జరిగిన కథ : పుత్రకునికి మహిమాన్వితమైన పాదుకలు, దండం, బొంతసంచి లభ్యమయ్యాయి. కోతులు ఎత్తుకుపోవడం వల్ల వాటిని పొందిన ఆనందం అంతలోనే ఆవిరైంది. ఎంతో కష్టపడి పాదుకలు, దండం తిరిగి సంపాదించాడు. బొంతసంచి రామజోగి అనే బిచ్చగాడి దగ్గర చూసి, దానిని చేజిక్కించుకునేందుకు అతణ్ని మాటల్లో పెట్టాడు. పుత్రకుడు కథ చెబుతున్నాడు. రామజోగి వింటున్నాడు.
గంపగయ్యాళి గోగునార మోకులన్నీ బండికి ఎక్కించింది. ఊరిబయట రావిచెట్టు దగ్గరికి వెళ్లింది. తన చేతుల తీట తీరేలాగా ఆ చెట్టునే భర్తగా భావించుకుని మోకులతో కొట్టసాగింది.
చాలాకాలం నుంచి ఆ రావిచెట్టును ఆశ్రయించుకుని ఒక బ్రహ్మరాక్షసుడు ఉన్నాడు. గంపగయ్యాళి చెట్టును కొడుతుంటే బ్రహ్మరాక్షసుడికి వీపు వాచిపోయింది. వాడు తట్టుకోలేక ‘కుయ్యోమొర్రో!’ అని అరుస్తూ ఆ చెట్టునొదిలి పరిగెత్తాడు. ఆమె దెబ్బలకు జడిసి.. పాపం తెల్లారేదాకా అలా పరిగెడుతూనే ఉన్నాడు.
అంతలో ముష్టిమూటలు నెత్తికెత్తుకుని, సానుభూతి అతనికి ఎదురొచ్చాడు. వాళ్లిద్దరూ మాటల్లో పడ్డారు.
“అయ్యా! మాది విన్నకోట అగ్రహారం” అని చెప్పాడు సానుభూతి.
“అయ్య బాబోయ్! ఆ ఊళ్లో మా రాక్షసులకంటే బలమైన గంపగయ్యాళి ఉందయ్యా! ఆమె కొట్టిన దెబ్బలకు నా వీపు పగిలిపోయింది. ఆ ఊళ్లో నువ్వెలా ఉంటున్నావయ్యా బాబూ!” అన్నాడు జాలిగా బ్రహ్మరాక్షసుడు.
సానుభూతి ఏడవలేక నవ్వుతూ..
“ఆ గయ్యాళి మా ఆవిడేనయ్యా! రోజూ నన్ను మోకులతో కొట్టడం ఆమెకు అలవాటు. నేను ఊళ్లో లేకపోవడం వల్ల నిన్ను బాదినట్టుంది” అని చెప్పాడు.
“అబ్బా అబ్బా.. ఎలా తట్టుకుంటున్నావయ్యా ఆ దెబ్బలు! వాటి కోసమేనా ఏదో పుట్టి మునిగిపోయినట్టు ముష్టి మూటలెత్తుకుని మళ్లీ బయల్దేరావు” అన్నాడు బ్రహ్మరాక్షసుడు వీపు తడుముకుంటూ.
“ఏం చేస్తాను?! ఏదో ఇంత కాచిపోస్తున్నది కదాని దెబ్బలు పడి ఊరుకుంటున్నాను. దాన్ని విడిచిపెడితే నాకు మళ్లీ పెళ్లికాదు. నేను అతి దరిద్రుణ్ని. ఏం చేయను” అని విచారం వ్యక్తంచేశాడు సానుభూతి.
అతని మాటలు వింటుంటే దయ అనే మాటకు అర్థమే తెలియని బ్రహ్మరాక్షసుడికి బోలెడంత జాలి ముంచుకొచ్చింది.
