జరిగిన కథ : గురుకులం నుంచి బయల్దేరారు ఇంద్రాణి, జాయపుడు. ముందు పల్లకిలో ఇంద్రాణి.. వెనుక అశ్వంపై జాయపుడు. ఏదో ఆలోచిస్తూ వెళ్తున్న జాయపుణ్ని.. ఓ బిచ్చగాడి పాట ఆపేసింది. గుర్రం దిగి.. అతనికి నమస్కరించాడు. ఆ బిచ్చగాడు స్థాణువైపోయాడు. చూస్తున్న జనం కూడా ఆశ్చర్యపోయారు. వారిని పట్టించుకోకుండా.. ఆ బిచ్చగాణ్ని అక్కడున్న ఇంటి అరుగుపై కూర్చోబెట్టి, పక్కనే కూర్చున్నాడు. అతని చేతిలోని వాయిద్యాన్ని తీసుకుని.. పసిపాపలా ఒడిలో పెట్టుకుని పరీక్షించసాగాడు.
ఆ వాయిద్యాన్ని ఆమూలాగ్రం చూస్తూ.. “ఇది ఎవరు తయారుచేశారు? ఈ గుమ్మడి బుర్ర ఏమిటి?” అడిగాడు
జాయపుడు. “ఏమో తెల్వదు దేవరా! మా నాయన నాకిచ్చిండు. ఈ గుమ్మడిబుర్ర పాడైపోతే మరోటి తగిలిస్తా! నే పాడుకుంటా, వాయించుకుంటా వీధులంట పోతుంటా.. జనమే నిలబెట్టి మరీ బియ్యం, అన్నం, కూరలు నా జోలెలో ఏస్తరు!” అని చెప్పాడు ఆ బిచ్చగాడు. “భలే భలే! వాయించు.. పాట పాడుతూ వాయించు..” అన్నాడు ఆ వాద్యాన్ని, దాని శబ్ద సౌందర్యాన్ని తీక్షణంగా పరిశీలిస్తూ జాయపుడు.
అతను పాడుతూ వాయిస్తున్నాడు. జాయపుడు కళ్లు మూసుకుని వింటున్నాడు. అప్పుడో సంఘటన జరిగింది. దూరంగా వీధి మలుపు వద్ద పల్లకి ఆగింది. ఇంద్రాణి దిగింది. దూరంగా జాయపుడు ఓ సాధారణ రెల్లుగడ్డి ఇంటి అరుగుపై ఓ బిచ్చగాడితో కూర్చుని కనిపిస్తున్నాడు. కొందరు సామాన్యులు వారిచుట్టూ మూగి ఉన్నారు. ఇంద్రాణి వేగంగా అక్కడికి రాబోయింది. మధ్యలోనే ఆగిపోయింది. చివ్వున వెనుదిరిగింది. పల్లకి అధిరోహించింది. పల్లకి ఆగకుండా ముందుకు సాగి.
అశ్వాలపై జాయపుడు, లలితాంబ.. దూసుకుపోతున్నారు. ఉండి ఉండి చెమటలు తుడుచుకుంటున్నారు. చాలాదూరం నుంచి వస్తున్నట్లు.. మరింత దూరం పోతున్నట్లు వారి అశ్వచాలన చెబుతున్నది.
వెనగ్గా మరికొందరు పురుషులు, స్త్రీలు అశ్వాలపై వస్తున్నారు. అంతా పోయేది ఒక్క దగ్గరకే. కానీ,
ఎవ్వరికీ సందేహం రాకుండా దూరదూరంగా పోతున్నారు.. ముగ్గురు నలుగురుగా. చీకట్లు బాగా ముసి
రేవేళకు ఓ నగరంలోకి ప్రవేశించి.
ఓ భవనానికి కాస్త ఆవలగా చెట్ల గుబుర్ల చాటున నిలబడి ఆ భవనాన్ని చూస్తున్నారు. “అదే.. కమలాంబ వేశ్యావాటిక!” చూపిస్తూ చెప్పింది లలితాంబ. అదొక శిథిలభవనంలా.. అలికిడి లేక నిశ్శబ్దంగా ఉంది. ఈ సమయంలో ఏ వేశ్యాగృహమైనా వచ్చేపోయే పల్లకీలు, రథాలతో అట్టహాసంగా వెలిగిపోతుంది. కానీ, కమలాంబ వేశ్యాగృహం ఎవరో శపించినట్లు నిశ్శబ్దాన్ని కప్పుకొని పడుకుని ఉన్నది. “అయితే నువ్వు చెప్పింది నిజమేనన్నమాట..” అన్నాడు జాయపుడు.
