Kasi Majili Kathalu Episode 103 ( కాశీ మజిలీ కథలు ) |జరిగిన కథ : శ్రీదర్శనుడు జూదంలో తన ఆస్తినంతా పోగొట్టుకున్నాడు. ప్రాణత్యాగానికి సిద్ధపడ్డాడు. అప్పుడు అతనికి తన మిత్రుడొక కథ చెప్పాడు. ఆ కథ ప్రకారం.. కాశ్మీర దేశాధిపతి అయిన భూనందనుడికి ఒక వింత కల వచ్చింది. అందుకు తగ్గట్లే ఒక వ్యాజ్యంలో తీర్పు చెప్పాల్సి వచ్చింది. దాంతో తన కలలో కనిపించిన సుందరిని ఎలాగైనా పొందాలని తపస్సుకు కూర్చున్నాడు భూనందనుడు.
మహర్షి చెబుతున్నాడు.
“మహారాజా! నీ కలలో కనిపించిన సుందరి ఒక పాతాళలోక నివాసిని. రాక్షసకన్య. పాతాళలోక వాసుల సౌందర్యం, వారి మహిమలు మానవులకు అంతుపట్టవు. ఆమె వల్ల నువ్వు విరాళిలో తూలిపోవడం వింతేమీ కాదు. విచారించకు. నువ్వు కోరితే నిన్నక్కడికి తీసుకుపోగలను!”. ఆయన మాటలతో భూనందనుడికి చెప్పలేనంత సంతోషం కలిగింది. “మహాత్మా! నా పాలిట మీరే మహేశ్వరులు. నా తపస్సు పండించడానికే దర్శనమిచ్చారు. నామీద ఇంత కరుణ చూపిన మీ వృత్తాంతమేమిటో తెలుసుకోవచ్చా?!” అని పలికాడు. అందుకు చిరునవ్వు నవ్వుతూ, మహర్షి తన గాథను చెప్పసాగాడు.
“కాశ్మీర దేశాధిపతీ! మాది దక్షిణదేశం. మా తండ్రిపేరు యజ్ఞవర్మ. నాపేరు వసుభూతి. గొప్ప యోగసాధకుడైన మా తండ్రినుంచి పొందిన జ్ఞానంతో నేను పాతాళశాస్ర్తాన్ని పఠించాను. హాటకేశ్వర మంత్ర తంత్ర విధులను క్షుణ్నంగా అభ్యసించాను. అంతటితో విడిచిపెట్టకుండా శ్రీశైలంలో చాలాకాలం తపస్సు చేశాను. మల్లికార్జున దేవుడు నన్ను కరుణించి స్వప్నంలో కనిపించాడు..
‘వసుభూతీ! నువ్వు పాతాళలోకానికి వెళ్లి, దైత్యకన్యలతో చాలాకాలం సుఖించిన తరువాత నన్ను చేరుకోగలవు. భూలోకం నుంచి పాతాళానికి వెళ్లడానికి అనేక మార్గాలున్నాయి. వాటిలో ముఖ్యమైనది కాశ్మీరదేశంలో ఉంది. అది పూర్వం మయబ్రహ్మచేత నిర్మితమైంది. ఆ మార్గాన్ని అనుసరించి బాణాసురుని కూతురైన ఉష.. పూర్వం అనిరుద్ధునితో క్రీడించింది. అప్పుడామెకు ప్రద్యుమ్నుడనే కుమారుడు ఉదయించాడు. కొడుకును రక్షించుకోవడం కోసం ఉషాదేవి ఆ గిరికూటాలలో ఒక ద్వారం నిర్మించి, దుర్గాలయం కట్టించింది. ఆ గిరికూటానికే ప్రద్యుమ్నకూటం అని పేరు. నువ్వు ఆ మార్గంలో వెళ్తే నీకు భోగసిద్ధి కాగలదు!’.. అని పలికి మల్లికార్జునుడు అంతర్ధానమయ్యాడు.
