Khamenei : ఇరాన్ (Iran) దేశాన్ని సుదీర్ఘ కాలంపాటు పరిపాలించిన మాజీ సుప్రీం లీడర్ (Ex Supreme Leader) అయతొల్లా అలీ ఖమేనీ (Ayathullah Ali Khamenei) అంత్యక్రియల అధికారిక షెడ్యూల్ ఖరారైంది. వచ్చే నెల (జూలై) 4 నుంచి రాజధాని టెహ్రాన్ (Tehran) లో ఈ అంత్యక్రియల ప్రక్రియ ప్రారంభం కానుందని ఇరాన్ ప్రభుత్వ అధికారిక మీడియా ఆదివారం వెల్లడించింది. ఖమేనీ సంస్మరణ బాధ్యతలను పర్యవేక్షిస్తున్న ప్రధాన కమిటీ ఈ మేరకు ఒక అధికారిక ప్రకటనను విడుదల చేసింది.
కమిటీ ప్రకటన ప్రకారం.. జూలై 4, 5 తేదీల్లో టెహ్రాన్లోని ప్రసిద్ధ ఇమామ్ ఖమేనీ ముసల్లా ప్రార్థనా మందిరంలో ఖమేనీ పార్థివ దేహానికి వీడ్కోలు వేడుకలు నిర్వహిస్తారు. అనంతరం జూలై 6, 7 తేదీల్లో రాజధాని టెహ్రాన్, పవిత్ర నగరం కోమ్ (Qom) లలో భారీ అంతిమ యాత్రలు (Funeral Processions) సాగుతాయి. 9న దేశ ఈశాన్య ప్రాంతంలోని మషాద్ నగరంలో తుది వీడ్కోలు కార్యక్రమం ముగుస్తుంది. అదే రోజున షియా ముస్లింలు అత్యంత పవిత్రంగా భావించే ఎనిమిదో ఇమామ్ ‘ఇమామ్ రెజా’ పవిత్ర క్షేత్రంలో ఖమేనీ దేహాన్ని ఖననం చేయనున్నారు.
నిజానికి మార్చి నెలలోనే జరగాల్సిన ఈ అంత్యక్రియలు యుద్ధ పరిస్థితుల కారణంగా వాయిదా పడుతూ వచ్చాయి. 86 ఏళ్ల అలీ ఖమేనీ ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా జరిపిన భారీ వైమానిక దాడుల్లో మరణించారు. ఈ దాడితో ఇరాన్పై ఆయన సాగించిన 36 ఏళ్ల పాలన ముగిసింది. ఖమేనీ మరణం తర్వాత మార్చి మొదటి వారంలో ఆయన కుమారుడు మొజ్తబా ఖమేనీ ఇరాన్ నూతన సుప్రీం లీడర్గా బాధ్యతలు చేపట్టారు. కాగా ఈ దాడుల్లో ఖమేనీతోపాటు ఆయన కుమార్తె, మనవడు, అల్లుడు, మరో నలుగురు కుటుంబసభ్యులు కూడా ప్రాణాలు కోల్పోయారు.