లలితాంబ తీక్షణంగా అటే చూస్తూ అన్నది. ఆమె కుడిహస్తం మాటిమాటికీ నడుముకున్న పటకాలో దోపిన చురకత్తి పైకే పోతున్నది. ఆమె ఎప్పుడైనా ముందుకు దూకే ఆడచిరుతలా ఉంది. అది పొలవాసనాడు ఆవలగా ధర్మపురి క్షేత్రానికి వెళ్లేదారిలో ఉన్న వేశ్యాగృహం. దానిని నిర్వహిస్తున్న కమలాంబ.. లలితాంబకు చెల్లెలు. పిన్ని కూతురు. అంటే.. నీలాంబ చెల్లెలి కూతురు. అయితే ఈ కమలాంబకు భర్త లాంటివాడు ఈప్రాంత మండలేశ్వరుని కుమారుడు కామితదేవుడు. అతని సహకారంతోనే కమలాంబ ఈ వేశ్యాగృహాన్ని నడుపుతున్నది. అయితే అతని ప్రత్యర్థులు కామితను దెబ్బకొట్టే తంత్రాలలో భాగంగా ఈ వేశ్యా
గృహాన్ని లక్ష్యంగా చేసుకున్నారు. నిన్నటిదినం దీనిపై దాడిచేసి కమలాంబతోసహా మహిళలందర్నీ బంధించారు. సహజంగానే కామిత వర్గం తిరిగి దాడి చేశారు కానీ, ప్రత్యర్థిదే పైచేయి అయ్యింది. కామితుణ్ని కూడా ఈ వేశ్యాగృహంలోనే బంధించి ఉంచారు.
ఈ సమాచారం ఓరుగల్లుకు చేరింది. లలితాంబ ఆగ్రహోదగ్రురాలయ్యింది. తన మహిళాసైన్యంతో కొందరు పురుషులను కలుపుకొని కదలబోయింది. అప్పుడే.. జాయపుని సహాయం అర్థించమని సలహా ఇచ్చింది నీలాంబ. లలితాంబ కోరికను జాయపుడు మన్నించాడు. ఆయుధాలు, కవచ, శిరస్త్రణాలు, ధరించి వాళ్లవెంట కదిలాడు. ఇద్దరూ మహావేగంగా వచ్చి ఆ వేశ్యాగృహం దగ్గరికి చేరారు. వెనుక వస్తున్న లలితాంబ సైన్యం కూడా చేరింది. పూర్తి ఆయుధ సంపత్తితో వచ్చారు.
‘ఆ వేశ్యాగృహంపై ఎలా దాడి చెయ్యాలి. లోపలికి ఎలా ప్రవేశించాలి? లోపలున్న శత్రువులు ముందే యుద్ధం ప్రారంభిస్తే కర్తవ్యం ఏమిటి?’ ఇత్యాదులన్నీ చర్చించారు. అనంతరం అందరూ ఆయుధాలు పంచుకుని ధరించారు. బరిసె, ధనుర్బాణాలు, ఖడ్గాలు, విచ్చుకత్తులు, చురకత్తులు, శిరస్ర్తాణాలు, కవచాలు ధరించి పెద్దపెద్ద మోకుతాళ్లతో గుంపులు గుంపులుగా గృహాన్ని చుట్టుముట్టారు. ముందువైపు సైన్యానికి లలితాంబ నాయకత్వం వహిస్తే.. వెనుక బృందానికి జాయపుడు నాయకుడిగా నిలిచాడు. మొదటగా దగ్గరున్న పెద్ద బండరాయికి తాడుకట్టి గిరగిరా తిప్పి గృహం గుమ్మాన్ని భేదించారు. అలాగే వెనుక గుమ్మాన్ని కూడా! వెనువెంటనే అందరూ మహావేగంతో లోపలికి దూకారు.
ఈ దాడి ఊహించని శత్రువులు నిద్రలో ఉండగా.. లలితాంబ సైన్యం విచక్షణారహితంగా వారిపై దాడిచేసి అందరిని బయటికి పారదోలింది. ఇదంతా అత్యంత వేగంగా.. కేవలం కొద్ది గంటలలోనే జరిగి, వేశ్యాగృహాన్ని తన స్వాధీనంలోకి తెచ్చుకున్నది లలితాంబ. ఓరుగల్లు నుంచి సహాయబృందం రావడంతో బలాబలాలు మారిపోయాయి. శత్రువర్గం పలాయనం చిత్తగించింది. కామితుణ్ని క్షేమంగా విడిపించారు.
జయజయధ్వానాల మధ్య కమలాంబకు వేశ్యాగృహాన్ని స్వాధీనపరచి.. తన సైనికబృందాన్ని అక్కడే వారికి రక్షణగా ఉంచింది లలితాంబ. కాస్త విశ్రాంతి తీసుకుని తిరిగి బయల్దేరారు జాయపుడు, లలితాంబ.
