జరిగిన కథ : వివాహానంతరం.. అత్తవారింట మూడేళ్లు గడిపాడు గణపతిదేవుడు. ఇద్దరు భార్యలతో సుఖ సంతోష విహార విలాసాదులతో పరవశించాడు. ఆ సమయంలోనే.. మళ్లీ యుద్ధభేరి మోగించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. నెల్లూరిసీమ నుంచి మనుమసిద్ధి ప్రతినిధిగా ఆయన కుమారుడు తిక్క భూపాలుడు.. ఒకరోజు తలగడదీవి కోటకు వచ్చాడు. తమిళజం పాలకుడు చోళరాజు మూడవ కులోత్తుంగచోళుడు.. మనుమసిద్ధిని సింహాసన భ్రష్టుణ్ని చేసి, తమ్ముళ్ల వరసైన నల్లసిద్ధిని, తమ్మసిద్ధిని విక్రమసింహపురం పాలకులను చేసినట్లు చక్రవర్తికి విన్నవించాడు తిక్క భూపాలుడు.
“మా వివాహానికి విచ్చేసిన మనుమసిద్ధి మహారాజులు మాతో ఎందుకు చెప్పలేదు తిక్క భూపాలా?!” అన్నాడు ఆవేదనగా చక్రవర్తి గణపతిదేవుడు.
“వివాహవేళ యుద్ధ సంగతులా! అని తమరికి విన్నవించలేదు ప్రభూ! వారి ఆగడాలు రోజురోజుకూ మితిమీరి పోతున్నాయి. ఇక భరించలేక తండ్రిగారు తమరి సాయం అర్థించడానికి నన్నే స్వయంగా పంపారు ప్రభూ!” చెప్పాడు తిక్క భూపాలుడు.
“మరి.. చోళుడు! ఆయన అభిప్రాయం ఏమిటి భూపాలా?”.
“అసలు దుర్మార్గుడు వాడే ప్రభూ! ఇప్పుడు వాడికి తమిళ రాజ్యం పిచ్చి బాగా తలకెక్కింది. విక్రమసింహపురం ఉత్తర భాగం పొత్తపినాడు వరకు తమిళ రాజ్యాన్ని విస్తరించాలని వాడి పన్నాగం!”.
దిగ్గున లేచాడు గణపతిదేవుడు.
“కంచి పట్టణం, కావేరి తీరప్రాంతం, తొండ మండలం, మొరసునాడు వరకు తెలుగు మాట్లాడే ప్రజలున్న ప్రాంతాలు. అవి ఆంధ్ర సామ్రాజ్యంలో భాగాలు. వాటిని ఆక్రమించడమే కాకుండా పొత్తపినాడు వరకూ హద్దులు నిర్దేశిస్తాడా తమిళ రాజ్యానికి?! అదెట్లా సాధ్యమో మేమూ చూస్తాం. మీకిదే మా అభయం. మీకు పూర్తి బాసటగా కాకతీయ చక్రవర్తి ఉన్నాడని మరచిపోవద్దని తండ్రిగారికి విన్నవించండి. చోళునికి మేం విన్నవిస్తాం.. కరవాలాల శబ్దాలతో!”.
ఆ తర్వాత ద్వీపరాజు పినచోడుణ్ని పిలిచి..
“అనుమకొండకు వార్త పంపండి. సకలసేనాపతి రుద్రసేనానివారికి మా మాటగా చెప్పండి. దక్షిణదిశగా యుద్ధానికి వెళ్లాలి. ద్వీప సైన్యమంతా సిద్ధమా!?
సంసిద్ధతకు ఎంతసమయం కావాలి?”.
పినచోడుడు అయోమయంగా చూశాడు. గణపతిదేవుని తేజరిల్లుతున్న ఆలోచనా స్రవంతులను చూశాక.. కొడుకు జాయపుని వంక చూశాడు. జాయపుడు ఊపిరి కూడా పీల్చడం లేదు. మారుమాట్లాడకుండా తల ఊపి.. వెనక్కి నడచి నిష్ర్కమించాడు పినచోడుడు. చక్రవర్తి అంతవేగంగా తిరిగి రాజ్య సమస్యల్లోకి రావడం జాయపుణ్ని ఆశ్చర్యపరచింది. ఆనాటి సంధ్యవేళ మరో కొత్త గణపతిదేవుణ్ని చూశాడు జాయపుడు.
తలగడదీవి సముద్ర తీరంలో ఇద్దరూ వాహ్యాళిగా నడుస్తున్నారు.