“ఓ బ్రాహ్మణుడా! దుఃఖించకు. నేను చెప్పినట్టు చేస్తే నీకు నీ పెళ్లాం పీడ వదిలిస్తాను. ఇక్కడికి దగ్గరలో వనదుర్గమనే నగరాన్ని దుర్గాదత్తుడనే రాజు పాలిస్తున్నాడు. అతనికి ఒకతే కూతురు. నేను దానిని పడతాను. భూతవైద్యులకు లొంగకుండా ప్రాణావశిష్టను చేస్తాను. కొన్నిరోజులాగి నువ్వక్కడికి రా. భూతాన్ని వదిలిస్తానని రాజుకు చెప్పి.. నీకు కావాల్సిన భూములో, గ్రామాలో కోరుకో. నా దగ్గరికి వచ్చి, రావిచెట్టు బ్రాహ్మణుడిని వచ్చానని చెప్పు. వెంటనే నేను రాజు కూతురిని వదిలేస్తాను. దాంతో నువ్వు భాగ్యవంతుడివి కావచ్చు. మరో మంచిపిల్లను చూసి పెళ్లి చేసుకోవచ్చు” అని చెప్పాడు.
సానుభూతి సంతోషపడి అలాగేనని ఒప్పుకొన్నాడు.
బ్రహ్మరాక్షసుడు వెంటనే వనదుర్గానికి పోయి, దుర్గాదత్తుని కూతురిని ఆవేశించాడు. దాంతో ఆమె కెవ్వుమని పెద్దకేక పెట్టి, సొమ్మసిల్లి పడిపోయింది. మెలకువ వచ్చింది మొదలు ఎవరు దగ్గరకి వచ్చినా మెడపట్టుకుని కరవబోయేది. దాంతో ఆమెను గదిలో బంధించారు. ఎందరో వైద్యులను రప్పించి, రకరకాల ప్రయోగాలు చేయించారు. కానీ ప్రయోజనం లేకపోయింది.
“రాకుమార్తెకు భూతాన్ని వదిలించిన వారికి నూరు గ్రామాలు రాసిస్తాను” అని దుర్గాదత్తుడు ప్రకటించాడు.
అప్పుడు సానుభూతి వచ్చాడు. తాను భూతాన్ని వదిలించగలనన్నాడు. అతని వాలకం చూస్తే ఎవరికీ నమ్మబుద్ధి కాలేదు. కానీ ఎందుకైనా మంచిదని రాకుమారి ఉన్న గదిలోకి వెళ్లనిచ్చారు. అతణ్ని చూడగానే రాకుమారి అరుస్తూ మీదికి రాబోయింది.
అతను రెండు చేతులూ జోడించి..“తండ్రీ! నేను సానుభూతిని. రావిచెట్టు బ్రాహ్మణుడిని వచ్చాను. నీవల్ల నాకు నూరు గ్రామాలు దక్కాయి” అని పలికాడు.
అప్పుడు బ్రహ్మరాక్షసుడు రాకుమారి శరీరంనుంచి ఈవలకు వచ్చాడు.“పారుడా! నీకోసమే ఇంతకాలమూ ఇంత అట్టహాసం చేస్తున్నాను. నీకు కావాల్సింది దొరికింది కదా! సుఖంగా ఉండు. నేనీమెను విడిచిపెట్టి పోతున్నాను. మరొక్కమాట చెబుతున్నాను ఆలకించు. బ్రహ్మరాక్షసులకు యవ్వనంలో ఉన్న ఆడపిల్లలను ఆవేశించినప్పడు చాలా సంతోషంగా ఉంటుంది. నేనిప్పుడు మరో రాజపుత్రికను ఆవేశిస్తాను. నువ్వు అక్కడికి రాకూడదు. వస్తే నిన్ను కూడా తినేస్తాను. జాగ్రత్త!” అని పలికి అక్కణ్నుంచి వెళ్లిపోయాడు.