కానీ, అసలు యుద్ధం అప్పుడే మొదలయ్యింది. పారిపోయిన శత్రువులు మరింత పెద్దసైన్యంతో ఆ వేశ్యాగృహాన్ని చుట్టుముట్టారు. అప్పటికే జాయపుడు, లలితాంబ నగరం దాటారు. చివ్వున ఆగి తిరిగి వెనక్కి కదిలారు. కానీ, అప్పటికే ఓ శత్రుసైనిక బృందం ఈ ఇద్దరి కోసం ఎదురుగా తరలివస్తున్నది.
రక్షణ కోసం ఇద్దరూ పక్కనున్న అడవిలోకి మళ్లారు. కాస్త లోపలికి.. దట్టమైన అడవిలోకి ప్రవేశించి.. అశ్వాలను ఓచోట విడిచారు. ఇద్దరూ మరింత ముందుకు వెళ్లి.. చెరోవైపు చెట్ల చాటున దాగి ఎదురుదాడికి సిద్ధంగా ఉన్నారు. మరో గంట తర్వాత శత్రుగుర్రాల కదలిక ఎండుటాకులు చెబుతున్నాయి. ఇద్దరూ కత్తులతో సిద్ధంగా ఉన్నారు. కానీ, వీళ్లు ఊహించని దాని కంటే పెద్ద పటాలమే కనిపించింది.
‘మరి కాస్త అడవి లోపలికి వెళ్దాం’ అని జాయపునికి సైగ చేసింది లలితాంబ. ఇద్దరూ వెనక్కి మళ్లారు.
ముందు వెనుకా చూసుకుంటూ వెళ్లడంతో.. ఇద్దరూ ముందుకు దబ్బున పడిపోయారు.
అదొక పెద్ద గొయ్యి. వెంటనే జాయపునికి అర్థమైంది.. అది ఏనుగుల కోసం ఏర్పాటు చేసిన మాటుగొయ్యి.
ఏదైనా ఏనుగు తిరిగే, దారిని గుర్తించి అక్కడ ఏనుగు పట్టేంత గొయ్యితీసి.. దానిపై పచ్చికొమ్మలు, రెమ్మలు, ఆకులు వేసి నేలలాగ భ్రమింపజేస్తారు. ఏనుగు అటుగా వస్తే ఆ గోతిలో పడటం ఖాయం. ఇప్పుడు జాయపుడు, లలితాంబ ఆ గోతిలో పడ్డారు. మనిషి ఎత్తుకంటే రెండురెట్లు ఎక్కువ ఉంటుందా గొయ్యి. వీటి నిర్మాణం జాయపునికి క్షుణ్నంగా తెలుసు. గోతిలో పడిన ఏనుగు తనంతట తాను పైకిరాలేదు.
సకిలింపులు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఇద్దరికీ రాగల సమస్యలు తెలుస్తున్నాయి. ఏ క్షణమైనా నిర్దేశించిన ఏనుగు వచ్చి గోతిలో పడవచ్చు. శత్రువులు గుర్తించవచ్చు. ఏనుగుల వేటగాళ్లు రావచ్చు. ఏది జరిగినా పెద్ద ఆపదే! లలితాంబలో ముందున్న తెగువ, పోరాటపటిమను దాటి.. స్త్రీ సహజభీతి ముఖమంతా అలుముకున్నది. “జాయ మామా..” బేలగా, నీరసంగా అన్నది.
ఆమె గొంతులో నిస్సహాయత వినిపిస్తున్నది. జాయపుని ఆలోచన మాత్రం తీవ్రంగా ఉన్నది. శత్రువుల కదలిక దగ్గరగా లేదు. తక్షణ ప్రమాదం ఏనుగు నుంచే! ఏ క్షణమైనా ఏనుగు వచ్చి గోతిలో.. అంటే తమమీదే పడుతుంది. ఏనుగు పడితే లోపల ఉన్నవాళ్లు తప్పుకొనే మార్గంలేదు. దాని కిందపడి.. తక్షణమే ఎముకలు పటపటా విరిగి చస్తారు. జాయపునికి ముచ్చెమటలు పోశాయి.
చేతిలో పట్టుకున్న కరవాలం కూడా గోతిలో పడినప్పుడు ఎక్కడో చేయి జారింది. చటుక్కున నడుము
వద్ద నున్న చురకత్తిని చూసుకున్నాడు. హమ్మయ్య.. చురకత్తి ఉన్నది. “లలితా.. నీవద్ద చురకత్తి ఉన్నదా?” అని అడిగాడు. “ఉంది మామా.. ఎందుకు?”. చేతులతో గొయ్యి గోడలను తడిమాడు. అప్పుడే సూర్యోదయానికి అడవి సిద్ధమవుతున్నది. స్పష్టాస్పష్టంగా ఆ గొయ్యి గోడలు కనిపిస్తున్నాయి. ఆశించినట్లే ఉన్నాయవి. రాయి నేలకాదు. మట్టి నేల. గబగబా చురకత్తితో కాస్త తవ్వి చూశాడు.
