Jaya Senapathi Episode 35 | జరిగిన కథ : మల్యాల మైలాంబిక ఆహ్వానం మేరకు.. పద్మాక్షి వివాహానికి హాజరయ్యాడు జాయప. అక్కడే తన తండ్రి.. వెలనాడు మండలేశ్వరుడు పినచోడుణ్ని కలుసుకున్నాడు. ఐదేళ్ల తర్వాత తండ్రిని చూసి కన్నీరుమున్నీరయ్యాడు. కొడుకును కళ్లారా చూసుకుని.. ఓ సాధారణ తండ్రిలా ఏడ్చాడు పినచోడుడు. ఆ తర్వాత తన తల్లికి అనారోగ్యంగా ఉన్నట్లు తెలిసి ఖిన్నుడయ్యాడు జాయప. వెంటనే తన అశ్వాన్ని అధిరోహించి.. తలగడ దీవి కోటకు చేరుకున్నాడు.
‘జాయప.. మన యువరాజు తిరిగి వచ్చాడట!!’..
జాయప తిరిగి వచ్చాడన్న వార్త.. అంతఃపురానికి చేరింది. తలగడదీవికోట లోపలినుంచి నిబిడాశ్చర్యంతో పరిచారికలు, కంచుకిలు, అన్నదమ్ములు – అక్కాచెల్లెళ్లు.. అందరూ పరుగులు పెడుతూ వచ్చేస్తున్నారు. జాయపను చూసి ఆగిపోయి అబ్బురంగా చూస్తున్నారు. తర్వాత మీదపడి హత్తుకుని పరవశించి పోతున్నారు.జాయపను జ్ఞాతులందరూ లోపలికి ఎత్తుకొని తీసుకు
పోయారు. మంచంపై తల్లి.. దాయమ్మ!!
గుమ్మానికి కళ్లు అతికించుకుని బతికి ఉంది. ఎండిపోయి రక్తహీనమైన బల్లిలా మంచంపై.. లేవలేనంత బలహీనంగా! చూస్తూనే చంటిపిల్లాడిలా ఏడ్చేశాడు జాయప. ఆమె.. ఏడ్చే శక్తిలేక కొడుకును చూసుకుంటూ వణికిపోతున్నది. నిండిన కుండల్లాంటి కళ్లనుంచి అశ్రువులు పక్కకు తొణుకుతున్నాయి. లేవాలని ప్రయత్నం.. సహకరించని శరీరం!
ఒక్క ఉదుటన తల్పంపై ఆమె కాళ్లవద్ద పడిపోయాడు. అతని దుఃఖాన్ని ఆపేవారెవ్వరూ లేరు. ఎందుకంటే అందరూ సజల నయనాలతో.. రుద్ధమైన కంఠాలతో మొద్దుబారిన గుండెలతో జాయపనే చూస్తున్నారు. దాయమ్మ కొడుకు కోసం ఎంతలా తపించిపోతున్నదో వారందరికీ తెలుసు. కన్నీరు ఉప్పెన లాంటిది. ఉవ్వెత్తున ఎగసి గూడుకట్టుకున్న ఎన్నో నిక్షిప్త మానసిక క్లేశాలను కడిగేస్తుంది. దాయమ్మ పసిపిల్లాణ్ని అదుముకున్నట్లు జాయపను అలా తన గుండెలకు అదుముకునే ఉన్నది. ఇద్దరినీ విడదీసే సాహసం ఎవ్వరూ చేయలేదు. కన్నీరు వారివారి మనసులను శుభ్రంచేసి తేలికపరుస్తున్నది. కాసేపటికి ఎవరో అన్నారు..
“జాయప ఎంగిలిపడి ఎంత కాలమయ్యిందో!?”..
తల్లి దాయమ్మ కదిలిపోయింది. తలెత్తి వెనుకనున్న తోటికోడలివైపు చూసింది. జాయప అన్నాడు..
“అమ్మా.. పాలబువ్వ!”..
విన్న పిన్ని లోపలికి పరుగుపెట్టింది. బంగారు తళియలో పాలతో వరిఅన్నం కలిపి తీసుకొచ్చి దాయమ్మ చేతికిచ్చింది. గబగబా కలిపి తొలిముద్ద పెట్టబోయింది.
