జరిగిన కథ : కాశీలో గంగలో మునిగిన ఫణిదత్తుడు పాతాళానికి వెళ్లిపోయాడు. అక్కడ వరుణకన్యకల కోరిక మేరకు సింహంతోనూ గుర్రంతోనూ యుద్ధం చేసి, కొన్ని దివ్యవస్తువులు సంపాదించు కున్నాడు. తిరిగి కాశీకి వచ్చి, స్నేహితులను కలుసుకున్నాడు. వారి దారిద్య్రాన్ని పోగొట్టడానికి భూరిశ్రవుడనే రాజు కోశాగారాన్ని దోచుకోవడానికి బిలం తవ్వగా.. ఆ దారి యువరాణి మందిరంలో తేలింది. దాంతో దొంగతనం ప్రయత్నాన్ని విరమించాడు. ఆ యువరాణిని పాము కరిచింది.
అప్పటికే రాకుమారికి ప్రేతస్నానం చేయిస్తున్నారు. పాముకాటుకు గురవ్వగానే.. అమాంతం విరుచుకు పడిపోయిందామె. రాజవైద్యులు ఎంత ప్రయత్నించినా లాభం లేకపోయింది. చనిపోయిందని ప్రకటించారు. చిగురాకులాంటి కన్నకూతురు కళ్లముందే నేలవాలిపోగా.. ఆ కన్నతల్లి స్పృహతప్పి పడిపోయింది. ఒకవంక మహారాణికి సపర్యలు జరుగుతున్నాయి. మహారాజు కన్నీరుమున్నీరుగా విలపిస్తూ.. కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు.
అంతలో.. ‘ఆగండి’ అనే అరుపు వినిపించింది. ఫణిదత్తుడు తన మిత్రులతో కలిసి అక్కడికి వచ్చాడు. వరుణకన్యల కోసం ఒక గుర్రాన్ని చంపినప్పుడు దాని దగ్గరున్న నాగమణి అతని చేతికి చిక్కింది. ఆ నాగమణిని అతడొక ఉంగరంలో దాచుకున్నాడు.
“మేము విషవైద్యులం. రాకుమారిని బాగుచేయగలం!” అంటూ మహారాజు అనుమతి కోసం ఎదురు చూడకుండానే.. వేగంగా రాకుమారి వద్దకు వెళ్లి, తన ఉంగరాన్ని ఆమె వేలికి తొడిగాడు. అంతే! నీలిరంగులోకి మారిపోయిన రాకుమారి దేహం మామూలుస్థితికి వచ్చింది. కలలోంచి మేల్కొన్నట్లు లేచి కూర్చుంది. అందరితోపాటుగా మహారాజు కూడా ఆశ్చర్యపడ్డాడు. ఆ వార్త విన్న మహారాణికి స్వస్థత చేకూరింది.
“మహాత్మా! మీరు సామాన్యులు కాదు. చనిపోయిన నా కూతురిని తిరిగి బతికించారు. నా రాజ్యం మొత్తం ఇచ్చేసినా మీ రుణం తీర్చుకోలేను. అయినా నా సంతృప్తికోసం మీకేం కావాలో కోరుకోండి. ఇస్తాను” అని అడిగాడు మహారాజు భూరిశ్రవుడు.
“మహారాజా! నేను ప్రతిఫలం కోరి ఈ పని చేయలేదు. మీ సంతోషం కొద్దీ ఏమిచ్చినా తీసుకుంటాను. నేను కోరినదానికంటే మీరు ఎక్కువే ఇచ్చారనుకుని, సంతోషిస్తాను” అన్నాడు ఫణిదత్తుడు.
ఆమాట వినేసరికి మహారాజుకు చెప్పలేని ఆనందం కలిగింది. ఫణిదత్తుణ్ని ఏనుగుమీద ఎక్కించి ఊరేగిస్తూ.. కొలువుకూటానికి తీసుకువెళ్లాడు. తన సింహాసనం మీద అతణ్ని కూర్చోబెట్టి.. కోటి వరహాలతో అభిషేకించాడు. ఆ సొమ్మంతా అప్పటికప్పుడే ఫణిదత్తుడు తన స్నేహితులకు ఇచ్చివేశాడు. దాంతో వారి కుటుంబాలను పట్టిపీడిస్తున్న దారిద్య్రం వదిలిపోయింది. కాగా, మహారాజు కోరికమేరకు ఫణిదత్తుడు, అతని స్నేహితులు కొంతకాలం ఆ నగరంలోనే ఉండిపోయారు.