మెత్తగా తెగుతున్నది. “లలితా.. వేగం. వేగంగా నువ్వు పట్టేటంత కన్నం ఆ గోడకు చెయ్యి. వెంటనే! ఊ.. ఆలస్యం లేదు. తెల్లవారితే ఏనుగులు కదులుతాయి. ఒక్క ఏనుగు లోపల పడిందో.. ఇద్దరం చస్తాం! త్వరగా గోడకు కన్నంవేసి మనం అందులో కూర్చోవాలి. అప్పుడే ఈ చావునుంచి తప్పించుకోగలం. ఏనుగు దాటిపోయాక మెల్లగా పైకి తవ్వుకుంటూ పైకి ఎక్కవచ్చు!”.జాయపుడు చెప్పిన ప్రమాదం.. తక్షణ కర్తవ్యం ఆమెకు అర్థమయ్యాయి. ఇద్దరూ పోటీపడుతూ వేగంగా గోడకు కన్నం తవ్వసాగారు.
రెండు మూడు.. ఐదు.. పాతిక ఘడియల కాలంలో ఇద్దరూ ఆ తవ్విన కన్నాలలో ఇరుక్కుని కూర్చున్నారు. ముందు ప్రాణాపాయం తప్పింది. బాగా తెల్లవారింది. చల్లగాలి రివ్వున వీస్తున్నది. సూర్యుని కిరణాలు ఇంకా వేడెక్కలేదు. గాలి సరసమాడుతున్నది. పక్షులు, కీటకాలు రణగొణధ్వని చేస్తున్నాయి. గొయ్యి దగ్గరగా గుర్రపు సకిలింపు.. దగ్గరగా. మెల్లమెల్లగా ఎవరో అశ్వంపై వస్తున్నట్లు.. అశ్వం కాలిగిట్టల శబ్దం ఎండుటాకుల్లో గరగరలాడుతున్నది. గుర్రం మరింత దగ్గరవుతున్నది. ఇద్దరూ ఊపిరి బిగబట్టి చురకత్తులు బిగించి.. పైన జరిగేది ఊహిస్తున్నారు. దగ్గరగా.. ఆశ్వికుడు దిగి వెతుకుతున్నాడేమో.. గుర్రం కదలిక, గిట్టల శబ్దం తప్ప.. మరేమీలేదు. జాయపునికి వెన్నుపై ఎవరో చరిచినట్లయ్యింది.
ఓ సంకేతంలా. తన ఊహ నిజమే! అది విక్రమ సకిలింపు. జాయపుణ్ని వెతుకుతూ మెల్లగా అక్కడే తిరుగుతున్నది విక్రమ. కన్నంలోంచి దిగి పైకి చూశాడు. చెయ్యి ఊపాడు.. ఆవలకు పొమ్మని. విక్రమను శత్రువులు చూస్తే చాలు.. వాళ్లకు పట్టిచ్చినట్లు అవుతుంది. జాయపుణ్ని చూసిన ఆనందంతో సకిలించి దూరం జరిగింది విక్రమ. జాయపునికి అర్థమైంది.. ఎవరైనా శత్రువు దగ్గరగా ఉంటే విక్రమ అక్కడికి రాదు. అంటే.. ఎవ్వరూ లేకపోవడం వల్లే విక్రమ అక్కడికి వచ్చింది. అలాగే ఏనుగులు అటు వచ్చినా విక్రమ వాటిని తరిమి కొట్టగలదు. “హమ్మయ్య! లలితా.. త్వరపడు. ఆ కన్నాన్ని మరింత పెద్దదిగా పైకి మెట్లలాగ తవ్వుకుంటూ పోదాం. పైకి ఎక్కేస్తాం.. కానివ్వు!”. (సశేషం)
మెల్లమెల్లగా ఎవరో అశ్వంపై వస్తున్నట్లు.. అశ్వం కాలిగిట్టల శబ్దం ఎండుటాకుల్లో గరగరలాడుతున్నది. గుర్రం మరింత దగ్గరవుతున్నది. ఇద్దరూ ఊపిరి బిగబట్టి చురకత్తులు బిగించి.. పైన జరిగేది ఊహిస్తున్నారు. దగ్గరగా.. ఆశ్వికుడు దిగి వెతుకుతున్నాడేమో..