“అమ్మా.. పాట!” అన్నాడు జాయప.
ఆమె గొంతు సవరించుకోవడానికి ఇబ్బంది పడుతుంటే.. జాయపే ఎత్తుకున్నాడు.
“లాలి జో గోపయ్యా.. లాలి జో కన్నయ్యా!”..
కొడుకు గాత్ర పరిణితికి ఆశ్చర్యపోతూ దాయమ్మ పెదవులు కలిపింది. తర్వాత అందరినీ గొంతు కలపమన్నట్లు సైగ చేశాడు జాయప. అమ్మలు, అక్కలు, చెల్లెళ్లు, అన్నలు, తమ్ముళ్లూ, పరిచారికలూ.. అందరూ కన్నీటితో పాడుతుండగా ఆ కన్నీరు కలిసిన పాలబువ్వ తల్లి చేతినుంచి నోట్లో పెట్టుకున్నాడు జాయప.. ఐదేళ్ల తర్వాత!
* * *
చౌండ భవంతి. పెళ్లి మండపం. రాత్రి మొదటి జాము. పద్మాక్షి వివాహపు ఐదోరోజు వేడుకలు. ఆరోజు నవ వధూవరుల తొలిరేయి వేడుకలు. మందిరం మధ్య వృత్తాకారంలో ఉన్న వేదిక. దానిపై నవ వధూవరులతో గొజ్జంగి పూలబంతితో బంతాట ఆడించి.. అప్పుడే లోపలికి తోడ్కొని పోయారు ముత్తయిదువలు, పురోహితులు. పురోహిత ఆశీర్వచన సహితంగా గర్భాదాన కార్యక్రమం నిర్వహించాక.. శయన మందిరం లోపలికి కొత్తజంటను సాగనంపి తలుపు మూశారు ముత్తయిదువలు. అనంతరం మహిళలకు ప్రత్యేక మధుసేవన ఆతిథ్యం లోపలే ఏర్పాటుచేశారు. నాలుగు రోజులుగా రాజ్యగొడవలు పక్కనబెట్టి చౌండ ఆతిథ్యంతో విందు, మందు, పొందు విలాసాలలో ఈదులాడుతున్న అతిథులందరూ తీరుబడిగా పక్కవారితో ముచ్చట్లు పంచుకుంటూ.. ఓరకంట వేశ్యా లలామల శరీరహొయ లయలను కోర్కెనిండిన కళ్లతో వీక్షిస్తున్నారు. కాకతీయ సామ్రాజ్యపు సామంత ప్రభువులంతా విచ్చేశారు. మండలాధీశులు మొత్తం అక్కడే ఉన్నారు. మంత్రులు, ప్రధానులు, లెంకలు, సేనాధ్యక్షులు, సాహిణులు, కవిగాయక పండిత ప్రకాండులు, అత్యుత్తమ సైన్యాధిపతులు, నియోగాధిపతులు, సమయాల శెట్టిలు, నానదేశి పెక్కండ్రు, సార్థవాహులూ, నౌకా నిర్మాతలు, కొండిపర్తి మండలంలోని కులీనులు.. బంధువర్గం.
అప్పుడు వినిపించింది మందిరానికి ఉత్తరదిశగా నిర్మించిన ఉన్నత వేదిక నుంచి రంగదేవతా పూజనం.
“ఆంగికం భువనం యస్య వాచకం సర్వ వాఙ్మయం!
ఆహార్యం చంద్ర తారాది తం వందే సాత్వికం శివం !!”..
అనంతరం యవనిక తొలగింది. ఆదితాళంతో మార్దంగికుడు మృదంగంపై ఓంకారం పలికిస్తుండగా.. నట్టువాంగం మొదలై శ్రీకృష్ణ, రాధ ఆహార్యంతో నీలాంబ, జాయప నటనమాడుతూ వేదికపైకి వచ్చారు. “ధీరసమీరే యమునా తీరే వసతివనే వనమాలీ!”..