అలా శివుని ఆనతిమేరకు నేనీ భూమికి వచ్చాను. ఇక్కడ త్రికూటశైలంపై త్రిమూర్తులు వెలిసి ఉన్నారని, వితస్తానదీ తీరం పరమపావనమని వీటిని సేవించాను. నువ్వు కనిపించావు. నాతో వస్తే నీకు నీ కలలో కనిపించిన కన్యను చూపగలను!”.. అని చెప్పి, రాజును బయల్దేరదీశాడు మహర్షి. ఆ మహర్షి వెంట రాజుతోపాటు అనేకమంది శిష్యులు కూడా ఉన్నారు. వారంతా కలిసి ప్రద్యుమ్నకూటమనే గిరిశిఖరాన్ని ఎక్కి.. అక్కడ నెలకొన్న వినాయకుణ్ని, శారికాదుర్గను ఆరాధించారు. ఒకచోట మహర్షి చేతిలోకి ఆవాలు తీసుకుని మంత్రించి నాలుగుమూలలా చల్లాడు. ఒకచోట భూమినుంచి తలుపు ఒకటి తెరుచుకుంది. కిందికి మెట్లు కనిపించాయి. ఆ మెట్ల వెంబడి పదిరోజులపాటు అహోరాత్రాలనే భేదం లేకుండా వాళ్లంతా నడిచివెళ్లసాగారు.
పదకొండోనాటికి పాతాళగంగ కనిపించింది. అక్కడి భూమి అంతా వెండిమయంగా ఉంది. ఆ గంగాతీరంలో చందనం, అగరుచెట్ల వాసనలు కమ్ముకుని ఉన్నాయి. ఆ వనమధ్యంలో మణిశిలలతో నిర్మించిన హాటకేశ్వర లింగం ఉంది. అక్కడి చెట్లపూలతో, గంగతో ఆ లింగాన్ని అర్చించిన మీదట మళ్లీ బయల్దేరబోతుండగా ఒక వింత జరిగింది.
“పండ్ల చెట్లు కనిపిస్తే ఎవరూ ముట్టుకోవద్దు” అని మహర్షి చెప్పబోతున్నాడు. అంతలోనే ఒక శిష్యుడు నేరేడు పండు కనిపిస్తే.. తెంపి నోట్లో వేసుకున్నాడు. అతను అక్కడే శిలగా మారిపోయాడు. మిగిలినవారంతా ఆ దృశ్యాన్ని చూసి భయపడుతూ క్రోసెడు దూరం పరిగెత్తారు.
వసుభూతి వెనుక మెల్లిగా వచ్చి, శిష్యులతో కలుసుకున్నాడు. వారిని ముందుండి మరికొంతదూరం నడిపించాడు. అక్కడో స్వర్ణప్రాకారం కనిపించింది. తలుపులు మూసి ఉన్నాయి. బయట రెండు మేకలు దర్శనమిచ్చాయి. వాటికి ఇనుప కొమ్ములున్నాయి. సమీపించిన వారిని కొమ్ములతో కుమ్ముతూ.. లోపలికి ప్రవేశించకుండా అడ్డుకుంటున్నాయి. వసుభూతి తన యోగదండంతో మంత్రించి, ఆ మేకల తలపై కొట్టాడు. వజ్రాయుధం దెబ్బ తగిలినట్లు రెండు మేకలూ బాధతో మూలుగుతూ అక్కణ్నుంచి పారిపోయాయి. తలుపులు తెరిచి శిష్యులతో కలిసి లోపలికి ప్రవేశించాడు వసుభూతి.
లోపల అనేకమంది సైనికులున్నారు. వాళ్లంతా రాక్షసులు. వీరిని చూసి మీదికి రాబోయారు. వసుభూతి మంత్రాక్షతలు చల్లుతుంటే రాక్షసులంతా ఎక్కడివారక్కడ పలాయనం చిత్తగించారు.