“ఈ నెల్లూరి రాజ్య గొడవలు ఏమిటి? ఈ చోడ.. చోళ.. రాజుల కథ ఏమిటి దేవరా!?” అడిగాడు జాయపుడు. “తెలుగు మాట్లాడితే చోడ, తమిళం మాట్లాడితే చోళ. తనకు సామంతుడిగా ఉండటానికి ఇష్టపడని మనుమసిద్ధిని తొలగించి, తనమాట వినే నల్లసిద్ధిని సింహాసనంపై కూర్చోబెట్టాడు చోళుడు. ఇదే ప్రాంతీయతత్వం..” విపులంగా చెప్పాడు గణపతిదేవుడు.
ఈ దృక్కోణం జాయపునికి కొత్త. గతంలో నాగంభట్టు తండ్రి శివభట్టు.. భారతఖండమంతా సంస్కృతం ఒకే భాషగా ఉండాలని, లేకుంటే ప్రాంతీయభాషలు పెరిగి ప్రాంతీయ రాజ్యాల ఘర్షణలు వస్తాయని వాఖ్యానించినట్లు లీలగా గుర్తొచ్చింది. దేశ ఏకతను కాపాడేది ఒక్క సంస్కృతమేనని జాయపుని అభిప్రాయం. అందుకే అతనికి సంస్కృతమంటే మక్కువ. గణపతిదేవుడు చేసిన ఈ విశ్లేషణ జాయపుని దృక్కోణంలో కొత్త ద్వారాలు తెరిచింది.
అనుమకొండలో సమాజాన్ని చూశాక అతనికి సామాజిక జీవనంపై ఎక్కువ అవగాహన కలిగింది. కానీ, రాజాస్థానాల ఆలోచనా ధోరణులు, అభిప్రాయాలు తెలియవు. ఇప్పుడు సాక్షాత్తూ కాకతీయ చక్రవర్తితో ఆంతరంగిక చర్చల వల్ల రాజాస్థానపు ధోరణులు మరింత అవగాహన చేసుకుంటున్నాడు.
పినచోడుని జాబుకు సకలసేనాధిపతి రుద్రసేనాని జవాబిచ్చాడు. ‘ఏ క్షణమైనా యుద్ధానికి మన మూలసైన్యం సిద్ధం. భృత్య సైన్యం, గిరిజన సైన్యం, సామంత సైన్యం సిద్ధమవ్వడానికి కొంచెం కాలం పడుతుంది’..అది చదివి జాయపుణ్ని అడిగాడు చక్రవర్తి..
“ఏం చేద్దాం??”జాయపుడు దీర్ఘంగా ఆలోచించి అన్నాడు.. “ఒక పనిచేద్దాం!”
కాకతీయ మంత్రాంగం అర్థంకాని నల్లసిద్ధి.. వెనువెంటనే కంచికి వేగును పంపాడు. వాడు చెప్పిన వార్త విని.. గజగజా వణికిపోయాడు నల్లసిద్ధి. వేగు కంటే ముందే.. జాయప నేతృత్వంలో ద్వీప సైన్యపటాలం కాంచీపురం మీద తీవ్రంగా దాడిచేసింది. గణపతిదేవుని యుద్ధతంత్రం అప్పుడు అర్థమైంది నల్లసిద్ధికి.
సింహపురి రాజనగరు..
ఉదయం రెండోజాము. తక్కువ జనసాంద్రత ఉన్న విక్రమసింహ రాజ్యపు రాజధాని నగరం నెల్లూరు అనే.. విక్రమసింహపురి.
హాయిగా మెల్లగా తాపీగా కదులుతున్న పురవాసుల మధ్యగా.. ఓ అశ్వం మెల్లగా పోతున్నది. దాని గమనం చూస్తే.. ఈ ప్రాంత పరిచయం ఉన్నట్లు లేదు.
ఆశ్వికుడు పొడవుగా, నిండుగా ఉన్నాడు. పెద్దపెద్ద మీసాలను మోయడానికన్నట్లు బుగ్గలు బలంగా, నిండుగా ఉన్నాయి. చిన్నకళ్లు, దట్టమైన కనుబొమలు, చెవులకున్న సత్తుకుండలాలు బలంగా ఊగుతున్నాయి. తలపై రంగుల తలపాగా వింతగా ఉండి, అతణ్ని కొత్తవాడుగా పట్టిస్తున్నది. అటూ ఇటూ చికిలించి చూస్తున్న ఆ ఆశ్వికుడు.. ఓ రెండడుగుల ముందుగా పోతున్న మరో ఆశ్వికుణ్ని అనుసరిస్తున్నాడని ఎవ్వరికీ సందేహం రాదు. అలా దూరదూరంగా ఇద్దరు ఆశ్వికులు పురవాసులను పరిశీలిస్తూ, ముందూ – వెనుకగా ఊరికి దూరంగా నిర్జనప్రాంతంలో ఉన్న ఓ ఉద్యానవనానికి చేరారు.