ఓడ్రదేశపు భక్తకవి జయదేవుడి కొత్తరచన అది. అష్టపదుల నాట్య ప్రదర్శన. జాముకుపైగా సాగిన నాట్యకార్యక్రమం అతిథులను మరో లోకాలకు తీసుకుపోయింది. వయసుతో సంబంధం లేకుండా అతిథులలో శృంగార రసభావనలు తట్టి లేపింది. ముఖ్యంగా రాధగా జాయప పాత్రధారణ, ఆహార్యం ప్రేక్షకులను మైమరపించింది. రాధ పాత్రధారి అబ్బాయి అని తెలిసి అందరూ విభ్రాంతి చెందారు. నీలాంబ అందంకంటే జాయప అందంపట్ల అభినందనలు కురిపించారు. ఆ వివాహ ముగింపు సంబరాలరాత్రి అతిథి ప్రపంచం పంచమ జ్యోత్స్నానందంలో వివశత్వమందింది.
* * *
అంతకు రెండురోజుల ముందు తలగడ దీవికోటలో తల్లి చేతులతో పాలబువ్వ తిన్న జాయపను.. బంధువులంతా మంగళస్నానాలు చేయించి హంసతూలికా తల్పంపై పవ్వళింపజేసి నిద్ర పుచ్చారు. అర్ధరాత్రివేళ దిగ్గునలేచాడు జాయప. కల.. చెరసాలలో సంకెళ్లతో దీనంగా చూస్తున్న అక్కలు!!
అమ్మను చూశాడు. అమ్మచేతి అన్నం తిన్నాడు. అన్నదమ్ములతో, పెదనాన్న, బాబయగార్లతో తన ఇంట పరవశించి.. రెండురోజులు ఆత్మీయంగా గడిపాడు. చాలు. తన కర్తవ్యం మరచిపోరాదు. అది మరపురానివ్వదు. నిద్ర పట్టనివ్వదు. ఇక్కడ ఉంటే కర్తవ్యం మరపురాదు కానీ, సాధించాలన్న పట్టుదల, పోరాటపటిమ తగ్గిపోతాయి. ఇక తల్లికేం కాదు. ఆమె పూర్తిగా కోలుకోవాలంటే అక్కలను తిరిగి తగిన గౌరవమర్యాదలతో తలగడదీవి కోటకు తెచ్చి అమ్మకు చూపాలి.మరోజాము తర్వాత జాయప తన అశ్వం విక్రమను ఆప్యాయంగా తట్టి వేగంగా అధిరోహించాడు. మరునాడు సంధ్యవేళకు నీలాంబ భవంతికి చేరాడు. చౌండ ఇంట వివాహ వేడుకలలో చివరి కార్యక్రమం నీలాంబ బృందానిదేనని జాయపకు తెలుసు. అతనికోసం అందోళనగా ఎదురుచూస్తున్న నీలాంబ.. జాయపను చూసి అమితోత్సాహంతో వివాహ మండపానికి లాక్కొని పోయింది వేగంగా.
రెట్టించిన ఉత్సాహంతో విరహోత్కంఠిత అయిన రాధ ఆహార్యంతో జాయప, కృష్ణుడిగా ముస్తాబైన నీలాంబతో.. రంగస్థలంపై ప్రత్యక్షం అయ్యాడు. పెద్దలను పరవశింపజేశాడు. శృంగార మోహావేశ భావాలలో ముంచెత్తాడు. పినచోడుడు తన కొడుకు నాట్యకౌశలం చూడటం ఇదే ప్రథమం. ఆయన చకితుడయ్యాడు. అందగాడైన బాలుడు మాత్రమే అనుకున్న కుమారుడు కౌమారందాటి యవ్వనుడవుతూ.. ఇంత గొప్ప కళాకారుడు అవుతాడనుకోలేదు ఆయన. ఈ నాలుగు రోజులలో కనిపించని జాయప వాయువేగ మనోవేగాలతో ద్వీపానికి వెళ్లి.. తల్లికి కనిపించి, మళ్లీ వచ్చి కార్యక్రమంలో పాల్గొనడం తెలిసి.. తండ్రిగా మరోసారి సంతోషించాడు. సున్నితమైన కుమార్తెల అంశం కూడా ఇక ప్రయోజకుడైన కుమారుడు చూసుకోగలడని ఆయనకు నమ్మకం కలిగింది. పినచోడుని ముఖంలో తేజరిల్లుతున్న ఆనందడోలికలు చౌండునికి, మైలాంబికకు అర్థం కాకపోలేదు. అలాగే జాయప తన కుమారుడిగా ఆయన అక్కడెవ్వరికీ చెప్పకపోవడం కూడా వారిదృష్టికి రాకపోలేదు.
