జరిగిన కథ : పెద్దసైన్యంతో వస్తున్న శత్రువుల నుంచి రక్షణ కోసం.. జాయపుడు, లలితాంబ అడవిలోకి మళ్లారు. రాత్రి కావడంతో.. ఇద్దరూ ఏనుగుల కోసం ఏర్పాటుచేసిన మాటుగొయ్యిలో పడిపోయారు. రాత్రంతా అందులోనే ఉన్నారు. తెల్లవారుతుండగా.. జాయపుని అశ్వం విక్రమ అక్కడికి వచ్చింది. దాన్ని చూడగానే.. ప్రాణం లేచొచ్చినట్టు అనిపించింది జాయపకు.
“హమ్మయ్య! లలితా.. త్వరపడు. ఆ కన్నాన్ని పెద్దదిగా పైకి మెట్లలాగా తవ్వుకుంటూ పోదాం!” అన్నాడు జాయపుడు. “అలాగే మామా!” అంటూ తన చేతిలోని చురకత్తితో గొయ్యి గోడలను తవ్వడం మొదలెట్టింది
లలితాంబ. మరో గంటలో ఇద్దరూ పైకి ఎక్కేశారు. విక్రమ పరుగున వచ్చి జాయపుణ్ని ఒరుసుకుంటూ సకిలిస్తున్నది ఆప్యాయంగా.. “నా గుర్రం ఎటో పోయింది. నీ గుర్రం.. భలే! నీకోసం ఇక్కడే తిరుగుతున్నది..” అన్నది లలితాంబ. చెట్ల చాటుగా సూర్యుడు ఇద్దరినీ ఆసక్తిగా చూస్తున్నట్లు.. ఎండ బలం పుంజుకుంటున్నది.
ఆ లేత ఎండకు ఆమె అందమైన మోముపై లేలేత నీటి బిందువులు.. ముంగురులకు పూసిన మెరుపు పువ్వుల్లా ఉన్నాయి. ఎందుకో ఆమె ముఖాన్ని మరీమరీ చూడబుద్ధయ్యింది జాయపునికి.. ‘ఎంత వెరపులేని ధీరత్వం..!? ఈమెకు తప్పు పేరు పెట్టింది అక్క!!’.. అతని ఆలోచనలకు అడ్డుపడుతున్నట్లు అన్నది లలిత. “ఈ గండం గడిచింది. మన తక్షణ కర్తవ్యం?”. “వెనక్కి పొలవాసనాడు వెళ్లి కమలాంబ వేశ్యాగృహం పరిస్థితి ఏమిటో తెలుసుకోవాలి. అందుకోసమే కదా మనం వచ్చింది..?!”. “నీ అశ్వం సంగతి వచ్చేటప్పుడు చూద్దాం. నా అశ్వం అధిరోహించు..” అంటూ లలితాంబను విక్రమపైకి లాక్కుని, ముందు కూర్చోబెట్టుకున్నాడు. ఇద్దరూ అతిసామీప్యంలోకి రావడం.. ఇద్దరికీ కొత్తగా ఉంది. ఇద్దరూ లేత యవ్వనులు కాదు. స్థిర యవ్వనులు.
కామసర్పాలు చుట్టుకున్న ఆకర్షణీయమైన శరీరులు. కామసర్పపు బుసలోని కామోద్దీపన తెలిసిన మానసాలు. విక్రమ కదిలింది. తిరిగి పొలవాసనాడు వెళ్లారు. కమలాంబ వేశ్యావాటిక స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నది. రెండు రాజబృందాల మధ్య గొడవ.. వేశ్యావాటిక విడిచి రాజనగరికి మళ్లింది. కమలాంబ కృతజ్ఞత వెలిబుచ్చి ఇద్దరికీ ఘనమైన వీడ్కోలు పలికింది. లలితాంబ మరో అశ్వం ఏర్పాటు చేసుకుంటుందని జాయపుడు భావించాడు. కానీ, ఆమె తిరిగి ఎగిరి అతని అశ్వంపై, అతని ముందు కూర్చుంది. జాయపునికి ఓ యవ్వనవతి తన శరీరానికి పూర్తిగా తాకుతూ.. కాదుకాదు ముడుచుకుని ఒడిలో కూర్చోవడం.. ఇబ్బందిగా లేదు కానీ, కొత్తగా.. ఏదో బానే ఉంది.