బ్రహ్మరాక్షసుడు వదిలిపోగానే.. విరుచుకుపడిపోయిన రాకుమారికి మెల్లిగా మెలకువ వచ్చింది. దుర్గాదత్తుడు చాలా సంతోషించాడు. సానుభూతికి మొదట చెప్పినదానికంటే ఎక్కువ డబ్బిచ్చాడు. అతనికి చక్కని భవంతి కట్టించాడు. మరో బ్రాహ్మణ పుత్రికతో పెళ్లి చేయించి, తన నగరంలోనే కాపురం పెట్టించాడు. కొంతకాలం ఆనందంగానే గడిచింది. రావిచెట్టు బ్రహ్మరాక్షసుడు వేరొక రాచకన్యను ఆవేశించాడు. ఆ రాజు దుర్గాదత్తునికి స్నేహితుడు. దుర్గాదత్తుని కుమార్తెకు సానుభూతి రాక్షసపీడను వదిలించాడని ఆ రాజు విన్నాడు.‘మీ ఆస్థాన మాంత్రికుణ్ని మా పురానికి పంపించవలసింది’ అని వర్తమానం పంపించాడు.దుర్గాదత్తుడు ఆ ఉత్తరం చదువుకుని, సానుభూతిని పిలిపించాడు. సంగతి సందర్భాలు తెలియచేశాడు.
“మీరీ పనిచేస్తే మీ కీర్తి విశ్వవ్యాప్తం కాగలదు” అన్నాడు.
సానుభూతికి భయం వేసింది.
“మహారాజా! భూతోచ్ఛాటన సామాన్యం కాదు. నా తపస్సంతా ధారపోసి మీ ఇంటిలో బ్రహ్మరాక్షసుణ్ని విడిపించాను. ఇప్పుడు నా శక్తి సరిపోదు. తెగించి ప్రయత్నిస్తే నేను పరానికి దూరమైపోతాను” అని చెప్పాడు.
దుర్గాదత్తుడు అంగీకరించలేదు.
“మహామాంత్రికా! ఆ రాజు నాకు మంచిమిత్రుడు, బంధువు కూడా. ఈ ఒక్కసారికీ మీరక్కడికి వెళ్లక తప్పదు. ఇంకెప్పుడూ ఎక్కడికీ పంపించనని మాటిస్తాను. ఇప్పుడు మాత్రం నా మాట దక్కించాలి” అని బతిమాలుకున్నాడు.
తప్పనిసరై సానుభూతి ఒప్పుకొన్నాడు. అష్టాక్షరి మంత్రాన్ని జపిస్తూ రాకుమారి గదిలో అడుగుపెట్టాడు.
“అయ్యా! నేను రావిచెట్టు బ్రాహ్మణుడిని వచ్చాను” అన్నాడు.“ఆ.. నువ్వా?! మళ్లీ వచ్చావా?! ఎందుకొచ్చావ్?! రావద్దని చెప్పలేదూ.. చూడు నిన్నేం చేస్తానో!” అంటూ మీదికి రాబోయాడు బ్రహ్మరాక్షసుడు.
“అయ్య బాబోయ్.. నా తప్పేం లేదు. మా గయ్యాళి పెళ్లాం వచ్చింది. బయట ఉంది. బండిమీంచి మోకులు దింపుతున్నది. ఈ సంగతి చెప్పి నిన్ను రక్షించాలనే వచ్చాను” అన్నాడు భయపడుతూ సానుభూతి.
“అమ్మ బాబోయ్… ఆమె వచ్చిందా!?” అంటూ బ్రహ్మరాక్షసుడు అక్కణ్నుంచి పారిపోబోయాడు.
సానుభూతి అతని చెయ్యి పట్టుకుని ఆపేస్తూ..
“మహానుభావా! నువ్వయితే పారిపోగలవు. మరి నా గతేంటి?! నన్ను కూడా రక్షించు” అని వేడుకున్నాడు.“దాన్ని పెళ్లి చేసుకున్నందుకు అనుభవించు. నువ్వెలా పోతే నాకేంటి!?” అంటూ బ్రహ్మరాక్షసుడు పట్టు విడిపించుకుని సముద్రాలు దాటి పారిపోయాడు. ఆ తరువాత ఆ చుట్టుపక్కల ఎక్కడా వాడి జాడలేదు.సానుభూతికి ఆ రాజుకూడా వెలకట్టలేని బహుమతులిచ్చాడు. దానితో దేవేంద్ర భోగాలు అనుభవిస్తూ సానుభూతి చాలాకాలం సుఖంగా ఉన్నాడు.
అంటూ కథను పూర్తిచేసి..