ఒకనాడు ఫణిదత్తుని దగ్గరికి రాకుమారి చెలికత్తె కుమారవతి వచ్చింది.“సౌమ్యా! నేను శశాంకవతి చెలికత్తెను. మీరామెకు ఆరోజున ఒక ఉంగరం ఇచ్చారట. ఆ ఉంగరాన్ని తిరిగివ్వడానికి మా సఖి ఇష్టపడటం లేదు. అందువల్ల దానికి బదులుగా ఈ ఉంగరాన్ని మీకివ్వమని పంపింది” అంటూ అతని వేలికి తొడగబోయింది.
“వద్దొద్దు” అంటూ ఫణిదత్తుడు చెయ్యి వెనక్కి తీసుకున్నాడు కానీ, ఆమె లాఘవంగా ఆ ఉంగరాన్ని తొడిగి అక్కణ్నుంచి వెళ్లిపోయింది.
పిమ్మట ఫణిదత్తుడు తన మిత్రులతో..
“చూడబోతే! ఈ శశాంకవతి గొప్ప రసికురాలిలా కనిపిస్తున్నది. ఈవిడ మనకొంప ముంచేలోపుగా ఈ ఊరు దాటిపోవడం మేలు కాబోలు” అన్నాడు.
ఆ మరునాడే రాజసభకు వెళ్లి.. తనకు సెలవిప్పించమని మహారాజును కోరాడు ఫణిదత్తుడు. అప్పుడే అంతఃపురంనుంచి కుమారవతి పరుగెత్తుకొని వచ్చింది.
“మహారాజా! యువరాణివారికి రాత్రినుంచి గుండె బరువెక్కిందట. పాము కరచినచోట కొంచెం మంటకూడా పెడుతున్నదట. మళ్లీ తిరగబెడుతుందేమోనని భయంగా ఉంది” అన్నది.
భూరిశ్రవుడు కంగారుపడ్డాడు.
“పదండి!” అంటూ ఫణిదత్తుణ్ని లేవదీశాడు.
తెరలచాటున ఒక మంచంమీద శశాంకవతి కూర్చుని ఉంది. కుడికాలును మాత్రం ఇవతలికి జరిపింది.
దూరంనుంచే ఆ కాలిని పరీక్షగా చూసి..
“దేవా! అది గట్టిపాము. దాని విషం శల్యాన్ని పట్టేసింది. పూర్తిగా తగ్గడానికి మూడునెలల వరకూ పడుతుంది. కానీ, ప్రమాదం ఏమీ ఉండదు. అయినా మీకు నమ్మకం కలిగించడం కోసం మరో మంత్రం వేస్తాను”.. మహారాజువైపు తిరిగి అన్నాడు ఫణిదత్తుడు.
ఆమె కాలిని పట్టుకుని, ఏవేవో మంత్రాలు వల్లించినట్లు అభినయించసాగాడు.
తొలినాడు ఆమె దేహాన్ని తాకినప్పుడు కలగని మధురమైన అనుభూతి ఏదో ఈనాడు అతని మనసులో కదలాడసాగింది. తెలియకుండానే అతని కళ్లు పాదంనుంచి ఆమె శిరస్సువైపునకు నడిచాయి. అప్పటివరకూ అడ్డుగా ఉన్న పరదాను కొద్దిగా తొలగించి.. చందమామలాంటి తన వదనబింబాన్ని కనిపింప చేసింది శశాంకవతి.
దాంతో ఫణిదత్తుని గుండెల్లో ఒక మెరుపు మెరిసింది. కళ్లకు మిరుమిట్లు గొలిపింది. అతనేదో గందరగోళంలో పడుతుండగానే రాకుమారి ఒక లేఖను అతని జేబులో జారవిడిచింది.
ఫణిదత్తుడు కొంచెం తెప్పరిల్లిన తరువాత..