మౌనంగా ఆ ఇరుకులో ఆమె కూర్చున్న తీరులో ఇష్టం స్పష్టం. విక్రమ కదలికల వల్ల దాదాపు రెండు గవ్యూతుల దూరప్రయాణం.. ఎలా ఉండబోతున్నదో.. జాయపునికి కొంచెంగా అవగతమవుతున్నది. విక్రమ ఉత్సాహంగా.. కొంటె నడకలతో పరుగుపెడుతూనే ఉంది. పైనున్న జాయపుడు, లలితాంబ ఎగిరెగిరి పడుతూనే.. తగులుతూ తాకుతూ ఒడిలో ఒదుగుతూ.. ఊగుతూ! అది ఓ రసరమ్య ఊయల క్రీడ. రహదారి పక్కగా ఎవరు వస్తూ పోతున్నారో.. ఏమో.. ఏమీ తెలియడం లేదు. అలుపొచ్చి ఆగింది విక్రమ. ఓ పూటకూళ్లమ్మ గృహం. దిగాక తెలిసింది ఆకలి. పెట్టింది తిన్నారు. మళ్లీ విక్రమపై జాయపుని ఒడిలో లలితాంబ.. విచిత్రంగా మాటలు లేవు ఇద్దరి మధ్య.
రాత్రికి ఓ సత్రంవద్ద ఆగింది విక్రమ. సత్రాలు కూడా రెండురకాలుగా ఉంటాయి. మహా రాజులు, రాజనగరి కుటుంబాలు, కులీనుల కోసం ఏర్పాటైన సత్రాలు కొన్ని.. సాధారణ ప్రజల కోసం కొన్ని. సత్రంలోకి ప్రవేశం తేలికగానే లభించింది. సత్రంలో గది లాంటిది.. మదుగులేని కేవలం విశ్రాంతి, నిద్రకోసం ఉన్న ఏర్పాటు మాత్రమే. యుద్ధానికి వచ్చారు.. వెంట కత్తులు తప్ప ఏ దుస్తులూ లేవు. రెండు మంచాలపై ఇద్దరూ ముడుచుకుని ఒదిగి నిద్రపోయారు.
రాత్రి గాలి రివురివ్వున బలంగా వీస్తూ శరీరాన్ని జోకొడుతున్నది.
జాయపునికి ఏవేవో కలల్లాంటివి.. రావాలని రాలేక దూరదూరంగా తిరుగాడుతున్నాయి. కళ్ల రెప్పలు
రానివ్వడం లేదు. అర్ధరాత్రివేళ ఎవరో కాళ్లను మర్దిస్తున్నట్లు.. కల! కలా? ఏమో.. కాళ్లు తిరిగి శక్తిని పుంజుకుంటున్నాయి. చటుక్కున లేచాడు. లలితాంబ అతని కాళ్లను మెల్లగా మర్దిస్తున్నది. కాళ్లను ముడుచుకున్నాడు .నాకు నిద్ర పట్టలేదు మామా.. నీ కాళ్లు అలసటతో అటూ ఇటూ ఊగిసలాడుతున్నాయి.