మరికొంత లోపలికి వెళ్లి చూసేసరికి విచిత్రమైన భవంతులు అనేకం ఉన్నాయి. ఆ భవంతులలోనుంచి కొంతమంది మదవతులు బయటికి వచ్చారు. వసుభూతిని, ఆయన శిష్యులను చుట్టుముట్టి సాదరంగా తమ భవంతులకు తీసుకుపోయారు. కాశ్మీరభూపతి భూనందనుడు మాత్రం మిగిలిపోయాడు. ఆయన తన కలలో కనిపించిన కన్యకోసం అన్వేషణ సాగించాడు. ఉద్యానవనాల్లో తిరుగుతుండగా ఒకచోట రత్నాలు పొదిగిన సాలభంజికలు దర్శనమిచ్చాయి. వాటి మధ్యలో తన ప్రేయసి కనిపించింది. కానీ, రత్నపుకాంతులు పరావర్తనం చెందుతుండగా.. ఆమె ఒక్కతే అనేకమందిగా కనిపించి కొంతసేపు భూనందనుడు భ్రాంతికి లోనయ్యాడు.
చివరికి ఒక యువతిని నిర్ధారించుకుని, చేయి పట్టుకున్నాడు. ఆమె నవ్వుతూ..
“మహాభాగా! నిన్ను చాలా కష్టపెట్టాను. నా అపరాధాన్ని మన్నించు” అని సాదరంగా పలుకుతూ తీసుకుపోయి ఒక రత్నపీఠంపై కూర్చోబెట్టింది. పూల విసనకర్రతో విసురుతూ అతనికి అలసట పోగొట్టింది.
అక్కడే ఒక దిగుడుబావి ఉంది. గట్టుపైనున్న చెట్టు కొమ్మలపై నుంచి కొన్ని శవాలు ఊడల్లా ఆ బావిలోకి వేలాడుతున్నాయి. ఆ శవాలనుంచి రక్తం కారుతూ బావినీళ్లలో కలిసిపోతున్నాయి. కొందరు రాక్షస స్త్రీలు ఆ బావిలోకి దిగి నీళ్లు తాగుతున్నారు. దానిని చూసి భూనందనుడు ఏవగించుకున్నాడు. ‘అయ్యో! ఈ రాక్షసులు ఎంత సుందరులైనా జాతిస్వభావాన్ని విడిచిపెట్టలేరు కదా!’ అనుకున్నాడు. ఇంతలో ఒక పరిచారిక రెండు గిన్నెలతో ఆ బావి నీటిని తీసుకొచ్చి భూనందనుని ప్రేయసి ముందుంచింది. ఆమె ఆ గిన్నెను భూనందనుని నోటికి అందించబోయింది.
“మనోహరా! మీరీ మద్యాన్ని సేవించండి. దీనితో నేను మీకు పూర్తిగా వశమవుతాను” అన్నది. భూనందనునికి ఆ వాసన చూడగానే వికారం పుట్టింది. ముక్కుమూసుకుని.. “వద్దు వద్దు!” అన్నాడు గిన్నెను పక్కకు తోసేస్తూ.
“తోయవద్దు. దీనిని తాగకపోతే మీకు ముప్పు రాగలదు. నా మాట వినండి” అన్నది. కానీ భూనందనునికి మనసు అంగీకరించలేదు. “ఇది మేము తాగదగినది కాదు. వద్దు” అంటూ మళ్లీ తోసివేశాడు. మూడుసార్లు ప్రయత్నించి విఫలమైన రాక్షసకన్య హెచ్చిన కోపంతో..
“నీ కర్మ ఇలా ఉంటే నేనేం చేయగలను” అంటూ ఆ గిన్నె ఎత్తి అతని నెత్తిపై పగలగొట్టింది. ఆ దెబ్బతో మూలుగుతున్న అతణ్ని పరిచారకులు పట్టుకుపోయి బలవంతంగా ఒక నూతిలో పారేశారు.
భూనందనుడు ఆ నూతిలో మునిగి లేచి, కళ్లు తెరిచి చూసేసరికి.. గతంలో తాను తపస్సు చేసుకున్న విక్రమ సరస్సు తీరంలో ఉన్నాడు. ఆశ్చర్య భరితుడై సరస్సునుంచి బయటికి వచ్చాడు.