“మరేమీ పరవాలేదు. కాసేపు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది” అంటూ బయటికి నడిచాడు.
అతని వెనుకే వస్తూ..
“ఆర్యా! మీరిప్పట్లో మమ్మల్ని విడిచిపెట్టి వెళ్లడానికి వీల్లేదు. కొంతకాలం ఇక్కడే ఉండి తీరాలి” అన్నాడు భూరిశ్రవుడు.
అతనికి మౌనంతోనే.. ‘సరే!’ అని చెప్పి, తన బసకు చేరుకున్నాడు ఫణిదత్తుడు. రాకుమారి తన జేబులో విడిచిన లేఖను ఆత్రంగా తీసి చదవసాగాడు.
అందులో ఇలా ఉంది..
‘సౌమ్యా! నువ్వు ఆనాడు శమనమనే లోకానికి చేరుకున్న నన్ను క్షేమంగా వెనక్కు తెచ్చావు. నీ మంత్రమహిమను వర్ణించలేను. నువ్వు కోరుకుంటే ఏ స్థితిలో ఉన్నా నాకు ప్రాణదానం చేయగలవు. అయినప్పటికీ నువ్వే నా పాలిట మృత్యుదాతవు కూడా అవుతున్నావని ఈమధ్య అనిపిస్తున్నది. నిన్ను చూసినకొద్దీ చూడాలనిపిస్తున్నది. చూడలేకపోతే చావాలనిపిస్తున్నది. ఈమాట మా తండ్రికి చెబితే నన్ను బతకనివ్వడు. నేను బతకడం ఎలాగో తెలియడం లేదు. దయచేసి దారి చెప్పు’.
ఆ లేఖను చదువుకున్న ఫణిదత్తుడు..
“స్త్రీల మాయలు బ్రహ్మకు కూడా తెలియవు కదా!” అన్నాడు.
అందుకు సుబాహుడు..
“ఇంతకూ ఆమె మనోభీష్టం ఏమిటో తెలుసుకున్నావా? వాళ్ల నాన్నను ఒప్పించి పెళ్లాడమంటున్నదా?! లేవదీసుకు పొమ్మంటున్నదా?! మరోసారి కనిపిస్తే చాలంటున్నదా?!” అని అడిగాడు.
ఆ మాటతో ఆలోచనలో పడ్డాడు ఫణిదత్తుడు.
ఆనాటి అర్ధరాత్రి.. అంతకుముందు రాజకుమారి మందిరం వరకూ తాము తవ్విన బిలమార్గాన్ని తెరిచాడు. ఒళ్లెరగకుండా నిద్రపోతున్న రాకుమారి పక్కమీద ఒక లేఖను పెట్టి, వెనుతిరిగాడు.
తెల్లవారి ఆ లేఖను చూసిన రాకుమారి తెల్లబోయింది. తెరిచి చూస్తే దాంట్లో ఇలా ఉంది.
‘దారి చూపమని నన్ను కోరావు. కోరుకుంటే నీ గదికిందనే బిలముదారి ఒకటుంది. అయినా ఈ దారులలో ఏముంది?! అభిలాష తీరాలంటే మనసులలో పుట్టే సాహసమే అసలైన దారి’..
లేఖను చదువుకున్న రాకుమారి తన గదినంతా శోధించింది. ఒకచోట నేలపై బండలు కొద్దిగా కదిలి ఉండటం గమనించింది. ఒక బండను పక్కకు తొలగించి చూస్తే బిలమార్గం బయటపడింది. అప్పుడు లేఖను మరోసారి చదువుకుంది. ‘సాహసం ఉంటే ఈ దారివెంట రావచ్చు’ అని అతను చెప్పినట్లుంది. కానీ, అదే సాహసం ఉంటే.. అతనే మళ్లీ వచ్చేవరకు నేను వేచి ఉండలేనా అనుకుంది రాకుమారి.
ఆనాటి రాత్రివరకు ఆమె రాకకోసం ఎదురుచూసిన ఫణిదత్తుని మనసులో కలవరపాటు మొదలైంది.
‘ఆ లేఖ వేరెవరి చేతిలోనైనా పడిందా? ఆమె చదివిందో లేదో’ అని పరిపరివిధాల తలపోశాడు.