ఆమె వివరించింది. ఏం చెప్పాలో అతనికి తోచలేదు. గదులలో, నడవాలలో అంతా నిద్రిస్తున్న బాటసారులు, రథికులు, చోదకులు. రాత్రి మూడోజాముకే కొత్తరోజు మొదలవుతుంది. ప్రత్యూషం ఆగమిస్తున్నట్లు కొత్తగాలి తెమ్మెరలు మంద్రంగా తాకుతున్నాయి. చాలామంది అప్పటికే కాలకృత్యాలు తీర్చుకుని తమ వృత్తులలోకి ప్రవేశిస్తారు. దూరంగా కోవెల్లో జేగంటలు.. మంత్రోచ్చారణ.. దగ్గరగా వీధుల్లో జంగముల తత్వాలు.. గుర్రాల సకిలింపులు.. ఏనుగుల ఘీంకారాలు.. ఎడ్ల మెడల్లో గంటలు.. ఎడ్ల బళ్ల గరగరలు.. ముందు మేల్కొన్న జనులే.. బాలభానుణ్ని నిద్ర లేపినట్లుంది. ఉదయ సమీరాలు రివురివ్వున ఆహ్లాదంగా తాకుతున్నాయి. ఇద్దరూ కాలకృత్యాలు తీర్చుకుని బయటికి వచ్చారు.
సత్రపు నడవాలో విబూది రాసుకుంటున్న జంగముడు అన్నాడు. “అమ్మాయీ.. మెడలో తాళి లేదు. కాళ్లకు మట్టెల్లేవు. ముఖాన సంసార ఛాయలు లేవు.. శివా! జాగ్రత్త.. జాగ్రత్త!”. లలితాంబ ముఖాన ఏదో అనిర్వచనీయ సిగ్గుల పూదోట.. ఆశ్చర్యపోయాడు జాయపుడు. ఈ తెలతెల్లని పుచ్చపూల తొలివెలుగుల్లో మెడలో తాళి, కాళ్లకు మట్టెలు ఉన్నాయో లేవో వీడు ఎలా చూశాడో!?.. తిరిగి విక్రమను ముద్దాడి అధిరోహించారు. వెలుగు వెంట పయనం.. పోయిపోయి నడినెత్తికి ఎగసిన సూర్యభగవానుడు.. తగ్గి తగ్గి ముసుగు తన్నేవేళకు నీలాంబ వేశ్యాగృహం వద్ద నిలిచింది విక్రమ.
లోపలికి ఆహ్వానించింది నీలాంబ. కూతురు, అల్లుడు కాని అల్లుడు ఒకే అశ్వంపై రావడం.. ఆమె కళ్లలో మెరుపులు నింపినట్లుంది. అవి మిలమిలా మెరిసిపోతున్నాయి. అప్పుడు చూశాడు జాయపుడు లలితాంబ ముఖంలోకి.. ఆశ్చర్యం.. పొద్దున జంగముడు చెప్పినప్పటి ‘సిగ్గుల పూదోట’ ఇప్పటికీ అలాగే ఉండటం..
“కాసేపు విశ్రమించు తమ్ముడూ.. రాజనగరికి తర్వాత వెళ్లవచ్చు!”. కాసేపటికి ఫలహారాలు. పానీయాలు.. ఎవరెవరో యువతులు. యువతులు సరే.. వారి ముఖాలలో కూడా సిగ్గుల పూదోట.. కాస్త శక్తి కూడదీసుకున్నాక కదిలాడు జాయపుడు. ద్వారంవద్ద వీడ్కోలు చెబుతూ.. “లలితకు, నీకు భోగిని పండుగ జరపాలని.. మంచి ముహూర్తం కోసం పండితులను సంప్రదించాను. రాబోయే..” నీలాంబ మెరిసే కళ్లతో చెబుతున్నది. అర్థంకానట్లు చూశాడు.
“నీకు లలితకు కన్యాదానం. అంటే మా కులవృత్తిలో అమ్మాయికి ఒకరితో శోభనకార్యమే వివాహవేడుక అన్నమాట. అదే భోగిని పండుగ. వినలేదా..” ముందు సంకోచంగా చెప్పినా, చివరికి స్పష్టపరచింది నీలాంబ.
అసహనంగా కదిలాడు. ఆత్మీయులతో తిరస్కార ప్రకటన చేయలేకపోవడం కళాకారుల బలహీనత!!
