చేశాడు. వాళ్లు చేసిన హడావుడిలో నేను మీ సంగతి కూడా మరిచిపోయాను. ఆ మహోత్సవాలలో ఎనిమిదిరోజులు ఒక్క ఘడియలాగా వెళ్లదీశాను. ఈవేళ ఉదయాన్నే ఎవరో పెళ్లివారు పోట్లాటకు దిగారని తెలిసి వచ్చాను. వచ్చి చూసేసరికి మీరు కనిపించారు. ఆ తర్వాత జరిగిన కథ మీకు తెలిసిందే!
..అని మయూరధ్వజుడు తన కథను చెప్పడం ముగించాడు. అప్పుడు పుష్పకేతుడు..
“మన చరిత్రలు విచిత్రాలుగా ఉన్నాయి. ఒకే నగరంలో ఉంటూ కూడా వేర్వేరు దేశాల్లో ఉన్నట్లు వ్యవహరించాం. అవతలివీధిలో ఎవరో రాక్షసుడు చంపబడ్డాడని విన్నాను కానీ, చంపింది నువ్వని తెలియలేదు. ఈ నగరం ఎంతో పెద్దది కావడం వల్ల చాలా విశేషాలే చూశాం. దైవకృప చేత మనకు మంచి భార్యలు లభించారు. అమితమైన ధనాన్ని కూడా సంపాదించాం. ఇక మన దక్షిణ దిగ్విజయ యాత్ర సఫలమైనట్లుగా భావించి, ఇంటికి పోదాం” అని చెప్పాడు. స్త్రీరాజ్యాన్ని మంత్రుల పరం చేసి, చతురంగబల సమేతంగా పుష్పకేతుడు, సోదరులను వెంటబెట్టుకుని కొద్దికాలంలోనే కన్యాకుబ్జం చేరుకున్నాడు. వారికోసం బెంగపెట్టుకున్న తల్లిదండ్రులకు ఆనందం కలిగించాడు.
(వచ్చేవారం.. కాళిదాసు – జ్ఞానతీర్థుడు)
-అనుసృజన: నేతి సూర్యనారాయణ శర్మ