‘అయ్యో.. ఇదంతా కల కాబోలు. మొదటిసారి వచ్చిన కలకంటే మరీ విపరీతంగా ఉంది. ఆ మహర్షి తనతోపాటు రసాతలానికి తీసుకుపోవడం, అక్కడి విశేషాలు చూపడం అన్నీ కలలోని వింతలే కాబోలు!’ అనుకుంటూ తన ఒంటిని తడిమి చూసుకున్నాడు. అక్కడి కన్యలు తనను అలంకరించిన గుర్తులు కనిపించాయి. ‘నా నార వస్ర్తాలు అక్కడే విడిచేశాను. ఈ పట్టువస్ర్తాలు ఎక్కణ్నుంచి వచ్చాయి. ఈ ఆభరణాలన్నీ ఎక్కణ్నునుంచి వచ్చాయి. అయితే ఇది కలకాదు’ అనుకుంటూ తల తుడుచుకున్నాడు. ఇంతలో అతని శిరస్సు చుట్టూ తుమ్మెదలు మూగడం గమనించాడు. ‘బహుశా ఆమె నా నెత్తిన పగలగొట్టిన మద్యం ప్రభావం కాబోలు. ఆహా! ఇప్పుడెంత సువాసన వస్తున్నది?! అప్పుడు మాత్రం వాంతి వచ్చిందేం!?’ అనుకున్నాడు. ఇంతలో అక్కడికి ఒక మునికుమారుడు వచ్చాడు.
“ఓయీ! నీవెవ్వరు? నీ నెత్తిమీద తుమ్మెదలు మూగుతున్నాయేమిటి? నీనుంచి మంచి పరిమళం వస్తున్నది. ఏమి రాసుకున్నావు. నీ వస్ర్తాలు, అలంకారాలు చూస్తుంటే మానవుడిలా కనిపించడం లేదు సుమా!” అని ప్రశ్నించాడు.
భూనందనుడు అతనికి నమస్కరించి.. “మహాత్మా! నేను మానవుణ్నే. దివ్యపదాన్ని పొంది, యయాతిలా భ్రష్టుడినయ్యాను” అంటూ తన వృత్తాంతమంతా అతనికి తెలియచేశాడు.
“కలలో కనిపించిన ఆడదాని కోసం పన్నెండేళ్లు తపస్సు చేసి వెర్రివాడినయ్యాను. తపస్సు ఫలమంతా ఒక్కదెబ్బతో చిందర వందరైపోయింది. ఇంక నాకీ జన్మలో మళ్లీ అటువంటి విచిత్ర వస్తువులు కనిపించవు కదా! రాజ్యంపై ఆశ ఎప్పుడో పోయింది. ఇప్పుడు దేహంపై కూడా ఆసక్తి పోయింది. నాకు మరణమొక్కటే శరణ్యం” అని వేదన వెలిబుచ్చాడు. అందుకు ఆ మునికుమారుడు..
“రాజా! ఎంతవరకు దేహాభిమానం ఉంటుందో అంతవరకు దుఃఖక్షయం కానే కాదు. ఈ సంసారమంతా కలవంటిది కాకుండా సత్యమే అనుకుంటున్నావా? ఇదో దీర్ఘస్వప్నం మాత్రమే. నిద్ర నుంచి లేవగానే.. కల చెదిరిపోగానే.. మోహం తీరగానే సంసారమంతా మిధ్య అని తెలియవస్తుంది. కలలోవలె ఉద్వేగం పొందితే మానవుడు ఇహంలో పురుషార్థాలను సాధించలేడు. నువ్వు గురువు మాట వినకుండా, ఆమె ఇచ్చిన పానీయాన్ని తాగకుండా తప్పు చేశావు. ఇదిగో నేను ఉపయోగించుకునే నా కృష్ణాజినాన్ని నీకు ఇస్తున్నాను. దీనిపై కూర్చుని మళ్లీ తపస్సు కొనసాగించు. నీకీ తుమ్మెదల బాధ తొలగిపోతుంది. భేదబుద్ధి నశించి, తపస్సులో ముందుకు వెళ్లగలవు” అని ఆశీర్వదించి.. కృష్ణాజినాన్ని అందించి వెళ్లిపోయాడు. ఆనాటినుంచి మళ్లీ పన్నెండేళ్లపాటు భూనందనుడు ఉగ్రతపస్సు కొనసాగించాడు. ఒకనాడు ధ్యానంలో కళ్లు మూసుకుని ఉన్న ఆ మహారాజుకు దివ్యసౌరభాలు పొడసూపాయి. కళ్లు విచ్చి చూసేసరికి తన ఎదుట ప్రేయసి కనిపించింది. “మనోహరా! ఇప్పుడు నేను నీకు పూర్తిగా అధీనమయ్యాను. నాతో రా” అంటూ అతణ్ని రసాతలానికి తీసుకుపోయింది. చాలాకాలంపాటు ఆమెతో భూనందనుడు దివ్యభోగాలు అనుభవించాడు.