“తొందరెందుకు అక్కా! కొంతకాలం తర్వాత ఆలోచిద్దాం!”. విక్రమ వేగంగా కదిలింది. ‘వద్దు.. నాకిష్టం లేదు’ అనలేదు జాయపుడు. తొందరెందుకు అన్నాడు.
మరికొంత కాలం తర్వాత అంటే.. అంగీకారమేనని అర్థం కదా. చివ్వున వెనక్కి తిరిగి.. చాటుగా వింటున్న లలితను చూసింది నీలాంబ. ఇద్దరూ ఏక క్షణంలో సంతోషంతో పులకించారు. లలితాంబ రివ్వున మెట్లెక్కి పై అంతర్వు వసారాలోకి వెళ్లింది. ఉత్సాహంగా చేయి ఊపింది. ఊహించినట్లు పైకి చూస్తున్న జాయపుడు ఉత్సాహంగా నవ్వాడు. బలంగా కళ్లెం ఊపాడు.
రాజ ప్రాసాదానికి వచ్చాడు. అశ్వశాల వద్ద తనకోసమే చూస్తున్నట్లు పుళిందపుడు.. వేగంగా దగ్గరికొచ్చాడు.
“పొలవాసనాడులో మీరు యుద్ధానికి వెళ్లింది ఎవరిమీదనో తెలుసా జాయపసేనానీ! మన రాజనగరి మిత్రుడు ముమ్మడినాయకుని సైన్యం మీద..” ఆశ్చర్యపోయాడు జాయపుడు. కామితదేవుడి శత్రువు.. ముమ్మడినాయకుడా.. మరోమాట చెప్పాడు పుళిందపుడు. మీకు తెలుసుగా.. ముమ్మడి, ఇంద్రాణి మధ్య ప్రేమ వ్యవహారం. పెద్దలు త్వరలో ముహూర్తం నిర్ణయించబోతున్నారు కూడా. మీరిలా చేశారని తెలిస్తే ఆమె కూడా నొచ్చుకుంటుంది”. విన్న జాయపునిలో కలిగిన భావనలు అతనిక్కూడా అర్థం కాలేదు. * * * లలితాంబ.. పదే పదే గుర్తొస్తున్నది. అశ్వంపై ఆమెను ముందు కూర్చుండబెట్టుకుని నాలుగు గవ్యూతులు.. రెండురోజుల ప్రయాణం.. ఓ రాత్రి ఏకాశయ్యాగతులవడం.. మొత్తంగా బావుంది.
ఆమెతో ఆ దగ్గరితనంలో ఏదో మానసిక శారీరక ఉద్రిక్తతల కలబోత ఉంది. కాకతితో కూడా ఎప్పుడూ అంత దగ్గరగా లేడు. లేడా.. ఉన్నాడు. ఉన్నాడున్నాడు.. అప్పుడతనికి కాకతిపై బెంగ ముంచుకొచ్చింది. ఓసారి కాకతిని చూస్తే బావుండును.. లలితాంబ ఆలోచనలను మరచిపోడానికా అన్నట్లు వెంటనే అయ్యనవోలు వెళ్లాడు. కానీ, కాకతి లేదు. నాటకాల ప్రదర్శనలిస్తూ దక్షిణావర్తంలోని శైవక్షేత్రాలను దర్శించడానికి భైరవ, కొండయ బృందాలు కుటుంబాలతో సహా వెళ్లారట. కాకతి కుటుంబం కూడా వెళ్లిందన్నమాట.
గతంలో భైరవ చెప్పడం గుర్తొచ్చింది.
గ్రామ సమయశెట్టి దేవరభట్టు ఇంటికి వెళ్లాడు. “మొత్తంగా పది శైవబృందాలు కలిసి వెళ్లారు దక్షిణరాజ్యాల్లోని గుడులన్నీ చూడాలని. రావడానికి హీనపక్షం ఆర్నెల్లు పడుతుందేమో..” చిరాకుగా, నిరాశగా వెనువెంటనే తిరిగి వచ్చేశాడు. మరునాడు ప్రభాతాన్నే కోటలోపలి రహస్యవేగుల నియోగంలో ఉద్యోగి.. అంకమరట్టను పిలిచాడు. ద్వీపం నుంచి నారాంబ – పేరాంబలతో వచ్చిన పరిచారిక నాంచారమ్మ. అనుమకొండ పక్కనున్న పసుపాముల గ్రామరట్ట ఆమెను వివాహం చేసుకున్నాడు.