* * *
వివాహ వేడుకలు ముగిసి.. జాయప తిరిగి తన దైనందినంలోకి వచ్చి పడ్డాడు. నాట్య సంగీత శిక్షణ, చదువు, మిత్రులతో చర్చలు, కబుర్లు.. ఓరుగల్లు, అనుమకొండ వీధుల్లో విహారాలు. అయినా తన కర్తవ్యం ఎప్పుడూ మరపురాదు. ఎలా.. ఎలా అక్కలను బంధ విముక్తులను చెయ్యాలి? ఓ తమ్మునిగా ఆరాటపడుతున్నాడే గాని వారిని బంధ విముక్తులను చేసే స్థాయి, వ్యూహం, వయసు అతనికి లేవు. ఉన్నదల్లా మొక్కవోని పట్టుదల. అతనికి కనిపిస్తున్న ఏకైక వెలుగుదీపం.. చక్రవర్తి గణపతిదేవుడు! తను రానురానూ చక్రవర్తికి దగ్గరవుతున్నాడు. మరింత దగ్గరవ్వాలి. అందుకు తనకున్న ఏకైకమార్గం నాట్యం. తద్వారా చక్రవర్తిని మెప్పించాలి.
* * *
ఓ రోజు ఉదయమే నాట్య గురుకులంలో అశోకుడు, జాయప కొన్ని నాట్య భంగిమలు, కరణుల మార్పుచేర్పులు సాధన చేస్తున్నారు. అప్పుడే ఇద్దరు పరిచిత వ్యక్తులు నాట్యమందిరంలోకి ప్రవేశించారు. వారు పరిచితుల్లా.. ఎక్కడో చూసినట్లుంది. వారి ఆహార్యం.. పావుకోళ్ల వరకూ పొడవైన ఉత్తరీయం.. నడికట్టులో చిన్న బంగారు ఉలి.. మహాస్థపతి రామప!!
ఇద్దరూ పరిచయం ఉన్నట్లు చిరునవ్వు నవ్వారు. జాయప వారి దగ్గరికి వెళ్లి నమస్కరించాడు. “ఆయుష్మాన్ భవ! ఆరోజు గుడిలో నీనాట్యం..” అన్నాడు రామప. “నాట్యం లాంటిది..” అన్నాడు జాయప.ముగ్గురూ నవ్వారు. “మీరేమిటి ఇక్కడ.. నాట్యం అభ్యసించడానికి వచ్చారా?”.రామప నవ్వాడు. “నాకంత అదృష్టంలేదు! నా వృత్తి ఇదిగో.. ఇలా చేతులతో నాట్యం చెయ్యడం!”..శిల్పం చెక్కడాన్ని అభినయించి చెప్పాడు. “అయితే ఆ రోజు.. గుడిలో ఏదో రాసుకుంటూ కనిపించారే?!”. కంచుకం లోపలి నుంచి ఓ బిరుసువస్త్రపు పొత్తి బయటికి తీశాడు రామప.
“ఇదేనా?!..” అంటూ చూపించాడు.అది చూసి జాయప ఆశ్చర్యపోయాడు. నాట్యభంగిమలు లిఖించి ఉన్నాయి. చాలామంది నటుల భంగిమలు. ఆ రోజు తను నాట్యం చేస్తున్నప్పటి భంగిమ కూడా వాటిలో ఉంది. ఆ రోజు తనను చూస్తూ గీసుకున్నారు. అవి చూశాక అతనికి దేవాలయాల్లో శిల్పాలు జ్ఞప్తికి వచ్చాయి. ఆ శిల్పరూపాలు ఇలా నాట్యాలు చూస్తూ రూపొందించు కుంటున్నారన్నమాట. పక్కనున్న వ్యక్తిని జాయపకు పరిచయం చేస్తూ.. “ఈయన సంజయ! చిత్రకారులు. చిత్రకారుల సమయానికి శెట్టి కూడా!” అన్నాడు రామప..