ఇద్దరూ అప్రమత్తులై పరిసరాలను జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు. ఇద్దరి కుడిచేతులు నడుముకున్న కరవాలాలపై ఉన్నాయి.
ముందున్న ఆశ్వికుడు తిక్క భూపాలుడు కాగా.. వెనుక అనుసరిస్తున్న వాడు జాయపుడు. ఊహించినట్లుగానే బరిసె ఒకటి తిక్క మీదికి రివ్వున దూసుకొచ్చింది. రెప్పపాటుకాలంలో ఆయన వేగంగా పిల్లిమొగ్గ వేసి, బరిసె దెబ్బను తట్టుకున్నాడు. తిరిగి చూసేసరికి.. బల్లెం విసిరినవాడు జాయపుని చేతిలో గిలగిలకొట్టుకోవడం కంటపడింది.
తిక్క భూపాలుడు బరిసె పీకి.. వాణ్ని పెద్దవృక్షానికి నిలబెట్టి, వాడి అరచేతిని చెట్టుకు ఆన్చి.. చేతినుంచి చెట్టులోకి దిగేలా బరిసెను గుచ్చాడు. వాడు అరిచిన అరుపుతో.. చెట్లపై పిట్టలు గిలగిల కొట్టుకుని ఎగిరాయి.
అప్పుడే జాయపుడు ఓ తుమ్మముళ్ల కొమ్మను తెచ్చి, వాడి శరీరంపై గట్టిగా అదిమాడు. అప్పుడు వాడు నిలువెల్లా గుచ్చుకున్న తుమ్మముళ్లతో.. బాణాలపై ఉన్న భీష్ముణ్ని చెట్టుకు నిలబెట్టినట్లుగా ఉన్నాడు.
“చెప్పు.. ఎవరు నువ్వు? మా వెంట ఎందుకు వస్తున్నావ్?”.
బాధతో విలవిలలాడుతూ మూర్ఛకు దగ్గరగా ఉన్నవాడు..
“నల్లసిద్ధి మహారాజుగారి వ్యక్తిగత వేగును. మీరు.. తిక్క భూపాలుడు గారు. మిమ్మల్ని అనుసరించమని ఆజ్ఞ!”.
ఇద్దరూ ముఖాలు చూసుకున్నారు. అనుకున్నట్లే తమను ఎవరో అనుసరిస్తున్నారని గ్రహించి నిర్జన ప్రాంతానికి వేగును రప్పించారు.
“సరే! మనుమసిద్ధి మహారాజుగారు ఎక్కడ!? ఆయన్ను ఎక్కడ.. ఏ కారాగారంలో బంధించారు?”.
“తెలియదు. నాకు తెలియదు యువరాజా!”..
ఆ వేగు దగ్గరికెళ్లి.. ముళ్లమండను అతని శరీరానికి మరింత పుష్టిగా గుచ్చాడు తిక్క.
వాడు బాధతో విలవిలలాడిపోయాడు. చురకత్తిని వాడి బుగ్గలపై పెట్టాడు జాయప.
“తోలు ఒలవడంలో నా చురకత్తికి మంచి అనుభవముంది. తోలుతీసి తొండలకూ, బుగ్గల్లో కండతీసి
ఉడతలకూ వేస్తే.. అవి రుచి తెలిసి ఒళ్లంతా కొంచెం కొంచెం కొరుక్కుతింటాయి. సరేనా?” అన్నాడు. వాడు గజగజ వణికిపోయాడు.
“మనుమసిద్ధి రాజుగారిని తోట కారాగారంలో ఉంచారని విన్నాను. నిజం నాకు తెలియదు. నన్ను ప్రాణాలతో వదలిపెట్టండి. పెళ్లాంబిడ్డలున్న వాణ్ని!” అన్నాడు ప్రాణభయంతో.
“నీ పేరేంటి?”. “కామేశ”.“తోట కారాగారంలోకి మమ్మల్ని తోడ్కొని పోవాల్సింది నువ్వే! ఎప్పుడు తీసుకెళ్తావు కామేశా?” అన్నాడు తిక్క.
ఇతర వేగుల సహాయంతో వీళ్లిద్దరికీ కారాగారంలో ఉన్న మనుమసిద్ధిని చూపాడు కామేశ.
ఆయన్ను చూసి తిక్క కన్నీరు మున్నీరైతే.. జాయప నిర్విణ్నుడయ్యాడు. మనుమసిద్ధి శరీరమంతా తూట్లు పొడిచారు. కేవలం ప్రాణాలతో మాత్రమే ఉన్నాడు. గణపతిదేవుని సహాయం ఆయనకు లభించిందనే భయంతో.. మనుమసిద్ధిని బందీని చేసి హింసిస్తున్నాడు నల్లసిద్ధి. ఆ కారాగారమంతా మనుమసిద్ధి అనుయాయులు, బంధు, సేనానులతో నిండిపోయి.. వారి హాహాకారాలతో ప్రతిధ్వనిస్తున్నది.