వారి బిడ్డే ఈ అంకమరట్ట. అతనికి జాయపుడు సాక్షాత్తూ నటరాజరూపం. అంకమతో అయ్యనవోలు గ్రామ వివరాలు చెప్పి.. “నువ్వు అప్పుడప్పుడూ ఆ గ్రామానికి వెళ్లి, కొండయ బృందం దక్షిణావర్తం నుంచి తిరిగి ఎప్పుడు వస్తారో నాకు తెలియపరచాలి. ఎప్పుడొస్తారో ఏమో.. ప్చ్!”. అంకమరట్ట అంగీకరించి నమస్కరించి వెళ్లిపోయాడు.
ప్రత్యూషవేళ.. ఆసన, యోగ, వ్యాయామ అభ్యాసాలు ముగిశాక జంతుకోష్టంలో విక్రమ, ధీరలతో వ్యూహాలు రూపొందించుకుంటున్నాడు జాయపుడు. పుళిందపుడు మరో వ్యక్తితో అక్కడికి వచ్చాడు. ఆ వ్యక్తి ముమ్మడినాయకుడు. వాళ్లిద్దరూ కూడా వ్యాయామశాల నుంచే వస్తున్నట్లున్నారు. చాలా సాధారణ ఆహార్యమే అయినా.. ముమ్మడి నడుముకు చురకత్తి. ముఖంపై ముచ్చటగా పెంచుకున్న మీసాలు.. మనసులోని కాఠిన్యాన్ని ప్రకటిస్తున్నాయి. వ్యాయామం వల్ల శరీరం చెమటవాసన కొడుతున్నది. “జాయపసేనానీ.. శుభోదయం!” అభివాదం చేశాడు పుళిందపుడు.
నవ్వులాంటిది నవ్వాడు ముమ్మడి. తిరిగి అభివాదం చేసి..“ఉదయాన్నే ఏమిటి విశేషం మిత్రమా.. వెతుక్కుంటూ వచ్చారు?” అన్నాడు. “అవునవును. ముమ్మడి నీకు పరిచయమే కదా! పొలవాసనాడు మండల సైన్యాధ్యక్షుని కుమారుడు మనవాడు. తండ్రిగారు మహామండలేశ్వరులు గణపతిదేవులవారి జ్ఞాతిసోదరులు. ఇటీవల కామితదేవుడు అనే సేనాని ఒకడు ముమ్మడితో ఢీ అంటే ఢీ అంటున్నాడు. వారిద్దరి తగవులు పెరిగి పెరిగి అనేక విపరీత పరిస్థితులకు దారి తీస్తున్నాయి. ఇటీవల మీరు కూడా..” పుళిందపుణ్ని ఆపమన్నట్లు భుజంపట్టి ఆపాడు ముమ్మడి. (సశేషం)“పొలవాసనాడులో మీరు యుద్ధానికి వెళ్లింది ఎవరిమీదనో తెలుసా జాయపసేనానీ! మన రాజనగరి మిత్రుడు ముమ్మడినాయకుని సైన్యం మీద..” ఆశ్చర్యపోయాడు జాయపుడు.
ముమ్మడినాయకుడా.. మరోమాట చెప్పాడు పుళిందపుడు. “మీకు తెలుసుగా.. ముమ్మడి, ఇంద్రాణి మధ్య ప్రేమ వ్యవహారం. పెద్దలు త్వరలో ముహూర్తం నిర్ణయించబోతున్నారు కూడా. మీరిలా చేశారని తెలిస్తే
ఆమె కూడా నొచ్చుకుంటుంది”.