“వివిధ అంశాలను మా శిల్పకారుల అవగాహన కోసం చిత్తరువులుగా ఇవ్వడానికి చిత్రకారుల సహాయం తీసుకుంటాం. స్థపతులం ఓ సంఘటనను, ఓ సామాజిక, జానపద లేదా ఓ పురాణఘట్టాన్ని ఎంచుకుంటాం. వాటిపై సంజయ, నేనూ చర్చించుకున్నాక.. మీలాంటి నటుల శరీరాలను, నాట్యభంగిమలను పరిశీలించి సరైన అభినయ, రూపురేఖల కచ్చితత్వంతో సంజయబృందం వాటిని పూర్తి చిత్తరువులుగా గీస్తారు. అప్పటికి ఓ పౌరాణికపాత్ర, సన్నివేశం లేదా ఎంచుకున్న ఓ గొప్ప ప్రబంధానికి శిల్పరూపం పూర్తవుతుంది. వాటిని మా స్థపతులబృందం అక్కడక్కడా మెరుగులు దిద్ది ఆమోదించాక.. వాటిని ముందుంచుకుని వర్ధకులు చెక్కడం ప్రారంభిస్తారు”.. వివరించాడు రామప. ఆరోజు నుంచి జాయపకు మరో కొత్తలోకం పరిచయం అయ్యింది. అది శిల్పప్రపంచం!!
మరునాడు స్థపతి రామప చెప్పినచోటుకి వెళ్లాడు జాయప. అది అనుమకొండలోనున్న రుద్రేశ్వరాలయం. ప్రజలు ‘వేయిస్తంభాల గుడి’ అని పిలుస్తున్నారు. నక్షత్రాకారపు ఎత్తయిన వేదికపై రుద్రేశ్వర, విష్ణ్వాలయ, సూర్యాలయ గర్భగుడులు ఒకే కప్పు కింద ప్రతిష్ఠితమైన త్రికూటాలయం అది. మూడింటికీ ముందున్న సభామండపం నుంచే ప్రవేశమార్గం ఉంది. దీనికి ఎదురుగా అందమైన శిల్పసంశోభిత స్తంభాలతో మూడు రంగమండపాలు ఉన్నాయి. “ఇది మా నాన్నగారు రుద్రోజుస్థపతి సృష్టి. గణపతిదేవ మహారాజుగారి పెదనాన్నగారు రుద్రదేవుల కల ఇది. ఆయన కాలధర్మం చెందారు.. నాన్నగారు పెద్దవారైనారు గాని.. ఈ రుద్రేశ్వర దేవాలయం సంపూర్ణం కాలేదు” చెప్పాడు రామప.గతంలో గుడి అంటే ఏదో భక్తిప్రపత్తులతో దేవుణ్ని దర్శించుకుని.. తమ కోర్కెలేవో నివేదించుకునే పవిత్ర స్థలంగానే తెలుసు జాయపకు. దీని నిర్మాణంలో ఉన్న శాస్త్ర అంశాలు, వాస్తు, గర్భగుడి, అంతరాలయం,
వివిధ మండపాలు, ఆధారశిల, ఉపానం, పట్టిక, పద్మం, కుముదం, అధోపద్మం, కక్ష్యాసనాలు, కపోతం, వ్యాళాలు, కోష్టం, ప్రసరం, చూరావళి, శిఖరం, విమానం, స్థపతి, వద్దంకులు లాంటి దేవాలయ పారిభాషిక పదాలు తెలియదు. వింటున్న జాయప ఒళ్లు జలదరించింది. గుడినిర్మాణంలో ఇంత శాస్త్రం ఉందా..!?
(సశేషం)
-మత్తి భానుమూర్తి
99893 71284