చివరికి తానే బయల్దేరి వెళ్లాడు. బండనెత్తి, గదిలోనికి ఎక్కేసరికి.. శశాంకవతి నిద్రపోతూ కనిపించింది.
కానీ, గది వాతావరణం ఇంతకుముందులా లేదు. పరిమళ ద్రవ్యాల సువాసనలు హాయి గొలుపుతున్నాయి. మంచం పక్కనే రకరకాల పిండివంటలు ఉన్నాయి. వాటితోపాటు తీరైన తాంబూలపు పళ్లెం కూడా ఉంది.
ఆకాశపు నీలిమంచంమీద నిద్రిస్తున్న చందమామలాగా ఉన్న శశాంకవతి ముఖాన్ని చూస్తున్న ఫణిదత్తుని మనసు.. పున్నమినాటి సముద్రంలా ఉప్పొంగుతున్నది.
అతనేం చేస్తాడో చూడాలనుకుని దొంగనిద్ర నటిస్తున్న శశాంకవతి.. చాలాసేపు తనను తాను నిలువరించుకోలేక తపన పడింది. తానింకా జాగుచేస్తే, ఫణిదత్తుడు తిరిగి వెళ్లిపోతాడేమో అన్న అనుమానం తోచగానే.. పైకి లేచి, అతని చేయిపట్టుకుంది.
“కుమారవతీ! రావే దొంగ దొరికాడు” అన్నది.
నిజంగానే ఎవరో వచ్చి తనను పట్టుకుంటారేమోనని భయపడ్డాడు ఫణిదత్తుడు. ఉట్టిది.. అక్కడెవరూ లేరు.
బిక్కమొగం వేసిన ఫణిదత్తుని చెయ్యి విడిచిపెట్టి, మంచంమీద విలాసంగా కూర్చుని, హొయలుపోతూ..
“మోహనాంగా! నువ్విక్కడికి ఎలా వచ్చావు? ఈ కన్నపు దొంగతనం ఎప్పుడు నేర్చుకున్నావు?” అన్నది.
ఫణిదత్తుడు గుటకలు మింగసాగాడు.
అంతలోనే శశాంకవతి మంచం మీదనుంచి లేచి..
“ఇంటికి వచ్చిన అతిథి ఎట్టివాడైనా పూజించాలి కదా! దయచేసి ఇలా కూర్చోండి” అన్నది.
అతణ్ని మంచంమీద కూర్చోబెట్టి, పూలమాల మెడలో వేసింది. గంధం పూసి, పన్నీరు చల్లింది. కొన్ని పిండివంటలు తినిపించి, పానీయాలు తాగించింది. చివరిగా తాంబూలం అందించింది.
“మహాభాగా! నన్ను నీదానినిగా చేసుకో” అన్నది.
ఆ రాత్రి నుంచి వారి రహస్య అనుబంధం కొనసాగింది. ప్రతిరాత్రీ బిలమార్గం ద్వారా ఫణిదత్తుడు రాకుమారి వద్దకు వెళ్తుండేవాడు. తెల్లవారకమునుపే తిరిగి వచ్చేవాడు. అలా కొంతకాలం గడిచేసరికి శశాంకవతి గర్భవతి అయింది. ఆ విషయాన్ని ఎవరో అంతఃపుర చారులు పసిగట్టారు. కానీ, దానికి కారకుడు ఫణిదత్తుడే అని తెలియలేదు.
‘నీ కూతురు గర్భవతి అయింది’ అని మాత్రమే భూరిశ్రవునికి తెలియచేశారు.
ఆ వార్తవిని మహారాజు ఆగ్రహోదగ్రుడయ్యాడు. వెంటనే కుమార్తె వద్దకు బయల్దేరబోయాడు.
కానీ, అప్పటికే ఎవరో తనపై చాడీలు చెబుతున్నారన్న సంగతి తెలిసిన శశాంకవతి.. బిలమార్గం ద్వారా బయటికి వెళ్లిపోయింది. వెళ్లిపోతూ ఒక పరిచారికను తండ్రి వద్దకు పంపింది.
“మహారాజా! రాకుమారి మేడమీద ఆడుకుంటుండగా ఎవరో భయంకరాకారుడు ఆకాశంనుంచి ఎగిరివచ్చి ఎత్తుకుపోయాడు” అని చెప్పింది ఆ పరిచారిక.