..శ్రీదర్శనా విన్నావు కదా! మానవ ప్రయత్నం మానకుండా ఉంటే ఎప్పటికైనా పోయిన సంపదలను మళ్లీ పొందవచ్చు. సౌఖ్యాలను అనుభవించవచ్చు. డబ్బు పోయిందని భోజనం మానివేయడం సమంజసం కాదు” అంటూ ముఖరకుడు బుజ్జగించి శ్రీదర్శనుడి చేత అన్నం తినిపించాడు. ఆ తరువాత..
“మిత్రమా! నీ ఉపదేశం నాకు శిరోధార్యం. నేను ఉత్తమ వంశంలో పుట్టినా కూడా ఇలా జూదం వల్ల భ్రష్టుడినైపోవడం తలుచుకుంటే సిగ్గేస్తున్నది. ఇలా దరిద్ర స్వరూపంతో ఈ ఊరిలో ఉండటం నా వల్ల కాదు. ఈ ఊరు విడిచి ఏ ఊరికైనా వెళ్లిపోతాను” అన్నాడు శ్రీదర్శనుడు.
ఆపదలు చుట్టుముట్టి భీతిపొందిన సమయంలో మిత్రుని కంటే మంచి ఆధారం మరొకటి దొరకదు. మైత్రిని విడిచిపెట్టుకోలేక శ్రీదర్శనుడితోపాటు ముఖరకుడు కూడా బయల్దేరాడు. కొన్నాళ్లు వాళ్లు దేశసంచారం చేయసాగారు. ఒకనాడు వాళ్లిద్దరూ ఒక మహారణ్య మధ్యం నుంచి ప్రయాణిస్తున్నారు. ఆ సాయంకాలం వేళలో నిర్మల జలాలతో నిండిన ఒక తటాకం వద్ద విశ్రాంతి తీసుకుంటున్నాడు శ్రీదర్శనుడు. ముఖరకుడు పండ్లు సేకరించడానికి వెళ్లాడు. కొంతసేపటికి ఒక యువతి అక్కడికి వచ్చింది. శివుడు నిప్పుకన్ను తెరవడం వల్ల మాడిపోయిన మన్మథుడనే ధూమాన్ని ముట్టుకున్న రతీదేవిలా.. నల్లకలువలా ప్రకాశిస్తున్న ఆమెను చూసి కళ్లు తిప్పుకోలేకపోయాడు శ్రీదర్శనుడు. అతణ్నే గమనిస్తూ దగ్గరికి వచ్చిందామె.
“మహాభాగా! మీరెవరు? ఇది ప్రమాదకరమైన ప్రదేశమని మీరెరుగరా?! ఇక్కడికెందుకొచ్చారు. అగ్నిశిఖలను చూసి భ్రమపడిన శలభాల్లాగా ఈ ప్రదేశంలో కనిపించే వైభవాన్ని చూసి ఇక్కడ బస చేశారా?! వద్దు సుమా! తొందరగా ఇక్కణ్నుంచి వెళ్లిపోండి” అని హెచ్చరించింది. అందుకు శ్రీదర్శనుడు..
“జవ్వనీ! నువ్వెవరు? చూడబోతే ఉత్తమజాతి కన్యలా ఉన్నావు. ఈ అడవిలో ఎందుకున్నావు?! మాకు కలగబోయే ఆపద ఎటువంటిది?! దయచేసి నిజం చెప్పు” అన్నాడు. అందుకు సమాధానంగా ఆమె తన కథ చెప్పసాగింది.
(వచ్చేవారం.. సాహసాన్ని మెచ్చిన భేతాళుడు)
-అనుసృజన: నేతి సూర్యనారాయణ శర్మ