“నువ్వు చెప్పిన కథలోని కోడళ్లమారి అత్తకంటే ఆ గంపగయ్యాళి ఎక్కువ గద్దరి అవునా కాదా!” అని అడిగాడు పుత్రకుడు. చివరిగా..
“రామజోగీ! ఇంతసేపూ నీతో మాట్లాడటం వల్ల నీపట్ల నాకు గాఢమైన స్నేహభావం కలిగింది. ఒక పనిచెయ్యి.. నీ జోలె, ఢక్కా నాకియ్యి. ఆ కోడండ్రమారి దగ్గర్నుంచి నువ్వు ఆశించిన దానికంటే ఎక్కువధనం సంపాదించుకొస్తాను” అన్నాడు.
రామజోగి అతని మాటలు అంగీకరించాడు. తాను జోలెగా వాడుకుంటున్న పుత్రకుడి బొంతసంచీని అతనికిచ్చాడు. దాంతోపాటు ఢక్క కూడా ఇచ్చాడు. అవి రెండూ తీసుకుని ఊళ్లోకి వెళ్లినట్లు నటించిన పుత్రకుడు.. ఏకాంత ప్రదేశానికి మళ్లాడు. బొంతసంచిపై దండంతో కొట్టాడు. దానినుంచి బంగారునాణేలు రాలాయి. ఆ నాణేలు తీసుకువెళ్లి రామజోగి ముందు పోశాడు.
వాటిని చూసిన రామజోగికి కళ్లు మెరిశాయి.
“కాసేపు ఉండు.. మరో ఇంటికి వెళ్లి, మరికొంచెం సంపాదించుకొస్తా!” అని పలికాడు పుత్రకుడు.
బంగారు నాణేల మీద ఆశకొద్దీ రామజోగి తలూపాడు. ఈసారి పుత్రకుడు తిరిగిరాలేదు. పాదరక్షలు తొడుక్కుని.. ‘నేనిప్పుడు దక్షిణసముద్రానికి పోవాలి’ అని తలుచుకున్నాడు.
రామేశ్వరం నుంచి తీర్థయాత్రలు చేయసాగాడు. తన దగ్గరున్న దండం సాయంతో తానే ఒక కొత్తరాజ్యాన్ని నిర్మించుకోవచ్చు. అయితే అటువంటి రాజ్యానికి అనువైన ప్రదేశం ఎక్కడుందో తెలుసుకోవడానికి పుత్రకుడు చాలాకాలం తీర్థయాత్రల్లో గడిపాడు. ఒకనాడు మహాబలిపురంలో ఒక పేదరాలి ఇంటికి వెళ్లాడు.
“అవ్వా! నేనీ పట్టణంలో కొంతకాలం ఉందామనుకుంటున్నాను. మీ ఇంటిలో ఉండనిస్తే నువ్వు కోరినంత ధనమిస్తాను” అన్నాడు.
అందుకు ఆ పేదరాలు..
“బాబూ! నేను బతికి చెడినదాన్ని. అన్నం అమ్ముకోను. ఈ పూటకు భోజనం పెట్టగలను” అన్నది.
పుత్రకుడు తింటున్నంతసేపూ అవ్వ తన కథ చెప్పింది. ఆమె భర్త మహాబలిపురం రాజుగారి ఆస్థానంలో పండితుడిగా ఉండేవాడు. ఇటీవలే ఆయన మరణించాడు. పిల్లలు లేకపోవడంతో ఆస్తి దాయాదుల పాలైంది. అయితే ఈమధ్యనే మహారాజు కుమార్తె అయిన పాటలికతో అవ్వకు స్నేహం ఏర్పడింది.
రోజూ తనకో కథ చెబితే అవ్వకు నెలభత్యం ఇచ్చే ఏర్పాటు చేస్తానంది యువరాణి. అవ్వ సంతోషించింది. కానీ, యువరాణి ఎప్పుడూ ఆమె చెప్పే కథలను సరిగా వినదు, పట్టించుకోదు. ఇలాగైతే వస్తున్న నెలభత్యం కూడా పోతుందేమో అని అవ్వకు బెంగగా ఉంది.
..పుత్రకుడు అవ్వలోని బెంగను తెలుసుకున్నాడు.