భూరిశ్రవుడు ఆమాట విని అదిరిపడ్డాడు.
ఏం చేయాలో అర్థంకాక మంత్రులను, శ్రేయోభిలాషులను సలహాకోసం పిలిపించాడు. అలా వచ్చినవారిలో ఫణిదత్తుడు కూడా ఉన్నాడు.
“ఆకాశగమనం చేసేవారు దేవతలైతే.. వారెప్పుడూ మానవకాంతలను ఎత్తుకుపోరు. అన్యులైతే వారికి భూమి పరిధినుంచి ఆవలిదాకా మానవులను తీసుకుపోయే శక్తి ఉండదు. కనుక, నాలుగు దిక్కులకూ సైన్యాన్ని పంపించి, రాకుమారిని వెతికించండి” అన్నాడు ఫణిదత్తుడు.
ఆమాటతో భూరిశ్రవునికి కాస్త ఊరట లభించింది. అప్పటికప్పుడు సైన్యాన్ని విభాగం చేసి నాలుగుదిక్కులకూ పంపాడు. ఉత్తరదిక్కుకు వెళ్లిన సైన్యానికి ఫణిదత్తుడే నాయకత్వం వహించాడు. నిజానికి, బిలమార్గం ద్వారా తనవద్దకు వచ్చిన శశాంకవతికి తన స్నేహితులను తోడిచ్చి.. ఉత్తరదిక్కుగా వెళ్లమని సూచించింది అతనే.
ఇప్పుడు వాళ్లను వెతుక్కుంటూ తానే బయల్దేరాడు. కొంతదూరం వెళ్లిన తరువాత తనతోపాటు వచ్చిన సైన్యాన్ని వేర్వేరు దిక్కులకు విభాగించి.. తానొక్కడే వేరొక మార్గంలో వెళ్లాడు. కానీ, మూడురోజులు ప్రయాణం చేసినా ఫణిదత్తుడు స్నేహితులను కలుసుకోలేకపోయాడు. ఎక్కడైనా దారితప్పారేమో అని మధనపడుతుండగా.. చివరికి ఒకచోట ఒంటినిండా గాయాలతో సుప్రహస్తుడు మొదలైనవారు కనిపించారు.
“మిత్రులారా! ఏమిటిది.. మిమ్మల్నిలా కొట్టిందెవరు?! రాకుమారి ఏమయ్యింది?” అని ప్రశ్నించాడు.
“ఫణిదత్తా! మేమీ దారిలో వస్తుండగా.. అటువైపు ఒక జనపదం, ఇటువైపు అరణ్యమార్గం కనిపించింది. జనపదాన్ని వద్దనుకుని, అడవిమార్గం పట్టాం. మేము వెళ్తుండగా దాదాపు వెయ్యిమంది రౌతులు ఎదురువచ్చారు. ఎందుకైనా మంచిదని వారికి ఎదురుపడకుండా కొంచెం దూరంగా జరిగి వేచి ఉన్నాం. మరికొంచెం సేపైతే ఆ సైన్యం మమ్మల్ని దాటిపోయేదే.. కానీ అంతలోనే ఆ సేనానాయకుడు వెనుతిరిగి వచ్చాడు. రాకుమారిని ఒడుపుగా పట్టుకుని, తన గుర్రం మీదికి లాక్కున్నాడు. మేము ప్రతిఘటించాం. కానీ, వెయ్యిమందిని ఎదుర్కోవడం, ఎంతోసేపు నిలవరించడం సాధ్యం కాదుకదా! చివరికి మమ్మల్నిలా కొట్టి వెళ్లిపోయారు” అని చెప్పాడు సుప్రహస్తుడు.
“ఆ సైన్యం ఎటువైపు వెళ్లింది?” అని అడిగాడు
ఫణిదత్తుడు.
సుప్రహస్తుడు చూపించిన దిక్కుకు తన గుర్రాన్ని దౌడు తీయించాడు.
(వచ్చేవారం.. మలుపు తిరిగిన జీవితం)
-అనుసృజన:
నేతి సూర్యనారాయణ శర్మ