ఆశ్చర్యపోయాడు జాయపుడు. ‘రాజ్యాధికారం ఇంత దుర్మార్గమా!?’ అని వాపోయాడు. జ్ఞాతులై అప్పటివరకూ రాజుగా ఎంతో అభిమానించిన అన్నను.. ఈ నల్లసిద్ధి ఇంతగా హింసించడం జాయపునికి చాలా కోపం తెప్పించింది. దీనికి కారణం రాజ్యకాంక్షతో కుటుంబంలో చిచ్చుపెట్టిన కులోత్తుంగ చోళుడు!!
వెంటనే గణపతిదేవునికి వార్త పంపాడు. ‘కాకతీయ ఖడ్గం నెల్లూరిలో గుచ్చితే.. కంచిలో పీకలు తెగాలి!’..
ఆఘమేఘాల మీద కాకతీయ సైన్యం నెల్లూరును చుట్టుముట్టింది. గణపతిదేవుడు తప్పకుండా సహాయం చేస్తాడని, నెల్లూరుపై త్వరలో యుద్ధం ప్రకటిస్తాడని ముందే ఊహించాడు నల్లసిద్ధి. కానీ, ఇంత త్వరగా కాకతీయ సైన్యం నెల్లూరును చుట్టుముడుతుందని మాత్రం ఊహించలేదు.
అతని అసలు బలం కంచి చోళుడు. యుద్ధం వస్తే కంచి సైన్యం సహాయంగా వస్తుందని కంచి చోళుడు – నల్లసిద్ధి వ్యూహం.
వాయువేగ మనోవేగాలతో వెలనాడు, కోట, కొండపడమటి తదితర సామంతరాజ్య సైన్యాలతో సాక్షాత్తూ గణపతిదేవుడు తరలి వచ్చి నెల్లూరు పొలిమేరల్లో స్కంధావారం ఏర్పాటుచేశాడు. కానీ, దాడి చేయలేదు. ఎందుకు చేయలేదో అర్థం కాలేదు నల్లసిద్ధికి. చర్చల కోసం సంధివిగ్రహిని కూడా పంపలేదు. స్కంధావారంలో ప్రశాంతంగా విశ్రాంతి తీసుకుంటున్నాడు గణపతిదేవుడు.
కాకతీయ మంత్రాంగం అర్థంకాని నల్లసిద్ధి.. వెనువెంటనే కంచికి వేగును పంపాడు. వాడు చెప్పిన వార్త విని.. గజగజా వణికిపోయాడు నల్లసిద్ధి. వేగు కంటే ముందే.. జాయప నేతృత్వంలో ద్వీప సైన్యపటాలం కాంచీపురం మీద తీవ్రంగా దాడిచేసింది. గణపతిదేవుని యుద్ధతంత్రం అప్పుడు అర్థమైంది నల్లసిద్ధికి.నెల్లూరుకు సహాయం రాకుండా ముందు కంచి సైన్యాన్ని కదలకుండా దాడి చేశారు. ఇది అటు కంచికి, ఇటు నెల్లూరుకు కూడా ఊహాతీతం.
ద్వీపసైన్యంతో కంచిపై రాత్రికి రాత్రి దాడి చేసినవాడు జాయపుడు. తనపై దాడిచేస్తారని ఏమాత్రం ఊహించని కులోత్తుంగ చోళుడు.. చిత్తుచిత్తయి పోయాడు. అప్పుడే చోళునికి మరో వార్త అందింది.
‘నెల్లూరులో నల్లసిద్ధి తలతో కాకతీయవీరుల కందుకక్రీడ సాగుతున్నది!’ అని. చేసేదిలేక ఓటమిని అంగీకరించాడు. చోళుని ఆతిథ్యం స్వీకరించి.. కంచినుంచి సైన్యాన్ని వెనక్కి మరల్చాడు జాయపుడు. జాయపుని సైన్యం, గణపతిదేవుని సైన్యం మూకుమ్మడిగా దాడి చేయగా మట్టి కరిచాడు నల్లసిద్ధి. విజయ సింహనాదం చేసిన గణపతిదేవుడు నెల్లూరులో మహారాజుగా మనుమసిద్ధిని తిరిగి గద్దెనెక్కించాడు. నిజమైన చక్రవర్తిగా.. సామంతుల పాలిటి దైవంగా తనను తాను నిరూపించుకున్నాడు గణపతిదేవుడు.
(సశేషం)
– మత్తి భానుమూర్తి 99893 71284