“అవ్వా! నేను నీకు కన్నెపిల్లలకు నచ్చే కథలు చెప్పగలను. వాటిని ఆమెకు చెప్పి, నువ్వు పొట్ట పోషించుకోవచ్చు” అన్నాడు పుత్రకుడు.
అందుకు అవ్వ..
“నీతి బాహ్యమైనవి కాకపోతే సరే..” అన్నది.ఆనాటినుంచి పుత్రకుడు రోజుకో కథ అవ్వకు చెబుతూ ఉండేవాడు. వాటిని యధాతథంగా అవ్వ అంతఃపురంలో పాటలికకు చెబుతుండేది. క్రమంగా అవ్వ చెప్పే కథలమీద పాటలికకు మోజు పెరిగింది. రోజూ ఆ కథల కోసం ఎదురు చూడసాగింది.
యువరాణి తాను చెప్పే కథల్ని చెవులప్పగించి వింటున్నదని విన్న పుత్రకుని మనసు ఊరికే ఉండలేకపోయింది. ఒకనాడు రాత్రి ఎవరూ చూడకుండా పాదరక్షల సాయంతో అంతఃపురానికి రహస్యంగా వెళ్లాడు. తల్పంపై శయనించి ఉన్న పాటలికను చేరాడు. ఆమె మెడకు గంధంపూసి, తాంబూల రసంతో చెక్కిలిపై బొమ్మలు గీశాడు. ఇంకా ఆమె ఆదమరుపు నిద్రలో ఉండగానే అక్కణ్నుంచి వచ్చేశాడు.
మరునాడు ఆ సన్నివేశాన్నే కథగా మలిచి అవ్వకు చెప్పాడు. గతరాత్రి తనకు కలిగిన అనుభవాన్నే కథగా చెప్పడంతో తొలిసారి అవ్వను నిలదీసింది పాటలిక.
“ప్రతిరోజూ నీకీ కథలన్నీ ఎవరు చెబుతున్నారు?” అని గట్టిగా అడిగింది.
ముసలమ్మకు రహస్యం చెప్పక తప్పలేదు. మరునాడు అవ్వతోపాటే పుత్రకుడు కూడా వచ్చాడు. పాటలిక తొలిచూపులోనే పుత్రకుణ్ని వలచింది. కొంతకాలం వాళ్లిద్దరూ రహస్యంగా కలుసుకోసాగారు. ఫలితంగా పాటలిక గర్భవతి అయింది.
అంతఃపుర రహస్యం బట్టబయలయ్యే రోజు రానే వచ్చింది. పాటలిక గర్భవతి అయిందనే వార్త తెలిసిన మహారాజు మండిపడ్డాడు. ద్రోహి ఎవడో కనిపెట్టి వధించండని కొందరిని నియమించాడు. ఆ వార్త తెలిసిన పాటలికకు ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ పుత్రకుడితో పెళ్లికి తన తండ్రి ఒప్పుకోడని అనిపించింది.
దాంతో ఒకనాటి రాత్రి పాదుకలను ధరించి, పాటలికను గట్టిగా పట్టుకుని.. తాను గంగాతీరంలో ఒక సుందరమైన ప్రాంతానికి వెళ్లాలని కోరుకున్నాడు పుత్రకుడు. ఆ ప్రదేశం వాళ్లిద్దరికీ బాగా నచ్చింది.
దండం రెండోకొనను నేలపై రాయగానే అక్కడో అద్భుతమైన పట్టణం పుట్టింది. బొంతసంచీ నుంచి నాణేలు రాల్చి ధనరాశులు పోగుచేశాడు పుత్రకుడు. తన పేరు, భార్యపేరు కలిసి వచ్చేలా ఆ నగరానికి ‘పాటలీపుత్రం’ అని పేరుపెట్టి.. చిరకాలం ఆనందంగా జీవించాడు. గంగ, గంధక, పుత్ర నదుల సంగమస్థానంలోని పాటలీపుత్రాన్ని రాజధానిగా చేసుకుని సువిశాలమైన మగధ సామ్రాజ్యం విలసిల్లింది.
(వచ్చేవారం.. కల నిజమాయెనా..)
-అనుసృజన: నేతి సూర్యనారాయణ శర్మ